
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018–19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది.
మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఇది సాధ్యమవుతుందని వివరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ నివేదికలో ఫిచ్ పేర్కొంది. కేంద్ర గణాంకాల శాఖ అంచనా 6.6% కంటే ఇది తక్కువే. విధానాల కారణంగా వృద్ధి రేటు మందగమనం ముగిసిపోయినందునే ఈ అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
నివేదికలోని వివరాలు
♦ 2017 మధ్య నాటికి నగదు సరఫరా అన్నది డీమోనిటైజేషన్ ముందు నాటికి చేరింది. ఇది క్రమంగా పెరుగుతోంది.
♦ జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన సమస్యలు క్రమంగా సమసిపోతున్నాయి.
♦ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య స్థిరీకరణ నిదానంగా ఉంటుంది. ఇది సమీప కాలంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది.
♦ కనీస మద్దతు ధరలు, ఉచిత ఆరోగ్య బీమా, గ్రామీణంగా డిమాండ్ను పెంచుతాయి.
♦ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వవ్యయాలు పెరగనున్నాయి.
♦ రోడ్ల నిర్మాణం, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ సైతం మధ్య కాలంలో వృద్ధికి మద్దతిస్తాయి.
♦ ఆహార ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే, చమురు ధరల ప్రభావాన్ని ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా కళ్లెం వేయనుంది.
♦ 2018, 2019 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు.
♦ వృద్ధి రేటు పుంజుకుంటే వచ్చే ఏడాది ఆర్బీఐ రేట్లు పెంచే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా 3 శాతంపైనే
ఇక అంతర్జాతీయంగాను వృద్ధి రేటు ఈ ఏడాది మెరుగ్గా ఉంటుందన్న ఫిచ్, అమెరికా, యూరోజోన్, చైనాల ఆర్థిక వ్యవస్థలు చక్కని వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. 2019 వరకు మూడు శాతానికి పైనే వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment