కనులవిందుగా తెప్పోత్సవం
– పాల్గొన్న వేలాది మంది భక్తులు
–– ధర్మకర్తల మండలి సభ్యులకు దక్కని అవకాశం
శ్రీకాళహస్తి : సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవం శుక్రవారం రాత్రి శ్రీకాళహస్తిలో వేడుకగా జరిగింది. ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఇంద్రవిమానంపై ఊరేగిన శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి రాత్రి పట్టణంలోని నారదపుష్కరిణిలో తెప్పలపై తిరుగాడారు. కుమారస్వామి కొండకు దిగువభాగంలో ఉన్న నారదపుష్కరిణిలో తెప్పలను పూలతో, మామిడి తోరణాలతో,అరటిచెట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుత్దీప కాంతులతో మెరిసిపోతున్న తెప్పోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించారు. కోనేరులో స్వామి అమ్మవారు తెప్పలపై ఆరు సార్లు ప్రదక్షిణలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఉత్సవాన్ని తిలకించారు. భక్తులు కోనేరులో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించకున్నారు. మరికొందరు భక్తులు బెల్లం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు,ఈవో భ్రవురాంబ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టవేలు జయగోపాల్, పీఎం చంద్ర, ఉభయదారులు పాల్గొన్నారు. తెప్పలపై ఆలయ చైర్మన్ దంపతులు,ఈవో, ఇద్దరు అర్చకులు, ఇద్దరు వేద పండితులు అవకాశం లభించింది. ఏడుగురు మాత్రమే తెప్పలపై ఎక్కడానికి వీలుందని ఇరిగేషన్ అధికారులు ముందే సూచించారు. దీంతో ఆలయ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.