
సాక్షి, చిత్తూరు : ప్రజా శ్రేయస్సే లక్ష్యం. రాజీపడే ప్రశ్నే లేదు. కేసులకు వెరసే నైజమే కాదు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగే లేదు. ఫీజుపోరు, సాగుపోరు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంపై ధర్నా, కరువు రైతుకు సాంత్వన కోసం పోరాటం.. ఒకటేమిటి.. సమస్య ఎక్కడున్నా ఆయన అక్కడుండేవారు. ప్రజల పక్షాన నిలిచారు.. ప్రభుత్వంతో పోరాడారు. హోదాకోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. పదేళ్ల పాటు జనంలో ఉన్నారు. తండ్రిచ్చిన అభిమానాన్నే వారసత్వంగా చేసుకుని ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఓదార్పు, పాదయాత్రలతో పేదరికాన్ని దగ్గరి నుంచి చూసి చలించిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయనకు జిల్లా జనం నీరాజనాలు పలికారు. 13 స్థానాల్లో గెలిపించి ప్రజా నాయకుడిని చేశారు.
పోరాటమే స్ఫూర్తిగా.. విలువలు, విశ్వసనీయతే లక్ష్యంగా ప్రజా పక్షాన నిలిచారు. అందరూ ఒక్కటై.. సమస్యలు చిన్నవిగా చూపే ప్రయత్నం చేసినా.. ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జనం కోసం నిలబడ్డారు. అందుకే జగన్మోహన్రెడ్డికి జనం పట్టం కట్టారు. 10 సంవత్సరాలు నిత్యం ప్రజల్లోనే ఉండిన ఏకైక నాయకుడు ఆయన. కేవలం ఇద్దరితో ప్రారంభమైన పోరాటం పదేళ్లలో 151కి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు కాదు.. దేశ చరిత్రలోనే ఎవరికీ సొంతం కాని రీతిలో 50 శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న క్రమంపై సాక్షి ప్రత్యేక కథనం.
ఓదార్పు యాత్ర..
దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టం. జిల్లాలో 36 రోజల పాటు 23 మందిని పరామర్శించారు. సమకాలీన రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా జనంలో అంత విస్తృతంగా ప్రయాణించిన దాఖలాలు లేవు. మహానేత రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో 23 మంది గుండెలు ఆగిపోయాయి. వైఎస్ మరణించిన 22వ రోజు నల్లకాలువ వద్ద జరిగిన సభలో జగన్ హామీ ఇచ్చారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారందరినీ పరామర్శిస్తానని చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే ఓదార్పు యాత్ర చేశారు.
సమైక్యాంధ్ర కోసం పోరాటం
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో 2013 నవంబర్ 30న సమైక్య శంఖారావం నిర్వహిం చారు. ఇంటి తలుపులు వేసుకోండని చంద్రబాబు చెబితే కుప్పం జనం తమ గుండె తలుపులు తెరుచుకుని సమైక్య శంఖారావం సభకు ప్రవాహంలా కదిలివచ్చారు. జగన్మోహన్రెడ్డి అడుగులో అడుగులేస్తూ కదంతొక్కారు.
ప్రజా ఉద్యమాలకు మద్దతు
వైఎస్ జగన్ ముఖ్యమైన సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. పోరాటాలు కొసాగిస్తూనే వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు రైతులు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిం చాలని 2011 ఫిబ్రవరి నుంచి వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. కనీస మద్దతు ధర అందక విలవిల్లాడతున్న అన్నదాతలకు అండగా 2011 మే 15న రైతు దీక్ష చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2012 జనవరి 4న ధర్నాకు దిగారు. వస్త్రవ్యాపారులకు మద్దతుగా 2012 జనవరి 27న భారీగా రాస్తారోకో చేశారు. 2015 డిసెంబర్ 8న కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు. 2017 నవంబర్ 20న హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ 2018 ఫిబ్రవరి 8న విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు.
రైతు భరోసా యాత్ర
వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలన్నీ అమలు చేయలేదు. దీంతో రైతుల రుణభారం పెరిగి, పంటలు నష్టపోయిన పరిస్థితుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. దీంతో వారిని ఓదార్చడానికి జగన్ రైతు భరోసా యాత్ర చేపట్టారు. దీంతో రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో ఇచ్చింది.
చేనేతలకు భరోసా
చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా 2012 ఫిబ్రవరి 12న మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. ఆ తరువాత చేనేత కార్మికులు ఎక్కడ దీక్షలు చేపడితే అక్కడ వారికి సంఘీభావం తెలిపారు. 2017అక్టోబర్లో మరోసారి చేనేత దీక్ష చేశారు. అక్కడే 45 సంవత్సరాలకే పింఛన్ పథకం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఇవ్వాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను నిరసిస్తూ కర్నూలులో జలదీక్ష చేపట్టారు.
ప్రజా సంకల్పయాత్ర చరిత్ర..
చరిత్రలో ఇదిరవరకూ ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అయ్యారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017 నవంబర్ 6న ప్రారంభమైంది. జిల్లాలో 2017 డిసెంబర్ 28న ప్రవేశించింది. 10 నియోజకవర్గాలో 23 రోజుల పాటు 291.1 కిలోమీటర్లు ప్రజలసమస్యలు తెలుసుకుంటూ నడిచారు. జిల్లాలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రకటన చేశారు.పాడి రైతులకు రూ.4 సబ్సీడీ పథకంపై రైతులకు చెప్పారు. రోళ్లుపగిలే ఎండలు, ఎముకలు కొరికే చలి,భారీవర్షాలు అనారోగ్యం ఇవేవీ జగన్పాదయాత్రను అడ్డుకోలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment