
గుప్తనిధుల ముఠా సభ్యుల అరెస్టు
- ద్విచక్రవాహనాలు, ఆటో, సామాగ్రి స్వాధీనం
కళ్యాణదుర్గం:
గోళ్ల – ముద్దినాయనపల్లి అటవీ ప్రాంతంలోని ఉప్పంపల్లి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గుప్తనిధుల తవ్వకాలకు ప్రయత్నించిన ముఠా సభ్యులలో 15 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐలు నబీరసూల్, శంకర్రెడ్డి తెలిపారు. అరెస్టు వివరాలను సోమవారం కళ్యాణదుర్గం రూరల్ పోలీసుస్టేషన్లో విలేకరులకు వెల్లడించారు.
గుప్తనిధులు తవ్వడానికి 19 మంది ముఠా సభ్యులు తొమ్మిది ద్విచక్రవాహనాలు, ఒక ఆటోలు వెళ్లినట్లు తెలిపారు. ఇందులో అనంతపురం నీరుగంటివీధికి చెందిన ఉమ్మిడిశెట్టి రామకృష్ణ అలియాస్ రాము ప్రధాన కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇతను గుప్తనిధుల ముఠా సభ్యులతో మంచి పరిచయాలు పెంచుకుని అవగాహన పొందాడన్నారు. గతంలో ఆత్మకూరు వద్ద జరిగిన జంట హత్యలు గుప్త నిధుల విషయంలోనే చోటు చేసుకోగా.. హత్యకు గురైన వారితో రామకృష్ణకు పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఉప్పంపల్లి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గుప్త నిధుల కోసం పరిశీలించారన్నారు.
ఇందులో భాగంగానే నలుగురు పరిచయం ఉన్న వ్యక్తులతో మరికొంతమందిని సమీకరించుకుని పది రోజుల క్రితం గుప్తనిధుల తవ్వకానికి వచ్చి సాధ్యం కాక వెనుదిరిగారన్నారు. జూన్ 27వతేదీ పగడ్భందిగా 19 మంది సభ్యులతో సామాగ్రితో పాటు వచ్చి తవ్వకాలకు పూనుకుని గ్రామస్థులు అప్రమత్తం కావడంతో పరారయ్యారన్నారు.