
డాక్టర్ రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) షేర్ల బైబ్యాక్ ఆఫర్ కింద 51 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. సగటున షేరు ఒక్కింటికి రూ. 3,090.92 చొప్పున కొనుగోలు చేశామని, ఇందుకోసం మొత్తం రూ. 1,569 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించింది. దీంతో బైబ్యాక్ ముగిసినట్లయిందని పేర్కొంది. షేరు ఒక్కింటికి రూ. 3,500కు మించకుండా రూ. 1,569.4 కోట్లు వెచ్చించి ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్ల బైబ్యాక్ చేపట్టాలన్న ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఆర్ఎల్ బోర్డు ఆమోదించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) నుంచి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో డీఆర్ఎల్ షేర్ల బైబ్యాక్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాల దరిమిలా మంగళవారం కంపెనీ షేరు ధర 0.81 శాతం పెరిగి రూ. 3,266.81 వద్ద ముగిసింది.