
సాక్షి, బిజినెస్ విభాగం: రిలయన్స్ జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రీ–పెయిడ్ యూజర్ల నెత్తిన తప్పనిసరి కనీస రీచార్జ్ పిడుగు పడేశాయి. ఇప్పటిదాకా ఇస్తున్న లైఫ్టైమ్ వేలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్ చేసుకోవాల్సిందేనని లేకపోతే సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తామని ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి. రీచార్జ్ల కోసం టెల్కో దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 28 రోజుల వేలిడిటీతో రూ. 100 లోపు కనీస ప్రీపెయిడ్ ప్యాక్స్ను ప్రవేశపెట్టాయి. వీటిలో రూ. 35, రూ. 65, రూ. 95 మొదలైన ప్యాక్స్ ఉన్నాయి. ఈ కనీస ప్లాన్స్తో రీచార్జ్ చేసుకోకపోతే 30 రోజుల్లోగా అవుట్గోయింగ్ కాల్స్, 45 రోజుల్లోగా ఇన్కమింగ్ కాల్స్ నిల్చిపోతాయి. అంటే ఈ కనీస ప్లాన్స్తో రీచార్జ్ చేసుకుంటేనే మొబైల్ సర్వీసులను .. ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్ను అందుకోవచ్చు. ఈ కొత్త నిబంధన కారణంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్ గడువు ముగియడంతో ఇప్పటికే పలువురు ప్రీపెయిడ్ యూజర్లకు అవుట్గోయింగ్ కాల్స్ను నిలిపివేస్తున్నాయి. టెల్కోల నుంచి మెసేజిలు వస్తుండటం సాధారణమేనని వాటిని పెద్దగా పట్టించుకోని యూజర్లు.. కనీస రీచార్జ్పరమైన కొత్త మార్పుల వల్ల అకస్మాత్తుగా కాల్స్ ఆగిపోతుండటంతో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్ కోసం మాత్రమే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ను ఉపయోగించే గ్రామీణ ప్రాంతాల్లో వారిపై ఈ విధానం ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
పెరగనున్న టెల్కోల ఆదాయాలు..
దీర్ఘకాలంగా రీచార్జ్ చేసుకోని కస్టమర్లు ఎయిర్టెల్లో 10 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాలో 15 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. కనీస రీచార్జ్ తప్పనిసరి కారణంగా వీరిలో ఎయిర్టెల్ నుంచి కనీసం సగం మంది బైటికి వెళ్లిపోయినా .. మిగిలిన వారి నుంచి ప్రతి నెలా ఆదాయం రానుంది. ఉజ్జాయింపుగా ఈ సంస్థలకు ఇప్పటిదాకా పాతిక కోట్ల మంది యూజర్లపై అడపాదడపా రూ. 250 కోట్లు వస్తుండ గా (రూ. 10 రీచార్జితో) .. ఇకపై యూజర్ల సంఖ్య సగం తగ్గినా కనీస రీచార్జీ రూ. 35 లెక్కన చూస్తే ప్రతి నెలా రూ. 437 కోట్లయినా రావచ్చని అంచనా.
కనెక్షన్లు ఫుల్..ఆదాయం నిల్..
దేశీయంగా మొబైల్ ఫోన్ యూజర్లలో దాదాపు 95% మంది ప్రీపెయిడ్ యూజర్లే ఉంటారు. ఇప్పటిదాకా చాలా మటుకు కనెక్షన్స్ విషయంలో ఆర్నెల్లకోసారి అత్యంత తక్కువగా రూ. 10 రీచార్జ్ చేసుకున్నా సర్వీసులు, ఉచిత ఇన్కమింగ్ కాల్స్ కొనసాగేలా లైఫ్టైమ్ వేలిడిటీ వర్తింపచేస్తూ వస్తున్నాయి టెల్కోలు. కొత్త సబ్స్క్రయిబర్స్ను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన ప్రయోజనాలతో కొంగొత్త టారిఫ్ ప్లాన్స్ను ప్రవేశపెడుతూ వస్తున్నాయి. దీంతో అనేక యూజర్లు అవసరం ఉన్నా లేకపోయినా.. రెండేసి..మూడేసి.. నాలుగేసి.. అంతకు పైగా సిమ్ కనెక్షన్లు తీసేసుకున్నారు. దీంతో ఫోన్లలో కూడా మార్పులు వచ్చాయి. డ్యుయల్ సిమ్ ఫోన్లు.. అంతకు మించి నాలుగైదు సిమ్లు వేసుకునే ఫోన్లు కూడా మార్కెట్లోకి హడావిడి చేశాయి. ఇవన్నీ పేరుకే కనెక్షన్లు గానీ వీటిల్లో టాక్టైమో.. లేదా డేటానో అయిపోయిందంటే పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా టెల్కోల ఖాతాలో కనెక్షన్లు కనిపిస్తున్నా.. వాటి ద్వారా వచ్చే సగటు ఆదాయాలు పెద్దగా ఉండటం లేదు. ఇక 2016లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో సంచలన ప్లాన్స్తో టెలికం రంగాన్ని కుదిపేయడంతో పలు టెల్కోలు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. జియోతో పోటీగా చార్జీలను భారీ స్థాయిలో తగ్గించాల్సి రావడంతో ఆదాయాలు దెబ్బతింటున్నాయి. మొత్తం మీద టెలికం రంగంలో కన్సాలిడేషన్కు దారి తీసింది ఇది. వొడాఫోన్–ఐడియాలు విలీనం కాగా.. టాటా డొకొమో మెదలైన వాటిని ఎయిర్టెల్ విలీనం చేసుకుంది. దీంతో ఆదాయం ఇవ్వని నామమాత్రపు కనెక్షన్లను వదిలిం చుకుని సిసలైన కస్టమర్లనే అట్టిపెట్టుకోవాలని, సగటు ఆదాయాలను పెంచుకోవాలనేది టెల్కోల వ్యూహం. అందుకే తప్పనిసరి రీచార్జ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నిర్ణయంతో కొందరు యూజర్లు తమ నెట్వర్క్ నుంచి వెళ్లిపోయినా.. ఉండే వారి దగ్గర్నుంచి పెరిగే ఆదాయాలతో ఆ నష్టం భర్తీ కాగలదని అవి భావిస్తున్నాయి. నిఖార్సయిన కస్టమర్ల సంఖ్యపైనా స్పష్టత వస్తుందని, దాని ప్రకారంగా ప్రణాళికలు చేసుకోవచ్చని యోచిస్తున్నాయి.
రీచార్జ్ చేయకుంటే ఏమవుతుంది..
తక్షణం రీచార్జి చేసుకోకపోయినా.. పూర్తిగా సేవలు నిలిపివేయకుండా కొంత కాలం పాటు సమయమిస్తున్నాయి టెల్కోలు. పరిశ్రమ వర్గాల ప్రకారం ఉదాహరణకు.. డిసెంబర్ 1 2018న రూ. 35 కనీస రీచార్జి చేయించారనుకుందాం. 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మళ్లీ రీచార్జ్ చేయించుకోకుంటే 29వ తారీఖు నుంచి ముందుగా అవుట్గోయింగ్ కాల్స్ నిల్చిపోతాయి. కానీ మరో 15 రోజుల దాకా .. అంటే వచ్చే ఏడాది జనవరి 12 దాకా ఇన్కమింగ్ కాల్స్ మాత్రం అందుకోవచ్చు. ఈ 15 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసిపోయిన తర్వాత కూడా బ్యాలెన్స్ వేయించుకోకపోతే.. తదుపరి రీచార్జ్ చేసుకునే దాకా ఇన్కమింగ్ కాల్స్ కూడా నిల్చిపోతాయి. అయినప్పటికీ రీచార్జ్ చేసుకోకపోతే మరో 90 రోజుల పాటు దాకా లెక్కల్లో మీ కనెక్షన్ను టెలికం సంస్థ కొనసాగిస్తుంది. అంటే ఇన్కమింగ్ కాల్స్కి ఇచ్చే 15 రోజులతో పాటు మొత్తం 105 రోజుల మేర గ్రేస్ పీరియడ్ లభించినట్లవుతుంది. అది కూడా తీరిపోతే ఇక ఆ నంబరును వదులుకోవాల్సిందే.
మళ్లీ సింగిల్ సిమ్ బాటేనా..
వివిధ ఆపరేటర్లు అందిస్తున్న ప్రయోజనాలను పొందేందుకు చాలా మంది సబ్స్క్రయిబర్స్ రెండు మూడు సిమ్లు ఉపయోగిస్తున్నారు. ఆగస్టు 2018 నాటికి 120 కోట్ల టెలికం కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 45 కోట్ల కనెక్షన్లు మల్టిపుల్ సిమ్ కార్డులవేనని అంచనా. తాజా పరిణామంతో తక్షణం యూజర్ల సంఖ్య కనీసం 3 కోట్ల మేర తగ్గొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. టెల్కోల తాజా చర్యలతో యూజర్లు మళ్లీ సింగిల్ సిమ్ వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఆరు నెలల వ్యవధిలో కనీసం 6 కోట్ల మంది సబ్స్క్రయిబర్స్ తమ రెండో సిమ్ను వదిలించుకోవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment