
నవరత్నాలపై అవగాహన కల్పిస్తున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి
నెల్లూరు, కోవూరు: టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్సార్సీపీ విజయానికి బూత్ కమిటీ కన్వీనర్లు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి దిశానిర్దేశం చేశారు. కోవూరు పంచాయతీలోని 140 నుంచి 145 వరకు పోలింగ్ బూత్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి హాజరయ్యారు. తొలుత కొత్తూరు కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలపై పోలింగ్బూత్ పరిధిలోని ఇంటింటికీ తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. అనంతరం పోలింగ్బూత్ల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు.
24న జొన్నవాడలో ప్రత్యేక పూజలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మూడు వేల కిలోమీటర్లకు చేరుకుంటుందని ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి చేపట్టిన యాత్ర దిగ్విజయంగా పూర్తికావాలని 24న ఉదయం జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మూడు వేల కొబ్బరికాయలను కొట్టే కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment