
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ), అలహాబాద్ బ్యాంకులు తమ రిటైల్ రుణాలను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో రుణాల రేట్లు దిగిరానున్నాయి. రెపో రేటుతో అనుసంధానించిన ‘పీఎన్బీ అడ్వాంటేజ్’ పథకాన్ని పీఎన్బీ ప్రారంభించింది. ‘‘ప్రస్తుతమున్న ఎంసీఎల్ఆర్తో పోలిస్తే రెపో ఆధారిత విధానంలో 0.25 శాతం తక్కువగా వడ్డీ రేటు ఉంటుంది. ఇంటి రుణాలు తీసుకునే వారికి నూతన రేట్లు 8.25 శాతం నుంచి 8.35 శాతం వరకు.. కార్ల కోసం తీసుకునే రుణాలపై 8.65 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది’’ అని పీఎన్బీ తెలిపింది. అంతేకాదు, ఎంసీఎల్ఆర్ కింద ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)కు మారిపోయే అవకాశం కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక రూ.75 లక్షల వరకు రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధానిత రేటు (ఈబీఎల్ఆర్) ఆధారంగా రుణాలను మంజూరు చేయనున్నట్టు అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment