
బ్రహ్మంసాగర్కు నీటిని అందించడంలో టీడీపీ విఫలం
బి.కోడూరు : బ్రహ్మంసాగర్కు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా నీటిని అందించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నేలటూరిరామిరెడ్డి కుమారుని వివాహానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు గత మూడేళ్లుగా మండలంలో వర్షాలు రాక బ్రహ్మంసాగర్ నీరు అందక పంటలు సరిగా పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు వారు స్పందిస్తూ బ్రహ్మంసాగర్ నీటి విషయమై ఇప్పటికే చీఫ్సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా బ్రహ్మంసాగర్ నీటి విషయమై పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా బ్రహ్మంసాగర్కు నీరు అందించి, బ్రహ్మంసాగర్ నుంచి అటు బి.మఠంతో పాటు బి.కోడూరు మండలంలోని 32 చెరువులకు నీరు అందించి కలసపాడు, కాశినాయన మండలాలకు నీరు అందించి చేయూతనిచ్చిన విషయాన్ని ఎంపీ అవినాష్రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతాంగ సమస్యలను పూర్తి విస్మరించిందన్నారు. బ్రహ్మంసాగర్ నీటి విషయమై జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి తిరిగి చీఫ్ సెక్రటరీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళతామని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల, బి.కోడూరు జెడ్పీటీసీలు చిత్తారవిప్రకాష్రెడ్డి, ఎస్.రామక్రిష్ణారెడ్డి, బి.కోడూరు సింగిల్విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.