ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా ఎదగాలి
నరసాపురం రూరల్: ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థీ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్ అన్నారు. స్వర్ణాంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం జరిగిన టెక్నోసెట్ 2కె–16 కార్యక్రమానికి ఆయన మఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పారిశ్రామికంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు విధిగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అవసరమైన కార్యక్రమాలకు హాజరై తమ సాంకేతిక నైపుణ్యాలను మరింత వృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల కార్యదర్శి సత్రశాల రమేష్బాబు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నోసెట్ వేదికగా తమ ఆవిష్కరణలను, పవర్ ప్రజంటేషన్ల ద్వారా వ్యక్తపరచి ప్రతిభను పెంపొందించుకోవచ్చన్నారు. కళాశాల చైర్మన్ కేవీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసకుమార్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.