కంబాలచెరువు (రాజమండ్రి) : నంది నాటకోత్సవాల్లో మంచి ప్రతిభ కనబరిచిన రంగస్థల నటి టి.వాణిబాల ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త కళాకారులను తీవ్రంగా కలిచివేసింది.
కంబాలచెరువు (రాజమండ్రి) : నంది నాటకోత్సవాల్లో మంచి ప్రతిభ కనబరిచిన రంగస్థల నటి టి.వాణిబాల ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త కళాకారులను తీవ్రంగా కలిచివేసింది. వాణిబాల ఈనెల 24న ది యంగ్మెన్ హ్యాపీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘దేశమును ప్రేమించుమన్నా’ పద్యనాటకంలో రుక్సానా పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఆమె పలి కించిన భావాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆమె ‘సాక్షి’తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ అయింది.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వాణిబాల నాటకం ముగిసిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి ఆమె మరణిం చారు. వడదెబ్బ వల్ల మృతిచెంది నట్టు వైద్యులు తెలిపారు. వాణిబాల తన ఏడోఏటే నటిగా రంగస్థల ప్రవేశం చేశారు. తల్లిదండ్రులు కళాకారులు కానప్పటికీ నటనపై మక్కువతో ఈ రంగంలో ఉంటున్నారు. సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చారు. 2004లో ‘నిశ్శబ్ద విప్లవం’ నాటికకు నంది బహుమతి గెలుచుకున్నారు.
కళావాణి సంతాపం
వాణిబాల మృతికి కళావాణి (ఉభయగోదావరులు రాజమండ్రి) సంస్థ సంతాపం ప్రకటించింది. తమ సంస్థలో వాణిబాల గోరంత దీపం నాటకంతో రంగప్రవేశం చేశారని, ఆమె నటించిన భయం, ఏ వెలుగుకీ ప్రస్థానం, గుప్పెటతెరు, మిథునం వంటి నాటకాలు మంచిపేరు తీసుకువచ్చాయని ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ స్టాలిన్, అధ్యక్షుడు తుమ్మిడి రామ్కుమార్ తెలిపారు.