ఎయిర్ ఇండియా అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా అమ్మకానికి మరో కీలక అడుగు పడింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఎయిర్ ఇండియా అమ్మకానికి ఆమోదం లభించింది. మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో మాట్లాడుతూ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు.
ప్రైవేటు వ్యక్తులు ఎయిర్ ఇండియా సంస్థలో చేరడం వల్ల సంస్థ మరింత నాణ్యంగా, వేగంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు. ఆర్థికమంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుకు చేయాలన్న విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కూడా క్యాబినెట్ సమ్మతించిందని తెలిపారు. వాటాల అమ్మకం, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.
కాగా ఎయిర్ ఇండియాలో నష్టాలను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సుమారు రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే .