వృద్ధుణ్ని ఏమార్చిన కేటుగాడు | Man Cheated Eldelry Man in Kurnool ATM Centre | Sakshi
Sakshi News home page

వృద్ధుణ్ని ఏమార్చిన కేటుగాడు

Published Wed, Dec 5 2018 11:28 AM | Last Updated on Wed, Dec 5 2018 11:28 AM

Man Cheated Eldelry Man in Kurnool ATM Centre - Sakshi

డూప్లికేటు ఏటీఎం కార్డును చూపుతున్న బాధితుడు సీసీ ఫుటేజీలో బాధితుడు, కేటుగాడి చిత్రం

కర్నూలు, ఆదోని: ఏటీఎం సెంటర్‌ వద్ద మాటువేసిన ఓ కేటుగాడు డబ్బు తీసిస్తానని వృద్ధుడిని నమ్మించాడు. ఇక్కడ డబ్బు రావడం లేదంటూ మరో ఏటీఎం సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడా డబ్బు తీస్తున్నట్లు నటించి, ఏటీఎం కార్డులో ఏదో సమస్య ఉందంటూ డూప్లికేట్‌ కార్డు చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. మరుసటి రోజు ఒరిజినల్‌ ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేసుకున్నాడు. సెల్‌కు వచ్చిన మెసేజ్‌ ఆధారంగా బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీసిన బాధితుడు మోసాపోయానని తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. టూ టౌన్‌ సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాలు..

పట్టణంలోని మహతార్‌ మసీదు వీధికి చెందిన ఏక్‌బోటే రామచంద్రకు ఆం్ర«ధాబ్యాంకులో అకౌంట్‌ ఉంది. కూతురు వివాహానికని ఖాతాలో కొంత నగదు దాచుకున్నాడు. అవసరం పడి ఈ నెల 3న ఆంధ్రాబ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లాడు. నగదు డ్రా చేసేందుకు యత్నిస్తుండగా పక్కనే ఉన్న ఓ 25 ఏళ్ల యువకుడు సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. డబ్బు డ్రా చేస్తున్నట్లు నటిస్తూ మిషన్‌లో ఏదో సమస్య ఉందంటూ భీమాస్‌ ఎదుట ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు తీసుకువెళ్లాడు. అక్కడా డబ్బు డ్రా చేస్తున్నట్లు నటించి కార్డులో ఏదోలోపం ఉందంటూ రామచంద్ర చేతిలో పెట్టి జారుకున్నాడు. ఇక రామచంద్రడు చేసేదేమీ లేక ఇంటికి వెనుదిరిగాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3.10గంటలలోపు పలు దఫాలుగా రూ.72 వేలు డ్రా అయినట్లు కుమారుడు శ్యాం సెల్‌కు మెసేజ్‌లు వచ్చాయి.

వెంటనే అతడు తన తండ్రికి ఫోన్‌ చేసి ఆరా తీయగా తాను ఇంట్లోనే ఉన్నానని, ఏటీఎం కార్డు కూడా తన వద్దే ఉందని చెప్పడంతో శ్యాం ఇంటికి వచ్చి తండ్రి వద్ద ఉన్నది డూప్లికేటుగా గుర్తించాడు. కేటుగాడు ఏటీఎం కార్డును నొక్కేసి డబ్బు డ్రా చేసినట్లు నిర్ధారించుకొని వెంటనే కార్డును బ్లాక్‌ చేయించాడు. అనంతరం శ్యాం తన తండ్రితో కలిసి టూటౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈనె 19, 20వ తేదీలలో కూతురి పెళ్లి ఉందని, ఇలాంటి సందర్భంలో తాను దారుణంగా మోసపోయానని బాధితుడు రామచంద్ర కన్నీరు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న సీఐ భాస్కర్‌ ఆంధ్రాబ్యాంకుకు చేరుకుని బ్రాంచ్‌ మేనేజరు నుంచి వివరాలు సేకరించారు. కర్నూలులోని కోట్ల కూడలిలో  ఏటీఎం ద్వారా కొంత, స్వైప్‌ మిషన్‌ ద్వారా కొంత నగదు డ్రా చేసినట్లు తెలుసుకున్నారు. ఆం్ర«ధాబ్యాంకు, స్టేట్‌ బ్యాకు ఏటీఎంలలో సీసీ ఫుటేజీలు సేకరించారు. వీలైనంత త్వరగా కేటుగాడిని గుర్తించి కటకటాల వెనక్కు పంపుతామని సీఐ  తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement