100 షెల్ కంపెనీలపై స్టాక్ ఎక్స్చేంజ్లు ఎటాక్
న్యూఢిల్లీ : ట్రేడింగ్కు దూరం చేస్తూ షెల్ కంపెనీలపై సెబీ ఉక్కుపాదం మోపిన అనంతరం, స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా ఆ కంపెనీలపై ఎటాక్కు సిద్ధమయ్యాయి. 331 అనుమానిత షెల్ కంపెనీల్లో తొలుత 100 కంపెనీలపై సెబీ సహకారంతో ఆడిట్ చేయాలని స్టాక్ ఎక్స్చేంజ్లు నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. దీనికోసం త్వరలోనే ఆడిటర్ల ప్యానల్ నియమిస్తాయని, ఎంపికచేసిన 100 కంపెనీలపై తొలి దశ ఆడిట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి. ఈ సంస్థలపై విచారణ ముగిసే వరకు ప్రమోటర్ల షేర్లు ఫ్రీజ్ చేయనున్నాయి. సెబీ గుర్తించిన అన్ని అనుమానిత షెల్ కంపెనీ ట్రేడింగ్ డేటాను స్టాక్ ఎక్స్చేంజీలు పరిశీలించనున్నాయి.
సెబీ గుర్తించిన 331 అనుమాని షెల్ కంపెనీల్లో 162 బీఎస్ఈలో లిస్టు అయి ఉన్నాయి. అందుబాటులో ఉన్న 154 కంపెనీల డేటా ప్రకారం 50 కంపెనీలు వరుసగా నాలుగేళ్ల నుంచి ఇప్పటివరకు నష్టాలనే నమోదుచేస్తున్నాయని వెల్లడైంది. ఇక 12కు పైగా కంపెనీలు గతేడాది నుంచి ఎలాంటి విక్రయాలు జరుపలేదు. ఇప్పటివరకు , రిటైల్, ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులే ఈ సంస్థల్లో 95 శాతం వరకు వాటాలను కలిగి ఉన్నట్టు గమనార్హం. షెల్ కంపెనీల ప్రభావంతో బ్యాంకులు కూడా తీవ్రంగా దెబ్బతినబోతున్నాయి. 331 స్టాక్స్ విలువను తగ్గించడంతో, ఇప్పటికే మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులు, మరింత దిగజారనున్నాయి.