
హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ పత్రాలు దాఖలు
కనీసం రూ.500 కోట్లు సమీకరణ లక్ష్యం...
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ అనుబంధ కంపెనీ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీచేయడంతో పాటు ప్రస్తుత షేర్హోల్డర్లు 2.66 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఆఫర్లో విక్రయిస్తారు. లేలాండ్ ఫైనాన్స్ సంస్థ వివిధ వాహనాల కొనుగోళ్లకు రుణాలందజేస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ ఐపీఓ: బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని బీఎస్ఈ యోచిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో సెబీకి బీఎస్ఈ సమర్పించవచ్చని సమాచారం.
ఐపీవో బాటలో 23 ఎస్ఎంఈలు: దాదాపు 23 చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు(ఎస్ఎంఈ)ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ మార్చి క్వార్టర్లో సెబీకి సమర్పించాయి. ఈ సంస్థలు ఐపీఓల ద్వారా రూ200 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి.
మళ్లీ సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ: విద్య సంబంధిత సేవలందించే సీఎల్ ఎడ్యుకేట్ కంపెనీ ఐపీఓ పత్రాలను దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సెబీకి సమర్పించింది.