Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt Super Six Promises By Vardhelli Murali1
నవ్విపోదురు గాక..!

‘‘ఆరు సూపర్‌ సిక్స్‌ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్‌ సిక్స్‌ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్‌ మీట్‌ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్‌ సిక్స్‌ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్‌ ఇయర్‌ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్‌ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్‌ అనే పథకంతో లింక్‌ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్‌ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్‌ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్‌ షిప్‌గా పెట్టుకున్న సూపర్‌ సిక్స్‌లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్‌షిప్‌ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్‌ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్‌ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్‌బుక్‌ నోరు తెరుస్తుంది. రెడ్‌ బుక్‌ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్‌ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్‌ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్‌ డెస్క్‌ ఇన్‌ఛార్జిగా నేను, స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్‌ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్‌ఆర్‌ లైవ్‌ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్‌ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్‌ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్‌ తొలగించి రిమాండ్‌కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్‌ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్‌ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్‌ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్‌ నవ్వు, ఇన్‌స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

YSRCP President YS Jagan slams CM Chandrababu Naidu2
పొగాకు రైతుల సమస్య డైవర్ట్‌ చేయడానికి ఇంత దుర్మార్గమా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరుతో ఉద్రిక్తతలకు కారణమైన వారిని వదిలేసి.. అమాయక రైతులు, ప్రజలపై కేసులు పెట్టడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది రైతుల సమస్యను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు సర్కార్‌ చేయిస్తున్న మరో దుర్మార్గమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..‘‘చంద్రబాబూ... పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కానీ... ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపై, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబూ? రైతుల సమస్యలపై గొంతెతి్తతే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా..? ఉల్టాగా... రాళ్లు మీ వాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ? రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేల్‌ వాయిస్తూ కూర్చున్న చక్రవర్తి నీరో తరహాలో... ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని మండిపడ్డారు.

Weekly Horoscope In Telugu From 15-06-2025 To 21-06-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.వృషభం...చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులు, సోదరీల నుంచి సహాయం అందుతుంది. ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలలో లోపాలను సరిదిద్దుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.కర్కాటకం...ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు, దేవీస్తోత్రాలు పఠించండి.సింహం..కొంత శ్రమపడాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనులు కొన్ని నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.కన్య...అనుకున్న కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఆస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అభివృది ్ధదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు తథ్యం. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు, శివస్తోత్రాలు పఠించండి.తుల...పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పరిచయాలు పెరుగుతాయి. ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.వృశ్చికం...ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. నీలం, నేరేడురంగులు, శివపంచాక్షరి పఠించండి.ధనుస్సు...ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు నిరాశకలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, విష్ణుధ్యానం చేయండి.మకరం...కొంత జాప్యం జరిగినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకూ అనుకూలిస్తుంది. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. పనిఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కుంభం...ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం ఉండవచ్చు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. వ్యయప్రయాసలు. గులాబీ, తెలుపు రంగులు, గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.మీనం...ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నలుపు, ఆకుపచ్చ రంగులు, రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

CM Revanth Reddy Comments At Telangana Gaddar Film Awards4
హాలీవుడ్‌కు వేదికవ్వాలి: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్‌కు హైదరాబాద్‌ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్‌ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్‌కు హైదరాబాద్‌ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్‌ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్‌ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్‌ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్‌ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు గద్దర్‌ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్‌ ఫౌండేషన్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్‌ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్‌ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

 Iran and Israel are trading missiles and air strikes as the conflict in West Asia5
దాడులు... ప్రతిదాడులు

టెహ్రాన్‌/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్‌: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్‌ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్‌ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్‌ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్‌ స్టాఫ్‌లో డెప్యూటీ ఇంటెలిజెన్స్‌ అధికారి అయిన జనరల్‌ గోలామ్‌రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్‌ విభాగ డెప్యూటీ జనరల్‌ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్‌ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్‌లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్‌ ‘ఖుజెస్తాన్‌’ప్రావిన్సులోని అబదాన్‌ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్‌షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్‌ దాడులుచేసింది. ఇరాన్‌ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీడెఫ్రిన్‌ ప్రకటించారు. 70 ఫైటర్‌జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. రేడియో ధార్మికత సాధారణమే సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్‌ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌రాజధాని టెల్‌ అవీవ్‌ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్‌వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్‌డోమ్‌ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. దీంతో రిషాన్‌ లీజియన్‌ నగరంలో ఇద్దరు, టెల్‌అవీవ్‌లోని రమాత్‌ గాన్‌ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్‌ అవీవ్‌ సమీప బెన్‌ గురియణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్‌ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేసింది. ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌గా అమీర్‌ హతామి ఇరాన్‌ నూతన ఆర్మీ చీఫ్‌గా అమీర్‌ హతామి నియమితులయ్యారు. ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్‌ సైన్యానికి చీఫ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్‌ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్‌ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్‌ మిసైల్‌ ప్రోగ్రాం నూతన చీఫ్‌గా జనరల్‌ మజీద్‌ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్‌ అమీర్‌ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే. యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్‌తోనూ ఇజ్రాయెల్‌ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్‌ సిటీలో సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో నూతన పోప్‌ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్‌ అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ బాంబులేస్తే, టెల్‌అవీవ్‌పై ఇరాన్‌ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ శనివారం పిలుపునిచ్చారు. రహస్యంగా డ్రోన్లు తరలించి.. రష్యాలోకి ఉక్రెయిన్‌ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్‌ సైతం ఇరాన్‌లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్‌–300 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంఛర్లను, రాడార్‌ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్‌ ఫైటర్‌జెట్లు ఇరాన్‌ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్‌నిఘా విభాగం మొస్సాద్‌ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్‌ విడుదలచేయడం అత్యంత అరుదు. విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్‌ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్‌ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్‌ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్‌పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్‌ కట్జ్‌’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు.ఇరాన్‌ ‘అణు’కల చెదిరింది యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్‌ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్‌ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్‌ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్‌కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్‌కేంద్రం బ్యాకప్‌ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్‌ నాశనంచేసింది. దీంతో కరెంట్‌ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.అణు చర్చలు అర్థ్ధరహితంఅమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్‌ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్‌లో జరగనున్నాయి. ఇజ్రాయెల్‌ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేయిల్‌ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ఇరాన్‌ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్‌ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్‌ క్షిపణులను తాము ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. కశ్మీర్‌ ‘పోస్ట్‌’పై ఇజ్రాయెల్‌ క్షమాపణలుటెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం తమ ‘ఎక్స్‌’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్‌ భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్‌ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్‌ శుక్రవారం ఒక మ్యాప్‌ను పోస్ట్‌పెట్టింది. అయితే ఈ మ్యాప్‌లో జమ్మూకశీ్మర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్‌ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్‌ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్‌ విఫలమైంది. మ్యాప్‌ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్‌ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్‌ శనివారం ఒ పోస్ట్‌ పెట్టింది.

Ahmedabad Plane Crash Deaths Rise To 274, the Air India Boeing 787 Dreamliner 6
274కు పెరిగిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అంతా దుర్మరణం పాలవడం తెలిసిందే. విమానం రన్‌వే సమీపంలోని బీజే మెడికల్‌ కాలేజీ క్యాంటీన్, బాయ్స్‌ హాస్టల్‌ భవనాలపై పడి పేలిపోవడమే గాక మరో రెండు పరిసర భవనాలకు కూడా నిప్పంటుకుంది. దాంతో వాటిలో ఉన్నవారిలోనూ చాలామంది చనిపోయారు. వారి సంఖ్య 33గా శనివారం తేలింది. ఇదే తుది సంఖ్యా, లేక మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాద సమయంలో మెస్, హాస్టల్‌ భవనాల్లో కనీసం 40 మందికి పైగా వైద్య విద్యార్థులున్నట్టు కాలేజీ వర్గాలు శనివారం తెలిపాయి. వారికి తోడు పలువురు స్థానికులు కూడా ఉన్నట్టు వెల్లడించాయి. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రికి ఇప్పటిదాకా 270 మృతదేహాలు వచ్చినట్టు బీజే మెడికల్‌ కాలేజీ జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ధవల్‌ గమేతీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులని గురువారమే తేలడం తెలిసిందే. అక్కడ టీ స్టాల్‌ నడిపే కుటుంబానికి చెందిన ఆకాశ్‌ పాట్నీ అనే 14 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తాజాగా ధ్రువీకరణ అయింది. మిగతా 27 మందిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు ఎంతమంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదంలో నాలుగు భవనాలు బాగా దెబ్బతిన్నట్టు కాలేజీ డీన్‌ మీనాక్షీ పారిఖ్‌ వెల్లడించారు. ‘‘దర్యాప్తు నిమిత్తం బాయ్స్‌ హాస్టల్‌ భవనాలను ఖాళీ చేయిస్తున్నాం. ఇప్పటికే 200 మంది విద్యార్థులకు పైగా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న, జరగబోయే ఎంబీబీఎస్‌ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నాం’’అని ప్రకటించారు. హాస్టల్‌ భవనంపై చిక్కిన విమానం తోక భాగం నుంచి శనివారం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అది ఎయిర్‌హోస్టెస్‌దిగా తేల్చారు. కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయిపోవడం తెలిసిందే. గుర్తుపట్టే స్థితిలో ఉన్న 8 మృతదేహాలను ఇప్పటికే కుటుంబీకులకు అప్పగించారు. మిగతా వాటికి డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారానికి 11 మృతదేహాలను గుర్తించారు. మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు కౌన్సెలర్లను అందుబాటులో ఉంచారు. మరణించిన విమాన ప్రయాణికుల కుటుంబాలకు టాటా గ్రూప్‌ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే. బోయింగ్‌ విమానాల్లో భద్రతా తనిఖీలుప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు 26 బోయింగ్‌ 787–8, ఏడు 787–9 సిరీస్‌ విమానాలను భద్రతాపరంగా క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటిదాకా 9 విమానాల్లో తనిఖీలు పూర్తయినట్టు వెల్లడించింది. తనిఖీల కారణంగా పలు ఎయిరిండియా విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787–8 విమానానికి వచ్చే డిసెంబర్‌లో సమగ్ర తనిఖీలు జరగాల్సి ఉంది. దాన్ని చివరిసారిగా 2023 జూన్‌లో క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుడివైపు ఇంజన్‌ను గత మార్చిలో ఓవరాలింగ్‌ చేశారు.వీడియో తీసిన టీనేజర్‌ను విచారించిన పోలీసులు ఎయిరిండియా విమాన ప్రమాద వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ కావడం తెలిసిందే. ఆర్యన్‌ 17 ఏళ్ల బాలుడు తన మొబైల్‌తో ఆ వీడియో తీశాడు. దర్యాప్తులో భాగంగా సాక్షిగా అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. తాను వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టిన 24 సెకన్లలోనే విమానం కూలినట్టు ఆర్యన్‌ మీడియాకు తెలిపాడు. ‘‘కళ్లముందే జరిగిన ప్రమాదంతో విపరీతంగా భయపడిపోయా. చాలాసేపటిదాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయా. వీడియోను మొదట నా సోదరికి చూపించా. తర్వాత మా నాన్నకు చెప్పా. కళ్లు మూసినా, తెరిచినా విమాన ప్రమాదమే గుర్తుకొస్తోంది. మేముండే ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఉండాలని లేదు’’అని చెప్పుకొచ్చాడు. ఆర్యన్‌ ఆ రోజంతా ఏమీ తినలేదని, రాత్రంతా నిద్ర కూడా పోలేకపోయాడని అతని తల్లి చెప్పింది. రెండుసార్లు వాయిదా వేసుకుని.. రూపానీ మృత్యుప్రయాణం! విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ వాస్తవానికి మే 19నే లండన్‌ వెళ్లాల్సింది. అసెంబ్లీ ఉప ఎన్నిక పనుల కారణంగా టికెట్‌ రద్దు చేసుకుని ప్రయాణాన్ని జూన్‌ 5కు వాయిదా వేసుకున్నారు. తర్వాత అదీ రద్దు చేసుకుని జూన్‌ 12న ప్రమాదం బారిన పడిన ఏఐ171లోనే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అలా విధి ఆయనను మృత్యుముఖానికి నడిపించింది. 2డి నంబర్‌ సీట్‌లో కూచున్న ఆయన ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో చిక్కి మరణించారు.

Strange things happening in Kurnool district in the name of talliki vandanam7
తల్లుల పేరుతో లీలలు వం‘ధనం’ వింతలు

సాక్షి ప్రతినిధి కర్నూలు : నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పలు ఊళ్లలో ‘తల్లికి వందనం’ అర్హుల జాబితాలు విస్తుగొలుపుతున్నాయి. ఒకే తల్లి పేరుతో, ఒకే ఆధార్‌ నంబర్‌తో పదుల సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు జాబితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి తప్పిదాలా.. లేక టీడీపీ కూటమి నేతల స్కామ్‌లా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒకటి, రెండు చోట్ల కాకుండా భారీ సంఖ్యలో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ‘తల్లికి వందనం’ పథకం జీవో జూన్‌ 12వ తేదీన విడుదలైంది. అదే రోజు రాష్ట్రంలోని సచివాలయాల పరిధిలో పథకానికి అర్హత సాధించిన వారి జాబితాలను ప్రచురించారు. ఈ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా? అని లబ్ధిదారులు పరిశీలించారు. ఇందులో గతంలో ‘అమ్మ ఒడి’కి అర్హత సాధించి ఇప్పుడు ‘తల్లికి వందనం’ జాబితాలో పేర్లు లేని వారు వేల సంఖ్యలో ఉన్నారు. అలాగే ఒకే తల్లి పేరుతో, ఒకే ఆధార్‌ నెంబర్‌తో 10కి మించి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. నిజానికి ఆ సచివాలయాల పరిధిలో ఏ తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నారనేది తక్కిన వారికి స్పష్టంగా తెలుసు. జాబితా తప్పుగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా మిత్రులకు పంపారు. దీంతో విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వింతలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ జాబితాలన్నింటినీ ఆయా జిల్లాల డీఈఓలకు పంపారు.ఇలా కర్నూలు జిల్లాలో 20,806 మంది విద్యార్థుల పేర్లు తప్పుగా ఉన్నట్లు విద్యాశాఖ కమిషనరేట్‌ నుంచి డీఈఓకు జాబితా వచ్చినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటి వరకు (14వ తేదీ సాయంత్రం) 14 వేల మంది విద్యార్థుల పేర్లు సరి చేసినట్లు తెలిసింది. నంద్యాల జిల్లాలో 8 వేల పేర్లు అధికారుల నుంచి వస్తే 6,600 పేర్లు పరిశీలించినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా ఆధార్‌ తప్పుగా ఉండటం, ఒకే తల్లి.. ఒకే ఆధార్‌ కార్డుపై ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో ఏదో జరిగింది..! కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే 28,806 పేర్లు తప్పుగా ఉన్నట్లు రాష్ట్ర విద్యా శాఖ గుర్తించి పరిశీలనకు జాబితాను డీఈఓలకు పంపించిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లక్షల సంఖ్యలో తప్పిదాలు జరిగి ఉంటాయనేది స్పష్టమవుతోంది. పైగా యూడైస్‌ (యూనిపైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌)లో రాష్ట్ర వ్యాప్తంగా 87,41,885 మంది పిల్లలు ఉన్నట్లు ఉంది. ఇది ఆయా జిల్లా కలెక్టర్లు ధ్రువీకరించిన పంపిన జాబితా. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని వెబ్‌సైట్‌. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 67 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం అమలు చేస్తోంది. కాగా.. ఒకే తల్లి, ఒకే ఆధార్‌ కార్డుపై పదుల సంఖ్యలో పిల్లలు ఎలా నమోదయ్యారనే విషయమై అధికారులు నోరు మెదపడం లేదు. ఒకవేళ ఇది తప్పిదమే అయితే ఏ విధంగా జరిగిందో స్పష్టత ఇవ్వాలి. ఇప్పటిదాకా అదీ లేదు. దీన్నిబట్టి ఎక్కడికక్కడ ఏదో గోల్‌మాల్‌ జరిగి ఉంటుందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘అమ్మ ఒడి’కి అర్హత సాధించి ఇప్పుడు జాబితాలో లేని నిజమైన అర్హులు వేదన పడుతుంటే, మరో వైపు ఒకే పేరుతో 40 మంది, 90 మందికి డబ్బులు జమ కానున్నట్లు జాబితాలు ప్రకటించడం పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. ఈ లెక్కలు సరిచేస్తే అర్హుల సంఖ్య ఇంకా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ బాధ్యత ఏదీ? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ‘అమ్మఒడి’ పథకమే ‘తల్లికి వందనం’. ఇలా పేరు మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏటా అమ్మఒడి పథకం కోసం లబ్దిదారుల డేటాను పాఠశాల యాజమాన్యంతో పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఒకటికి రెండుసార్లు పరిశీలించి అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే పథకాన్ని అమలు చేసేవారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి జాబితాలో ఒక్కసారి కూడా తప్పులు దొర్లలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోనే ఇంత భారీ స్థాయిలో తప్పిదాలు/అవకతవకలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా, డోన్‌ ఘటనపై నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారిని ‘సాక్షి’ సంప్రదించగా విచారిస్తున్నామని, వారి ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదని చెప్పారు. అనాథలు ఎవరైనా ఉంటే ఇతర తల్లుల పేర్లు పిల్లలకు లింక్‌ చేసే అవకాశం ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాలోని ఘటనలపై కలెక్టర్‌ రంజిత్‌బాషాను వివరణ కోరగా.. తన దృష్టికి రాలేదని, డీఈఓకు చెప్పి విచారణ చేయిస్తామన్నారు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణానికి చెందిన సచివాలయం నంబర్‌–4 పరిధిలో తల్లికి వందనం అర్హుల జాబితా విస్తుగొలుపుతోంది. ఇందులో బెస్త సుజాత అనే మహిళ పేరుతో 37 మంది పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒకే ఆధార్‌ కార్డు పేరుతో వీరంతా సుజాత పిల్లలుగా రికార్డులోకి ఎక్కారు. అయితే పిల్లలు చదివే స్కూలు కోడ్‌ మాత్రం వేర్వేరుగా ఉంది. 37 మందికి ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున రూ.4.81 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కానుంది. నిజానికి సుజాత పిల్లలు కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూలులో చదువుతున్నారు. ఈమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పథకానికి అర్హతే లేదు. అయితే బెస్త సుజాత పేరుతో వేరుగా రేషన్‌కార్డు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి జెడ్పీ పాఠశాలలో బింగి గాదిలింగప్ప పిల్లలు చదువుతున్నారు. ఇతని భార్య పేరు హంపమ్మ. ఈయన ఆధార్‌ నంబర్‌ 244429359357పై 94 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ అవుతున్నట్లు జాబితాలో ఉంది. 94 మందికి రూ.12.22 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కానుంది. ఇతను పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడు. వ్యవసాయ పనులకు వెళతాడు. భార్య ఉండగా లింగప్ప ఆధార్‌ నంబర్‌ ఎందుకు లింక్‌ చేయాల్సి వచ్చిందో అధికారులకే తెలియాలి.

Luxury car companies in India are now focusing on unique and personalized features8
లగ్జరీ కారు ..  స్పెషల్‌ గేరు.. 

లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్‌ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్‌ ఎడిషన్‌ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్‌లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్‌ ఎడిషన్ల బాట పట్టాయి. హెచ్‌ఎన్‌ఐల జోరు .. భారత్‌లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్‌లో స్పెషల్‌ ఎడిషన్లు, హైపర్‌ కస్టమైజ్డ్‌ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్‌ బెంజ్‌ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్‌ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్‌ ఎండ్‌ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్‌లో భాగమైన జేఎల్‌ఆర్‌ కొత్తగా డిఫెండర్‌ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్‌ డిఫెండర్‌కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్‌ మోడల్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్‌క్లూజివ్‌ పెయింట్‌ షేడ్స్, కస్టమైజ్డ్‌ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్‌ అప్‌గ్రేడేషన్‌ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్‌–బెంజ్‌ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్‌ పెడుతోంది. తమ టాప్‌ ఎండ్‌ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్‌–పర్సనలైజేషన్‌ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్‌ బెంజ్‌ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్‌ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్‌ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్‌ ఎడిషన్‌లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్‌ ఎస్‌ఎల్‌ 680 మోనోగ్రామ్‌ సిరీస్‌ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్‌ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్‌ను అందిస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. కలెక్టర్స్‌ ఎడిషన్‌ను బెంగళూరులోని మెర్సిడెస్‌–బెంజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా (ఎంబీఆర్‌డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది. మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్‌ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్‌ రోవర్‌ రణ్‌థంబోర్‌ ప్రత్యేక ఎడిషన్‌ రేటు రెగ్యులర్‌ వెర్షన్‌తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్‌–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్‌ ఎస్‌ జాన్‌ కూపర్‌ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్‌ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.ఉభయతారకంగా .. వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్‌తో ఈ మోడల్స్‌ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్‌ఆర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్‌ ఎడిషన్లు, స్పెషల్‌ ఎడిషన్‌ మోడల్స్‌ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మొబిలిటీ డైరెక్టర్‌ పునీత్‌ గుప్తా తెలిపారు. సదరు మోడల్‌ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్‌ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ ఆదాయాలపరంగా బాగుంటోంది.కొన్ని కార్లు.. → డిఫెండర్‌ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు → రేంజ్‌రోవర్‌ రణ్‌థంబోర్‌ రేటు రూ. 4.98 కోట్లు → మెర్సిడెస్‌ మేబ్యాక్‌ ఎస్‌ఎల్‌ 680 మోనోగ్రామ్‌ సిరీస్‌ ధర రూ. 4.2 కోట్లు → ఏఎంజీ జీ63 కలెక్టర్స్‌ ఎడిషన్‌ రూ. 4.3 కోట్లు

NEET results released and Good ranks only for low marks9
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2025లో రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్‌–100 మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసు­కోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్‌–100లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్‌ రామ్‌ కిరీటి రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అలాగే, కొడవాటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంకు.. దేశిన సూర్యచరణ్‌ 59, పొదిలపు అవినాష్‌ 64 (ఓబీసీ), యర్రా సమీర్‌ కుమార్‌ 70 (ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్‌ 92వ (ఓబీసీ) ర్యాంకులు సాధించారు. వీరుగాక కారు మంచి విక్రాంత్‌ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు.టాపర్‌గా రాజస్థాన్‌ విద్యార్థి ఈసారి నీట్‌ యూజీ పరీక్షలో టాప్‌–10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌ కుమార్‌ టాపర్‌గా నిలవగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్‌‡్ష అవాధియా రెండో ర్యాంకు, మహరాష్ట్ర విద్యార్థి క్రిషంగ్‌ జోషి మూడో ర్యాంకు, ఢిల్లీకి చెందిన మృణాల్‌ కిషోర్‌ ఝా నాలుగో ర్యాంకు, అవికా అగర్వాల్‌ (ఢిల్లీ) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు. 73 మందికి అత్యుత్తమ మార్కులుఈ ఏడాది నీట్‌ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. 144 నుంచి 686 మార్కుల వరకు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు.

South Africa wins World Test Championship10
సూపర్‌ ‘సఫారీ’

దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్‌ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్‌ కప్‌ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్‌ కప్‌లు, 9 టి20 వరల్డ్‌ కప్‌లు, 9 చాంపియన్స్‌ ట్రోఫీలు, 2 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్‌ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్‌’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్‌ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్‌ అంటే చెలరేగిపోయే ఆసీస్‌ ఈ సారి మాత్రం బ్యాటింగ్‌ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్‌ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్‌ అవుట్‌ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్‌ (8)ను స్టార్క్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్‌రమ్‌ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్‌హామ్‌ (21 నాటౌట్‌) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్‌రమ్‌ను హాజల్‌వుడ్‌ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్‌ వేసిన బంతిని వెరీన్‌ కవర్‌ పాయింట్‌ దిశగా ఆడి సింగిల్‌ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) హెడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 136; రికెల్టన్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 6; ముల్డర్‌ (సి) లబుషేన్‌ (బి) స్టార్క్‌ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్‌ 66; స్టబ్స్‌ (బి) స్టార్క్‌ 8; బెడింగ్‌హామ్‌ (నాటౌట్‌) 21; వెరీన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్‌: స్టార్క్‌ 14.4–1–66–3, హాజల్‌వుడ్‌ 19–2–58–1, కమిన్స్‌ 17–0–59–1, లయన్‌ 26–4–66–0, వెబ్‌స్టర్‌ 5–0–13–0, హెడ్‌ 2–0–8–0.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement