
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్ పేర్కొంది. గురువారం ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,01,555 కోట్లకు చేరి.. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా నిలవటం తెలిసిందే.
కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో రూ.1,580 చేరిన నేపథ్యంలో ప్రమోటర్ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో గతేడాది 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్–10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment