హ్యుందాయ్ కొత్త వెర్నా వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కార్ మేకర్ హ్యుందాయ్ మోటార్ ఇండియా మిడ్ సైజ్, సెడాన్ వెర్నా అన్ని కొత్త వెర్షన్ల ఫస్ట్ లుక్ను ఆవిష్కరించింది. వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న ఫిఫ్త్ జనరేషన్ వెర్నాను శుక్రవారం ఆవిష్కరించింది. కొత్తగా అభివృద్ధి చెందిన కే 2 ప్లాట్పారం ఆధారంగా దీన్ని రూపొందించింది. రూ .1,040 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసినట్టు కంపెనీ వెల్లడించింది. మాన్యుల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో1.6లీటర్ పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో కొత్త వెర్నా ను అందుబాటులోకి తెస్తోంది.
ఈ అప్ కమింగ్ వెర్నా బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయనీ, ఆగస్టు 22 న దీన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. దీపావళి పండుగకు ముందే 10,000 డెలివరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో వైకె కూ చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ వెర్నా బెంచ్మార్క్ ఫీచర్లు మరియు పనితీరుతో సెడాన్ విభాగంలో సంచలనం సృష్టిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 88 లక్షల సెడాన్ కార్లను, భారతదేశంలో మొత్తం 3,72,982 యూనిట్లు విక్రయించామన్నారు. 2006 లో ఈ మోడల్ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ దేశంలో 3.17 లక్షల సెడాన్లను కంపెనీ విక్రయించింది. అయితే ఈ కొత్త కారు ధరెంతో ఉంటుందో ఇంకా స్పష్టంకాలేదు.
హ్యుందాయ్ వెర్నా భారత్లోకి ప్రవేశించిన తొలి ఫ్లూయిడ్ మోడల్. హ్యుందాయ్ ఫ్లూయిడ్ కార్లకు ఇప్పటికీ భారత్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే మునుపటి వెర్నాతో పోలిస్తే 2017 వెర్నా పెద్దదిగా, 70ఎమ్ఎమ్ పొడవు, 29ఎమ్ఎమ్ వెడల్పు, 10ఎమ్ఎమ్ వీల్ బేస్ పెరుగుతుందట. ఎక్కువ క్యాబిన్ స్పేస్ తో పాటు, 2017 వెర్నా సెడాన్లో హ్యుందాయ్ సేఫ్టీకి పెద్ద పీట వేయనుందని, ఇందులో ప్రత్యేకించి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు, టాప్ ఎండ్ వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం. మిడిల్ సెడాన్ సెగ్మెంట్లో రూ.7.65-13.43 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ధర పలికే మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ సెడాన్లకు పోటీగా హ్యుందాయ్ ఈ కొత్త వెర్నాను తీసుకొస్తోందని అంచనా.