
'చంద్రబాబుకు డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదు'
కర్నూలు: ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని ఘనచరిత్ర చంద్రబాబుదని వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జలదీక్షకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజల సొమ్ముతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లాలన్న విమానాల్లోనే వెళ్తున్నారని చెప్పారు.
చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు తప్పా డైరెక్ట్ పాలిటిక్స్ చేతకాదని ఎద్దేవా చేశారు. చిదంబరం కాళ్ల మీద పడి జగన్ పై కేసులు బనాయించారని ఆరోపించారు. నీచులతో చేతులు కలిసి జగన్ ను జైలుకు పంపారన్నారు. అవినీతికి పెద్దపీట వేయడంలో చంద్రబాబు ముందున్నారని దుయ్యబట్టారు. కోట్లతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరో వెన్నుపోటుదారు వద్దకు వెళుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల మేలు కోసమే జగన్ ఆలోచిస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. జననేత ప్రజలతోనే ఉన్నారని, ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలా అని నారా లోకేశ్ ఆలోచిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు.