పరీక్ష ప్రశాతం
ప్రిలిమ్స్కు 60 శాతం హాజరు
- 9,346 మందికి 5,612 మంది హాజరు
- ఉస్మానియా కాలేజీ కేంద్రంలో తనిఖీ చేసిన కలెక్టర్
- ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న నిబంధన కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. 9,346 మంది దరఖాస్తు చేసుకోగా 5,612 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 3,734 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 60.04 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన 20 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఉస్మానియా కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తనిఖీ చేశారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, డోన్, పగిడ్యాల తహసీల్దార్లు లైజన్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. 20 సెంటర్లకు 20 మంది డిప్యూటీ తహసీల్దార్లు సిట్టింగ్ స్క్వాడ్గా పరీక్షను పర్యవేక్షించారు.
ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల వివరాలు...
గ్రూపు-1 పరీక్షకు కూడా అభ్యర్థుల పూర్తి వివరాలతో ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. అయితే ఓఎంఆర్ షీట్లోని వివరాలు, హాల్ టికెట్లోని వివరాలు సరిపోకపోవడంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి రెండు మూడు సెంటర్లలో కనిపించింది. కొన్ని సెంటర్లలో ఇంటి పేర్లలోను తేడాలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీ అధికారుల సూచనల మేరకు అభ్యర్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకొని పరీక్షకు అనుమతించారు. వికలాంగులకు కింది గదుల్లోని సీట్లు కేటాయించాల్సి ఉండగా రెండు, మూడు అంతస్తుల్లో అలాట్ చేయడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఇద్దరు ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు కర్నూలులో జరిగిన పరీక్షను పర్యవేక్షించారు.