యాగశాలలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శని, ఆదివారాలు సెలవులు కలిసిరావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రుల బృందావన దర్శన, పరిమళ ప్రసాదం, అన్నపూర్ణభోజనశాల, పంచామృతం క్యూలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు నదీతీరంలో స్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూలబృందావన దర్శించుకుని పీఠాధిపతి సభుదేంద్రతీర్థుల మూలరాముల పూజలో తరించారు. యాగశాలలో కలశ పునఃప్రతిష్ఠాపన సందర్భంగా మృత్యుంజయ, శాంతి హోమాలు కొనసాగాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.