ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్సిగ్నల్
-
నామినేషన్లు ప్రారంభం ఆగస్టు22
-
ఎన్నికలు సెప్టెంబర్ 13న
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు యాజమాన్యం అంగీకరించింది. సెప్టెంబర్ 13న ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. రామగుండం ప్రాజెక్టు పరిపాలనా భవనంలోని ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో ఎన్టీపీసీ అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల తేదీని ఖరారు చేశారు. ప్రస్తుత గుర్తింపు యూనియన్ కాలపరిమితి గతేడాది సెప్టెంబర్తో ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో వివిధ యూనియన్లు అసంతృప్తి వ్యక్తంచేస్తూ కార్మికశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించాయి. ఈ క్రమంలో కేంద్రకార్మిక శాఖ డెప్యూటీ ఛీప్ లేబర్‡కమిషనర్ ఎన్నికల విషయంలో స్థానిక యాజమాన్యానికి లేఖ రాసింది. ప్రాజెక్టులోని యూనియన్లు, యాజమాన్య ప్రతినిధులతో ఎన్నికలతేదీ ఖరారుపై సమావేశం నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థ విస్తరణ నేపథ్యంలో వీఐపీల తాకిడి ఉంటుందని, కొంత వ్యవధి కావాలని యాజమాన్యం కార్మికశాఖాధికారిని కోరింది. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఎన్నికల సరళిని మార్పు చేసేందుకు కార్పొరేట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని అన్ని ఎన్టీపీసీ సంస్థల్లో ఒకేసారి గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని భావించింది. మెజార్టీ సాధించిన యూనియన్తోపాటు రెండో స్థానంలో ఉన్న యూనియన్కు ప్రాతినిధ్యం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో కొన్ని జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తంచేశాయి. జూన్ 19న ఎన్బీసీ సమావేశంలో యూనియన్ ఎన్నికలపై అన్ని జాతీయ సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చి సంతకాలు చేశాయి. దీంతో రామగుండం ఎన్టీపీసీ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ కార్పొరేట్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సెప్టెంబర్ 13న ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో నామినేషన్ ఆగస్టు 22న, విత్డ్రా 24న, గుర్తుల కేటాయింపు 25న, సెప్టెంబర్13న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికలలో విజయం సాధించిన నూతన యూనియన్ ప్రతినిధులు సెప్టెంబర్ 15,16 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న ఎన్భీసీ సమావేశంలో పాల్గొనున్నారు. పోటీలో ఏడు యూనియన్లు అర్హత కలిగిఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఏజీఎం హెచ్ఆర్, ఎన్నికల అధికారి రమేష్, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల తేదీ ఖరారు కావడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అన్ని యూనియన్లు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.