
'ముందు సింగపూర్.. ఇప్పుడు జపాన్'
సాక్షి, రాజమహేంద్రవరం: ‘రాజధాని పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు...మీ పాలన రాజధానికే పరిమితమా? రాజధాని నిర్మాణంలో ఏ లొసుగులున్నాయో తెలియటంలేదు... ముందు సింగపూర్ అన్నారు... ఇప్పుడు జపాన్ అంటున్నారు’ అని మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం చంద్రబాబుకు లేఖ రాశారు. విదేశీ టూర్ల పేరుతో ప్రజాధానాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలను విస్మరించారని ఆ లేఖలో విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా పథకాలకు చంద్రన్న అంటూ పేరు పేట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన బినామీలకు బాబు అక్రమంగా భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, కాలేజీల నుంచి ముడుపులు తీసుకుంటూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.