
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి. లాభదాయకం కాని విదేశీ కార్యకలాపాలను మూసివేయడం, అలాగే ఒకే పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఒకటికి మించి ఉన్న శాఖలను క్రమబద్ధీకరించడం పీఎస్బీల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 70 విదేశీ శాఖల్ని మూసేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
పీఎస్బీలు గతేడాది 35 విదేశీ శాఖల్ని మూసేశాయి. 41 విదేశీ శాఖలు 2016–17లో నష్టాల్ని ప్రకటించాయి. నష్టాల శాఖల్లో 9 ఎస్బీఐకి చెందినవి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాఖలు, బ్యాంకు ఆఫ్ బరోడా 7 శాఖలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే పీఎస్బీలకు విదేశాల్లో శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలు కలిపి 165 వరకు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment