శ్రీకాకుళం పాతబస్టాండ్ : రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. దీంతో బదిలీలకు మార్గం సుగమమైంది. గత నెలలో వివిధ ప్రభుత్వ శాఖలకు బదిలీలు నిర్వహించింది. అయితే రెవెన్యూ సిబ్బంది ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమంలో ఉండడంతో ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ కార్యక్రమం పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీలోగా రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ బ్యాన్ను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్వో కేడర్ నుంచి అన్ని తరగతిల ఉద్యోగులకు బదిలీలు చేసే అవకాశాలున్నాయి. అయితే రెవెన్యూ విభాగంలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి, దీర్ఘకాలంగా ఒకచోట పనిచేసిన వారిని బదిలీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ బదిలీల బ్యాను ఎత్తివేత వస్తుందని తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు వారు కోరుకున్న చోటుకు వెళ్లేందుకుగాను రాజకీయ సిఫార్సులను సిద్ధం చేసుకుంటున్నారు.
‘రెవెన్యూ’ బదిలీలకు సై!
Published Fri, Sep 4 2015 12:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement