rajamahendravaram
-
ఏపీ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో దళిత యువకుణ్ణి అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించిన కేసులో డీజీపీతోపాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అమానవీయమైన ఘటనపై ఆ ప్రాంతంతో లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఆ అధికారి నాలుగు వారాల్లోగా నిష్పాక్షికంగా విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది.వరద సమయంలో తమ కాలనీలో సమస్యపై పులిసాగర్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీంతో విద్యావంతుడైన ఆ దళిత యువకుడిని దారుణంగా వేధించి, పోలీస్ స్టేషన్ లాకప్లో అర్ధ్ధనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ల ముందు నిలబెట్టారు. చంపేస్తానని ఇన్స్పెక్టర్ బాజీలాల్ బెదిరించాడు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎంపీలు పిల్లి గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు మార్గాని భరత్రామ్, గోరంట్ల మాధవ్తో కలిసి ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని, బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పులి సాగర్కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి కమిషన్ ఈ నోటీసులిచ్చిoది. పులి కృపానంద సాగర్ అనే దళిత యువకుడిపై అక్కడి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కులవివక్ష చూపించడంతోపాటు కస్టోడియల్ హింసకు గురి చేశారని ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక బ్రెత్రెన్ చర్చి వద్ద నీరు నిలిచిపోయిందని ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు హింసించారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించినందుకు ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఐ బాజీలాల్ అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అవమానించడంతోపాటు అత్యంత అమానవీయంగా చొక్కా విప్పి కొట్టారని, కులం పేరుతో అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. లాకప్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఎదుట ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు నిలబెట్టారని తెలిపారు. ఆ తర్వాత అతన్ని ఒక బండరాయికి కట్టి గోదావరిలో పడేశారని పేర్కొన్నారు. ఈ దారుణ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఊచల మధ్య ఒక మహిళా పోలీసు దగ్గర నిలబడి ఉన్న దృశ్యాలకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లు, ఫొటోలను కూడా ఆయన ఫిర్యాదుకు జత చేశారు. దీని ఆధారంగా మానవ హక్కుల కమిషన్ ఏపీ డీజీపీకి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు ఆన్లైన్లో నోటీసులిచ్చిoది. ఈ అమానవీయ ఘటనపై రాజమండ్రికి సంబంధం లేని జిల్లాలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ స్థాయి ర్యాంకుకు తగ్గని సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 4 వారాల్లోగా నిష్పాక్షికంగా నివేదిక తమకు పంపాలని స్పష్టం చేసింది. బాధితుడు లేవనెత్తిన సమస్యలు, పారిశుద్ధ్య లోపంపై జిల్లా కలెక్టర్ ఏం చర్య తీసుకున్నారో తెలపాలంటూ మరో నోటీసు ఇచ్చారు. -
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు!
తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ,. స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. -
టీడీపీలో ఇసుక దుమారం?
సాక్షి, రాజమహేంద్రవరం : నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇసుక తుపాను చెలరేగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతో ఆ పార్టీల నేతలు ఇసుక మీద పడ్డారు. వర్షాకాలం పురస్కరించుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుకను ఊడ్చేశారు. ఇప్పుడిదే వారి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఓ జనసేన నేత అత్యుత్సాహం రాజమహేంద్రవరంలోని ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నగర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారిన ఈ ఇసుక బాగోతం కథాకమామిషు ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య ఈ ఇసుక దుమారం రేగింది. గోరంట్లకు అనుచరుడిగా పేరుగాంచిన ఓ జనసేన నేత ఇసుక వ్యాపారమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు ఇసుక దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా.. గోదావరి వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ర్యాంపుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఆ గుట్టలు మింగేశారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా అక్రమంగా తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని గ్రాయత్రి–1, 2, 3, 4, 5 పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లోని నిల్వలను ఆ నియోజకకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా బుచ్చయ్య అనుచరుడైన ఓ జనసేన నేత ఇసుక మొత్తం ఊడ్చేశాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ నేత రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ర్యాంపులపై కూడా కన్నేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండటం.. నూతన ఇసుక పాలసీ త్వరలో రానుండటంతో ముందుగానే తరలించేయాలన్న ఆలోచనతో దానిని ఎడాపెడా తరలించేసి అమ్మేశారు. ఇలా రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలో నిల్వ ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఇసుక కొల్లగొట్టినట్లు సమాచారం. దోపిడీ చేసిన సొమ్ములో తన గురువుకు కొంత లాభం చేకూర్చినట్లు తెలిసింది. సిటీ ఎమ్మెల్యే తండ్రి సీరియస్.. ఇదిలా ఉంటే.. ఈ విషయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి వెళ్లడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ ఇలాకాలో తమకు తెలీకుండా ఇసుక తరలించుకుపోవడంపై అవాక్కయ్యారు. అదీ తన విరోధి బుచ్చయ్యచౌదరి అనుచరుడని తేలడంతో మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిల్వలకు సంబంధించిన నగదు తనకివ్వాలని సదరు నేతకు కబురు పంపినట్లు సమాచారం. ఆ నేత నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై అప్పారావు కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగని ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే కూటమిలో భాగమైన జనసేన నేత కావడం, పార్టీ పెద్దలకు మరో రకమైన సంకేతాలు వెళ్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారులపై చిందులు? మరోవైపు.. ఇసుక తరలించేస్తుంటే ‘మీరేం చేస్తున్నారు? అడ్డుకోవాలి కదా..’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు మైనింగ్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. రాజమండ్రి సిటీ పరిధిలో ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లాలన్నా తన అనుమతి ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఏమీ చెప్పలేక అధికారులు మిన్నకుండిపోయారు. ఇసుక తరలించిన వ్యక్తి కూటమి నేత కావడం, ఆయన్ను ఏమీ అనలేక తమపై రుబాబు చూపడంపట్ల అధికారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇది అధికార పార్టీ పనే’.. రాజమండ్రిలో అలజడిపై భరత్రామ్
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ నేత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి దహనం చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయం వద్ద ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుం డగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మాజీ ఎంపీ భరత్ రామ్కు సమాచారం అందించారు. వెంటనే ఆయనతో పాటు ప్రకాశం నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఇటు వంటి విషసంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని చెప్పారు. ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం,ఇళ్ల పైకి దాడులు చేయడం, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం వంటి దారుణాలకు ఒడిగట్టారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు దర్యాప్తు చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం: టీడీపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్)/అనంతపురం కార్పొరేషన్/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసుమంతైనా లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లేవంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్ 25న çఫస్ట్ ప్లోర్లో 120.34 స్క్వేర్ యార్డ్స్ ప్రపోజ్ చేస్తూ మార్ట్గేజ్ చేశారు. గతేడాది వీఎంఆర్డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యంతరం లేకపోయినా..ఆటోమెటిక్గా ప్లాన్ అప్రూవల్ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు. బుల్డోజర్తో కూల్చేస్తామంటూ..నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్స్తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ అక్కడికి చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడారు.ప్రభుత్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యుమెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కూల్చేసామని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్ మారుతీహరిప్రసాద్ శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని, అంతవరకు నిర్మాణాలు చేపట్టకూడదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ శ్రీనివాసులుకు నోటీసు అందించారు. ఇది అనధికారిక కట్టడంరాజమహేంద్రవరంలోని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్రామ్ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడమంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రాజమహేంద్రవరంలో.... ‘గేమ్ చేంజర్’
రాజమహేంద్రవరం పయనమయ్యారు రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘గేమ్ చేంజర్’ అనే పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.తండ్రి పాత్రలో అప్పన్నగా, కొడుకు పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్గా రామ్చరణ్ కనిపిస్తారట. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో పాల్గొనేందుకు శుక్రవారం రామ్చరణ్ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ షెడ్యూల్తో ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఇక రామ్చరణ్, అంజలి, శ్రీకాంత్తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఉసురుతీసిన కలహాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాల కారణంగా అనుమానాస్పదంగా దంపతులు మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరం ఆనంద్నగర్లో శనివారం చోటుచేసుకుంది. అయితే సంఘటనా స్థలంలో ఆధారాలను బట్టి భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జగ్గంపేటకు చెందిన శ్రీధర్ (28)కు ప్రత్తిపాడుకు చెందిన దేవి (22)కి ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల బాబు, ఆరేళ్ల పాప ఉన్నారు. తాపీ పనిచేసుకునే శ్రీధర్కు ఏడాది కిందట ప్రమాదం జరగడంతో వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.భార్య దేవికి ఫిట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో భార్య దేవి నెలరోజుల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను కాపురానికి తీసుకు వచ్చేందుకు శ్రీధర్ వారం కిందట అత్తారింటికి వెళ్లాడు. పిల్లలను ప్రత్తిపాడులో వదిలేసి భార్యాభర్తలిద్దరూ కలసి ఆనంద్నగర్లోని ఇంటికి శనివారం ఉదయం 10.30 గంటలకు వచ్చారు. వస్తూ శ్రీధర్ వెంట మద్యం బాటిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకూ తలుపు వేసి ఉండడం, ఇంటి లోపలకు వెళ్లిన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు ఎంత తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి తలుపులు తీసి చూడగా భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని మూడో పట్టణ పోలీసులకు తెలిపారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దేవి మెడకు చున్నీ ఉండడం, ఆమె కిందపడిపోవడంతో ఆమెను చంపి శ్రీ«ధర్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను సీఐ వీరయ్య గౌడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి
-
అనపర్తిలో అయోమయం
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతో.. అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. పోటాపోటీగా నామినేషన్లు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేసి అందరినీ షాక్కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గూటికి నల్లమిల్లి? తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది. సెంటిమెంటుతోనేనా.. అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్ పోటీ చేశారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించారని తెలిసింది. మాజీ సైనికుడికి అన్యాయం? అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్ఎస్ఎస్ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
చలో రాజమహేంద్రవరం
‘గేమ్చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్నగర్ సమాచారం. రామ్చరణ్తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్పై త్వరలోనే స్పష్టత రానుంది. -
చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం
పార్టీ కోసం.. చంద్రబాబు పర్యటనల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల చేతి చమురు వదిలిపోయింది.. మూతికి కర్రతో గడ్డి కట్టి, ఆశ చూపించి, పరుగులు పెట్టించినట్టు.. ఎమ్మెల్యే సీటు ఇస్తామంటూ ఆశ చూపారు. ఆ మాటలు కాస్తా నమ్మి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. కొన్నాళ్లు పోయాక.. అబ్బెబ్బే.. అది కాదు.. ఎంపీ సీటు అన్నారు. తీరా చూస్తే పొత్తులతో ఆ ఆశ కాస్తా చిత్తయిపోతున్న చిత్రం కళ్ల ముందు స్పష్టం కనిపిస్తోంది. మొత్తంమీద చంద్రబాబు జిత్తులతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నట్టుగా ఉంది టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి పరిస్థితి. తాజాగా శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో కూడా చౌదరి పేరు లేకపోవడంతో.. ఈ పరాభవాన్ని ఎలా సహించాలంటూ ఆయనతో పాటు ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం కూడా దక్కలేదంటూ ఆక్రోశిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పదా? రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశిస్తున్న ఆయనకు.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమితో ఆశలు గల్లంతైనట్లేనా? కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారా? ఈ పరిణామంతో చౌదరికి మరోసారి పరాభవం ఎదురు కానుందా? టీడీపీ మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. రెంటికీ చెడ్డ రేవడిలా.. తన పనితీరుపై అధినేత చంద్రబాబు విరుచుకుపడటంతో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి చాన్నాళ్ల కిందటే గుడ్బై చెప్పేశారు. అప్పటి నుంచీ ఆ బాధ్యతలను బొడ్డు వెంకట రమణ చౌదరికి చంద్రబాబు అప్పగించారు. ఆయనే రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అంతలోనే ఆయన ఆశలపై పొత్తుల పిడుగు పడింది. జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం.. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో చౌదరి వర్గంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఈ పరిణామం చౌదరికి మింగుడు పడని అంశంగా మారింది. ఒక దశలో ఇది చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించే స్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకోవడం వరకూ వెళ్లింది. ఆ సమయంలో చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ససేమిరా అన్నప్పటికీ చేసేది లేక చౌదరి మిన్నకుండిపోయారు. అప్పటి నుంచీ టీడీపీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన వర్గం సైతం అందే పంథా అవలంబిస్తోంది. తనకు ఎంపీ సీటు కేటాయిస్తారులే అనే ఆశతో ఇష్టం లేకపోయినా.. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి చౌదరికి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో సైతం ఆయన పేరు లేకపోవడంతో ఎంపీ సీటు కూడా గోవిందానేనా? అనే అనుమానం చౌదరి వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. కలవరం రేపుతున్న కూటమి ఎమ్మెల్యే సీటు ఎటూ దక్కలేదు.. కనీసం ఎంపీగా అయినా అవకాశం వస్తుందని భావిస్తున్న చౌదరి వర్గానికి.. చంద్రబాబు బీజేపీతో కలవడం కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఎన్నికల బరిలోకి దింపేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం స్థానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు నగరంలోని ఓ హోటల్లో కొద్ది రోజులుగా బస చేస్తున్నట్లు తెలిసింది. పురంధేశ్వరి పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలు, సాధ్యాసాధ్యాలపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి పోటీ దాదాపు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీ కోరుకుంటున్న ఈ లోక్సభ స్థానాన్ని కాదనే ధైర్యం చంద్రబాబు చేయరు. ఈ పరిణామాలు చౌదరి వర్గంలో ఆందోళన రేపుతోంది. ఎంపీ అవకాశం కూడా లేనట్లేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాగైతే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే మీమాంస ఆయన వర్గంలో బలంగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగేలా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది. రూ.కోట్లు ధారబోసినా కరివేపాకు రాజకీయమేనా! బీజేపీ నేతలతో చంద్రబాబు కాళ్లబేరానికి వెళ్లడం టీడీపీ నేతలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే జనసేనతో జత కట్టడంపై గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా బీజేపీతో కలవడంపై మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట రమణ చౌదరి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. చినబాబు లోకేష్కు సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పబ్లిసిటీ చేసేందుకు సహకరిస్తున్నారు. ఇదే తరుణంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, పటిష్టతకు ఇంత చేస్తున్నా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం చౌదరి వర్గంలో వ్యక్తమవుతోంది. తన విషయంలో కూడా చంద్రబాబు కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే రాజకీయాలకు తెర తీయడంపై మండిపడుతున్నారు. లోహిత్నూ వాడేసుకున్నారు ఎన్ఆర్ఐలు, డబ్బున్న నేతలు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి. ఇందుకు నిదర్శనమే శిష్ట్లా లోహిత్. ఎంపీ స్థానం కేటాయిస్తామనే ఆశ కల్పించి, ఎన్ఆర్ఐ అయిన లోహిత్ను రాజమహేంద్రవరంలో పరిచయం చేశారు. ఆర్థికపరమైన పార్టీ కార్యక్రమాలకు ఆయనను విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆయనను ఏ స్థాయిలో వాడేసుకున్నారంటే.. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఒక్కో నియోజకవర్గానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలా లోహిత్ ఇచ్చిన డబ్బుతోనే మహానాడుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేశారు. అందులో లోహిత్కు తగిన గుర్తింపు ఇచ్చిన పాపాన పోలేదు. చివరకు సీటు తనకు కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో చేసేది లేక లోహిత్ ఇక్కడి నుంచి దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. ఇదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని పురంధేశ్వరికి కేటాయిస్తే వెంకట రమణ చౌదరి సైతం దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన వర్గంలో చర్చ జరుగుతోంది. -
బీజేపీకి ‘మూడొ’చ్చింది
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్గా ఉంది. ఆ మూడు ఏవంటే కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది. ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది. ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు. -
చల్లారని సర్దుబాటు మంటలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు మంటలు చల్లారడం లేదు. ఇరు పార్టీల అధినేతలు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహార శైలి ఆయా పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వెరసి వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. సీట్లపై ఎటూ తేల్చకపోవడంతో ఇరు పార్టీల నేతలు వర్గాలుగా విడిపోయి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. పార్టీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమ నేతకు సీటు కేటాయించని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు దిగుతామని అల్టిమేటం ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నిరాకరిస్తే తమ సత్తా ఏమిటో పార్టీల అధిష్టానాలకు చూపేందుకు సంసిద్ధమవుతున్నారు. ప్రజల్లో తమకున్న ఆదరణను చూపేందుకు కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించుకుని మరీ బలప్రదర్శనలకు దిగుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, మౌనపోరాటం వంటి కార్యక్రమాలతో వినూత్న నిరసనలకు నాంది పలకడం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నిడదవోలును బూరుగుపల్లికి కేటాయించాలని నినదిస్తున్న టీడీపీ నేతలు ఎడతెగని ఉత్కంఠ రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు ఉమ్మడి స్థానాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు తనదంటే తనదంటూ జనసేన, టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ గందరగోళాన్ని చక్కదిద్దాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం ఇరు వర్గాల మధ్య విభేదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. నిడదవోలులో నిరసన గళం నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పట్టం కట్టకపోతే సహించేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. కచ్చితంగా తమ నేతకు కేటాయించాల్సిందేనన్న అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకి మద్దతుగా ఉండ్రాజవరం మండలంలోని ఆయన స్వగ్రామం వేలివెన్నుకు పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. శనివారం సైతం అధిక సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని శేషారావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ బలప్రదర్శనకు దిగారు. ఆయనకు టికెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని కుండ బద్దలుగొడుతున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రకటించుకోవడం పొత్తు ధర్మమా? అంటూ ప్రశ్నించారు. దుర్గేష్ను నిడదవోలుకు పంపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే ఇక్కడికి వచ్చి ఎలా గెలుస్తారో తామూ చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. దుర్గేష్ దారెటు..? రాజమహేంద్రవరం రూరల్ జనసేన నేత కందుల దుర్గేష్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే రూరల్ సీటు దక్కుతుందన్న ఆయన ఆశలకు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గండి కొట్టారు. బుచ్చయ్య ఒత్తిడికి తలొగ్గిన టీడీపీ, జనసేన అధిష్టానాలు దుర్గేష్ను నిడదవోలుకు సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దుర్గేష్ను మంగళగిరి పిలిపించి మరీ హితబోధ చేశాయి. ఈ పరిణామం ఇటు రాజమహేంద్రవరం రూరల్ జనసేన, అటు నిడదవోలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు నింపాయి. ఇద్దరు నేతల మధ్య వైషమ్యాలకు ఆజ్యం పోశాయి. ఈ పరిస్థితుల్లో దుర్గేష్ ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దుర్గేష్కు స్థానచలనంపై జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. రూరల్లో బుచ్చయ్యకు సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. దుర్గేష్కు మద్దతుగా ఆందోళన దుర్గేష్ను నిడదవోలుకు పంపాలని జనసేన అధినేత పవన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన మాటను సైతం కట్టుబడి ఉండలేరా అని ప్రశ్నిస్తున్నారు. దుర్గేష్కు రూరల్ కేటాయించాలని కోరుతూ కడియం నుంచి రాజమహేంద్రవరం నగరంలోకి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలోపేతానికి దుర్గేష్ చేసిన కృషిని కూడా గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో అధిష్టానం ఉందా అని మండిపడ్డారు. దుర్గేష్కు సీటు కేటాయించకపోతే బుచ్చయ్యకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో దుర్గేష్కు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రకటించే వరకూ చూస్తానంటున్న గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటు తనకేనని సీనియర్ టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇరు పార్టీల అధ్యక్షులూ ప్రకటించేంత వరకూ వేచి చూస్తానని అంటున్నారు. -
రాజమహేంద్రి ..రాత మారింది
పవిత్ర గోదావరి సమీపాన ఉజ్వరిల్లే నగరం రాజమహేంద్రవరం. ఇదొక చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా ప్రతీతి చెందిన ప్రాంతం. హోల్ సేల్ వస్త్ర వాణిజ్యానికి చుక్కాని. నవ్య తూర్పు గోదావరి జిల్లాకు కేంద్రం. ఐదు లక్షలు పైగా జనాభాతో తులతూగే సిరులు కలిగిన నగరం. గత పాలకులు కేవలం పుష్కరాల సమయంలోనే నామమాత్రంగా పనులు చేసేవారు. కానీ నాలుగున్నరేళ్లలో నగర అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సాధారణ, మున్సిపాలిటీ, ప్రత్యేక, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) నిధులు రూ.558 కోట్లు వెచ్చించింది. ఇందులో రూ.217 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకాల నిర్వహణ చేపడుతోంది. పచ్చదనం పెంపొందించి, పార్కులను అభివృద్ధి చేస్తోంది. అర్బన్ ఫుడ్ ప్లాజా, కంబాల చెరువు పార్కు, పుష్కర ఘాట్ వద్ద పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్లను వినియోగంలోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రూ.7 కోట్లతో 100 అడుగుల రోడ్ల అభివృద్ధి జరిగింది. నగర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.125 కోట్ల ప్రత్యేక నిధులు అందించారు. – షేక్ ఫయాజ్ బాషా, సాక్షి, రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల నిర్వహణ ఇలా.. ► సెంట్రల్ జైల్ ప్రాంగణంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం ► అకడమిక్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణం ► 2023–24 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి 150 మెడికల్ సీట్లు ► సిబ్బందికి టీచింగ్ స్టాఫ్ క్వార్టర్లు ► మెడికో హాస్టళ్లు ► నర్స్ హాస్టళ్లు ► ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, బోధనాసుపత్రిలో 54 మంది వైద్యులు, ► 484 మంది నర్సులు ► ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 500 పడకల బోధనాసుపత్రిగా విస్తరణ నాలుగున్నరేళ్లలో వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు ► రహదార్లు రూ.98 కోట్లు ► డ్రెయిన్లు రూ.54కోట్లు ► మంచినీటి సరఫరా రూ.28 కోట్లు ► వీధి దీపాలకు రూ.9 కోట్లు ► పార్కులకు రూ.9కోట్లు ► సుందరీకరణకు రూ.13 కోట్లు ► సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ రూ.16కోట్లు ► భవనాలు రూ.6 కోట్లు ► ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు ► సీఎం మంజూరు చేసిన నిధులు రూ.125 కోట్లు పురోగతి సాధించిందిలా.. ► రూ.4.3 కోట్లతో 7.3 కిలోమీటర్ల మేర డివైడర్ల మధ్యలో పచ్చదనం ► 17 కిలోమీటర్లలో 15,000 మొక్కలు ► ఎయిర్పోర్టు రోడ్డులో 12 కిలోమీటర్ల మేర రుడా, మున్సిపల్ నిధులతో ఉద్యానవనం ► 40 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కుల సుందరీకరణకు మరో రూ.4.3 కోట్లు ► కొత్తగా 5 పార్కులు (మహాలక్ష్మి పార్క్, గాదాలమ్మ నగర్ పార్క్, ఏకేసీ పార్క్, అంబేద్కర్ పార్క్, సాయిచైతన్య కాలనీ పార్క్, ఎస్బీఐ కాలనీ పార్క్) ► రూ.7.26 కోట్లతో జంక్షన్ల ఆధునీకరణ ► రూ. 7.26 కోట్లతో పుష్కర ఘాట్, దేవీచౌక్, దండి మార్చ్ వంటి 12 జంక్షన్లు ఆధునికీకరణ ► రూ.4.6 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ రూము, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ► వై–జంక్షన్, హ్యాపీ స్ట్రీట్ వద్ద రూ.1.2 కోట్లతో వాటర్ ఫౌంటేన్లు ► ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ అందుబాటులోకి తెచ్చారు. ► రూ.1.2 కోట్లతో ఆనం కళాకేంద్రం వద్ద అతి పెద్ద ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ► రూ. 2 కోట్లతో పద్మావతీ నగర్ పార్కు వద్ద చిన్నారులకు స్విమ్మింగ్ పూల్ ► రూ.53.85 కోట్లతో నగరంలో 51 కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు ► ఇప్పటికే 39 కిలోమీటర్ల పనులు పూర్తి ► పురోగతిలో 12 కిలోమీటర్ల మేర పనులు ► రూ.5 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్ల మరమ్మతులు ► ఒక్కో కేంద్రానికి రూ.80 లక్షలు ► 6 యూపీహెచ్సీల నిర్మాణం పనులు ► గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జిపై (పాత రైల్వే వంతెన) 2.7 కిలోమీటర్ల మేర ఆర్నమెంటల్ లైటింగ్ ‘నాడు–నేడు’తో నూతన రూపు ► రూ. 28 కోట్లతో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా 35 పాఠశాలలు ఎంపిక ► మొదటి దశలో శ్రీ పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్, లాలాచెరువు హైసూ్కళ్లు ఆధునికీకరణ. రెండో దశలో మరో 60 పాఠశాలల అభివృద్ధి ప్రతిపాదనలు, టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు ► నాగులగుట్ట చెరువు వద్ద రూ.12 కోట్లతో క్రికెట్ స్టేడియం నిర్మాణం ► రూ.23 కోట్లతో గోదావరి తీరం వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆధునీకరణ ► వీఎల్పురం వద్ద రూ.23 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ► రానున్న రూ.80 కోట్లతో అమృత్ స్కీమ్తో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు సిద్ధం ► ఖేలో ఇండియా పథకం కింద రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ► రూ.3 కోట్లతో గాంధీ పురం వద్ద గ్లో గార్డెన్ నిర్మాణాలు పర్యాటక కేంద్రంగా కంబాలచెరువు కంబాల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు పార్కులో 6 ఎకరాల్లో చెరువు అభివృద్ధి బోటింగ్ సదుపాయం 4 ఎకరాల్లో జాగింగ్ ట్రాక్, బోట్ సైక్లింగ్, 4 లేజర్ షో, 360 డిగ్రీ సైక్లింగ్, 360 డిగ్రీ అమ్యూజ్ మెంట్ రైడ్, ట్రాంపోలిస్ ఎక్విప్మెంట్, స్కై బెలూన్ (చిల్ర్డన్స్), స్కై రోలర్, వాటర్ వాకింగ్ బాల్స్, బాడీ బార్బింగ్ బాల్స్, 4 పురుషుల జిమ్, సీటింగ్ గ్యాలరీ, మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా, ఓఏటీ జోన్, స్టేట్ ప్రైడ్ జోన్, చిల్ర్డన్స్ ప్లే ఏరియా ఆక్వా లేజర్ షో చౌడేశ్వర్ నగర్లో రూ. 3 కోట్లతో గ్లో థీమ్ పార్క్ రూ.90 లక్షలతో సివిల్ పనులు రూ.2 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టారు. అందుబాటులోకి 300 మీటర్ల వాకింగ్ ట్రాక్ బాపూజీ స్ఫూర్తికి నిదర్శనం దండి మార్చ్ మహాత్మా గాంధీ రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నగరాన్ని బాపూజీ ఐదుసార్లు సందర్శించారు. ఆ అనుబంధానికి ప్రతీకగా దండి మార్చ్ రూపుదిద్దుకుంది. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు వెచ్చించారు. 200 మీటర్ల పుష్కర ప్లాజా రోడ్డును పూర్తిగా ఆధునీకరించారు. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైన్ బోర్డులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. పచ్చదనం పెంపొందించడంతో సెల్ఫీల కోసం యువత పోటీ పడుతోంది. ఏకేజీ కళాశాల వద్ద రూ. 80 లక్షలతో ఏర్పాటైన హ్యాపీ స్ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జగనన్న స్మార్ట్ రోడ్స్ ► రూ. 8.5 కోట్లతో ‘జగనన్న స్మార్ట్ రోడ్లు ► వై జంక్షన్ నుంచి లాలాచెరువు జంక్షన్ వరకూ 3 కిలో మీటర్లు అధునాతన రహదారి ► రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పున ఫుట్పాత్లు ► మధ్యలో ఆహ్లాదాన్ని నింపేలా ముచ్చటగొలిపే ఉద్యానవనాలు ► అక్కడక్కడా అందుబాటులోకి సెల్ఫీ స్పాట్లు ► గోడలపై రంగురంగుల బొమ్మలు ► రూ.5 కోట్లతో వై–జంక్షన్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఫుట్పాత్లు, పార్కింగ్, డస్ట్బిన్స్ ► రూ.12.6 కోట్లతో 16 కిలోమీటర్ల మేర 15 రకాల రహదారుల నిర్మాణం ప్రశాంత వాతావరణంలో జీవించాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలి. రోడ్డు, డ్రెయిన్లు, వీధి దీపాలు, పార్కులను ఆధునీకరించాం. పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం. తాగునీటి పనుల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.మాధవీలత, కలెక్టర్, తూర్పు గోదావరి హరిత నగరంగా తీర్చిదిద్దుతాం సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆహ్లాదకర ప్రదేశాలతో హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నాం. న్యూయార్క్, ఇంగ్లండ్ దేశాల్లో ఓపెన్ ఆడిటోరియంలలో ఓపెన్ స్క్రీన్లపై చిత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ ఆనందంగా గడుపుతూంటారు. అలాంటి అనుభూతిని కల్పించేందుకు ఆనం కళాకేంద్రంలో ఓపెన్ స్క్రీనింగ్ ఆడిటోరియం తీర్చిదిద్దుతున్నాం – కె.దినేష్ కుమార్, కమిషనర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ -
రాజమండ్రి రూరల్లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్తో టచ్లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
గోదావరి చెంతన తెలుగు పరవళ్లు
సాక్షి,రాజమహేంద్రవరం/రాజానగరం:: గోదావరి చెంతన.. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇక్కడి గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా, ఆదికవి నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించి వెయ్యేళ్లయిన సందర్భంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారక, నారాయణభట్టు వేదికలపై నిర్వహిస్తున్న ఉత్సవాలను గవర్నర్ విశ్వభూషణ్, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ.. సంస్కృతి, రచనలకు కేరాఫ్ అడ్రస్గా రాజమహేంద్రవరం విరాజిల్లుతోందన్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కావ్యాలు, పురాణేతిహాసాలను తెలుగు వాళ్లు అనువదించినట్టు ఎవరూ చేయలేదన్నారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనల్లోని పదాలు చూస్తే ముచ్చటేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్మాధవ్, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందెశ్రీ, జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు, ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్రెడ్డి పాల్గొన్నారు. పూర్ణకుంభ పురస్కారాలు తెలుగు జాతికి పూర్వీకులు అందించిన సేవలను గుర్తించి, వారి వారసులను సత్కరించడం అభినందనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తెలుగు మహాసభల్లో రాజరాజనరేంద్రుని వేదికపై శుక్రవారం సాయంత్రం జరిగిన పూర్ణకుంభ అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు. తెలుగు జాతికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, తిక్కన సోమయాజి, డొక్కా సీతమ్మ, పరవస్తు చిన్నయసూరి, గుర్రం జాషువా, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పెద్దింటి దీక్షిత్దాసు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు, సాలూరి రాజేశ్వరరావు, పీబీ శ్రీనివాస్, జంధ్యాల, జమునా రాయలు, బాపు తదితరుల వారసులను అతిథులు సత్కరించారు. విశ్వనాథ గోపాలకృష్ణ, బుచ్చివెంకటపాతిరాజు, జిత్మోహన్మిత్రా, ఎర్రాప్రగడ రామకృష్ణ, కూచిభోట్ల ఆనంద్, రసరాజు, బాదం బాలకృష్ణ, వంశీ రామరాజు, చెరుకువాడ రంగసాయి, తనికెళ్ల భరణి, గౌతమీ గ్రంథాలయం, నన్నయ భట్టారక పీఠం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ప్రతినిధులు కూడా పురస్కారాలు అందుకున్నారు. -
కాపుల మీద దాడులపై పవన్ నోరు విప్పాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి పెద్దమనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు. గురువారం ఆమె రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ మార్గాని భరత్రామ్తో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని చెప్పారు. మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. -
ఈనాడు ఫోటో గ్రాఫర్ అయితే ఏంటి? బాలయ్య చిందులు
రాజమహేంద్రవరం: నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై బాలయ్య చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో బాలకృష్ణ మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి **..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. బాలకృష్ణ పలు సందర్భాల్లో ఇలా ప్రవర్తించడం అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏం మాట్లాడాతాడో, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో బాలకృష్ణకే తెలియదు. గతంలో అభిమానులపై కూడా బాలకృష్ణ చిందులు తొక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆవేశంలో బూతులు మాట్లాడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా యెల్లో మీడియాలో భాగమైన ‘ఈనాడు’పైనే ఆగ్రహం వ్యక్తం చేశాడంటే ఆయన ఫస్ట్రేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన బావ చంద్రబాబు కేసులో ఇరుక్కుని రిమాండ్కు వెళ్లడం, ఆయన అల్లుడి ఢిల్లీలో మకాం వేయడంతో ఏం చేయాలో తోచక సహనం కోల్పోతున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే, అది ఆయన సహజశైలినో, నైజమో అర్థం కాక అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీకి ఎప్పుడూ డబ్బా కొట్టే ఈనాడుకు చెందిన ఫోటోగ్రాఫర్పైనే బాలయ్య అసహనం ప్రదర్శించాడంటే పార్టీని, చంద్రబాబును మరింత కష్టాల్లోకి నెట్టేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. మరి బాలకృష్ణ అంతేలే అని ఈనాడు అధినేత రామోజీరావు సరిపెట్టుకుంటారో లేదో చూడాలి. -
‘వారధి’క్యం
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో.. రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా: గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చెన్నై–హౌరా మధ్య రైల్వే లైన్ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ప్రకృద్ధీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది: నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాçహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. -
కొవ్వూరు–రాజమహేంద్రవరం రోడ్డు రైలు వంతెన
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో..రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా.. గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చైన్నె–హౌరా మధ్య రైల్వే లైన్ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది.. నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. శాశ్వత పనులకు ప్రతిపాదనలు రోడ్డు కం రైలు వంతెనపై శాశ్వత మరమ్మతులను ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రత్యేక పనుల కింద రూ.2.10 కోట్లతో అత్యవసరంగా చేపట్టేందుకు టెండర్లు పిలిచాం. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం. అత్యవసర నిధులతో వివిధ రకాల పనులు చేపట్టనున్నాం. శాశ్వత మరమ్మతులు చేపట్టడానికి రైల్వే శాఖను సమన్వయ పరుచుకోవాల్సి ఉంది. – ఎస్బీవీ రెడ్డి, ఈఈ, రోడ్డు కం రైలు వంతెన, రాజమహేంద్రవరం -
ఆఖరి ఉరికి 48 ఏళ్లు
రాష్ట్రంలో ఉరిశిక్ష అమలు చేసి అర్ధ శతాబ్దం సమీపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఔను నిజమే. వివిధ పరిస్థితుల నేపథ్యంలో శిక్షల అమలులో ఆలస్యం అనివార్యమవుతోంది. దేశంలో కేంద్ర కారాగారాలన్నింటిలోనూ ఈ శిక్ష పడిన ముద్దాయిలు వివిధ అప్పీళ్లతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఉరి తీసేందుకు వీలున్న ఏకైక సెంట్రల్ జైలు ఇక్కడే ఉంది. ఎక్కడ ఉరి శిక్ష పడినా ముద్దాయిని ఇక్కడి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. ఈ జైలులో ఇప్పటివరకూ 48 మందిని ఉరి తీసినట్లు సమాచారం. స్వాతంత్య్రం వచ్చాక 27 మందిని ఉరి తీశారు. ఆఖరిసారిగా 1976 ఫిబ్రవరి 22న అనంతపురానికి చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. అప్పటి నుంచి అంటే ఈ 47 ఏళ్ల కాలంలో ఉరి శిక్ష అమలు కాలేదు. 1997 మార్చిలో ఇద్దరిని ఉరి తీయాల్సి వచ్చినా అనూహ్య పరిణామాల మధ్య సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్ష అమలు కాలేదు. – డెస్క్, రాజమహేంద్రవరం 1602లో డచ్వారి హయాంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ హయాంలో 1864లో దీనిని జైలుగా మార్చారు. 1870లో దీనికి పూర్తి జైలు రూపం వచ్చింది. 1990లో దీనిని ఆధునీకరించారు. పాత కట్టడం ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపు ఉరి (హ్యాంగ్) సెల్ ఉండేది. తర్వాత కొత్తగా నిర్మించిన జైలు పరిపాలనా భవనం కింది భాగంలోకి దీనిని మార్చారు. దేశంలో భూగర్భ హ్యాంగ్ సెల్ ఇదొక్కటేనని చెబుతారు. తలారీ కోసం తలనొప్పులు ఉరిశిక్షను అమలు చేసే తలారీ (హ్యాంగ్మన్) పోస్టు అంటూ ప్రత్యేకంగా ఉండదు. శిక్ష అమలు చేసినప్పుడల్లా తలారీ ఎంపిక తలనొప్పిగానే పరిణమిస్తుంది. ఈ శిక్ష అమలు చేసేవారికి మనో నిబ్బరం ఉంటాలి. అనారోగ్యం లేదా గుండె సంబంధ సమస్యలు ఉండకూడదు. సాధారణంగా ఉరిశిక్షను అమలు చేసే వ్యక్తి కుటుంబం నుంచి వారసత్వంగా ఎవరో ఒకరు ముందుకు వస్తుంటారు. 1997లో ఇక్కడి జైలులో ఉరి శిక్ష అమలు కావాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కృష్ణా జిల్లా తిరువూరు సబ్జైలులో పని చేసిన ధర్మరాజు సంసిద్ధత తెలిపారు. అధికారులు ఆయనను రాజమహేంద్రవరానికి డిప్యుటేషనుపై తీసుకువచ్చారు. తీరా వచ్చాక ఆఖరి సమయంలో ఉరి అమలు కాలేదు. అచ్చం సినిమా తరహాలోనే.. 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతిరావు, విజయ వర్ధన్లకు 1995లో గుంటూరు సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. 1997 మార్చి 14న ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్ను అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ తిరస్కరించారు. దీంతో అదే నెల 29న వీరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. శిక్ష అమలుకు ముందు రోజు మార్చి 28న రాష్ట్రపతి శంకర్దయాళ్శర్మను జ్ఞాన్పీట్ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవితో పాటు మరికొందరు ప్రముఖులు కలిశారు. క్షమాభిక్ష వినతిని మరోసారి పరిశీలించాలని అభ్యర్థించారు. ఆయన పిటిషన్ను స్వీకరించారు. దీంతో వారు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఆ రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసు విచారించి రాష్ట్రపతి నిర్ణయం వెలువడేంత వరకూ శిక్ష అమలు చేయవద్దని ఆదేశించింది. అర్ధరాత్రి దాటాక నిర్ణయం రావడంతో సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్షను నిలిపివేశారు. తర్వాత రాష్ట్రపతి నారాయణన్ వీరి ఉరి శిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చాలని నిర్ణయించారు. ముద్దాయిల్లో విజయ వర్ధన్ ఇప్పటికీ 30 ఏళ్లుగా రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. చలపతిరావు మరో జైలులో ఉన్నారు. రోజూ ప్రాణ సంకటమే.. ఉరి శిక్ష అమలు చేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. కానీ శిక్ష అమలవుతుందో లేదో తెలియక ఏళ్ల తరబడి ఆశనిరాశల మధ్య నలిగిపోతున్నారు ఉరి శిక్ష ఖైదీలు. 2021లో ఉరి శిక్ష పడిన మున్నా గ్యాంగ్కు చెందిన కొందరు ఇక్కడి కేంద్ర కారాగారంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది ఉరి శిక్ష ఖైదీలున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. పై కోర్టులకు అప్పీలు వంటి వివిధ దశల్లో వీరి కేసులు కొనసాగుతున్నాయి. 1997లో తన ఉరి శిక్ష యావజ్జీవ ఖైదుగా మారిన నేపథ్యంలో 30 ఏళ్లకు పైబడి కారాగారంలో ఉంటున్నానని చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఖైదీ విజయ వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రత్యామ్నాయ విధానాలపై కమిటీ ఉరి శిక్షకు ఇకపై ఉరి పడుతుందా.. మరణ శిక్ష అమలులో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. సున్నితమైన ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. మరణ శిక్ష కింద ఉరి కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలని 2017లో న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాల ధర్మాసనం ఈ ఏడాది మార్చి చివరిలో విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి దీనిపై సమాధానం చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు. ఆ రాత్రి ఎప్పటికీ గుర్తే.. 1975లో జైళ్ల సర్వీసులో చేరాను. రాజమండ్రిలో ఇద్దరిని ఉరి తీయాలని తెలిసింది. తీస్తానని ముందుకు వచ్చాను. తిరువూరు నుంచి డిప్యుటేషనుపై రాజమండ్రికి బదిలీ చేశారు. తెల్లవారితే ఉరి అనగా ఆ రాత్రి జైలులోనే ఉన్నాను. నిద్ర పట్టలేదు. మనసంతా ఆలోచనలే. నా చేతుల మీదుగా ఇద్దరు ప్రాణాలు పోతాయనే ఆలోచన ఇబ్బంది పెట్టేది. కర్తవ్యం కదా అని సమాధానం చెప్పుకునేవాడిని. ఒంటిగంటన్నర తర్వాత కలత నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో సహచరులు వచ్చి లేపి శిక్ష అమలు కావడం లేదన్నారు. ఆ సమయంలో ముద్దాయిల కంటే ఎక్కువగా సంతోష పడ్డాను. 2007లో రిటైరయ్యాను. ఇప్పటికీ రామమండ్రి జైలులో ఉరి రాత్రి గుర్తుకొస్తూనే ఉంటుంది. – ధర్మరాజు, కాపవరం, కోరుకొండ మండలం ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు ప్రస్తుతం కేంద్ర కారాగారంలో మరణ శిక్ష పడిన ఖైదీలు 18 మంది వరకూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ శిక్ష పడినా అమలుకు ఇక్కడికే తీసుకువస్తారు. 47 ఏళ్లుగా శిక్ష అమలు చేయనప్పటికీ హ్యాంగ్ సెల్లో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపడుతుంటాం. ఉరికంబం గదిలో ఐరన్ లివర్, కింద నిలబడే ఐరన్ పలకలను జాగ్రత్తగా ఉండేలా చూస్తాం. ఆదేశాలొస్తే అమలుకు సిద్ధంగా ఉంటాం. – రాహుల్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం జాప్యం అనివార్యం శిక్ష పడిన తర్వాత ఖైదీలకు వివిధ పై కోర్టుల్లో అప్పీలుకు అవకాశం ఉంటుంది. తర్వాత హోం శాఖ ద్వారా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంటుంది. ఈ దశలు దాటడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి జీవితానికి సంబంధించిన అంశాలు పైకోర్టులు పరిశీలిస్తాయి. ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మరీ క్రూరం, అత్యంత అమానవీయ సంచలన కేసుల్లో మినహా మిగిలిన కేసులన్నింటికీ ప్రొసీజర్ వల్ల జాప్యం అనివార్యం. – ఎం.విశ్వేశ్వరరావు,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ -
రాజమహేంద్రవరం: గోదావరికి వరద (ఫొటోలు)
-
'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్లో కూడా హీరోనే!
బిచ్చగాడు సినిమాతో ఫేమస్ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తాజాగా సీక్వెల్ను తెరకెక్కించారు. తానే హీరోగా, దర్శకుడిగా రూపొందించిన బిచ్చగాడు-2 ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) తాజాగా ఈ సినిమా సక్సెస్ను విజయ్ ఆంటోనీ అందరికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో యాచకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తానే స్వయంగా వారికి వడ్డించారు. ఇదీ చూసిన ఆయన అభిమానులు హీరో చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. విజయ్ ఆంటోని భోజనం వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. (ఇది చదవండి: అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి) -
ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు: ఎంపీ భరత్
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ అయ్యారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తీసే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. వెన్నుపోటు పొడవటం ఎందుకు?.. శత జయంతి ఉత్సవాలు జరపడమెందుకు అని ప్రశ్నించారు. కాగా, ఎంపీ భరత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన నిర్వాకంతోనే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు. రాజమండ్రిని నాశనం చేశారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారు. దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు. ఎంతకు తెగిస్తే ఇవన్నీ చేస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘అచ్చెన్నాయుడు పైల్స్.. వాళ్ల మాయరోగాలు గుర్తున్నాయా?’ -
వైఎస్సార్ సీపీ నేత భవానీశంకర్ హత్య
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సంజీవ్నగర్లో పాతకక్షల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకుడు బూరాడ భవానీశంకర్(58) మంగళవారం హత్యకు గురయ్యారు. ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్ కథనం ప్రకారం.. సీటీఆర్ఐ పనసచెట్టు సమీపంలోని సంజీవ్నగర్కు చెందిన బూరాడ భవానీశంకర్, అతని భార్య కృష్ణమాధురి ఒక వేడుకకు హాజరై తిరిగి 3.30: గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. భవానీశంకర్ మేడపైన హాలులో కూర్చుని భోజనం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పీటా అజయ్ అక్కడకు వచ్చాడు. ఏదో మాట్లాడే పని ఉందని చెప్పాడు. సరే భోజనం చేసి కిందకు వస్తానని అతనితో చెప్పాడు. ఇంతలో భవానీశంకర్ భోజనం చేస్తుండగా అజయ్ పైకి వచ్చాడు. ఆ సమయంలో అజయ్ తన వెనుక దాచుకుని ఉన్న కత్తిని చూసి భవానీశంకర్ భార్య గట్టిగా కేకలు వేశారు. ఈ లోపు తనతో వెంట తెచ్చుకున్న కత్తిని తీసి కడుపులో మూడుసార్లు పొడిచి, పరారు అయ్యాడు. గాయాలపాలైన భవానీశంకర్ను వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందారు. విషయం తెలిసిన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. హత్య జరిగిన వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ హత్య పాత కక్షల నేపథ్యంలో జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు గురైన భవానీశంకర్ వైఎస్సార్ సీపీ 44 వార్డు ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించిన పోలీసులు హత్య చేసింది అజయ్గా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ భరత్రామ్ మృతుడి భార్య కృష్ణమాధురిని ఫోన్లో పరామర్శించారు. -
రాజమహేంద్రవరంలో మరో మార్గదర్శి
-
స్వచ్ఛ అఖండ గోదావరి
సాక్షి, అమరావతి: ఒకప్పుడు కాలుష్యకాసారమైన అఖండ గోదావరి నది ఇప్పుడు స్వచ్ఛమైన జలాలతో కళకళలాడుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గోదావరి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు గోదావరి నీటిని నేరుగా తాగవచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు అఖండ గోదావరి జలాలు స్వచ్ఛమైనవని సీపీసీబీ కూడా తేల్చింది. సీపీసీబీ గతేడాది నవంబర్లో గోదావరి జలాలపై అధ్యయనం చేసింది. జలాలు కాలుష్య రహితంగా మారినట్లు వెల్లడించింది. కాలుష్య కాసారాల జాబితా నుంచి అఖండ గోదావరిని తొలగించింది. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో సముద్రానికి 1,067 మీటర్ల ఎత్తున మొదలైన గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా 1,465 కి.మీ.ల దూరం ప్రవహించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇందులో తెలంగాణలో భద్రాచలం మండలం రాయనపేట నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం వరకూ ఉన్న గోదావరి నిత్యం ప్రవాహంతో నిండుగా కన్పించడం వల్ల అఖండ గోదావరి అని పిలుస్తారు. రాయనపేట నుంచి రాజమహేంద్రవరం వరకు నదీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మురుగు నీటిని, వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేసేవి. పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నదిలో కలిపేవారు. దాంతో గోదావరి జలాలు కలుషితమయ్యాయి. సీపీసీబీ 2018లో నిర్వహించిన అధ్యయనంలో అఖండ గోదావరి జలాల్లో పీహెచ్ 6.5 నుంచి 8.5, డీవో (డిజాల్వ్డ్ ఆక్సిజన్) లీటర్కు 5 మిల్లీ గ్రాములు, కోలీఫామ్ వంద మిల్లీలీటర్లకు 1742, నీటిలో కరిగిన ఘన పదార్థాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. దాంతో అఖండ గోదావరిని కాలుష్య కాసారాల జాబితాలో ఐదో విభాగంలో చేర్చింది. ఆ విభాగం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నేడు స్వచ్ఛతకు చిరునామా వైఎస్ జగన్ సీఎం అయ్యాక గోదావరి పరిరక్షణకు ప్రణాళిక రచించారు. నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు, రాజమహేంద్రవరంలో మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేశాకే నదిలో కలపాలని ఆదేశించారు. దాంతో నదీ తీర ప్రాంతాల్లో వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే కలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో రోజుకు 80.6 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసేలా రెండు చోట్ల భారీ ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు)లను నిర్మించారు. వాటి ద్వారా రాజమహేంద్రవరం నగరం మురుగునీటిని శుద్ధి చేశాకే నదిలోకి వదులుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలను కూడా ఎస్టీపీలలో శుద్ధి చేశాకే వదులుతున్నారు. దాంతో అఖండ గోదావరి జలాలు స్వచ్ఛంగా మారాయి. అఖండ గోదావరి పరిరక్షణకు సీఎం జగన్ తీసుకున్న చర్యలను పర్యావరణవేత్తలు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
బుడతడు.. గుండె ఆగినంత పనిచేశాడు..
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్కు బయట గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆడుకుంటూ బాల్కనీలోని గ్రిల్స్లో కాలు పెట్టగా అది ఇరుక్కుపోయి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాత్రూమ్లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం ప్రకాశ్నగర్లోని సాయిరాఘవ టవర్స్ మూడో అంతస్తులో ఎం.సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఆమెకు ఏడాదిన్నర బాబు (సాయిరామ్) ఉన్నాడు. మంగళవారం ఉదయం సాయిరామ్ను తీసుకుని తల్లి బాత్రూమ్కు వెళ్లింది. ఎప్పటిలా స్నానం చేయించి రూమ్ బయటకు వదిలింది. తర్వాత తానూ స్నానానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ బాలుడు బాత్రూమ్ డోర్ వద్ద ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలోని గ్రిల్లో కాలు పెట్టగా ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోయేసరికి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు బాత్రూమ్ నుంచి విన్న తల్లి బయటకు రాలేక, బాబుకు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది. కింది భాగంలో నివాసం ఉంటున్న వారు విని పైకి వచ్చారు. లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అపార్టుమెంటుకు చేరుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్లో ఇరుక్కున్న బాలుడి కాలు బయటకు తీశారు. తర్వాత లోనికి వెళ్లి బాత్రూమ్ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చింది. ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్కు ఫోన్చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్రామ్ను పలువురు అభినందించారు. -
రాజమండ్రి ఎంపీగా జమున రాజకీయ ప్రస్థానం
సీటీఆర్ఐ(రాజమ హేంద్రవరం)/అమలాపు రం టౌన్/సామర్లకోట/కొవ్వూరు: గోదారీ గట్టుంది.. గట్టుమీన సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది..ఈ పాట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది గలగల పారే గోదావరి మాత్రమే కాదు..అమాయకత్వాన్ని..అందాన్ని..అభినయాన్ని మూటగట్టుకున్న అలనాటి సినీనటి జమున..గోదావరిని..ఆ నదీమతల్లి పేరును తెరకు బలంగా పరిచయం చేసిన ఆమె మూగ మగమనసులు ఎప్పటికీ చిరస్మరణీయం ..రాజమహేంద్రవరానికి చెందిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తాను అమితంగా ప్రేమించే గోదావరిని 1964లో ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు. గోదారి గట్టుంది పాటకు తన అభినయంతో జమున ప్రాణం పోశారు. శుక్రవారం ఉదయం జమున కన్నుమూశారని తెలియగానే జిల్లా ప్రజానీకం కంటతడి పెట్టింది. ఈ అందాల తారతో తమ గోదారి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. చాలామంది ఈమెను గోదావరి జిల్లా వాసిగా భావిస్తారు. కర్నాటక హంపీలో పుట్టినా ఈమె మన జిల్లాతో మమతానురాగాలను పెనవేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు కూడా ఆమెను తమ ఆడపడుచుగా ఆదరించారు. గలగల పారుతున్న గోదారిలా.. 1953లో జమున పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేసినా అంత గుర్తింపు రాలేదు. 1964లో ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన మూగమనసులు చిత్రంలో ఈమె గౌరమ్మ పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా జమున ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. అదే సినీమా హిందీలో మిలన్గా రీమేక్ చేస్తే అందులో కూడా నటించి మెప్పించారు. ఉత్తమ సహాయనటిగా ఫిల్మిఫేర్ అవార్డు అందుకున్నారు. సఖినేటిపల్లి–నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి గట్ల పైన..పడవలపైన ఈమెతో తీసిన ‘గోదారి గట్టుంది.. పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘నా పాట నీ నోట పలకాలా చిలకా’ పాట కూడా గోదావరి అందాల బ్యాక్ డ్రాప్లోనే చిత్రీకరించారు. గోదావరికీ జమునకు విడదీయరాని బంధముందేమో. 1974లో చిత్రీకరించిన గౌరి సిమిమాలో ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటలో కృష్ణతో ఇక్కడి గోదావరి పాయల్లోనే నర్తించారు. 2014లో జరిగిన గోదావరి పుష్కరాలకు ఆమె పనిగట్టుకుని మరీ వచ్చారు.‘గోదారి గట్టుంది’ పాట తాను జీవించి ఉన్నంత కాలం గుర్తుంటుందని చెప్పడం విశేషం పెద్ద మనసున్న నటి 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనతో కనివీని ఎరుగని నష్టం వాటిల్లింది. ఆ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఎనీ్టఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రతారలతో కలిసి జమున జోలె పట్టి చందాలు వసూలు చేశారు. ఇక్కడి ప్రజలు తమ ఆడపడుచు వచ్చినట్లుగా భావించి స్పందించారు. వంద రూపాయలిస్తే షేక్హ్యాండ్ ఇస్తానని సరదాగా అనడంతో అభిమానులు ఎగబడి ఆమెకు కరచాలనం చేసి విరివిగా విరాళాలు అందజేశారు. రాజమండ్రి ఎంపీగా.. ఇందిరాగాంధీ మీద ఉన్న అభిమానంతో జమున రాజకీయాలలో అడుగుపెట్టారు. తనను సినీరంగంలో ఆదరించిన రాజమండ్రి నుంచి 1989లో పోటీ చేశారు. లోక్సభ సభ్యురాలిగా 1991 వరకూ కొనసాగారు. తెలుగు ఆర్టిస్ట్ ల అసోసియేషన్ను ప్రారంభించారు. రంగ స్థల వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తరుణంలో సామర్లకోట మండలం మాధవపట్నం శివారున ఉన్న తోలుబొమ్మ కళాకారుల జీవన పరిస్థితులు చూసి చలించిపోయారు. అప్పటి కలెక్టర్తో వారి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. గ్రామ సమీపంలో సుమారు 10 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి మూడేసి సెంట్లు వంతున 176 మంది కళాకారులకు ఇళ్ల స్థలాలుగా అందజేశారు. ఎంపీగా ఉన్నప్పుడు తమ వద్దకు వచ్చి యోగ క్షేమాలు అడిగే వారని ఈ కళాకారుల సంఘ నాయకులు తోట బాలకృష్ణ, తోట గణపతి, రాష్ట్ర బొందిలిల కార్పోరేషన్ డైరెక్టర్ తోట సత్తిబాబులు గుర్తు చేసుకున్నారు. అందుకే మాధవపట్నం శివారు ప్రాంతాన్ని జమునానగర్గా వ్యవహరిస్తున్నారు. ♦ఎంపీ హోదాలో జమున రాజమహేంద్రవరంలో 1991 ఏప్రిల్ 5న ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొవ్వూరు మండలం నందమూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన వైనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ♦ 1989లో కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రఫీయుల్లా బేగ్ తరఫున జమున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాపవరంలో రఫీ మోటారు బైకు ఎక్కి ఆమె ప్రధాన వీధుల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాజమహేంద్రి ఆడపడుచు జమున: ఎంపీ భరత్ రాజమహేంద్రవరం రూరల్: జమున మృతికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె నటన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమేనన్నారు. అగ్ర కథానాయకుల చెంత దీటుగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సత్యభామ పాత్రలో ఆమె జీవించారన్నారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారన్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంత ఆడపడుచుగా పేరొందారని నివాళులరి్పంచారు. జెట్ మిత్ర రండి... జమున రాజమహేంద్రవరం నగరానికి ఎప్పుడు వచ్చినా జెట్ మిత్ర రండి అని నన్ను పిలిచేవారు. మేడమే నా పేరు జిత్ మోహన్ మిత్ర అని చెబితే మీరు పిలవగానే జెట్ స్పీడ్తో వస్తారు కదా ..అందుకే జెట్ మిత్ర అని పిలుస్తున్నాను అనేవారు. అమె ఎంపీగా పోటీ చేసినప్పుడు అమె దగ్గర ఉండి తోడ్పాటు అందించాను. పెద్ద తార అయినప్పటికీ భేషజం చూపించేవారు కాదు. – శ్రీపాద జిత్మోహన్మిత్ర, సినీయర్ నటుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలి... 2016 శ్రీమహాలక్ష్మీ సమేత చినవేంకటేశ్వర స్వామి పీఠం బ్రహ్మోత్సవాలలో సర్వేజనా సుఖినోభవంతు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జమునకు కళాతపస్విని అనే బిరుదును ప్రదానం చేశాం. రాజమహేంద్రవరం ఆడపడుచుగా ఆమెను సత్కరించుకున్నాం. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామిజీ -
ఫోటో తీసుకుందామని వందే భారత్ ట్రైన్ ఎక్కాడు..డోర్లు లాక్ అవ్వడంతో..
రాజమహేంద్రవరం: ‘ఎరక్కపోయి ఇరుక్కున్నాడు’ అనే సామెత తాజా ఘటనకు అచ్చం సరిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కి ఇంకా రెండు రోజులు కాలేదు.. ఒక వ్యక్తి ఫోటో కోసం ట్రైన్ ఎక్కేశాడు. సెల్పీ తీసుకుందామని భావించి ట్రైన్ స్టేషన్లో ఆగిన వెంటనే అందులోకి అమాంతం దూకేశాడు. చకచకా సెల్పీలు తీసుసుకున్నాడు. కానీ ట్రైన్ డోర్లు ఆలోమేటిక్గా లాక్ అవుతాయనే విషయం గ్రహించలేకపోయాడు. అంతే డోర్లు లాక్తో ట్రైన్లో ఇరుక్కుపోయి ఫైన్ చెల్లించుకున్నాడు. అంతే కాదు.. మళ్లీ స్టాప్ వచ్చే వరకూ మనోడి దిగే పరిస్థితి లేకుండా పోయింది. వందే భారత్ ట్రైన్ రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో ఆగిన సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ట్రైన్ ఎక్కేశాడు. సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ లోపు డోర్లు లాక్ అయిపోయాయి. అంతే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటూ చూసినా చేసే పరిస్థితి ఏమీ లేకుండా పోయింది. ఈలోపు టీసీ వచ్చి టికెట్ అడిగేసరికి అసలు విషయం బయటపెట్టాడు. తాను ఫోటోలు కోసం ట్రైన్ ఎక్కానని, డోర్లు ఆటోమేటిక్గా లాక్ అవుతాయనే విషయం తెలియదన్నాడు. టీసీ కూడా తాను కూడా ఏమీ చేసే పరిస్థితి లేదని, వచ్చే స్టేషన్ వరకూ ఆగాల్సిందేనని చెప్పేశాడు. దాంతో పాటు జరిమానా కూడా విధించాడు టీసీ. ఇక చేసేది లేక ఫైన్ చెల్లించాడు మనోడు. రాజమండ్రిలో ట్రైన్ ఎక్కినవాడు చివరకు విజయవాడలో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఫోటో తీసుకుందామని వందే భారత్ ట్రైన్ ఎక్కాడు..డోర్లు లాక్ అవ్వడంతో..
-
400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయరహదారి
రాజమహేంద్రవరం– విజయనగరం వరకు మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 400 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ నిర్మాణానికి రూ.568 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. సాక్షి, అల్లూరి సీతారామరాజు(రంపచోడవరం): మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన రాజమహేంద్రవరం– విజయనగరం హైవే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 400 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.568 కోట్లు వెచ్చించింది. దశల వారీగా నేషనల్ హైవే ఆథారిటీ అధికారులు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే గోకవరం నుంచి ఐ.పోలవరం జంక్షన్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. నాలుగు మండలాల పరిధిలో.. రంపచోడవరం మండలం ఐ.పోలవరం నుంచి కాకరపాడు వరకు జాతీయ రహదారి 516 రోడ్డు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి నాలుగు మండలాలను కలుపుతూ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పది కిలోమీటర్లు మేర రోడ్డును విస్తరిస్తున్నాయి. ఈ నాలుగు మండలాల్లో హైవే రోడ్డు నిర్మాణానికి 725 ఎకరాలు అవసరం. 585 ఎకరాలు అప్పగింత ఇప్పటివరకు 585 ఎకరాల ప్రభుత్వ భూమిని రోడ్డు నిర్మాణ పనులకు ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించారు. మరో 140 ఎకరాలు ప్రైవేట్ భూమి ఉంది. ఈ భూమిని అప్పగించేందుకు అవార్డు ఎంక్వైయిరీ ప్రకటించిన తరువాత, భూ యాజమానులకు నష్టపరిహారం చెల్లించి భూమిని అప్పగిస్తారు. అయితే అప్పటి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారవర్గాలు తెలిపాయి. సుమారు 70 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో 120 చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మాణం చేపడతారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు.. హైవే రోడ్డు నిర్మాణం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నుంచి గోకవరం, పోక్సుపేట, ఐ. పోలవరం జంక్షన్, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కాకరపాడు జంక్షన్, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మినిస్ట్రీస్ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్టు అండ్ నేషనల్ హైవే ఆథారిటీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చురుగ్గా పనులు సుమారు 70 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాత రోడ్డును వెడల్పు చేసే పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పనులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ భూములను అప్పగించే ప్రక్రియ పూర్తయితే రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. – చక్రవర్తి, జేఈ, ఆర్అండ్బీ, కాకినాడ -
కన్సాస్ సెనేటర్గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్గా కొనసాగుతున్నారు. మేయర్గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
Goldsmiths: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు
(డెస్క్–రాజమహేంద్రవరం): ఆధునిక పరిస్థితుల ప్రభావితంతో కుల వృత్తులు కూలిపోతున్నాయి. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నాయి. మనుగడ కష్టమని భావించిన కొందరు బతుకుదారి మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ తాతల కాలం నుంచి వారసత్వంగా అబ్బిన వృత్తినే నమ్ముకుంటూ యాతనలు పడుతున్నారు. ఒకప్పుడు ‘బంగారు’బాబుల్లా బతికిన స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చాలామంది పల్లెటూళ్ల నుంచి పట్టణాల బాట పడుతున్నారు. బతుకు బండి పయనానికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఉనికిపాట్లు కార్పొరేట్ సంస్థల సవాళ్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పటికీ ఉనికి చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని నల్లమందుసందు, సీతమ్మసందు, చందాసత్రం, గుండువారి వీధి ప్రాంతాల్లో కొందరు స్వర్ణకారులు కొద్దోగొప్పో ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ వృత్తికి ఊపిరిలూదుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న పరిచయాలతో కొందరు ఇక్కడకు వచ్చి బంగారమిచ్చి వారితో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 2008 నాటికి వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది. తమ సంఘంలో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం గండేబత్తుల శ్యామ్ చెప్పారు. కార్పొరేట్ సెగ ఆభరణాల రంగంలో కార్పొరేట్లు అడుగు పెట్టడంతో స్వర్ణకారుల బతుకులు రంగు మారిపోయాయి. అప్పటి వరకూ ఉన్న ఉపాధి కాస్తా దూరం కావడం ప్రారంభమైంది. తొలినాళ్లలో జ్యూయలరీ షాపులొచ్చి వీరి మనుగడను కొంత దెబ్బ తీశాయి. పాతిక సంవత్సరాలుగా నగరాల్లో కార్పొరేట్ షాపులు పెరిగిపోయాయి. ఈ పదేళ్లలో ఓ మాదిరి పట్టణాలకూ ఈ షాపులు విస్తరించాయి. పగలూ రాత్రీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోయే అందాల షాపుల భవంతుల వైపే జనమూ అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వృత్తి నైపుణ్యమున్న స్వర్ణకారులకు ఆదరణ తగ్గింది. కార్పొరేట్ తాకిడికి తలవంచిన కొందరు బ్యాంకులు లేదా బంగారంపై వడ్డీ ఇచ్చే వ్యక్తుల వద్ద అప్రైజర్లుగా చేరిపోయారు. వయసు 50లు దాటిన మరికొందరు మరో పని నేర్చుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పాత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణకారులుగా పని చేస్తున్నవారెవరూ తమ పిల్లలను ఈ రంగం వైపు నడిపించడంలేదు. తన ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారని.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నల్లమందు సందులో పని చేస్తున్న స్వర్ణకార సంఘం సభ్యుడు పేరూరి సూర్యప్రకాష్ చెప్పారు. తమ తరం తర్వాత స్వర్ణకారులు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడదామన్నా పెట్టుబడి ఏదీ.. అన్ని వృత్తుల మాదిరిగానే ఆభరణాల తయారీలో కూడా ఆధునికత అడుగు పెట్టింది. ప్రతి చిన్న పనీ యంత్రాల సాయంతోనే చేయాల్సి వస్తోంది. కానీ వాటిని సమకూర్చోలేక స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి పరికరాలతో స్వర్ణకారులు నెట్టుకొస్తున్నారు. గతంలో ఎక్కువగా కుంపటి ఉపయోగించేవారు. నాటి స్వర్ణకారులెందరినో శ్వాసకోశ వ్యాధులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని స్వర్ణకారుడు ఈదరాడ శ్రీనివాస్ చెప్పారు. ఉదయం నుంచి చీకటి పడే వరకూ కూర్చుని పని చేయడం వల్ల శారీరక వ్యాయామం లేక అనారోగ్యం బారిన పడుతున్నామని మరో స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దోగొప్పో డబ్బులు వెచ్చించి, చిన్నపాటి యంత్రాలు కొందామన్నా ఎక్కువ మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక్కో యంత్రానికి కనీసం రూ.50 వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వ్యక్తిగత రుణాలకు బ్యాంకులు సహకరించడ లేదని స్వర్ణకారుడు వరప్రసాద్ చెప్పారు. దొంగ బంగారం కొన్నారంటూ గతంలో పోలీసుల నుంచి తమకు తరచూ వేధింపులు ఎదురయ్యేవని కొందరు స్వర్ణకారులు చెప్పారు. ఐదేళ్లుగా ఈ వేధింపులు తగ్గాయన్నారు. ఏమైనప్పటికీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక స్వర్ణకారుల బతుకులు కాంతిహీనమవుతున్నాయి. సామాజిక భవనమూ లేదు ఈ మధ్యనే రాజమహేంద్రవరం స్వర్ణ కారుల సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఈ నగరంలో మాకు ఒక సామాజిక భవనం కూడా లేదు. స్థలమివ్వగలిగితే భవనం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి సమకూర్చగలిగే ఆర్థిక స్తోమత మాలో ఎవ్వరికీ లేదు. ప్రజాప్రతినిధులు మా కష్టాలను గమనించి సామాజిక భవనం నిర్మించాలని కోరుతున్నాను. – గండేబత్తుల శ్యామ్, అధ్యక్షుడు, రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం రుణం అందించాలి స్వర్ణాభరణాల తయారీ యంత్రాలు చాలా ఖరీదైనవి. కొనుక్కుని బతుకుదామంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ముద్రా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. పూచీకత్తు లేనిదే ఇవ్వబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఎలా పోటీ పడగలం? ఎలా ముందుకు వెళ్లగలం? రుణ సదుపాయం కల్పిస్తే కొద్దోగొప్పో ఈ వృత్తి బతకడానికి అవకాశముంటుంది. – ఈదర వరప్రసాద్, నల్లమందు సందు, రాజమహేంద్రవరం ఈ స్పీడులో మాలాంటి వాళ్లకు కష్టమే.. ఎక్కడ పడితే అక్కడ జ్యూయలరీ షాపులు వచ్చేశాయి. పెద్ద పట్టణాల్లో కార్పొరేట్ సంస్థల షోరూములు వచ్చేశాయి. అక్కడ అడిగిన వెంటనే కావాల్సిన నగ దొరుకుతోంది. ప్రస్తుతం ప్రజలకు అడిగిన వెంటనే సరకు ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టే తత్వం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎంత బాగా చేసినా ఫలితం ఏముంది? కొద్ది మంది మాత్రం చిన్నచిన్న నగలు చేయించుకోవడానికి నమ్మ కంతో వస్తున్నారు. జగన్ ప్రభుత్వం పుణ్యమాని పెన్షన్ వస్తోంది. – నామగిరి బ్రహ్మానందం, ప్రత్తిపాడు -
పచ్చ పత్రికల దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: ‘దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి’ అన్నట్టుగా ఉంది పచ్చ నేతలు, ఎల్లో మీడియా తీరు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీకి చెందిన అర్జి పార్వతి (65) కుక్క కాటు ఇంజక్షన్ రెండో డోస్ వేయించుకునేందుకు మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తిరిగి ఇంటికి బయలు దేరుతుండగా రంగంపేట నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఏపీ29 జెడ్–355 నంబరు గల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడింది. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ డ్రైవర్ నూలు హరీష్ స్థానికుల సాయంతో తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అయితే వలంటీర్.. 70 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా సీఎం సభకు తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. సీఎం సభలో అపశ్రుతి.. అని పచ్చ మీడియా తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేశారు. ఇంతలో వైద్య సేవలతో తేరుకున్న పార్వతి.. జరిగిన విషయాన్ని ఔట్ పోస్టు పోలీసులకు వెల్లడించింది. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. టీడీపీ నేతలకు బుద్ధిరాదు: ఎంపీ భరత్ ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా, టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నట్టే సీఎం సభల్లో కూడా జరగాలనే దుర్బుద్ధిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. నగరంలో ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే దానిని సీఎం సభతో ముడిపెడుతున్నారంటే టీడీపీ చిల్లర, శవ రాజకీయం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. -
జన గోదారి!
రాజమహేంద్రవరం నుంచి సాక్షిప్రతినిధి: పెన్షన్ పెంపు వారోత్సవాల సభకు తరలివచ్చిన జనసందోహంతో గోదారమ్మ పులకించిపోయింది. రూ.2,500 నుంచి రూ.2,750కి పింఛన్ల పెంపు వారోత్సవాలలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటున్నారని తెలిసి వృద్ధులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రాజమహేంద్రవరం తరలివచ్చారు. సభాస్థలి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ముఖ్యమంత్రి జగన్ రాకకు అరగంట ముందుగానే కిక్కిరిసింది. పలువురు లోపల ఖాళీ లేకపోవడంతో రోడ్లపైనే నిలుచుని ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యాక తిరుగుముఖం పట్టడం కనిపించింది. నగర వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మున్సిపల్ స్టేడియంలోని హెలీపాడ్ దగ్గర నుంచి శ్యామలా సెంటర్, డీలక్స్ సెంటర్, సాయికృష్ణా ధియేటర్, రంభ ఊర్వశి మేనక థియేటర్, చర్చిగేట్, ఆర్యాపురం, నందంగనిరాజు జంక్షన్, వై జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు దారికిరువైపులా ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్టేడియం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకోవడానికి సీఎంకు అరగంటపైనే పట్టింది. ► సీఎం జగన్ తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడ నిరీక్షిస్తున్న పలువురి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. ఆధార్ నమోదు కేంద్రం స్టాల్ వద్ద వృద్ధురాలు జి.చెల్లాయమ్మను పలకరించగానే భావోద్వేగానికి గురై నిలబడేందుకు ప్రయత్నించింది. ఆమెను సీఎం వారిస్తూ మోకాళ్లపై కూర్చోవడంతో చల్లగా ఉండాలని, మళ్లీ నువ్వే సీఎంగా వస్తావయ్యా అంటూ దీవించింది. ► కల్లుగీత, నేత కార్మికులు, చర్మకారులు, డప్పు వాయిద్యకారులు, ట్రాన్స్జెండర్లు తదితర పెన్షన్దారులతో సీఎం మాట్లాడి సమస్యలను సావధానంగా ఆలకించారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ధవళేశ్వరానికి చెందిన కోరుమిల్లి మేఘన పరిస్థితిని తండ్రి రాజన్న ప్రసాద్ సీఎం దృష్టికి తేవడంతో సమస్య పరిష్కరించాలని తూర్పుగోదావరి కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. అనంతరం పెన్షన్దారులతో ముఖ్యమంత్రి గ్రూపు ఫొటో దిగారు. బస్సులో ఉన్నా, ప్రజల గురించే.. సభా ప్రాంగణానికి సీఎం జగన్ బస్సులో వెళుతుండగా ఆర్ట్స్ కాలేజీ వై.జంక్షన్ వద్ద ఓ మహిళ పాపను ఎత్తుకుని పరుగులు తీస్తుండటాన్ని అద్దంలో గమనించి వెంటనే వాహనాన్ని ఆపాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన చెట్టి సూర్యకుమారిని దగ్గరకు పిలిచి ఆమె కుమార్తె డయానా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. పుట్టిన ఏడో నెల నుంచే స్పైనల్ మస్కిలర్ ఎట్రోపి టైప్–2 వ్యాధితో నడవలేని స్థితిలో ఉందని బాధితురాలి తల్లి కన్నీటి పర్యంతం కావడంతో పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. ఉద్యోగం పోయింది.. ఆదుకోండి సారూ తన భార్య ప్రసన్న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, కుమార్తె కీర్తన బ్లెస్సీ తక్కువ బరువుతో పుట్టడంతో పాటు గుండెకు రంధ్రం పడిందని, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఆర్నెల్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారని రాజమహేంద్రవరం తుమ్మలావకు చెందిన సిరికొండ సురేష్ సీఎం జగన్ ఎదుట విలపించాడు. మంత్రులు, ఎంపీలు చెప్పినా ఏఈ, ఎంఈలు ఉద్యోగం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ రోదించాడు. తల్లీ బిడ్డలకు వైద్య సేవలందించడంతో పాటు సురేష్ ఉద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు సీఎం సూచించారు. సొరియాసిస్ బాధిత చిన్నారికి పెన్షన్, వైద్యం.. పుట్టుకతో సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న తన మూడేళ్ల కుమారుడి వైద్యం కోసం సాయం అందించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడవల్లికి చెందిన విజ్జిన అమ్మాజీ ముఖ్యమంత్రి ఎదుట మొర పెట్టుకుంది. హెలీపాడ్ వద్ద సీఎంను కలిసిన ఆమె కుమారుడు వికాస్ చికిత్స కోసం ప్రతి నెలా మందులు వాడాల్సి వస్తోందని, కొబ్బరి ఒలుపు కార్మికుడైన తన భర్త ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతోందని తెలిపింది. చిన్నారి వికాస్కు వైద్యసేవలు అందించడంతో పాటు నెలకు రూ.8 వేలు నుంచి రూ.10 వేలు పెన్షన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ను సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ సేవలు అందకపోతే తన కార్యదర్శికి తెలియచేయాలంటూ ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా కల్పించడంతో అమ్మాజీ కళ్లు చెమర్చాయి. కిడ్నీ బాధితుడైన లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన 16 ఏళ్ల సాయి గణేష్ తన తండ్రితో కలిసి సీఎం జగన్ వద్ద తన కష్టాలను మొర పెట్టుకున్నాడు. బాధితుడికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందేలా తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ఆదేశించారు. సీఎం జగన్ తన కుమారుడి సమస్యను సావధానంగా ఆలకించి వెంటనే స్పందించటాన్ని జీవితాంతం మరువలేమని సాయిగణేష్ తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనన్నా గత ప్రభుత్వ హయాంలో నా భర్త చనిపోతే ఎవరూ పట్టించుకోలేదన్నా. నాకు ఇద్దరు పిల్లలు. జన్మభూమి కమిటీల చుట్టూ పెన్షన్ కోసం రోజుల తరబడి తిరిగా. మీరు సీఎం అయ్యాక వలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. నెల తిరగకుండానే వితంతు పింఛన్ చేతిలో పెట్టారు. నా పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విద్యా దీవెన రూ.75 వేలు, వసతి దీవెన రూ.20 వేలు చొప్పున నాలుగేళ్లలో రూ.3,80,000 లబ్ధి పొందే అవకాశం మీ ద్వారా వచ్చింది. చిన్న కుమారుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున రెండేళ్ళకు రూ.30,000 అమ్మఒడి వచ్చింది. నా పిల్లలకు మేనమామ జగనన్న ఉన్నాడనే ధీమాతో చదివిస్తున్నా. నాకు ఇంటి పట్టా ఇచ్చారు. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. నా కుమారుడికి యాక్సిడెంట్ అయితే నాకంటే ముందే 108 వచ్చి ఆసుపత్రిలో చేర్చింది. ఆరోగ్యశ్రీ కార్డుతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించా. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని చెబుతా’ – కోటా సామ్రాజ్యం, వితంతు పెన్షనర్, రాజమహేంద్రవరం. -
మరో మాట నిలబెట్టుకున్నా
రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది కులాల యుద్ధం కాదు.. క్లాసుల మధ్య యుద్ధం. ఒకవైపు పేదవాడు మరోవైపు పెత్తందారీ వ్యవస్థ మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విషయాన్ని గుర్తించాలి. పొరబాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడనేది మరిచిపోవద్దు. కుట్రలు, కుతంత్రాలతో వస్తున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, గజదొంగల ముఠా విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి, దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 64,06,240 మంది లబ్థిదారులకు రూ.1,765.04 కోట్ల నమూనా చెక్ను ఎలుగొండ చెల్లాయమ్మకు అందచేశారు. గత సర్కారు అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తే ఇప్పుడు ఏకంగా 64.06 లక్షల మందికి పెన్షన్లు అందచేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు పింఛన్ల కోసం రూ.400 కోట్లిస్తే ఇప్పుడు నెలకు రూ.1,765 కోట్లకుపైగా వ్యయం చేస్తూ అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తున్నట్లు తెలిపారు. నాడు కత్తిరింపులే లక్ష్యమని, జన్మభూమి కమిటీలకు 3 నెలల పెన్షన్ లంచమిస్తేనేగానీ మంజూరు కాని దుస్థితి నెలకొందన్నారు. గత సర్కారు అరకొరగా రూ.వెయ్యి పెన్షన్ ఇస్తే ఇప్పుడు నెలకు రూ.2,750 చొప్పున ఇస్తూ మిగిలిపోయిన అర్హులను సైతం గుర్తించి ఏటా రెండుసార్లు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక్క పింఛన్ల కోసమే రూ.62,500 కోట్లు వెచ్చించామన్నారు. పింఛన్ల పెంపు వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు మిగిలిపోయిన అర్హులకు కూడా.. అర్హతే ప్రామాణికంగా పథకాలన్నింటినీ అమలు చేస్తున్నాం. ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడకుండా మనకు వ్యతిరేకంగా ఓటేసిన వారికి కూడా పథకాలన్నింటినీ అందిస్తున్నాం. వీటిని పారదర్శకంగా అర్హులకు చేర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 2.62 లక్షల మంది వలంటీర్లు, 1.30 లక్షల మంది ఉద్యోగులతో సచివాలయ వ్యవస్థను తెచ్చాం. అవ్వాతాతలకే కాకుండా పుట్టుకతో, పుట్టిన తర్వాత అంగవైకల్యానికి గురైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బాధితులు, డయాలసిస్ చేసుకుంటున్నవారు, తలసీమియా, సికిల్సెల్, ఎనీమియా, హీమోఫీలియా, ఎయిడ్స్, బోదకాలు, చివరకు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కాలేయం, గుండె మార్పిడి జరిగిన నిరుపేదలందరికీ ప్రభుత్వం తరపున పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ అవ్వాతాతలకు పెన్షన్ పెంచడంతో పాటు గత జూలై నుంచి నవంబరు వరకు అర్హులందరికీ కొత్త కార్డులిచ్చాం. బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ డిసెంబరులోనే ఇచ్చాం. మిగిలిపోయిన అర్హులకు జూలై, డిసెంబరులో ఏడాదికి 2 సార్లు మేలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొత్తగా 44,543 బియ్యం కార్డులు ఇవ్వడంతో ఏపీలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,45,88,539కు చేరింది. మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డులు 1,41,48,249కు చేరాయి. మరో 14,531 ఇళ్ల పట్టాలకు సంబంధించి మంజూరు పత్రాలను అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నారు. ఇలా 30,29,171 ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు అందించగలిగాం. థాంక్యూ జగనన్న అంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు అపకారికి సైతం మీ బిడ్డ ఉపకారం గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇప్పుడు పెన్షన్లకు ఎక్కడా కోటాలు, కత్తిరింపులు, వివక్ష, లంచాలు లేవు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకుని మోకరిల్లాల్సిన అవసరం లేదు. చివరకు మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే చాలు పెన్షన్ దగ్గర నుంచి ప్రతి పథకం ఇళ్ల దగ్గరకు వెళ్లి అందించే గొప్ప వ్యవçస్థ తెచ్చాం. ఇందుకు కారణం మీ బిడ్డ మనసున్న పాలన. చెడు చేసేవారికి సైతం మంచి చేసే గుణం మీ బిడ్డకు ఉంది కాబట్టే ఇంత మంచి పరిపాలన చేయగలుగుతున్నాం. షూటింగ్ కోసం గేట్లన్నీ మూసివేసి.. ఇదే చంద్రబాబు ఫోటో షూట్, డ్రోన్ షాట్ల కోసం ఇదే రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలకు వచ్చారు. మీ అందరికీ గుర్తుందా...? (ప్రజలంతా ఒక్కసారిగా పైకి లేచి గుర్తుందంటూ నినదించారు) ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగా చంపేశాడు. అన్ని గేట్లు మూయించి సినిమా డైరెక్టర్ను పక్కన పెట్టుకుని షూటింగ్ కోసం ఈ ఒక్కగేట్ తెరిచాడు. వేల సంఖ్యలో జనమంతా ఒక్క గేటు గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ డ్రోన్ షాట్ల కోసం నాడు 29 మంది చనిపోతే.. కుంభమేళాలో చనిపోలేదా? తొక్కిసలాటలు జరగలేదా? అని ఈ పెద్ద మనిషి వాదించాడు. మనుషులను చంపేసి మానవతావాదినంటాడు.. కందుకూరులో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించేందుకు విశాలమైన ప్రదేశంలో మీటింగ్ జరగనివ్వకుండా ముందుకు తీసుకెళ్లి సందులోకి ప్రజలను తరలించారు. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి తన వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లడం ద్వారా 8 మందిని చంపేసిన పరిస్థితి చూశాం. తన డ్రోన్ షాట్స్, ఫోటో షూట్ కోసం 8 మందిని చంపేశాడు. ఆ వెంటనే ఆ పెద్దమనిషి అక్కడే.. మౌనం పాటించాలంటాడు. పక్కనే ఉన్న ఆసుపత్రికి వెళ్లాలంటాడు. షూటింగ్ కోసం 5 నిమిషాల్లో ఆసుపత్రి నుంచి మళ్లీ తిరిగి వచ్చేశాడు. చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిణీ చేశానంటాడు. తానే మనుషులను చంపేస్తాడు.. చనిపోయిన వారిపట్ల తాను ఒక మహోన్నత, మానవతావాదిలా మళ్లీ డ్రామాలాడుతున్నాడు. ప్రతి అడుగులోనూ ‘బాబు’ మోసాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ మనిషి వంకర బుద్ధి ఎలా ఉంటుందో 2014 నుంచి 2019 వరకు మనమంతా చూశాం. ప్రతి అడుగులోనూ మోసమే. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలంటూ చివరకు నట్టేట ముంచాడు. రూ.14,204 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి అక్కచెల్లెమ్మలను రోడ్ల పాలు జేశాడు. రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారు. మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేశాడు. పేదల వ్యతిరేక శక్తులతో పోరాటం అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలు ఒక లెక్కా? ఇలాంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి చెప్పదు, టీవీ 5 చూపించదు. దత్తపుత్రుడు ప్రశ్నించడు. కారణం వీళ్లంతా ఓ గజదొంగల ముఠా. అప్పట్లో జరిగిన ఏకైక స్కీం.. దోచుకో, పంచుకో, తినుకో(డీపీటీ). అందుకే ఆ పెద్దమనిషిని అధికారంలోకి తెచ్చేందుకు వారంతా కష్టపడుతున్నారు. వీరంతా పేదవాడికి ఇంగ్లిషు మీడియం చదువులు వద్దంటున్నారు. పేదలకు ఇళ్లు కట్టించొద్దంటున్నారు. పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటున్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక శక్తులతో మీబిడ్డ పోరాటం చేస్తున్నాడు. ఈ పోరాటంలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయ మీ బిడ్డ పట్ల ఉండాలని కోరుతున్నా. మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లేకపోవచ్చు. దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటంటే... ఆ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు. ఆ పెద్దమనిషి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడిని నమ్ముకుంటే మీ బిడ్డ ఒక ఎస్సీ,ఎస్టీ బీసీ, మైనార్టీ, పేద వర్గాలను నమ్ముకున్నాడు. పెంచిన పింఛన్లకు సంబంధించిన చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన వేణు, దాడిశెట్టిరాజా, కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎంపీలు పెదిరెడ్డి మి«థున్రెడ్డి, మార్గాని భరత్రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, చింతా అనురాధ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. వేలల్లో టోకెన్లు.. అరకొరగా చీరలు ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతున్నా ఈనాడు రాయదు. ఆంధ్రజ్యోతి చూపించదు. టీవీ 5 అడగదు. దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు. పేదలను చంపేసి చివరికి టీడీపీ కోసం త్యాగం చేశారంటారు. చనిపోయిన వారిలో ఎస్సీలుంటే తన కోసం త్యాగం చేశారని దాన్ని కూడా వాడుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు. ఈ పెద్ద మనిషి రక్త దాహం తీరక మళ్లీ గుంటూరులో సభ పెట్టాడు. కొత్త ఏడాది రోజు మరో ముగ్గురిని ఫోటో షూట్లు డ్రోన్ షాట్ కోసం బలి తీసుకున్న పరిస్థితిని మనమంతా చూశాం. తన సభకు ప్రజలు రారనే భయంతో చీరల పంపిణీ పేరుతో మరో ముగ్గురుని బలిగొన్నాడు. వారం రోజులు ఇంటింటికీ తిరిగి టోకెన్లు ఇచ్చారు.బాబు వచ్చే వరకు, మీటింగ్ పూర్తయ్యే వరకు చీరలు పంపిణీ చేయలేదు. ముందే చీరలు పంపిణీ చేస్తే చంద్రబాబు రాకముందే మహిళలు వెళ్లిపోతారని పంచలేదు. తీరా చూస్తే ఇచ్చిన టోకెన్లు వేలల్లో ఉంటే పంపిణీ కోసం చీరలేమో అరకొరగా తెచ్చారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఆశ్చర్యమేమిటంటే చంద్రబాబు తానే బలి తీసుకుంటాడు.. మళ్లీ మొసలి కన్నీళ్లు కారుస్తాడు. పోలీసులది తప్పు అంటాడు. ఇంతకన్నా అన్యాయమైన మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? 39 లక్షల పెన్షన్లు ఎక్కడ?.. 64 లక్షల పింఛన్లు ఎక్కడ? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న పరిపాలనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్న్ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. బాబు పాలనలో పెన్షన్లు ఎలా కోత పెట్టాలా? అనే ఆలోచన చేశారు. నాడు ఎవరైనా చనిపోతేనే మరొకరికి పెన్షన్ మంజూరు చేసే దుస్థితి. పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లాల్సిందే. అరకొరగా ఇచ్చే పింఛన్లు సైతం మూడు నెలల సొమ్మును లంచంగా ఇస్తేనే మంజూరయ్యేవి కావు. గత సర్కారు దిగిపోయే 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 64.06 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తోంది. 39 లక్షలు ఎక్కడ? మన ప్రభుత్వం ఇస్తున్న 64 లక్షలు పెన్షన్లు ఎక్కడ? మీరే ఆలోచన చేయండి. నాడు రూ.వెయ్యి మాత్రమే ఇవ్వగా నేడు రూ.2,750 చొప్పున ఇస్తున్నాం. తేడా గమనించండి. గత సర్కారు హయాంలో పెన్షన్ల ఖర్చు నెలకు కేవలం రూ.400 కోట్లు కాగా ఈరోజు మన ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు రూ.1,765 కోట్లు వ్యయం చేస్తోంది. పెన్షన్లపై ఏడాదికి రూ.21,180 కోట్లు వ్యయం చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లలో కేవలం పెన్షన్ల కోసం రూ.62,500 కోట్లను అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, అభాగ్యుల కోసం ఖర్చు చేసింది. వెన్నుపోటు, ఫొటో షూట్, డ్రామాలే బాబు నైజం.. ఇంత మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్న రాజకీయాలను ఇవాళ చూస్తున్నాం. రాజకీయ వ్యవçస్థ్ధ ఎంత దిగజారిపోయిందో వివరించేందుకు చిన్న ఉదాహరణ చెబుతా.. కోర్టులో ఒకాయన జడ్జి ముందుకు వచ్చి.. ‘అయ్యా తల్లీతండ్రి లేనివాడిని! నన్ను శిక్షించకండి..’ అని ఏడ్చాడు.. ఆ ఏడుపు చూసి జడ్జి జాలిపడి చలించి ‘ఈ మనిషి చేసిన తప్పేమిటి?’ అని ప్రాసిక్యూటర్ను అడిగారు. ‘నిజమే.. ఈ మనిషికి తల్లీతండ్రి ఇద్దరూ లేరు.. కారణం ఆ తల్లితండ్రీ ఇద్దరినీ చంపేసింది ఈ వ్యక్తే..’ అని ప్రాసిక్యూటర్ చెప్పారు. చంద్రబాబుది కూడా ఇదే పద్ధతి. ఈ పెద్ద మనిషి.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుస్తాడు. తానే చంపేస్తాడు. సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు. ఎన్టీఆర్ పార్టీని, ట్రస్టుని, ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండ వేస్తాడు. తమ్ముళ్లూ...! ఎన్టీఆర్ అంత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారా? అని ఊరూరా అడుగుతాడు. పొడిచేది, చంపేది ఆయనే. మళ్లీ మొసలి కన్నీరు కార్చేది కూడా ఆయనే. ఎన్టీఆర్ అయినా, ప్రజలైనా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం.. వెన్నుపోటు పొడవడం. ఫోటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం. -
‘ఏడాది తిరిగినా రాని పెన్షన్.. నెల రోజులకే వచ్చింది’
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూ.2750కు పెంచి పంపిణీ చేస్తోంది. దీంతో గత మూడ్రోజులుగా కోలాహలంగా పెన్షన్ వారోత్సవాలు జరుగుతున్నాయి. పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వితంతు పింఛన్ అందుకుంటున్న రాజమండ్రిలోని మున్సిపల్ కాలనీకి చెందిన కోటా సామ్రాజ్యం అనే మహిళ మాట్లాడారు. తనకు ఈ ప్రభుత్వం నుంచి అందిన పథకాలను గుర్తు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది.’అంటూ తన కుటుంబం లబ్ధిపొందిన వివరాలను చెబుతూ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు సామ్రాజ్యం. వేదికపై మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్పై ఓ పాట పాడారు కోటా సామ్రాజ్యం. తన ఇంట్లో ఎప్పుడూ సీఎంను తలుచుకుంటూ ఓ పాట పాడుకుంటానని చెప్పారు. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే..నా అన్నలా ఉంటాడని అంటాను నేను.’అని పాట అందుకున్నారు. సీఎం జగన్ అంటే తమకు దేవుడని, జై జగనన్న, జైజై జగనన్న అంటూ ముగించారు. ఇదీ చదవండి: అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ -
ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..
(డెస్క్ – రాజమహేంద్రవరం): ఇది 85 ఏళ్లనాటి ముచ్చట.. అప్పటికి స్వాతంత్య్ర రావటానికి దశాబ్ద కాలం వ్యవధి ఉంది. దేశమంతా స్వేచ్ఛా కాంక్ష ప్రజ్వరిల్లుతోంది. పట్టణాలు, పల్లెలు మహాత్ముని పథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లిపాలెం అనే చిన్న గ్రామంలోని వీధుల్లో భోగిమంటల్లా నాలుగైదు చోట్ల నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అవేమిటని ఆరా తీస్తే.. తెల్లవారి మిల్లు దుస్తులను రాశులుగా పోసి మంట పెడుతున్నారు గ్రామస్తులు. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా రేగిన ఆ అగ్నిశిఖలు ఆ గ్రామంలోని 17 ఏళ్ల యువకుడిలో ఓ కొత్త ఆలోచన రేపాయి. ఖద్దరు వస్త్రధారణ, గ్రామ స్వరాజ్య సాధన, పల్లెసీమల్లో విద్యావ్యాప్తి, మద్యపానం, జూదాలకు దూరంగా ఉండటం.. ఇలా బాపూజీ బాటలో మన గ్రామంలోని యువత పయనిస్తే దేశానికి మేలు చేసినట్లే కదా అని భావించాడు. ఆ కుర్రాడు– మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆ వయసులోనే తన ఇంటిని కార్యక్షేత్రంగా మలచుకుని ఆంధ్రీ కుటీరం పేరుతో.. తన తండ్రి ఆశీస్సులతో ఒక సంస్థను ప్రారంభించాడు. యువతలో సాహిత్యాభిలాష ఆంధ్రీ కుటీరం సంస్థకు 1938 జనవరి 13న మధునాపంతుల శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ కోడిపందేలు, గుండాటల వంటి జూదాలతో కాలాన్ని వృథా చేస్తున్న యువకులను దగ్గరకు చేర్చుకున్నారు. మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం నేర్పి, భాషా ప్రవీణులను చేసి, ఉపాధ్యాయ వృత్తికి దారి చూపారు. అనంతరం కాలంలో మహాకవిగా, కళాప్రపూర్ణునిగా, ఆంధ్రపురాణకర్తగా మధునాపంతుల సువిఖ్యాతులయ్యారు. అన్ని కులాల వారికీ ఉచితంగా విద్య నేర్పుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రామసీమల్లో విద్యావ్యాప్తికి ‘నేను సైతం’ అంటూ ఆయన తలపెట్టిన ఈ యజ్ఞం ఇలా సాగుతుండగా.. తోరణం పేరుతో తన తొలి ఖండకావ్య సంపుటిని కవిసమ్రాట్ విశ్వనాథవారి పీఠికతో వెలువరించారు. పల్లెసీమల్లో భాషా వ్యాప్తికి ఆంధ్రీ కుటీరం వంటి సంస్థలు అవసరమని విశ్వనాథ ఆకాంక్షించారు. ఆనాడే అక్షరాంకురార్పణ అదే ఏడాది మధునాపంతులకు ఓ ఆలోచన కలిగింది. తెలుగు భాషా సేవకు పత్రికా నిర్వహణ తోడ్పాటు అవుతుందని భావించారు. వెంటనే తండ్రికి, కవితా గురువు శతావధాని ఓలేటి వెంకట రామశాస్త్రికి ఆ విషయం విన్నవించారు. పిఠాపుర సంస్థాన ఆస్థాన కవులైన ఓలేటి వారు అక్కడి సొంత ప్రెస్సు విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో పత్రిక అచ్చు వేయించుకునేందుకు అనుమతించారు. ఆంధ్రికి కాకినాడ కలెక్టర్ 1939 మార్చి 15న డిక్లరేషన్ ఇచ్చారు. పల్లిపాలెమే కార్యస్థానంగా మలచుకుని 1939 మార్చి నుంచి ఆంధ్రి సాహిత్య మాసపత్రిక ఆరంభమైంది. ఆంధ్ర శబ్దానికి ఆంధ్రి స్త్రీ వాచకమే కాకుండా ఆ పేరుతో ఒక రాగం కూడా ఉంది. ‘ప్రమాది ఉగాది నాడు 1939 మార్చి 22న వేదుల రామమూర్తి అధ్యక్షతన ఆంధ్రి ప్రారంభోత్సవం జరిగింది. ‘గొప్పగా ఉన్నది. నగర సంకీర్తన చేసితిమి ఆనాడు నాకు గల ఉత్సాహము అతివేలము’ అని ‘జ్ఞప్తి’ అనే డైరీలో మధునాపంతుల రాసుకున్నారు. ఎందరో మహానుభావుల ప్రశంస నేటి కథ.. ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్నా.. ఏమి వెర్రి నీది ఓయన్నా.. అని మధునాపంతులను డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. ఆంధ్రపురాణం, ఆంధ్ర రచయితలు, ఆంధ్రి.. ఇలా తన అణువణువులోనూ ఆంధ్రత్వం పుణికి పుచ్చుకున్న కవి ఆయన. ఆయన నెలకొల్పిన ఆంధ్రీ కుటీరాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా అవిచ్ఛిన్నంగా నడుపుతుండటం విశేషం. ఈ సంస్థ వచ్చే నెలలో 85వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్నది. వాడ్రేవు చిన వీరభద్రుడన్నట్లు ‘ఈ ఊరి అరుగులు ఎన్నో దశాబ్దాలుగా సారస్వత సత్రయాగానికి నోచుకున్నాయి’. నేటికీ ఈ ప్రాంతానికి వచ్చిన సారస్వత ప్రియులైన ప్రముఖులంతా పల్లిపాలెం సందర్శించటం సాధారణం. శాస్త్రి శత జయంత్యుత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ 2020లో ఇక్కడే నిర్వహించింది. ఆంధ్ర పురాణ సవ్యాఖ్యాన బృహత్ గ్రంథాన్ని ప్రచురించిన అజోవిభో అధినేత అప్పాజోస్యుల సత్యనారాయణ.. ఆ గ్రంథాన్ని మధునాపంతుల రచించించిన మామిడి వృక్షం కిందనే ఆవిష్కరించారు. ఆంధ్రి విశిష్టతలు ► పిఠాపురం మహారాజా, జయపురం సంస్థానాధీశులు విక్రమదేవవర్మ, సర్ సీఆర్ రెడ్డి వంటి ప్రముఖుల ఆశీస్సులతో మొదలైన ఆంధ్రి పత్రికలో చెళ్లపిళ్ల, జాషువా, విశ్వనాథ, వేలూరి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కరుణశ్రీ, దేవులపల్లి, గడియారం వంటి వారెందరో తమ కవితలు, అమూల్య వ్యాసాలు రాసేవారు. రచయితలు, కవులు ఎంత ప్రసిద్ధులైనా వారి రచనల కింద సంపాద కుడు నిక్కచ్చిగా, నిర్భీతిగా రాసే వ్యాఖ్యలు ఆ రోజుల్లో సంచలనం కలిగించేవి. ► ఉత్తమ సాహిత్య విలువలతో సాగిన ఆ పత్రిక మూడేళ్ల పాటు 36 సంచికలు వెలువడి అనివార్య పరిస్థితుల్లో ముూతపడింది. ► పోస్టల్, కరెంటు సౌకర్యాలు లేవు. కనీసం సరైన రహదారి కూడా లేని ఓ చిన్న గ్రామం నుంచి ఉత్తమ విలువలతో వెలువడిన ఆ పత్రికపై పరిశోధనలు జరిగాయి. ► అజోవిభో సంస్థ ఆంధ్రిలోని ముఖ్యమైన వ్యాసాలన్నిటినీ సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించే ప్రయత్నిస్తోంది. ► ప్రెస్ అకాడమీ ఆర్కివ్స్ వెబ్సైట్లో ఆంధ్రి సంచికలన్నీ అందుబాటులో ఉంచారు. సాహిత్యాభిమానుల సహకారం మరువలేనిది ఎప్పుడో మధునాపంతుల నాటిన బీజం నేటికీ పచ్చగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నాం. సాహితీవేత్తలు, మిత్రుల సహకారం మరువలేనిది. ఇన్నేళ్లు సజీవంగా ఉన్న సంస్థలు అరుదనే చెప్పాలి. సంప్రదాయ భూమిక, ఆధునిక ఆలోచనా స్రవంతుల స్వీకరణే లక్ష్యంగా అక్షర సేవ చేసి ఆంధ్రిని ఆరాధించుకోవాలన్నదే సంకల్పం. భవిష్యత్తులో కూడా అందరి సహకారాన్నీ కోరుకుంటున్నాం. – మధునాపంతుల సత్యనారాయణమూర్తి, సంచాలకుడు, ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం -
జనవరి 3న రాజమహేంద్రవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో జనవరి 3న జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. ఆ ప్రకారం.. సీఎం జగన్ జనవరి 3వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్షో ద్వారా ప్రభుత్వ ఆర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికకు వస్తారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వైఎస్సార్ భరోసా పింఛన్ను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశం ఇస్తారు. నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అధికారులందరూ సమన్వయంలో పనిచేసి సీఎం జగన్ రాజమహేంద్రవరం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, సీఎం పర్యటించే దారి పొడవునా, సభావేదిక వద్ద బారికేడ్లు తదితర ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. చదవండి: (జనసేన నాయకుడి వేధింపుల పర్వం.. ప్రేమిస్తున్నానంటూ హల్చల్) -
రాష్ట్రపతి ముర్ముకు రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం
మధురపూడి(రాజమహేంద్రవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఉదయం 9.40 నిమిషాలకు ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తూ ఎయిర్పోర్టుకు వచ్చారు. కొద్ది నిమిషాలు ఉండి తర్వాత హెలికాప్టర్లో భద్రాచలానికి బయలుదేరారు. అంతకు ముందు రాష్ట్రపతికి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఇన్చార్జి ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్, ఫైర్ శాఖ డీజీ ఎన్.సంజయ్, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎయిర్పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు, విజయనగరం బెటాలియన్ కమాండెంట్ విక్రమ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నారు. భద్రాద్రి ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/వరంగల్: రాష్ట్రపతి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీకి చేరుకున్న ముర్ము.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి భద్రాద్రి రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రశాద్) పథకం ద్వారా రూ.41 కోట్లతో చేపట్టబోతున్న పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఆదివాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి వర్చువల్ పద్ధతిలో ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లా నామాలపాడులో కొత్తగా నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఊరంతా కళాకారులే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ శ్రీరంగపట్నం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, బాలనాగమ్మ, చింతామణి.. నాటకం ఏదైనా వారి నటనాచాతుర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాళికా మాత, దుర్గమ్మ, శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకన్నబాబు, రాక్షసుడు, అఘోరాలు.. ఇలా వేషమేదైనా పరకాయ ప్రవేశం చేయడమే వారి ప్రత్యేకత. తాతల కాలం నుంచి సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుని మరీ వారు రంగస్థలంపై, జాతర్లలో సత్తా చాటుతున్నారు. నటనపై మక్కువతోనే జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణకు వ్యవసాయం చేసినా ప్రదర్శనలను మాత్రం విస్మరించరు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం పౌరాణిక నాటకాలకు కేరాఫ్ అడ్రస్గా విరాజిల్లుతోంది. ఊరంతా కళాకారులే తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం ఖ్యాతి గడించింది. కేవలం నగరం ఒక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కళాకారులు వేల సంఖ్యలో ఉన్నారు. శ్రీరంగపట్నంలో అయితే ఊరంతా కళాకారులే దర్శనమిస్తారు. మేజర్ పంచాయతీ అయిన ఈ గ్రామ జనాభా 12,500. కుటుంబాలు 3,165 ఉన్నాయి. వీరిలో 400 మంది పౌరాణిక నాటకాలు వేసే కళాకారుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారంటే నాటకాలపై వారికున్న మక్కువ ఏమిటో అర్థమవుతోంది. వ్యవసాయ పనులతో జీవనం సాగించే కళామతల్లి ముద్దుబిడ్డలు వివిధ పండగలు, జాతర సమయాల్లో కళాకారులుగా రూపుదాలుస్తారు. ప్రజలను అలరించే ప్రదర్శనలు ఇస్తారు. వీరి నట విశ్వరూపానికి దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. శ్రీరంగపట్నం కళాకారులంటే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రజలు అమితంగా ఇష్టపడుతూంటారు. రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ వేలాది ప్రదర్శనలు వారి సొంతం. ఫలితంగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, గ్రామ దేవతల జాతరల సమయంలో కళా ప్రదర్శనలతో సందడి వాతావరణం తీసుకువస్తారు. వివిధ వేషధారణలతో అలరిస్తారు. రూ.500తో మొదలై.. 1988లో ఒక్కో బృందంలో సభ్యుడికి కళాప్రదర్శనకు రూ.500 అందేది. ఇవి ఖర్చులకు కూడా సరిపోకపోయినా కళామతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఉన్న బృందంలో ఒక్కో కళా ప్రదర్శనకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. ఏ పాత్ర కావాలన్నా.. గ్రామంలో 20 నాటక బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 20 మంది చొప్పున 400 మంది కళాకారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరాణిక కళాబృందాలున్నా.. పాత్రకు అనువైన కళాశారులు దొరకడం కష్టం. కానీ శ్రీరంగపట్నం మాత్రం అందుకు భిన్నం. ఏ పాత్రయినా.. ఏ నాటకమైనా అందుకు తగిన కళాకారులను సమకూర్చడం ఈ ఊరి ప్రత్యేకత. పౌరాణిక పాత్రల్లో అత్యంత ప్రాధాన్యమైన అన్నమయ్య, రాముడు, లక్ష్మణుడు వంటి విభిన్న పాత్రల్లో నటించే వారు కేవలం ఇక్కడే ఉండటం విశేషం. వీటితో పాటు కాళికాదేవి, నెమలి కోబ్రా డ్యాన్స్, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, తాండ్ర పాపారాయుడు వంటి వేషధారణలకు కేరాఫ్గా ఈ గ్రామం ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ లేని కళాకారులు లేరంటే అతిశయోక్తి కాదు. నాటక ఘట్టం సందర్భంగా వీరు వేసే పాత్రలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను కట్టి పడేస్తుంటాయి. తమ తాతలను, తండ్రులను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం వారి సంతానం నాటక రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రదర్శనలపై ఉన్న మక్కువతో ఈ రంగంలోనే స్థిరపడిపోతూ కళకు జీవం పోస్తున్నారు. 34 ఏళ్లుగా.. 1988 నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా. నాటక రంగంపై ఉన్న ప్రేమతో నేటికీ కళామతల్లి బిడ్డగా కొనసాగుతున్నా. రామాంజనేయ యుద్ధంలో నా నటనకు ప్రశంసా పత్రాలు, అవార్డులు దక్కాయి. నాడు ఒక్కో ప్రదర్శనకు రూ.500 గౌరవ వేతనం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.2 వేలు పైగా అందుతోంది. డ బ్బులు ఎంత వచ్చాయన్నది కాకుండా.. కళను బతికించాలన్న తాపత్రయంతోనే కొనసాగుతున్నాం. – బాసెట్టి జగ్గారావు, కళాకారుడు రాక్షసుడే వచ్చినట్టు.. బాలగౌరి కళాకారుల సంఘ సభ్యుడైన తనకాల నాని మిమిక్రీ ఆర్టిస్ట్. నాటక రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. నల్లకాళికాదేవి, వేపాలమ్మ పాత్రలకు జీవం పోస్తున్నాడు. తన నటనకు గుర్తింపుగా ఇటీవల పుష్ప–2 సినిమాలో అవకాశం దక్కింది. ఆవేశం.. ఈ వేషం.. నాన్న కీబోర్డ్ ప్లేయర్. బాబాయ్ సింగర్. వారిని స్ఫూర్తిగా తీసుకున్న కళాకారులు సతీష్ లేడీ ఓరియంటెడ్ గెటప్లో అలాగే ఒదిగిపోతాడు. బుల్లితెరపై స్టాండప్ కామెడీ రోల్ చేస్తున్నా.. నాటక ప్రదర్శన ఉందంటే చాలు వాలిపోతాడు. వేషమేదైనా.. కళాత్మకమే.. అఘోరా నృత్యం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ పాత్రకు జీవం పోస్తాడు ఎం.సంపత్. అతను నాట్యం చేస్తూంటే అఘోరాలే ఔరా! అంటూ ఆశ్చర్య పోవాల్సిందే. పార్వతీ దేవి పాత్రకు సైతం న్యాయం చేస్తాడు. అబ్బాయే.. అమ్మాయిలా.. మరో కళాకారుడు రాంబాబు అమ్మవారు, లేడీ గెటప్, రుక్మిణీదేవి వేషధారణల్లో అలరిస్తుంటారు. ఇలా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో పాత్రకు న్యాయం చేయడంతో కీలక భూమిక పోషిస్తారు. (క్లిక్ చేయండి: ఒకప్పుడు తిరుగులేని ఆదరణ.. ఇప్పుడు కనుమరుగు) -
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
చారిత్రక నగరంలో ఫుడ్ నైట్
రాజమహేంద్రవరం సిటీ: ఆహార ప్రియులకు శుభవార్త.. రాత్రివేళ టిఫిన్ లేదా మరే ఇతర ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఎక్కడ దొరుకుతాయనే దిగులు చెందనక్కర లేదు. ఒకచోటే ఫుడ్ ఐటమ్స్ కొలువుతీరి స్వాగతం పలకనున్నాయి. చీకటి పడిందని చింతపడనక్కర్లేదు. అర్ధరాత్రి సమీపిస్తున్నా ఆదరాబాదరా పడనక్కరలేదు. హ్యాపీగా తినివెళ్లొచ్చు.. రాజమహేంద్రవరంలోనే ఈ అవకాశమండోయ్.. ఈ వివరాలేంటో తెలుసుకుందాం..! నగరంలో వినూత్నరీతిలో అర్బన్ ఫుడ్ ప్లాజా ఏర్పాటు కానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రమయ్యాక చాలా మంది నగరానికి చేరుకునే ఇతర ప్రాంతాల వారు గాని ఇక్కడి ప్రజలు గాని రోడ్ల మీద ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా? అని వెతకటం సహజం. దీనిని దృష్టిలో పెట్టుకుని నగరపాలకసంస్థ రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ వివిధ రకాల ఫలహారాలు ఒకేచోట అందించాలని సంకల్పించింది. బిర్యాని, చైనీస్ ఫుడ్, తందూరీ, వెజిటేరియన్ ఫుడ్స్, పండ్ల రసాలు, ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్స్ ఇలా 10 రకాల ఆహారాలను ఒకే వేదికపైకి అందుబాటులోకి తేనుంది. ఇందు కోసం 33 స్టాల్స్ను సిద్ధం చేస్తోంది. విజయవాడ తరువాత మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఇలాంటి సదుపాయం కల్పించనుంది. స్టాల్స్ ఏర్పాటుకు రూ.1 కోటి వెచ్చించనుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రెండో గేట్ అర్బన్ స్క్వేరు సెంటర్ను ఆనుకుని అర్బన్ ఫుడ్ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మీటర్లు పొడవున్న ఈ రోడ్ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఫుడ్ ప్లాజా ప్రాంతాన్ని అలంకరించనున్నారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డులో సన్నాహాలు ఈ స్టాల్స్లో నిబంధనలకు అనుగుణంగా.. నాణ్యతను పాటించేలా ఉత్సాహవంతులైన వ్యాపారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. ఎన్నింటికి తెరవాలి.. ఎన్నింటికి క్లోజ్ చేయాలి.. ఎలాంటి నాణ్యత కల్పించాలి?, సందర్శకులతో వ్యవహరించే తీరు.. ఫుడ్ ఐటమ్స్ లాంటి విషయాలపై 521 మంది దరఖాస్తుదారులతో ఇప్పటికే కమిషనర్ దినేష్కుమార్ మాట్లాడారు. మొదటి దశలో కంబాల చెరువు రోడ్డు పక్కన, కోటి లింగాల ఘాట్ వద్ద ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. అర్బన్æ ఫుడ్ ప్లాజాను ఈట్ స్ట్రీట్ పేరుతో షాడే బాలికల స్కూల్ రోడ్లో ప్రతిపాదించి సిద్ధం చేశారు. ఆ రోడ్డు సక్రమంగా లేదని చివరికి ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో పదిరోజులే సమయం ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో రాత్రి సమయాల్లో ప్రధాన సెంటర్లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పుడ్ప్లాజాతో ఈ ఇబ్బందులు చక్కబడే అవకాశాలున్నాయి. అర్బన్ ఫుడ్ ప్లాజా కచ్చితంగా ప్రజలకు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పంచుతుందని కమిషనరు దినేష్కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలను నియంత్రించనున్నారు. ఆహార ప్రియులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని హాయిగా వెళ్లగలగాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. డిసెంబరు 1న ప్రారంభం రాజమహేంద్రవరంలో ఫుడ్ ప్లాజా ఏర్పాటుతో ఆహార ప్రియుల కోసం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. విజయవాడ తరువాత ఈ నగరంలోనే ఏర్పాటు చేస్తున్నాం. 10 కేటగిరీల్లో 33 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.25 వేలు ముందుగా డిపాజిట్ చెల్లించాలి. నెలకు రూ.10 వేలు అద్దెగా నిర్ణయించాం. ఈ నెల 21 వరకూ డిపాజిట్ చెల్లించేందుకు సమయం ఇచ్చాం. అందరి సమక్షంలో డ్రా తీసి దరఖాస్తుదారులకు షాపుల స్థలం కేటాయిస్తాం. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ కోరుకున్న ఆహారం ఒకే వేదిక వద్ద లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – దినేష్కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం -
ఒకే మహిళతో ఇద్దరు ఎఫైర్.. చివరికి దారుణంగా..!
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని సింహాచల్ నగర్లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన లక్కాకు ఏడుకొండలు (40) హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపారానికి సంబంధించి కొన్ని సరకులు తీసుకురావాలని భార్య విజయలక్ష్మికి చెప్పిన ఏడుకొండలు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం వచ్చాడు. కొద్ది గంటల తర్వాత అతడికి భార్య ఫోన్ చేసింది. పని ఇంకా పూర్తి కాలేదని చెప్పి అతడు ఫోన్ పెట్టేశాడు. 10 గంటల తర్వాత అతడి ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఇదిలా ఉండగా సింహాచల్ నగర్ నుంచి క్వారీకి వెళ్లే రోడ్డుపై ఒక వ్యక్తి హత్యకు గురయ్యారంటూ ఆదివారం అర్ధరాత్రి దాటాక త్రీటౌన్ సీఐ మధుబాబుకు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. ఆ మృతదేహం ఏడుకొండలుదేనని గుర్తించారు. తెల్లవారుజామున అతడి భార్య విజయలక్ష్మికి సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల, వీపుపై గాయాలుండటంతో ఏడుకొండలును ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు 24 గంటలు గడవక ముందే పట్టుకున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఓ మహిళతో ఏడుకొండలు, మరో వ్యక్తి వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు. వీరిద్దరికీ తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఏడుకొండలు భార్య ఇచ్చిన సమాచారం మేరకు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మహిళను, ఆమె భర్తను, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. చదవండి: (Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు) -
రామోజీరావు స్టేలపై పుస్తకం రాస్తా: ఉండవల్లి
సాక్షి, రాజమహేంద్రవరం: ఈనాడు రామోజీరావుపై ఎలాంటి కేసులు పెట్టినా కోర్టు నుంచి స్టే తెచ్చుకోగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆరోపించారు. రామోజీరావు కోర్టుల నుంచి తెచ్చుకున్న స్టేలపై తాను ఒక పుస్తకమే రాస్తానని, లా విద్యార్థులకైనా ఉపయోగపడుతుందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై తాను కేసు వేసి 16 ఏళ్లయిందని, అది ఎప్పు డు తేలుతుందో, అప్పటివరకు తాను ఉంటానో లేదోనని వ్యాఖ్యానించారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమన్నారు. మార్గదర్శి అకౌంట్ బుక్స్ ఎవరూ చెక్ చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారన్నారు. రామోజీకి, మార్గదర్శికి సంబంధం లేదని కోర్టులో చెప్పినప్పటికీ అన్ని సంస్థలకూ చైర్మన్ రామోజీ అనే సంతకం ఉందన్నారు. చిట్ఫండ్ కంపెనీ డబ్బును ఇతర వ్యాపారాలకు వాడకూడదన్న నిబంధనలనూ పట్టించుకోలేదని అన్నారు. మార్గదర్శి రూ.1,300 కోట్లు నష్టాల్లో ఉందని రంగాచారి కమిషన్ చెప్పిందన్నారు. 12 చానళ్లు అమ్మి నష్టాలు పూడ్చానని ఆయన అంటున్నారని, అది నిజమని తాము నమ్మడంలేదని చెప్పారు. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశానంటున్న రామోజీ ఎవరికి ఇచ్చారనేది ప్రశ్నార్థకమన్నారు. ఆయన కోర్టుకు తప్పుడు పేర్లు సమర్పించారని, అందులో ఎల్కే అద్వానీ, ఉపేంద్ర అనే పేర్లు కూడా ఉన్నట్లు తాను చూశానన్నారు. మార్గదర్శికి డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై ఈడీ విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి లేఖ రాశానన్నారు. అయితే, 12 చానళ్ల విక్రయ లావాదేవీలపై సెబీ విచారణ జరపాలని, రామోజీ ఫిలిం సిటీ వయోలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్పై స్పందించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమని ఆర్వోసీ తెలిపిందన్నారు. ప్రభుత్వం చిట్ఫండ్ కంపెనీలపై విచారణ జరుపుతున్నందున, మార్గదర్శిపైనా దర్యాప్తు జరపాలని, తన వద్ద ఉన్న ఆధారాలన్నీ ఇస్తానని అన్నారు. రాష్ట్ర విభజన, అమరావతి రాజధానిపై ‘విభజన వ్య«థ’ అనే పుస్తకం రాస్తున్నానని ఉండవల్లి చెప్పారు. అమరావతి రాజధానిని మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి తానేనని తెలిపారు. రాజధాని అక్కడ పెట్టడం సరికాదని, అది భ్రమరావతి అని చెప్పిందీ తానేనన్నారు. -
తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు గుమ్మళ్ళదొడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు. బయో ఇథనాల్లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. -
అమరావతి యాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రైతుల పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహా పాదయాత్రను టీడీపీ మద్దతుతో నిర్వాహకులు రాజకీయ యాత్రగా మార్చిన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలకు లోబడే మహా పాదయాత్ర జరగాలని తేల్చి చెప్పింది. 600 మంది రైతులు మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు తాము అనుమతినిచ్చిన సంగతి గుర్తు చేసింది. అందుకు విరుద్ధంగా 600 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదని ప్రాథమికంగా తేల్చిచెప్పింది. అది కూడా యాత్రలో రైతులు మాత్రమే పాల్గొనాలని తేల్చి చెప్పింది. రైతులు మినహా మిగిలిన వారెవరూ పాల్గొనకుండా రోప్ పార్టీతో తగిన చర్యలు చేపట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించింది. సంఘీభావం పేరుతో మిగిలిన వారు యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని పేర్కొంది. తమ ఆదేశాల వల్లే పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేసిన హైకోర్టు, ఆ యాత్ర కొనసాగాలంటే వాటిని అమలు చేయాల్సిందేనని తెలిపింది. రూట్మ్యాప్ ప్రకారం యాత్ర జరిగేచోట అదేరోజు ఇతర పార్టీలు ఎలాంటి పోటీ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామంది. కోర్టు ఆదేశాలకు లోబడి యాత్ర సాగేందుకు ఎలాంటి ఆదేశాలు కావాలో తెలియచేయాలని అటు పిటిషనర్ను, ఇటు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, మరో ఇద్దరు లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. సీఎం, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హోంశాఖ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నవారు అడుగడుగునా న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నివేదించారు. యాత్ర సందర్భంగా ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశించినా ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. యాత్ర చేస్తున్న వారు తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. యాత్రలో పాల్గొనేందుకు హైకోర్టు 600 మందికే అనుమతినిస్తే రోజూ వేల సంఖ్యలో పాల్గొంటున్నారని, వీరిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నారని తెలిపారు. సంఘీభావం పేరుతో ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమన్నారు. యాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారో ఫొటోలు చూస్తే అర్థమవుతుందన్నారు. అభ్యంతరకర నినాదాలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే రాజమహేంద్రవరం ఘటన జరిగిందని, ఇందుకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో యాత్ర క్షేత్రస్థాయిలో ఎలా సాగుతోంది? నిర్వాహకులు కోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘిస్తున్నారు? టీడీపీ నాయకులు సంఘీభావం పేరుతో ఏం చేస్తున్నారు? తదితర అంశాలతో అనుబంధ పిటిషన్ను సిద్ధం చేశామన్నారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అందులో కోరామని, ఆ పిటిషన్ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏజీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు అనుబంధ పిటిషన్ దాఖలుకు అనుమతినిచ్చింది. ఎలా అడ్డుకోగలం?.. ఉద్రేకం వద్దు! సాధారణ ప్రజానీకం తమ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారని, వారిని ఎలా అడ్డుకోగలమని ఉన్నం మురళీధరరావు పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదన్నారు. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మురళీధరరావు ఆవేశంగా వాదనలు వినిపిస్తుండటంతో.. ఉద్రేకం తగ్గించుకోవాలని న్యాయమూర్తి ఆయనకు సూచించారు. 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని హైకోర్టు స్పష్టంగా చెబితే అందుకు విరుద్ధంగా వేల సంఖ్యలో ఎలా పాల్గొంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు రావడంలో తప్పు లేకున్నా ఆ పేరుతో యాత్రలో పాల్గొంటామంటే అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. యాత్ర విషయంలో కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని న్యాయమూర్తి గుర్తు చేశారు. తమ ఆదేశాలకు లోబడే యాత్ర సాగాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను నేటికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంలో హోంశాఖ కౌంటర్ సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
రాజమండ్రి చూసొద్దామా?
చారిత్రక నగరమైన రాజమండ్రి టూరిజం హబ్గా మారుతోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన రాజమండ్రిలో రివర్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. రాజమండ్రి నగరంతోపాటు సమీపంలో గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుకలంక, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు, ఆకట్టుకునే మ్యూజియంలు, పురాతన కట్టడాలు, పాపికొండల టూరిజం వంటి సదుపాయలతో ఉన్న రాజమండ్రి నగరాన్ని టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో భాగమైన రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, ఏజెన్సీలలో ఎన్నో అందమైన, ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలచిన ప్రదేశాలు ఉన్నాయి. నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుతమైన అందాలకు చారిత్రక ఇతిహాసాలకు కొలువైన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పథకాలు సిద్దం చేసింది. రాజమండ్రి నగరం కేంద్రంగా రివర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా రాజమండ్రి నగరంలో గోదావరిపై 122 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేసి, టూరిజం స్పాట్ గా మార్చాలని భావిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ వంతెనను వెడల్పు చేసి, వాకింగ్ ట్రాక్ తోపాటు, షాపింగ్ స్ట్రీట్ గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న వంతెనను తీర్చిదిద్దితే దేశంలోనే పురాతనమైన గోదావరి వంతెన ప్రత్యేక గుర్తింపు పొందుతుంది రాష్ట్రంలో పాపికొండల టూరిజం ఇప్పటికే ఎంతో గుర్తింపు పొందింది. రాజమండ్రి నగరం కేంద్రంగానే పాపికొండల బోట్ల నిర్వహణ జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చే టూరిస్టులు రాజమండ్రికి వచ్చి,ఇక్కడినుంచి దేవీపట్నం వద్ద బోట్లు ఎక్కి పాపికొండల యాత్రకు వెళతారు. ఇపుడు యాత్రికులు బసచేయడానికి ఏర్పాట్లు చేయడం,అదే విధంగా స్థానికంగా రివర్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే హరిత, అర్ధర్ కాటన్ బోట్లుతోపాటు మరో పది ప్రైవేట్ బోట్లు పాపికొండలకు వెళ్లి వస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచి, మరికొన్ని బోట్లకు అనుమతివ్వడంతోపాటు పాపికొండల టూరిజాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి పాయల మధ్య ఉన్న పిచ్చుక లంక పర్యాటకంగా అత్యంత అనువైన ప్రాంతంగా గుర్తించారు. దాదాపు 57 ఎకరాలున్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడానికి గతంలోనే ఎత్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో హోటల్ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఓబెరాయ్ గ్రూపు ఇక్కడ హోటల్స్, రిసార్టులు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విస్తృతమైన అవకాశాలు ఏర్పడ్డాయి. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఓవైపు ఆహ్లాదాన్నిచ్చే గోదావరిపై ఉన్న వంతెనలు, ఘాట్లు, వాటిలో ఉన్న పవిత్ర దేవాలయాలతోపాటు చారిత్రిక కట్టడాలు కూడా కనపడతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినవి గోదావరి పై ధవళేశ్వరంలో కాటన్ మహాశయుడు నిర్మించిన ఆనకట్ట దానితోపాటు ఆయన పేరిట ఏర్పాటు చేసిన కాటన్ మ్యూజియం. రాజమండ్రికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉండటంతో సుదూర ప్రాంతాలనుంచి సైతం పర్యాటకలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నగరంలోకి వచ్చే మార్గాన్ని సైతం ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దారు. రాజమండ్రికి సమీపంలోనే వాడపల్లి, ద్రాక్షారామ, అయినవిల్లి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉండటం, రాజమండ్రి నగరంలో కూడా అనేక దేవాలయాలు, ఘాట్లు, ఉండటంతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. -
అతని బతుకు లెక్క తప్పింది
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో సరదాగా హోటల్కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. అకౌంటెంట్గా జీఎస్టీలు ఫైల్ చేసేవాడు. డాన్బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు. పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతోపాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ తీసుకెళ్లాడు. తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై బైక్, సెల్ఫోన్ విడిచి పెట్టాడు. లెటర్ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. రైలు టిక్కెట్లు తీసి పంపించి... ఏ శుభకార్యానికి వెళ్లినా అందరం కలిసి వెళ్లే వాళ్లం.. విశాఖపట్నం శుభకార్యానికి వెళ్దామంటే ఈసారి తనకు పని ఉంది రాలేనని సత్యేంద్రకుమార్ చెప్పారని అతని భార్య స్వాతి పేర్కొంది. తనకు, అత్తమామలకు టిక్కెట్లు తీసి పంపించి ఇలా శోకం మిగిల్చారంటూ కన్నీరుమున్నీరవుతోంది. తిరిగి వెళ్లి వచ్చేసరికి అందనంత దూరానికి వెళ్లిపోయి తనను ఒంటరి దాన్ని చేసేవా బావా రోదిస్తున్న తీరు స్థానికుల గుండెల్ని పిండేసింది. అందరితోను కలివిడిగా నవ్వుతూ పలకరించే సత్యేంద్రకుమార్, ఇద్దరు కుమార్తెలు మృత్యువాతపడడాన్ని అతని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఎల్పురం, బుచ్చియ్యనగర్ ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కష్టాన్ని తమతో పంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ మృతుని తల్లితండ్రులు సుశీల, సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతున్నారు. పార్థివ దేహాలకు నివాళి వీఎల్పురంలో తండ్రీ కుమార్తెల పార్థివ దేహాలకు సోమవారం రాత్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్కు ఆదేశించారు. బతకాలని ఉన్నా... సత్యేంద్రకుమార్ తనతోపాటు పిల్లలనూ మృత్యుఒడికి చేర్చిన ఘటనపై ఆయన నివాస ప్రాంత వాసులకు కన్నీరు తెప్పించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు తాను చనిపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని..అందుకే వెంట తీసుకువెళ్లినట్లు సత్యేంద్రకుమార్ సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. అకౌంట్స్ కన్సల్టెన్సీ ఆఫీసు నిర్వహించేవాడు. అనుకున్న మేర ఆదాయం రాలేదని ఆందోళన చెందేవాడు. ఆర్థికంగా ఎదిగే అవకాశం లేని దురదృష్టవంతుడ్ని అంటూ సత్యేంద్రకుమార్ లేఖలో ప్రస్తావించాడు. మరణానికి మూడొంతులు అకౌంట్స్ టెన్షనే కారణమన్నాడు. బతకాలనే ఉంది..కానీ జీవితం ఇలాగే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. సున్నితంగా తాను ఆలోచించానని అనుకోవద్దన్నాడు. చావడానికి కూడా చాలా ధైర్యం కావాలంటూ లేఖ ముగించాడు. ఈ లేఖ అందరి హృదయాలనూ కదిలించింది. -
మంత్రి విశ్వరూప్కు అస్వస్థత
-
రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిపై మరమ్మతులు
-
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
పోలీసులపై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
సాక్షి, రాజమండ్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు రావుపాలెం జొన్నాడ వద్ద వీరంగం సృష్టించారు. నా కారును ఎందుకు ఆపారంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు రుబాబు చేశారు. చదవండి: (గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్షాప్ ప్రారంభం) -
రెండో ఉజ్జయిని.. రాజమహేంద్రవరం
ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి.. ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్కడ నిత్యం... ‘నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. భస్మాంగరాయ మహేశ్వరాయ.. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ.. తస్త్మేన్త కారాయ నమశ్శివాయ!’ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద ఝరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తిపారవశ్యంతో కట్టిపడేస్తోంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి.. ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా.. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతోపాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమీ ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. ఆధునికత ఉట్టిపడేలా.. ఆధ్యాత్మికుల మనసు దోచుకునేలా.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో, ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారుచేయించారు. ప్రత్యేకం.. భస్మాభిషేకం రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. భస్మాభిషేకం. ఇక్కడ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అందుబాటులో ఉండాలనే.. రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుదిశలా విస్తరించాలనే సంకల్పంతోనే ఆలయం నిర్మించాం. చారిత్రక నగరం కావడంతో ఇక్కడి ప్రాశస్త్యం భావితరాలకు గుర్తుండిపోవాలనే ఆలయాన్ని ప్రారంభించాం. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అందుబాటులోకి వచ్చింది. మరింత అభివృద్ధి చేస్తాం. – పట్టపగలు వెంకట్రావు, చైర్మన్, రోటరీ చారిటబుల్ ట్రస్ట్, మహాకాళేశ్వరాలయం -
దశాబ్దాల కల సాకారం.. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ రహదారుల అనుసంధానం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రగతికి సోపానం కానుంది. రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితాన్నిచ్చి, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. రాబోయే రెండేళ్లలో జాతీయ రహదారులు అన్ని రంగాల అభివృద్ధిలో కీలకంగా నిలవనున్నాయి. జిల్లాల పునర్విభజన తరువాత జాతీయ రహదారులకు గుర్తింపు, అనుసంధానంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వాణిజ్య సంబంధాలు మెరుగు పడేందుకు సానుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కాకినాడ పోర్టు – సామర్లకోట రైల్వే జంక్షన్, కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు కీలక రహదారులు జాతీయ హోదాతో నాలుగు వరుసలుగా అభివృద్ధి సాధించనున్నాయి. మరింత స‘పోర్టు’ విశాఖపట్నం తరువాత ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న కాకినాడ పోర్టు నుంచి ఇతర జిల్లాలకు రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. దీంతో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవకు ఎంపీలు, మంత్రుల సమన్వయంతోడు కావడంతో ఇది సాకారం కానుంది. కాకినాడ పోర్టు నుంచి పామోలిన్ క్రూ డ్, ఎరువుల దిగుమ తులు జరుగుతున్నా యి. ఆఫ్రికా దేశాలకు బియ్యం, సింగపూర్, మలేషి యా వంటి దేశాలకు గ్రానైట్ వంటి ఎగుమతులు జరు గుతున్నాయి. ఇంతటి కీలకమైన రేవును జాతీయ రహదారితో అనుసంధానించడం వలన ఎగుమతి, దిగుమతులు మరింత ఊపందుకునే అవకాశాలు పెరుగుతాయి. కాకినాడ పోర్టుతో అటు అన్నవరం, ఇటు సామర్లకోట జంక్షన్లను జాతీయ రహదారితో అనుసంధానం చేస్తున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఈ ప్రాంతాల గుండా కాకినాడకు నాలుగు వరుసల హైవే పారిశ్రామిక ప్రగతిలో మేలిమలుపు కానుంది. చదవండి👉 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం) అచ్చంపేట – పెద్దాపురం ఏడీబీ రోడ్డు ఈ జాతీయ రహదారికి భూసేకరణ జరుగుతోంది. కాకినాడ సమీపంలోని అచ్చంపేట జంక్షన్ నుంచి ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా 25 అడుగులతో నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. అచ్చంపేట నుంచి పెద్దాపురం ఏడీబీ రోడ్డు పొడవు 12.25 కిలోమీటర్లు. దీని నిర్మాణంతో సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సామర్లకోట మండలం నుంచి 12.25 కిలోమీటర్ల భారత్మాల రోడ్డుకు రూ.395.60 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇది ఉండూరు జంక్షన్ నుంచి కాకినాడ – సామర్లకోట రోడ్డులో ముత్యాలమ్మ గుడి, గోదావరి కాలువ మీదుగా వీకే రాయపురం, సామర్లకోట పంచారామ క్షేత్రం వెనుక నుంచి హుస్సేన్పురాన్ని కలుపుతూ సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ మీదుగా రాక్ సిరామిక్స్ సమీపాన పెద్దాపురం ఏడీబీ రోడ్డును కలవనుంది. అచ్చంపేట నుంచి రాజానగరం వరకూ నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారికి ఈ రోడ్డు అనుసంధానం కానుంది. దీంతో రాజానగరం నుంచి కాకినాడ వరకూ ఏడీబీ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. దశాబ్దాల కల సాకారం ఇప్పటి వరకూ అమలాపురం నుంచి అంబాజీపేట, ముక్కామల మీదుగా రావులపాలెం వరకూ ఆర్అండ్బీ రోడ్డు ఉంది. దీనిని రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి కత్తిపూడి – పామర్రు 216 జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. 216ఈగా పిలిచే ఈ కొత్త జాతీయ రహదారి అమలాపురం శివారు పేరూరు వై జంక్షన్ నుంచి భట్లపాలెం – ఇందుపల్లి – ఈదరపల్లి – ముక్కామల బైపాస్ రోడ్డు మీదుగా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. కోనసీమలో కొత్తగా 35 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఈ రోడ్డు ఆర్అండ్బీ నుంచి ఎన్హెచ్కు బదిలీ అయింది. కొత్త హైవేను ఈదరపల్లి – ముక్కామల బైపాస్ మీదుగా నిర్మించడంతో ఈ 8 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో కోనసీమ వాసుల ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఈ హైవే నిర్మాణంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల సాకారమవుతోంది. మూడు ఫ్లై ఓవర్లకు గ్రీన్సిగ్నల్ ►ఇటీవలనే ఆమోదం లభించిన జొన్నాడ, మోరంపూడి, దివాన్చెరువు ఫ్లైæఓవర్లతో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే జాతీయరహదారి 216పై ప్రమాదాలు తగ్గనున్నాయి. ►జొన్నాడ ఫ్లైఓవర్కు రూ.24కోట్లు, మోరంపూడి ఫ్లైæఓవర్కు రూ.56కోట్లు, దివాన్చెరువు ప్లైఓవర్కు ఐదేళ్ల క్రితం రూపొందించిన అంచనా రూ.20కోట్లు అవసరమవుతాయి. ►వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మరో కీలకమైన రహదారి కాకినాడ–జొన్నాడ. దీనికి జాతీయ హోదా ప్రయత్నం ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైంది. ►కాకినాడ, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ►కాకినాడ–అమలాపురం మధ్య జాతీయరహదారి 216 ను కలిపి ద్రాక్షారామ–కోటిపల్లి–అయినవిల్లి మీదుగా ఉన్న రాష్ట్ర రహదారిని కాకినాడ–వేమగిరిని కలుపుతూ ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారి హోదా ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. వాకలపూడి లైట్ హౌస్ – అన్నవరం పొడవు: 40.32 కిలోమీటర్లు. నాలుగు వరుసల రహదారి అంచనా : రూ.776.82 కోట్లు. హోదా : ఎన్హెచ్ 516–ఎ‹ఫ్ నిర్మాణ గడువు : రెండేళ్లు -
జక్కంపూడి స్ఫూర్తితో ముందడుగు: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రాజకీయ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయంగా ఎదిగానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గం తుని వెళ్తున్న ఆయనకు వేమగిరి నుంచి కంబాలచెరువు సెంటర్ వరకూ భారీగా మోటా ర్ సైకిళ్లు, కార్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి తొలుత బొమ్మూరులోని ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శ్రీనివాసులురెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి చిత్రపటానికి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఐఎల్టీడీ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్కు చేరుకుంది. అక్కడ మంత్రి దాడిశెట్టి రాజాను రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతల సహకారంతో ముందుకు తర్వాత స్టేడియం రోడ్డు మీదుగా ర్యాలీ తాడితోట, కంబాల చెరువు సెంటర్కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్అండ్బీ మంత్రిగా రామ్మోహనరావు విశేష సేవలందించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంపీ వంగా గీత, సోదరులు జక్కంపూడి రాజా, గణేష్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ ఎంపీ వంగా గీత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మానే దొరబాబు, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్, అడపా అనిల్, ముద్దాల అను, కోడికోట, ఆరిఫ్, జేకే అరుణ్, కేఆర్జే రాజేష్, గన్నవరపు సంజయ్, కనకాల రాజా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ర్యాలీకి వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యం వహించారు. -
హీరో రామ్చరణ్కు బాహుబలి కాజాతో సత్కారం
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్చరణ్ కెరీర్లో 15వ చిత్రం. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజమహేంద్రవరం వెళ్లిన రామ్చరణ్కు తాపేశ్వరం సురుచి పీఆర్ఓ వర్మ బాహుబలి కాజాను అందజేశారు. జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజాను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. షెల్టాన్ హోటల్లో జరిగిన ఫోటోషూట్లో రామ్చరణ్కు వర్మ ఈ కాజాను బహుకరించారు. కాగా ఆర్సీ15 చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చెన్నై–కోల్కతా జాతీయ రహదారి. రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు. ప్రపంచ నర్సరీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన ఆ ఊరి పేరు కడియం. అలాంటి పూలవనంలో విరబూసిన ఓ యువకుడు టీకొట్టు బడ్డీలకు బ్రాండింగ్ చేసి మరోసారి ఆ గ్రామ పేరు ప్రఖ్యాతలను దేశం నలుమూలలా విస్తరింపజేస్తున్నాడు. మూడు పదుల వయసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల్లో రూ.లక్షల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి.. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందడుగు వేశాడు. చదవండి: ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు 2017లో రాజమహేంద్రవరంలో హైటెక్ హంగులతో ‘టీ టైమ్’ పేరిట బడ్డీని ప్రారంభించిన తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ (బాలు) దానికి బ్రాండింగ్ చేశారు. అదే పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తాజాగా వారణాసిలో ప్రారంభించిన ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 1,500 ‘టీ టైమ్’ ఔట్లెట్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా 25 వేల మందికి బాలు ఉపాధి చూపుతున్నాడు. మొదట్లో రూ.10 వేలతో ప్రారంభించిన ‘టీ టైమ్’ బ్రాండ్ ఐదేళ్లలో రూ.10 కోట్ల టర్నోవర్తో నడుస్తోంది. రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల టీ టైమ్ అవుట్లెట్లే కనిపిస్తాయి. ప్రాథమిక విద్య కడియం, కరైకల్, పాండిచ్చేరిలో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ చేసిన బాలు తండ్రి దివంగత వీరభోగవసంతరావు దక్షిణాది రాష్ట్రాల్లో క్లాస్–1 కాంట్రాక్టర్. ఈ క్రమంలో బాలు దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ పలు భాషలపై పట్టు సాధించారు. చదవండి: కోటిస్తే.. బడికి మీరు చెప్పిన పేరు బ్రాండ్కే మోజు బీటెక్ తరువాత దుబాయ్లో డాలర్లు కురిపించే ఉద్యోగం చేస్తున్నప్పుడు స్నేహితులతో కలిసి కాఫీ షాపునకు వెళ్లారు బాలు. అక్కడ టీ, కాఫీ ఖరీదు రూ.500 కంటే ఎక్కువ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని బాలు చెప్పారు. టీ కప్పు లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ (పదార్థాలు) విలువ రూ.30 కూడా ఉండవు. టీ విలువ రూ.30 పోను మిగిలిన విలువ అంతా బ్రాండ్కే అనే వాస్తవాన్ని గుర్తించి ‘టీ టైమ్’ను ప్రారంభించారు. టీ టైమ్ వ్యాపారాన్ని చేయాలన్నది వేరెవరో ప్రేరేపించింది కాదంటారాయన. సామాన్యుడికి నాణ్యత కలిగిన టీ అందించాలనే తపన నుంచే ‘టీ టైమ్’ ఆవిష్కరణ జరిగిందని బాలు చెప్పారు. సామాన్యులతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో సంపన్నులతో సమానంగా వారిని చూడాలనుకున్నానని.. దానిని నెరవేర్చుకుంటూ ముందుకెళుతున్నానని బాలు వెల్లడించారు. చదవండి: ప్రపంచాన్ని మెప్పించిన పాతికేళ్ల కుర్రాడు.. కడప బాహుబలి ప్రణాళిక ముఖ్యం.. వచ్చే మూడేళ్లలో కనీసం మరో 10 వేల అవుట్లెట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాలు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనేది జీవితాశయమని వెల్లడించారు. ఇప్పటివరకు తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో 10% మాత్రమే విజయం సాధించానన్నారు. నేటి వ్యాపార సరళిపై మాట్లాడుతూ.. ఎవరికైనా ఆలోచన వస్తే దానిని కాగితంపై రాసుకుని తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు పరితపించాలని.. పటిష్టమైన వ్యూహం, క్షేత్ర స్థాయిలో అవగాహన, లావాదేవీల్లో గణాంకాలపై పట్టు సాధించడం ద్వారానే ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రణాళిక బలంగా ఉన్నప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయంటున్నారు బాలు. -
రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..
సాక్షి, రాజమహేంద్రవరం: రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వలన ఎదురవుతున్న సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. వీటి ప్రకారం ఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు. చదవండి: (చట్టాలు చేయకుండా నిలువరించలేరు) రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తోటి ప్రయాణికుల వలన ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటారు. దీనిపై బోగీల్లోని ఆర్ఫీఎఫ్ సిబ్బంది, టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది. చదవండి: (TTD: ఆన్లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల) ఫోన్ కాల్ చాలు.. జైలుకు పంపేస్తాం బోగీల్లో తోటి ప్రయాణికుల వలన ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగినా చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు.. న్యూసెన్స్ కేసు నమోదు చేసి, జైలుకు పంపుతాం. – సైదయ్య, ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్, రాజమహేంద్రవరం -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. విషయం తెలియడంతో
సాక్షి, రాజమహేంద్రవరం: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. హతుడు నగరంలో చాలామందికి సుపరిచితుడు కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్నగర్కు చెందిన సీహెచ్ సునీల్ కాళేశ్వరి ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్లో డైరెక్టర్గా పని చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక ఒక కార్పొరేట్ స్కూలులో ప్రిన్సిపాల్గా పని చేస్తోంది. అందరితో కలివిడిగా, స్నేహపూర్వకంగా ఉండటంతో నగరంలోని ప్రముఖులతో సునీల్కు పరిచయాలున్నాయి. సునీల్ కుటుంబానికి బొమ్మూరుకు చెందిన డెన్మర్ అనే వ్యక్తి కుటుంబానికి చాలాకాలంగా స్నేహం ఉంది. ఉద్యోగ రీత్యా డెన్మర్ అబుదాబీలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సునీల్కు, డెన్మర్ భార్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలియడంతో డెన్మర్ ఈ వ్యవహారంపై ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో అతడు వారం రోజుల క్రితం రాజమహేంద్రవరంలోని బొమ్మూరు ప్రాంతంలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచీ భార్యకు, డెన్మర్కు, సునీల్కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం సునీల్ భార్య యథావిధిగా డ్యూటీకి వెళ్లిపోయింది. ఇంట్లో సునీల్ ఒంటరిగా ఉన్నాడు. కొంతసేపటికి ఆ ఇంటికి డెన్మర్, అతడి భార్య చేరుకున్నారు. అక్కడ ముగ్గురి మధ్య గంట పైగా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వారు తిరిగి వెళ్లిన కొద్దిసేపటికి సునీల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చదవండి: కూకట్పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ.. ఇంట్లో కేకలు వినిపించడంతో అక్కడకు వెళ్లిన స్థానికులు సునీల్ పరిస్థితిని గమనించి అతడి భార్యకు సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన స్థానిక ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న ప్రకాశ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. హత్యపై స్థానికులను ఆరా తీశారు. హతుడి దేహంపై మెడకు ఇరువైపులా, ఛాతి పైనా కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన కత్తిని హంతకులు అక్కడే పడేయడంతో దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వికటించిన ఆర్ఎంపీ వైద్యం.. 20 రోజుల నరకయాతన.. చివరికి సునీల్ హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న డెన్మర్, అతడి భార్యను బొమ్మూరులోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. డెన్మర్ భార్య చేతిపై కూడా కత్తి గాయాలున్నాయని చెబుతున్నారు. బహుశా సునీల్ను హతమార్చేందుకు డెన్మర్ ప్రయత్నించినప్పుడు అతడి భార్య అడ్డుకొనేందుకు ప్రయత్నించి ఉంటుందని, ఆ క్రమంలోనే ఆమెకు కూడా కత్తి గాయాలయ్యాయని అనుమానిస్తున్నారు. -
తాగొద్దని మందలిస్తే.. చాకులతో పొడిచి, ఇనుపరాడ్డులతో కొట్టి, ఆపై..
రాజమహేంద్రవరం: రోజూ స్నేహితులతో కలిసి తాగి తిరుగుతుండడంతో తరుచూ మందలిస్తూ కట్టడి చేస్తున్నాడనే ఉద్దేశంతో పురోహితుడు కంచిభట్ల నాగసాయి (25)ను తోటి స్నేహితుడు, మరో ఇద్దరితో కలిసి హత్యచేశారని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పుమండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు. హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సోమవారం తూర్పుమండల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కంచిభట్ల నాగసాయి, వెలివెంటి సాయిపవన్ నాలుగు నెలలుగా కొంతమూరులోని బొమ్మనకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి కుల వృత్తి అయిన పౌరోహిత్యం చేస్తుండేవారు. చదవండి: విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి.. సాయిపవన్, కొంతమూరు బొమ్మనకాలనీకి చెందిన నెరుగొందల నాగేంద్ర, ఒక మైనర్బాలుడితో కలిసి ప్రతిరోజు తాగి తిరుగుతుండేవాడు. దీంతో కంచిభట్ల నాగసాయి వారిని తరుచూ మందలించేవాడు. ఇది నచ్చక సాయిపవన్, మైనర్ బాలుడితో కలిసి గత నెల 24వ తేదీన అర్ధరాత్రి వారి రూమ్లోనే చాకులతో పొడిచి, ఇనుపరాడ్డులతో కొట్టి హత్యచేశారు. అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా నెరుగొందల నాగేంద్రతో కలిసి పెట్రోల్తో కాల్చేశారు. మళ్లీ ఈ నెల మూడో తేదీన పెట్రోలు పోసి కాల్చుతుండగా వాసన వచ్చి చుట్టుపక్కల వారు రావడంతో ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఈ నెల 3వతేదీ రాత్రి 8 గంటల సమయంలో కొంతమూరులోని బొమ్మలకాలనీలో హోప్చర్చి దగ్గరలో ఒక ఇంట్లో మృతుడు శవం కాలిపోయి ఉందని వీఆర్వో మిర్తివాడ రామాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, అక్కడే శవపంచనామా నిర్వహించారు. అనంతరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యారస్తోగి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి పర్యవేక్షణలో తూర్పుమండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్ సారథ్యంలో రాజానగరం పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 36గంటల్లోనే కేసును ఛేదించి ఆదివారం కొంతమూరులో వెలివెంటి సాయిపవన్, నెరుగొందల నాగేంద్ర, మైనర్బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును 36 గంటల్లో ఛేదించిన రాజానగరం పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సైలు వై.సుధాకర్, ఎండీ జుబేర్, ఏఎస్సై వై.శ్రీనివాస్, హెచ్సీ, పీసీలను ఎస్పీ ఐశ్వర్యారస్తోగి అభినందించారని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. -
విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: ఒక పురోహితుడిని అతడి సహచరుడే హతమార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరం బయట పడకుండా నిందితుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన కంచభట్ల నాగసాయి అలియాస్ వెంకటేష్ (24), నాగపవన్ (19) స్నేహితులు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. పౌరోహిత్యం చేసుకుంటూ కోలమూరు గ్రామ పంచాయతీ పరిధి బొమ్మన కాలనీలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దగ్గరకు తరచూ చరణ్, నందా, షణ్ముఖ్ కార్తీక్ అనే స్నేహితులు వస్తుంటారు. ఖర్చులు ఎక్కువ చేస్తున్నావంటూ నాగపవన్ను ఇటీవల నాగసాయి మందలిస్తున్నాడు. కొన్నిసార్లు కొడుతున్నాడు. గత నెల 24న ఖర్చుల విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన నాగపవన్.. చాకుతో నాగసాయిని మెడ మీద, పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయాలతో నాగసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మిత్రుడి మృతదేహాన్ని వదిలేసి నాగపవన్ వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేందుకు ప్రయత్నించాడు. పూర్తిగా కాలకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం (ఈ నెల 3) సాయంత్రం మరో స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) మృతదేహంపై దుప్పట్లు వేసి కాల్చేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుర్వాసన రావడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నాగపవన్ మృతదేహాన్ని బాత్రూములో పడేసి, పంది చనిపోయినట్టుందని చెప్పి ఆదరాబాదరాగా జారుకున్నారు. వారి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు రాజానగరం పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం అర్ధరాత్రి రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వై.సుధాకర్లు ఆ ఇంటిని పరిశీలించారు. సగం కాలిన శవం బాత్రూములో పడి ఉండటాన్ని గుర్తించారు. శనివారం ఉదయం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ వచ్చి స్థానికులను ఆరా తీశారు. తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ యువకులు దారితప్పినట్లు గుర్తించారు. వ్యసనాలకు బానిసైనట్లు భావిస్తున్నారు. నాగసాయి కొంతకాలం యాక్టింగ్పై మక్కువతో మైసూరు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. నిందితుడు నాగపవన్తో పాటు ఉన్న స్నేహితులెవరనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. చదవండి: (కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు) -
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్లోని రెడ్క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్లో స్థానిక కవులు సత్కరించారు. ‘సిరివెన్నెల’గా మారిందిక్కడే.. సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు. ►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు. ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో.. సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది. – దాట్ల దేవదానంరాజు, కవి, యానాం అలా పరిచయం చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం. – డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్) మాది 40 ఏళ్ల స్నేహబంధం సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత రాజమహేంద్రవరంతో అనుబంధం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్మోహన్మిత్రా కన్నీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల చిత్రం షూటింగ్లో సీతారామశాస్త్రి తదితరులు ఆయనతో పరిచయం మరువలేనిది ‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు. – ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం -
హత్యల మిస్టరీ వీడింది.. తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీ తెలిపారు. మినీ వ్యాన్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురిని, వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులున్నారని వివరించారు. తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వేలిముద్రే పట్టించింది పిఠాపురానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ ఒగ్గు నాగేంద్ర (32) ఈ నెల 26న తాడేపల్లిగూడెం వెళ్లి కమలా ఫలాల లోడు వేసుకుని తిరిగి వెళుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నన్నయ యూనివర్సిటీ సమీపానికి వచ్చేసరికి ఆ వ్యాన్ను రాజమహేంద్రవరం శంభూనగర్కు చెందిన మద్ది వెంకట సాయి (వెంకట్), కడియం మండలం వేమగిరికి చెందిన తూము ముత్యాలు, ఓ బాల నేరస్తుడు కలిసి ఆపారు. నాగేంద్రను బెదిరించి డబ్బులు, సెల్ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో ముద్దాయిలు చాకులతో అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు. ఈ కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఓ నిందితుడి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నాగేంద్రను హత్య చేసిన తరువాత నిందితులు విశాఖకు పారిపోయారు. తిరిగి వస్తూ కత్తిపూడిలో ఓ స్కూటర్ దొంగిలించారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో మద్ది వెంకట సాయిపై చోరీ కేసులతో పాటు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. అలాగే తూము ముత్యాలుపై ఒక కేసు, బాల నేరస్తుడిపై రెండు కేసులు ఉన్నాయి. ఈ కేసును చాకచక్యంగా విచారించి, నిందితులను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుభాష్, క్లూస్ టీం ఎస్సై ప్రవీణ్, ఎస్సైలు ఎండీ జుబేర్, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, ఎం.ప్రసాద్, కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, కె.పవన్కుమార్, సూరిబాబు, ఆర్వీ రమణ, ఎన్.రాంబాబులను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. చదవండి: (ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య) తాగి తందనాలాడుతుంటే తిడుతోందని.. సీతానగరం మండలం వంగలపూడిలో ఈ నెల 24న జరిగిన కోదేళ్ల నాగమ్మ అలియాస్ చింతాలమ్మ (72) హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. నాగమ్మ మృతదేహంపై గాయాలుండటంతో ఆమె బంధువు కొండయ్య ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇచ్చిన ముఖ్య సమాచారం ఆధారంగా వంగలపూడికే చెందిన యువకుడు ఇండుగుమిల్లి నవీన్ను, ఓ బాల నేరస్తుడిని వీఆర్వో ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. ప్రతి రోజూ మద్యం తాగి ఊళ్లో బలాదూర్గా తిరుగుతున్న వీరిని నాగమ్మ తరచూ అసభ్య పదజాలంతో తిట్టేది. ఈ నెల 24న పుట్టిన రోజు సందర్భంగా మద్యం తాగి వస్తున్న వారిద్దరినీ చూసిన నాగమ్మ తీవ్రమైన పదజాలంతో దూషించింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని నిందితులిద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే నాగమ్మ ఇంట్లోకి వెళ్లి చెంబుతో ఆమె ముఖంపై కొట్టారు. ఆమె ఇంట్లోనే ఉన్న గునపంతో ఆమె ఛాతి మీద బాది హతమార్చారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. వృద్ధురాలి హత్యకు వారు ఉపయోగించిన చెంబు, గునపం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ప్రతిభ చూపిన కోరుకొండ ఇన్స్పెక్టర్ పీఈ పవన్కుమార్రెడ్డి, సీతానగరం ఎస్సై కె.శుభశేఖర్, కానిస్టేబుళ్లు పి.రాము, ఎస్.ప్రసాద్, సీహెచ్ గోవిందు, బి.వెంకటేష్లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో శాంతిభద్రతల ఏఎస్పీ లతామాధురి, నార్త్జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!) -
విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్/ఆత్రేయపురం: వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారు. కలసిమెలసి ఉండేవారు. చివరికి మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో స్నానాలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం ఐఎల్టీడీ బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన కొల్లాబత్తుల దయాకరుణ్ ఎలియాస్ సన్నీ (20), రైల్వే క్వార్టర్స్కు చెందిన బాణావత్ సత్యనారాయణ (20) ధవళేశ్వరం వివేకానంద ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం తరగతులు ముగిశాక ఇద్దరూ గోదావరి స్నానానికి పిచ్చుకలంక వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడ్డారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి వారి మృతదేహాలు శుక్రవారం గోదావరి ఒడ్డున లభ్యమయ్యాయి. దయాకరుణ్ తండ్రి శేఖర్ పెయింటింగ్ పనుల కాంట్రాక్టు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సత్యనారాయణ తండ్రి సీతనాయక్ రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఐటీఐ చదివి ఉద్యోగాలు పొందుతారని భావించిన తరుణంలో విద్యార్థులిద్దరూ మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హీరో చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా స్థానిక అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, మాజీ ఎంపి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (చెన్నై నుంచి హైదరాబాద్కు బైక్పై వచ్చేవాణ్ణి) -
ఆ జంక్షన్ హిజ్రాల అడ్డా..సిగ్నల్ పడితే హడలే..
సాక్షి,రాజమహేంద్రరం రూరల్: నగరంలోని జంక్షన్లలో హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. కొందరు ఎటువంటి మాస్కు ధరించకుండా నగదు వసూలు చేయడంతో వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలలుగా మోరంపూడి జంక్షన్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరంలో అతిపెద్దది మోరంపూడి జంక్షన్. ఇక్కడ అధికంగా నగదు వస్తుందన్న అంచనాతో హిజ్రాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇందులో సగం మంది ఎటువంటి మాస్కులు ధరించకుండా నగదు వసూలు చేస్తున్నారు. సిగ్నల్ పడినప్పుడు ఎక్కువ వాహనాలు ఆగుతాయి. ఆ సమయంలో నాలుగు వైపుల నుంచి హిజ్రాలు వచ్చి వాహన చోదకులను నగదు డిమాండ్ చేస్తున్నారు. కారులు, లారీలు, ఇతర వాహన చోదకుల నుంచి రూ.10 తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా వల్ల జాతరలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో జంక్షన్లలో నగదు వసూలు చేస్తున్నారన్న మానవతా దృక్పథంతో వాహన చోదకులు సైతం ఎంతో కొంత ఇస్తున్నారు. వీరితో పాటు భిక్షాటన చేసే చిన్నపిల్లలతో తల్లులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ వస్తువులు అమ్మకందారులతో జంక్షన్లో రద్దీగా ఉంటోంది. అన్నీ జంక్షన్లలోనూ.. మోరంపూడి జంక్షన్తో పాటు నగరంలోని ఇతర ముఖ్యకూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద హిజ్రాల నగదు వసూలు కొనసాగుతూనే ఉంది. ఇటీవల తాడితోట జంక్షన్లో హిజ్రాలను చెదరగొట్టే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్పై తిరగబడ్డారు. జంక్షన్లలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిగ్నల్ను చూసుకోవాలో, హిజ్రాల నుంచి తప్పించుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. కుటుంబంతో కలిసి మోటారుసైకిల్పై వచ్చిన వారిని కూడా వదలడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్య నుంచి రక్షించాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
ఆ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని 32 పురపాలక సంఘాలు, 3 నగరపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విలీన గ్రామాలతో కలిపే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నిక జరుగుతుందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల ఏర్పాటుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టులకు వెళ్లి మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిందన్నారు. అయినప్పటికీ న్యాయస్థానాల్లో విజయం సాధించి, ఏ క్షణంలోనైనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్లీన్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిపై కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెలాఖరున విజయవాడలో మునిసిపల్ అధికారులకు వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విశాఖ మినహా ఎక్కడా లేనివిధంగా రాజమహేంద్రవరంలో రూ.4 కోట్లతో అత్యాధునిక కబేళాను నిర్మించామన్నారు. రాజమహేంద్రవరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్రామ్ పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా నమ్మకంగా నటించి ఆటో డ్రైవర్ దారుణం
రాజమహేంద్రవరం: అమ్మా.. ఎక్కడికి వెళ్లాలి. రమ్మంటారా.. బ్యాంకుకా పదండి వెళ్దాం.. అంటూ నమ్మకస్తుడిగా నటించిన ఓ ఆటో డ్రైవర్ చివరికి ఆ వృద్ధురాలిని హత్య చేసి బంగారం కాజేశాడు. అప్పులు, ఖర్చుల కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఎ.లతామాధురి తెలిపారు. దీనిపై శుక్రవారం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గత నెల 4న రాత్రి హుకుంపేట ఆదర్శనగర్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు జంగా నారాయణమ్మ (60) హత్యకు గురైంది. ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఆమె ముక్కు, నోరు మూసివేసి హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ శేమూషీ బాజ్పాయ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, ఈస్ట్జోన్ డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో బొమ్మూరు, రాజానగరం ఇన్స్పెక్టర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్లు, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. అనుమానం వచ్చి హుకుంపేట ఆదర్శనగర్ పార్కు వద్ద ఉంటున్న ఆటో డ్రైవర్ చుక్కా లోవరాజును ఆవ రోడ్డులో బొమ్మూరు ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి అరెస్టు చేశారు. అతన్ని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. లోవరాజు సొంతూరు విజయవాడ. అక్కడ గతంలో అతనిపై దొంగతనాల కేసులున్నాయి. పదేళ్ల కిందట ఆయన రాజమహేంద్రవరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హత్యకు గురైన జంగా నారాయణమ్మకు లోవరాజు ఆటోడ్రైవర్గా పరిచయం అయ్యాడు. ఆమెకు నమ్మకస్తుడిగా ఉంటూ సుమారు నాలుగేళ్ల నుంచి ఆసుపత్రులకు, బ్యాంకు పనులకు, దేవాలయాలు, బంధువుల ఇళ్లకు తన ఆటోలో కిరాయికి తిప్పుతూ ఉండేవాడు. అంతా గమనించి.. నారాయణమ్మ ఒంటరిగా ఉంటుందని, ఆమె వద్ద బంగారం ఉందని గమనించాడు. ఆ బంగారం దొంగిలించి అప్పులు, కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని నిందితుడు భావించాడు. ముందుగానే హత్యకు పథకం వేశాడు. గత నెల 4న రాత్రి 8 గంటలకు ఎవరూ లేని సమయంలో లోవరాజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి, ఒంటి మీద బంగారాన్ని దోచుకుపోయాడు. ఈ కేసులో చివరికి నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.4 లక్షల విలువైన 116 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ లతామాధురి తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెకర్లు లక్ష్మణరెడ్డి, సుభాష్లను, బొమ్మూరు పీఎస్ సిబ్బంది, డీఎస్పీ క్రైం పార్టీని ఎస్పీ శేముషీ బాజ్పాయ్ అభినందించారు. చోరీ కేసులలో నిందితుల అరెస్ట్ అర్బన్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రవికుమార్, ప్రకాష్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్లకు వచ్చిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర చోరీ నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ లతామాధురి తెలిపారు. విశాఖపట్నానికి చెందిన బందు గోవింద్, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్కు చెందిన ఆలమురి సంజీవరెడ్డిలను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కాసుల బంగారు ఆభరణాలు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు గత రెండు నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఆరు నేరాలు చేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంటి ప్రహరీ దూకి కిటికీ తెరిచి చూస్తుండగా వాచ్మెన్ చూడటంతో పరారయ్యారు. టుటౌన్ పరిధిలో రెండు, ప్రకాష్నగర్ పరిధిలో రెండు, బొమ్మూరు రెండు, కాకినాడ సీసీఎస్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటి, చిత్తూరు జిల్లా అలిపిరి పరిధిలో పలు దొంగతనాలు చేశారు. బందు గోవిందుపై రాజమహేంద్రవరం, విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో సుమారు 15 కేసులు ఉన్నాయి. ఐదు కేసుల్లో శిక్ష కూడా పడింది. వారిని పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులను అర్బన్ ఎస్పీ అభినందించారని లతామాధురి తెలిపారు. -
ఒంటరైన మూడేళ్ల చిన్నారి
భార్య, భర్త, మూడేళ్ల బాబు.. అందమైన కుటుంబం.. జీవితం ఎంతో సరదాగా సాగిపోతోంది. భర్త ఓ కంపెనీలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, భార్య గృహిణి. మూడు రోజుల క్రితం కుటుంబం అందరూ కలసి నూతన సంవత్సరం వేడుకల కోసం తుని నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ఉండడంతో తిరిగి తుని బయల్దేరి వస్తుండగా.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో వారి జీవితాలను చిదిమేసింది. భార్యభర్తలను మృత్యు ఒడికి చేర్చి.. ఆ మూడేళ్ల చిన్నారిని తల్లి, తండ్రి లేని ఒంటరిని చేసింది. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడికి ఏం జరిగిందో, అమ్మా, నాన్న ఏమయ్యారో తెలియక బిత్తరచూపులు చూస్తున్నాడు. సాక్షి, అన్నవరం: జాతీయ రహదారిపై ఆదివారం అన్నవరం వద్ద మధ్యాహ్నం డివైడర్ను బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో దానిపై ప్రయాణిస్తున్న భర్త మహ్మద్ కరీం(32) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మహ్మద్ అరీష్ కోమల్(26) తుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. బండి మీద వారిద్దరి మధ్య కూర్చున్న మూడేళ్ల బాలుడు కరీముల్లా ఖాదరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన మహ్మద్ కరీం పదేళ్లుగా విశాఖ జిల్లా రాజవరంలోని డక్కన్ కెమికల్స్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2014లో కాకినాడకు చెందిన మహ్మద్ అరిష్ కోమల్తో వివాహమైంది. వీరు ఆరేళ్లుగా తునిలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకల కోసం రాజమహేంద్రవరం వెళ్లిన వీరు ఆదివారం హీరోహోండా గ్లామర్ బైక్(ఏపీ05, డీబీ 6213)పై తిరిగి తుని బయల్దేరారు. వారి కుమారుడు ఖాదరీఫ్ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. అన్నవరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. స్నేహ రెసిడెన్సీ సమీపంలో డివైడర్ను వీరి బైక్ ఢీకొని ఒక్కసారిగా కింద పడిపోయారు. మహ్మద్ కరీం, భార్య అరిష్ కోమల్ రోడ్డు పక్కనే పడిపోగా, కుమారుడు ఖాదరీఫ్ పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డాడు. స్థానికులు వీరిని గమనించి వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా.. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని పరీక్షించగా మహ్మద్ కరీం అప్పటికే చనిపోయాడు. భార్య, తీవ్ర గాయాలతో తుప్పల్లో పడి ఉన్న కుమారుడు ఖాదరీఫ్ను గమనించి వెంటనే తుని ఆసుపత్రికి తరలిస్తుండగా భార్య అరిష్ కోమల్ మార్గం మధ్యలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఖాదరీఫ్కు తీవ్ర గాయాలవ్వడంతో అతడిని తుని ప్రభుత్వాసుపత్రి వైద్యుల సిఫారసుతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై అజయ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..) -
ఏమైంది తల్లీ...
అందరికీ ప్రాణం పోసే తల్లివి నీవు.. ఏమైందమ్మా.. నవమాసాలు మోసి కన్న బిడ్డనే కాదనుకున్నావు.. ఆ బిడ్డతో నీవూ అనంత లోకాలకు వెళ్లిపోయావు.. ప్రాణం పోయే వారికీ మందులిచ్చి దేవుడిలా ఆదుకునే నువ్వే ఎందుకిలా చేశావో.. అంత కష్టం ఏమొచ్చిందో.. ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావంటూ ఆ తల్లీబిడ్డల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఓ వైద్యురాలు తన కుమారుడితో సహా బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలహాలు ఆ కుటుంబంలో చిచ్చు రేపాయి.. చివరికి ఆత్మహత్యకు పురిగొల్పాయి.. ఈ నేపథ్యంలో తన కుమారుడితో సహా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దేవీచౌక్ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్ దొంతంశెట్టి లావణ్య (33) చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. (చదవండి: అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!) ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్ (7)కు నిద్రమాత్రలు ఇచ్చి తానూ ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లీ బిడ్డలకు అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే హత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జక్కంపూడి రాజా దీక్ష విరమణ
-
జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష విజయవంతం
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: కార్మికుల సంక్షేమం, వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమైంది. రాజా దీక్షకు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల రెగ్యులరైజేషన్ డిమాండ్ నిరాహార దీక్షతో నెరవేరింది. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరాయంగా పోరాటం సాగిస్తామని జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం పేపరుమిల్లు వద్ద కార్మికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ మిల్లు ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. రాజమహేంద్రవరం ఏపీ పేపరుమిల్లులో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉండగా యాజమాన్యం నిర్లక్ష్యం, నిరంతృత్వధోరణి అవలంబిస్తూ వచ్చింది. కార్మికుల తరఫున ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఏడాది కాలంగా పలు దఫాలు చర్చలు నిర్వహించారు. పేపరుమిల్లు యాజమాన్యం సమయం కావాలంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. చివరగా జరిపిన చర్చల్లో 15వ తేదీ గురువారం తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో శుక్రవారం మరోమారు మిల్లు ఆవరణలో చర్చలు ప్రారంభించారు. పలు దఫాలు మిల్లు యాజమాన్యం తరుఫున జీఎమ్ సూరారెడ్డి, అక్కిన జయకృష్ణ చర్చలు నిర్వహించినా విఫలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సాయంత్రం ఐదు గంటలలోపు న్యాయమైన కోర్కెలు అంగీకరించకపోతే శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సమయం పూర్తయినా ప్రకటన వెలువడకపోవడంతో దీక్ష దిగిన విషయం తెలిసిందే. రాజాతో పాటు సీఐటీయూ నాయకుడు సంఘీభావంగా దీక్ష చేపట్టారు. చర్చలు సఫలం మిల్లు యాజమాన్యం తరఫున జీఎం సూరారెడ్డి, జయకృష్ణ, కార్మిక శాఖ తరఫున ఎం.రామారావు, శ్రీనివాస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టి.అరుణ్తో నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్ చేయడం, మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి అంగీకరించారు. యాజమాన్యం వద్ద రాజా పెట్టిన ఎనిమిది డిమాండ్లలో ఏడు డిమాండ్లను అంగీకరించి బదిలీల విషయాన్ని రెండు రోజుల్లో లేబర్ కమిషనర్ వద్ద మాట్లాడనున్నట్లు యాజమాన్యం తెలిపింది. దీక్ష విరమణ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి యాజమాన్యం ఒప్పుకోవడంతో దీక్ష విరమణకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీఐటీయూ నాయకుడు టి.అరుణ్ అంగీకరించారు. దీంతో జక్కంపూడి రాజాకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, టి.అరుణ్కు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. వైద్య పరీక్షలు రెండో రోజుకు చేరడంతో వైద్యులు బీపీ, సుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరోనా పరీక్షలు జరిపారు. డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్, అనపర్తి ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, ధనలక్ష్మి, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన నేత పోలు కిరణ్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
సెంట్రల్ జైలులో 265 మందికి కరోనా!
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్లో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. సెంట్రల్ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్ సోకింది. పాజిటివ్ వచ్చిన జైల్ సిబ్బంది 24 మందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్ఎల్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. అయితే వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరారీ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేయడంతో (8 మంది బెయిల్పై విడుదలయ్యారు), మిగిలిన 10 మంది ఖైదీలను రాజ మహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్యతో పాటు భారీ స్థాయిలో బెడ్లు ఏర్పాటు చేయవలసి ఉంటుందని దీంతో ఖైదీలను సెంట్రల్ జైల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. -
నేటి నుంచి బెంగళూరుకు విమానం
మధురపూడి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన సర్వీసులు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసులు నిర్వహించనుంది. 6ఈ7231 నెంబర్ గల ఈ సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.35 గంటలకు బెంగళూరులో బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. 6ఈ7232 నెంబర్ గల సర్వీసు సాయంత్రం 6.00 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరుకు పయనమవుతుంది. ఉదయం 9.25 గంటలకు, రాత్రి 9.15 గంటలకు ఉన్న హైదరాబాద్ సర్వీసులు యథాతథంగానే కొనసాగుతాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్ ఆగస్టు 20వ తేదీ వరకూ ఇదేవిధంగా కొనసాగుతాయి. -
ఈ కుర్రాడు.. ఇక శతావధాని ఆదిత్యుడు
సాక్షి, రాజమహేంద్రవరం: లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది. ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ శతావధానంలోని అంశాలు మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు. 25 నిమిషాల్లో 75 పద్యాలు మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి. పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు. ‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్ దూరినభ్యాదతన్గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం ‘గారె’ను బాష్పముల్ కువలయాంగనకున్ కలుషమ్ము మీరగా ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై.. పండితుల ప్రశంసలు ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్ సందీప్ అసామాన్యమైన ప్రతిభ చూపాడు. – ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అత్యద్భుత ప్రతిభ లలిత్ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి. – మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం పద్యవిద్యలో లలిత్ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను. – చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత -
స్పోర్ట్స్ రాజధానిగా రాజమహేంద్రవరం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరం నగరం స్పోర్ట్స్ రాజధానిగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యెనెక్స్, సన్రైజ్ డాక్డర్ వైఎస్సార్– జక్కంపూడి రామ్మోహనరావు మెమోరియల్ 44వ ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్, జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2019 పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని, వారికి సరైన ప్రోత్సాహం ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తారని అన్నారు. మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఇటు విజయవాడ, అటు వైజాగ్ అభివృద్ధి చెంది, మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ స్పోర్ట్స్ హబ్గా మారడానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, బాయ్ కార్యదర్శి ఉమర్ రషీద్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ రఘు కిరణ్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, తూర్పు గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షురాలు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడాలి తనూజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకూ జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లాలో జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. -
చంద్రబాబుది అనవసర రాద్ధాంతం: సోము వీర్రాజు
దేవీచౌక్ (రాజమహేంద్రవరం): ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాజధాని పేరిట విఠలాచార్య సినిమా చూపి.. ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని రెండూ వేర్వేరు అంశాలని.. పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే రాజధాని అని.. దీనిపై చంద్రబాబు గగ్గోలు పెట్టడం అనవసరమన్నారు. చంద్రబాబు రూ.640 కోట్లు వెచ్చించి వర్షం వస్తే లీకయ్యే నిర్మాణాలు చేశారని దుయ్యబట్టారు. -
రాజమహేంద్రవరంలో నిధి అగర్వాల్ సందడి
-
విహంగమా.. ఎటు వెళ్లిపోయావమ్మా..
సాక్షి, రాజానగరం: ఓపెన్ బిల్ బర్డ్స్గా పిలిచే ఈ పక్షులు రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏటా జూన్, జూలై మాసంలో (తొలకరి చినుకులు పడే సమయం) క్రమం తప్పకుండా సైబిరీయా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదిగా ఇక్కడకు వచ్చిన ఈ పక్షులు గ్రామంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) ఆ పిల్ల పక్షులతో కలసి వేల కొలదిగా ఇక్కడ నుంచి తిరిగి పయనమవుతాయి. మళ్లీ జూన్, జూలై మాసం వచ్చే వరకు వీటి జాడ ఎవరికీ తెలియదు. పక్షుల జాడ లేక బోసిపోయిన ఊర చెరువు ఏమైందో ఏమో.. కాని ఈసారి ఏమైందో ఏమోగాని ఒక్కసారిగా మాయమైపోయి. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్లపై ఉండే ఈ పక్షులు తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగా రెండు నెలలు ముందే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం గ్రామస్తులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించే ఈ ప్రాంత రైతులు పక్షులు హఠాత్తుగా మాయం కావడంతో ఇది శుభకరం కాదంటూ సెంటిమెంటుగా ఫీలవులున్నారు. కొందరైతే ఇవి మాయమైన నెల రోజుల నుంచి మాకు ఆరోగ్యాలు కూడా బాగుండడం లేదంటున్నారు. ఎందుకంటే వీటిని పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. తమ తాతముత్తాల కాలం నాటి నుంచి ఈ విధంగా క్రమం తప్పకుండా వలస వచ్చే ఈ విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దులు ఉండవు. ఆకాశంలో విహరిస్తున్న పక్షి (ఫైల్) వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు అసలు అంగీకరించరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడేనంటారు. ఈ సమయంలో ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని తిరిగి వెళ్తున్నాయి కాబట్టి విదేశీ పక్షులనడం సరికాదంటారు. అందుకనే వాటిని పురిటికి పుట్టింటికి వచ్చే ఆడపడచుల్లా భావించి, ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసిన మాదిరిగా వాటిని కూడా చూస్తారేగాని చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షులు పెట్టే కీచుకీచు ధ్వనులను కూడా పిల్లల సందడిగానే భావిస్తారుగాని ‘ఇదేం గోలరా బాబూ’ అని ఈసడించుకోరు. గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే వాటిని జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. అసలు తమ గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక కారణంగానే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి ఉనికిని శుభకరంగా భావిస్తుంటారు. మృత్యు పాశాలవుతున్న విద్యుత్ తీగలు పుణ్యక్షేత్రం వాసులు తమ ఆడపడుచుల్లా చూసుకునే ఈ సైబీరియన్ పక్షులు మాయమవడానికి ఊరచెరువు పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు కారణమని కొంతమంది అంటుంటే, కాదు ఈ మధ్య భారీగా బాణసంచా కాల్చడంతోనే భయపడి వెళ్లిపోయాయని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా అవి స్వేచ్ఛగా విహరించేందుకు అనువైన వాతావరణం ఇక్కడ క్రమేణా కనుమరుగైపోతోందనేది వాస్తవం. ఎందుకంటే అవి విహరించే ఊర చెరువు చుట్టూ కంచి చెట్లు ఉన్నాగాని వాటి పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు వాటి పాలిట మృత్యు గీతాలను ఆలపిస్తున్నాయి. వాటి పాలిట మృత్యపాశాలైన హైటెన్షన్ విద్యుత్ తీగలు పక్షులు గాలిలోకి ఎగిరే సమయంలో ఆ తీగలకు తగులుకొని చాలావరకు చనిపోతున్నాయి. చెరువు పై నుండి హైటెన్షన్ వైర్లను వేయవద్దని స్థానికులు అడ్డుపెట్టిన విద్యుత్ అధికారులు వినలేదు. ఏటా వచ్చే ఈ విదేశీ విహంగాలకు ఈ విద్యుత్ తీగలు మృత్యు ద్వారాలవుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపి ఈ పక్షుల మనుగడకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. జిల్లాలో సైబీరియన్ పక్షుల రాకతో విశిష్టతను సంతరించుకున్న పుణ్యక్షేత్రంలో నేడు వాటి జాడ కానరావడం లేదు. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడకు వచ్చిన విదేశీ విహంగాలు మూడు నెలలు కూడా తిరక్కుండానే ఒక్కసారిగా ఎటో ఎగిరిపోయాయి. సాధారణంగా ఏటా కార్తికమాసం వెళ్లిన తరువాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులు, ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో ఆరోజ నుంచి తమకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తున్నాయని కొంతమంది గ్రామస్తులు సెంటిమెంటుగా అంటున్నారు. అటవీ శాఖ పట్టించుకోవడం లేదు అటవీ శాఖ మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. విదేశీ విహాంగాల కోసం ఒక బోర్డును ఏర్పాటుచేసి, అంతటితో తమ పని అయిపోయినట్టుగా ఆ శాఖ అధికారులు ఉన్నారు. రక్షణ లేని స్థితిలో పక్షులు కూడా ఇక్కడ ఇమడలేకపోతున్నాయి. అందుకనే అకస్మాత్తుగా వెళ్లిపోయాయి. – పేపకాయల ఈశ్వరరావు బాణసంచా కాల్పులే కారణం గ్రామంలో ఒక సందర్భంలో భాగంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఆ కాల్పులకు బెదిరిపోయిన పక్షులు ఇక తిరిగి రాలేదు. గతంలో కూడా ఈ విధంగా ఒకసారి జరిగింది. మళ్లీ వచ్చే ఏడాది వరకు వాటి జాడ కనపడదు. – కర్రి వీరబాబు కరెంటు తీగలకు చనిపోతున్నాయి కరెంటు తీగల వల్ల వెళ్లిపోయాయి అనుకుంటున్నాం. పైకి ఎగిరేటప్పుడు కొన్ని చనిపోతున్నాయి. ఈ తీగలను మార్చమని ఎన్నిమార్లు చెప్పినా ఎవరు వినవడం లేదు. – ఈలి శ్రీను అపురూపంగా చూసుకున్నాం ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు, ఎంతో అపురూపంగా చూసుకుంటాం, అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఎందుకు వెళ్లిపోయాయో తెలీడం లేదు. – నరాల రాము -
అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా జగన్ పాలన
సాక్షి, రాజమహేంద్రవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమోదించి నేటికి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ముందుగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, ఆయనకు రాజ్యాంగ స్ఫూర్తిపై మాట్లాడే నైతికత లేదన్నారు. గడిచిన ఆర్నెల్లలో 1.40 లక్షల ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అందులో కనీసం పదిశాతం ఉద్యోగాలనైనా తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇవ్వలేదన్నారు. అమెరికాలో పుట్టి ఉంటే బాగుండును, దళితులుగా ఎవ్వరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజ్యాంగం గురించి మాట్లాడతారని ప్రశ్నించారు. పుట్టిన రోజుకు, వర్ధంతికి తేడా తెలియన లోకేష్ ఇంట్లో కూర్చుని రాజ్యాంగం గురించి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా పెరిగితే ఒక్క మన రాష్ట్రంలోనే పెరిగినట్టు గగ్గోలు పెట్టడం చంద్రబాబుకి, లోకేష్కే చెల్లిందన్నారు. ‘లోకేష్ను సూటిగా అడుగుతున్నా.. మీ హెరిటేజ్లో ఉల్లి రేటు ఎంత ఉందో చెబుతావా? ఎంతకు కొని వినియోగదారులకు ఎంతకి అమ్ముతున్నారో చెప్పగలవా?’ అన్నారు. ఉల్లి ధరలు పెరిగితే వాటిని ప్రజలకు అందించటానికి రైతు బజార్లులో కేజీ రూ. 25 విక్రయించడం కనబడటం లేదా అని అడిగారు. అమరావతిలో రాజధానిని నిర్మించినట్టు, దానిని మేము పాడు చేస్తున్నట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. అసలు అమరావతిలో రాజధాని ఎక్కడ ఉందని, అక్కడ ఉన్నదంతా గ్రాఫిక్స్ కదా అని వ్యాఖ్యానించారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్స్ కట్టి 7 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. మద్యంపై ఒక స్టాండ్ లేకుండా చంద్రబాబు అండ్ కో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు శ్రిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాపారాయుడు, మిందే నాగేంద్ర పాల్గొన్నారు. -
కడవరకూ జగన్తోనే ఉంటాం: ఎంపీ భరత్రామ్
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అన్ని విభాగాల్లో శిథిలావస్థకు చేరిన గదులను చూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్థన్ను కలిసి ట్రామాకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. పేపర్మిల్లు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నుంచి సీఎస్ఆర్ నిధులను సేకరించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆసుపత్రి ఫొటోలు తీయించి అభివృద్ధి చేసిన తరువాత తిరిగి ఫొటోలు తీస్తామన్నారు. కడవరకూ జగన్తోనే ఉంటాం... వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీకి టచ్లో ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటారన్నారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారక్ప్రసాద్, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, సివిల్ సర్జన్లు కోటేశ్వరరావు, పద్మావతి, ప్రదీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సెగ్మెంట్కు మొబైల్ వాటర్ ట్యాంక్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ వాటర్ట్యాంకు ఉండే బాగుంటుందని దానిపై ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్రామ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మార్గాని ఎస్టేట్స్లో ఆయన కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్పై పార్లమెంటు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామంలో మంచినీటి సమస్య వస్తే నీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ట్యాంకులు సులువుగా చిన్న వీధులలో మలుపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నారు. వాటర్ హెడ్ ట్యాంకులు పైపులైను నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలని, వాటికి కొంత సమయం పడుతుందని ఈలోపు వాటర్ ట్యాంకులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు ఈ విషయంపై ఏవిధంగా చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీ ఆరాతీయగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని డీఈలు తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలకు పరిపాలనా పరమైన ఆమోదాలు వచ్చాయన్నారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని డీఈలు ఎస్.రవికుమార్, సీహెచ్ రమేష్, పి.శ్రీనివాస్, ఎంఎస్ స్వామి పాల్గొన్నారు. -
బెంబేలెత్తిస్తున్న బ్లేడ్ బ్యాచ్
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో బ్లేడ్బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రజలపై దాడులు చేసి వారి నుంచి సొమ్ములు కాజేస్తున్న ఈ బ్యాచ్ ఇప్పుడు పోలీస్ సిబ్బందిపై కూడా దాడులు చేస్తోంది. నగరంలో బ్లేడ్ బ్యాచ్ యువకులు రెండు ముఠాలుగా ఏర్పడి హల్చల్ చేస్తున్నారు. ఆనంద్ నగర్, రాజేంద్ర నగర్, క్వారీ ప్రాంతం, కంబాల చెరువు, ఆదెమ్మదిబ్బ తదితర ప్రాంతాలలో 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులు బ్లేడ్ బ్యాచ్లుగా ఏర్పడ్డారు. గంజాయి, మద్యం తాగి ఆ మత్తులో సామన్యులపై దాడులు చేసి సొమ్ము, ఇతర వస్తువులు కాజేస్తున్నారు. ఇటీవల ఆనంద్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ను అర్ధరాత్రి బెదిరించి రూ.15 వేలు విలువైన సెల్ఫోన్ను చోరీ చేశారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి చోరీకి పాల్పడుతున్నారు. పోలీసుల పైనా దాడులు గతంలో త్రీటౌన్ ఎస్సైగా విధులు నిర్వహించిన సంపత్పై బ్లేడ్ బ్యాచ్ యువకులు ఇటుకలతో దాడి చేశారు. ఈ నెల 21వ తేదీ ఆనంద్ నగర్ ఆటోస్టాండ్ వద్ద స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై నడిరోడ్డుమీద దాడి చేశారు. అక్కడి ఆటోడ్రైవర్లు వారిస్తున్నప్పటికీ వీరంగం సృష్టించారు. కొద్దిసేపటికి అదే ప్రాంతంలో కత్తులతో హడావుడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆనంద్ నగర్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సారా వ్యాపారం, వ్యభిచారం, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ అండదండలు బ్లేడ్బ్యాచ్ ముఠాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్న వెంటనే.. వారిని వదిలెయ్యాలని రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎప్పుడూ గంజాయి, మద్యం మత్తులో ఉండే బ్లేడ్బ్యాచ్ సభ్యులు అవసరమైతే హత్యలు కూడా చేసేందుకు వెనుకాడరు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం స్థానికులు సైతం హడలిపోతున్నారు. -
ఎమ్మెల్యే ఫిర్యాదుతో అవినీతి డొంక కదిలింది!
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు బాధ్యులను గుర్తించడంలో ప్రభుత్వం వేగం పెంచింది. రైతుల రెక్కల కష్టంతో లాభాల బాటలో నడుస్తున్న బ్యాంకు సొమ్మును అడ్డగోలుగా దుబారా చేసిన తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గడచిన ఐదేళ్ల డీసీసీబీ పాలనతోపాటు పొడిగించిన రెండేళ్ల ప్రత్యేక పాలనలో అవకతవకలు భారీగా జరిగినట్టు ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో స్పష్టమైంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఫిర్యాదుతో డీసీసీబీలో కదిలిన అవినీతి డొంక చాంతాడును మించిపోతోంది. ఎమ్మెల్యే పది అంశాలపై చేసిన ఫిర్యాదులపై పరిశీలన ప్రారంభిస్తే అవి చివరకు 33 అంశాలకు చేరుకున్నాయి. డీసీసీబీలో జరిగిన ఆర్థిక అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు విభాగాల్లో అవసరానికి మించి అదనంగా లక్షలు ఖర్చు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల సొమ్మును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశారన్నది ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదిక సారాంశంగా ఉంది. సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పాండురంగారావు, కాకినాడ డివిజనల్ సహకార అధికారి కె.పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల బృందం శాఖాపరమైన విచారణ నిర్వహించింది. ఏడేళ్ల పాలనపై ప్రాథమిక నివేదిక డీసీసీబీ పాలకవర్గం గడువు 2018 ఫిబ్రవరి 17తో ముగిసిపోయింది. కానీ అప్పటి పాలకుల ఆదేశాల మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ పాలకవర్గ పదవీ కాలాన్ని రిఫరెన్స్ నంబర్ 1447/2018–సీ ద్వారా 2018 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఒకసారి, అదే ఏడాది ఆగస్టు 12 వరకూ రెండోసారి, 2019 ఫిబ్రవరి 12 వరకూ మూడోసారి పొడిగించారు. పొడిగింపుతో కలిపి డీసీసీబీ పాలకవర్గం మొత్తం పాలనా కాలంలో 45 పాలకవర్గ సమావేశాలు నిర్వహించి 881 తీర్మానాలను ఆమోదించింది. మొత్తం పాలనాకాలంలో ఆమోదించిన తీర్మానాలపై విచారణాధికారుల బృందం డీసీసీబీలో రేండమ్గా (మచ్చుకు) కొన్ని విభాగాలు, కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పరిశీలించగా గుర్తించిన ఆర్థిక అవకతవకలను ప్రభుత్వానికి నివేదించారు. చైర్మన్ వరుపుల రాజా రుణాల కోసం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ, హెచ్ఆర్డీ, ఆడిట్ ఇలా మొత్తంగా ఆరు కమిటీలను అధికార, అనధికారులతో ఏర్పాటు చేశారు. ఆ తరువాత విడుదలైన రుణాలు, ఉద్యోగులకు 40 రోజుల ఎక్స్గ్రేషియా తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని ప్రాథమిక విచారణ నిగ్గు తేల్చింది. ఈ క్రమంలో గడచిన ఐదేళ్ల పూర్తి కాలంతోపాటు పొడిగించిన రెండు సంవత్సరాల కాలంలో డీసీసీబీలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల రెక్కల కష్టాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేసిన వ్యవహారాలపై ప్రాథమిక విచారణ నివేదిక చేతికొచ్చాకనే 51 విచారణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విచారణ షురూ అమలాపురం డివిజనల్ సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ విచారణాధికారిగా బాధ్యతలు తీసుకొని పక్షం రోజులైంది. గత పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సోదాహరణంగా విచారణ జరుగుతోంది. గుర్తించిన అవకతవకలను ఎప్పటికప్పుడు సహకారశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఓ పక్క 51 విచారణ చురుగ్గా జరుగుతుండగా మరోవంక ఇవే అంశాలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను స్టేట్ ఇంటెలిజెన్స్ తెలుసుకుంటోంది. ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఒక బృందం రెండు రోజుల కిందటే రంగంలోకి దిగింది. ఆ బృందం ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తోంది. అవకతవకలకు ఆస్కారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పీఏసీఎస్లు, డీసీసీబీలో పలు సెక్షన్ల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైందని విశ్వసనీయ సమాచారం. అవకతవకలపై సహకార అధికారులు తయారుచేసిన ప్రాథమిక నివేదికపై కూడా ఇంటెలిజెన్స్ కూపీ లాగుతోంది. ఇతర విచారణలతో మాకు సంబంధం లేదు సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుతున్న 51 విచారణకు మిగిలిన విభాగాలు చేసే విచారణలతో సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రతి అంశంపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఇంటిలిజెన్స్ వంటి ఇతర విచారణలు మా పరిధిలోకి రావు. వాటితో సంబంధం లేకుండా మా విచారణ స్వతంత్రంగా జరుగుతుంది. – బి.దుర్గాప్రసాద్, డివిజినల్ కో ఆపరేటివ్ అధికారి, అమలాపురం -
శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాను మరిపించే సీన్!!
శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో సీన్లా ఆ మెడికల్ షాపునకు ‘ఏసీఈ( ఏస్) ఆసుపత్రి అని బోర్డు తగిలించేశారు. ఏడు పడకల ఆసుపత్రిగా బిల్డప్ చేశారు. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల సహాయంతో రోగులను ఆసుపత్రికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. జూనియర్ డాక్టర్లను ఆసుపత్రికి తీసుకొచ్చి.. అన్ని రకాల వైద్యసేవలు అందిస్తున్నామని హడావుడి చేశారు. ‘మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.వెయ్యి గిఫ్ట్ కార్డు, పది మందికి రూ.2 వేలు, 15 మందికి రూ.3 వేలు, 25 మందికి రూ.6 వేలు గిఫ్ట్ కార్డు ఇస్తాం’ అంటూ ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటనలు వాట్సాప్లలో షేర్ చేశారు. ఇది గమనించిన జనం జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తనిఖీ చేశారు. ఆసుపత్రి పేరుతో వారు చేస్తున్న కార్యకలాపాలను చూసి కంగుతిన్నారు. సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం ): డిగ్రీ చదివి, మెడికల్ షాపు నిర్వహించుకునే రామచంద్రన్, రాజేష్లు రాజమహేంద్రవరం సీతం పేటలోని ఏసీఈ(ఏస్)ఆసుపత్రిని ప్రారంభించారు. వీరు జూనియర్ డాక్టర్లు పి.నిఖిల్, ఎం.రాజేంద్రలతో కలసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఏడు పడకల ఆసుపత్రి అంటూ ఒక షాపులో ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే నిర్వహణకు సిద్ధమయ్యారు. మెడికల్ షాపు నిర్వహించే వారు ఏకంగా డాక్టర్ల అవతారం ఎత్తడంతో స్థానికులు ఈ ఆసుపత్రి వ్యవహారాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు రంగంలోకి దిగి ఆసుపత్రిని తనిఖీ చేశారు. డాక్టర్కు చెల్లించే నెల జీతం రూ.1.50 లక్షలు ఏ విధంగా చెల్లిస్తున్నారో కూడా సరైన రికార్డులు వారు నిర్వహించడం లేదు. అనుమతి లేకుండా ఆసుపత్రి ఏర్పాటు జిల్లాలో ఏవిధమైన క్లినిక్లు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలన్నా జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్హెచ్ఓ) అనుమతి తప్పనిసరి. ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు, రోగులకు అందించే వైద్య సేవలు, వైద్య పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. వైద్య అధికారుల నుంచి ఏవిధమైన అనుమతులు లేకుండానే ఏసీఈ(ఏస్) ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటనలు ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యం రోగుల చికిత్సకు ఉపయోగించే పరికరాలేవీ లేకుండానే ఆసుపత్రిని నిర్వహించడంపై వైద్యాధికారులే అవాకయ్యారు. అనుభవం లేకుండానే ఆసుపత్రి నిర్వహించి కోట్లకు పడగలెత్తాలనే లక్ష్యంతో సేవా రంగాన్ని వ్యాపారరంగంగా మార్చారంటూ వైద్య మండలి చైర్మన్ సాంబశివారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిని సీజ్ చేశాం ఈ ఆసుపత్రి నిర్వహణకు అనుమతి లేదు. రికార్డులూ సక్రమంగా లేవు. ఆసుపత్రి నిర్వహణ వ్యాపార దృక్పథంతో జరుగుతోంది. సరైన మౌలిక సదుపాయాలు, రోగులకు వైద్యం అందించే పరికరాలు లేకుండానే ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర వైద్యాధికారులకు నివేదిక అందిస్తున్నాం. – డాక్టర్ టి. రమేష్ కిషోర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి -
‘మాటపై నిలబడి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా’?
రాజమహేంద్రవరం సిటీ: ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వంద రోజుల శిక్షణ పొందిన ముస్లిం మహిళలకు కుట్టుమెషిన్ల పంపిణీ వ్యవహారం వైఎస్సార్ సీపీదే తప్ప ప్రభుత్వానిది కాదని వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా అధ్యక్షుడు ఎండీ కరీంఖాన్ అన్నారు. ఈ మెషీన్ల పంపిణీ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని పిలువలేదంటూ టీడీపీకి చెందిన ముస్లిం నేతల విమర్శలను ఆయన ఖండించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనారిటీ సంస్థ ద్వారా ఈ మెషీన్లు మంజూరైనట్టు చెప్పారు. ఆ మెషీన్లు పాడయ్యే పరిస్థితి రావడంతో ప్రముఖులతో పంపిణీ తామే చేపట్టామన్నారు. ఎమ్మెల్యే భవాని అంటే గౌరవం ఉందని, వైఎస్సార్ సీపీకి చెందిన విషయం కావడంతో ఎమ్మెల్యేను ఆహా్వనించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారని, అయితే జీఓలే నిధులు మంజూరు కాలేదన్నారు. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో చెబితే ముస్లిం సంక్షేమానికి ఖచ్చు చేస్తామన్నారు. టీడీపీ పాలనలో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. మాటపై నిలబడి సుభాన్ రాజకీయాల్లోంచి తప్పుకుంటారా? కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సోషల్ మీడియాలో టీడీపీ నాయకుడు షేక్ సుభాన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి రాజకీయాల నుంచి ఆయన వైదొలగాలని అన్నారు. సుభాన్ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలో ముస్లింల ఆస్తులు కారుచౌకగా లీజుకు ఇచ్చిన టీడీపీ నాయకులు ఆర్థికంగా ఫలితాలు పొందారన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ మైనార్టీ సెల్ నాయకుడు మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం పురస్కారం పేరు మార్పు విషయంలో అధికారుల అత్యుత్సాహానికి పాల్పడ్డారనే విషయం సీఎం గుర్తించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలు సీఎం వెన్నంటి ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేసి ఉన్న పరువు పోగొట్టుకోవద్దని సలహా ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ముస్లిం నాయకులు సయ్యద్ రబ్బాని, నయూమ్ భాయ్, హసన్, సయ్యద్ మదీనా, గౌస్, ఆరిఫ్ ఉల్లాఖాన్, షేక్ మస్తాన్, అమనుల్లా బేగ్, సయ్యద్, ఈసా మొగల్, అల్తాఫ్, షరీఫ్ పాల్గొన్నారు. -
రాజమహేంద్రవరంలో డీసీసీబీ లీలలు
టీడీపీ హయాంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రైతులకు బదులుగా తన అనుయాయులకు ఆర్థిక వనరుగా మారింది. రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి తమ విలాసాలకు వాడుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి , రాజమహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను టీడీపీ సర్కారు హయాంలో జిల్లా తెలుగు తమ్ముళ్లు బాగా వంట పట్టించుకున్న ట్టున్నారు. సీఎం స్థాయిలో చంద్రబాబే విమానయానాలతో ప్రజా సొమ్మును దుబారా చేస్తుంటే తాము తక్కువ తిన్నామా అన్నట్టు ఆ పార్టీ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా వ్యవహరించిన వరుపుల రాజా రైతుల సొమ్ము ఇష్టానుసారంగా దుబారా చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటిని నియంత్రించాలి్సన డీసీసీబీకి గతంలో సీఈఓగా పనిచేసి రిటైరయిన హేమసుందర్, ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు వంతపాడారు. డీసీసీబీపై ఎంతో నమ్మకం ఉండబట్టే జిల్లాలో లక్షలాది మంది రైతులు రూ.1000 కోట్లు డిపాజిట్లు చేశారు. కేవలం ఐదేళ్ల కాలంలో తమ నమ్మకాన్ని వమ్ము చేసి బ్యాంక్పై విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించారని తాజాగా వెలుగుచూస్తున్న ఉదంతాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలాసాలు, విందులు, ఆతి«థుల రాచమర్యాదల కోసం తమ కష్టాన్ని అడ్డుగోలుగా లక్షల రూపాయలను బొక్కేశారని రైతులు మండిపడుతున్నారు. ప్రశ్నించేవారే లేరన్న ధైర్యంతో అడ్డగోలుగా సాగించిన అక్రమ బాగోతాలపై రాష్ట్ర ప్రభుత్వం 51 ఎంక్వైరీ వేసిన సంగతి తెలిసిందే. విచారణాధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్ విచారణ ప్రక్రియను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో డీసీసీబీలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ దేవాలయం వీధిలో కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అడ్డగోలుగా అసోసియేషన్కు కట్టబెట్టేసిన వ్యవహారం ‘సాక్షి’ ఈ నెల 29వ తేదీన ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇంచుమించు ఇటువంటి వ్యవహారమే మరొకటి రాజమహేంద్రవరంలో వెలుగులోకి వచ్చింది. నిబంధనలన్నీ తుంగలో... రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్ అంటే నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. సినిమా థియేటర్లు, హోటళ్లు, బ్యాంకులు తదితర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర బిందువు. అటువంటి సెంటర్లో డీసీసీబీకి ఎప్పుడో తొలినాళ్లలో ఏర్పాటు చేసిన బ్రాంచి ఉంది. ఈ భవంతికి వందేళ్ల చరిత్ర ఉంది. ఈ పురాతన బ్రాంచి కార్యాలయాన్ని ఆనుకుని గత పుష్కరాల సమయంలో లెక్కాపత్రం లేకుండా అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించారు. అసలు ఎక్కడైనా ఒక లక్ష రూపాయల భవనం నిర్మించాలంటే ముందుగా ప్రతిపాదనలు, అంచనాలు, టెండర్లు...బిల్లులు...ఇలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. కోటి రూపాయలు విలువైన భవన నిర్మాణమైనా ఇదే విధానాన్ని పాటించాలి. కానీ డీసీసీబీలో మాత్రం వీటన్నింటినీ బుట్టదాఖలు చేసి అత్యంత విలాసవంతమైన భవంతిని నిర్మించేశారు. సుమారు రూ.కోటిన్నరతో ఈ విలాసవంతమైన భవనాన్ని పుష్కరాల సమయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే అ«ధికార పార్టీ ప్రతినిధుల విడిది కోసం అగమేఘాలపై నిర్మించేశారు. రెండు అత్యంత ఖరీదైన సూట్లు ఉన్నాయి. ఒక సూట్ చైర్మన్కు, మరొకటి డీసీసీబీ సీఈఓకు. ఒక పెద్ద విలాసవంతమైన హాలు. పైన ఏడు గదులు నిర్మించారు. సహకార సంఘాల చట్టం లేదా, స్వయం ప్రతిపత్తి కలిగిన డీసీసీ బ్యాంక్ మనుగడ పూర్తిగా రైతుల కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి బ్యాంకు సొమ్ములతో భవనాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. పుష్కరాలు వస్తున్నాయనగా హడావుడిగా నిర్మించిన భవనం ఆ సమయంలో పలు జిల్లాల నుంచి వచ్చే టీడీపీ నేతల కోసం బాగా ఉపయోగపడింది. 2015లో గోదావరి పుష్కరాల్లో వినియోగంలోకి వచ్చిన ఈ భవంతికి ఇప్పటికీ డీసీసీబీలో బిల్లులు లేవని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా సహకార యంత్రాంగం ఇచ్చిన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేడయం గమనార్హం. భవనం నిర్మాణం పూర్తి చేసి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఏ ఒక్క దానికీ బిల్లులు లేకపోవడాన్ని పరిశీలిస్తే రైతుల సొమ్ము ఏ స్థాయిలో దుబారా జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసినతరువాత టెండర్లు పిలిచి...పద్ధతి ప్రకారం తక్కువకు కోట్చేసే కాంట్రాక్టర్కు పనులు అప్పగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. త్రిమెన్ కమిటీ పేరుతో సొంత వారికే నిర్మాణ పనులు అప్పగించి లక్షలు పక్కదోవపట్టించారని ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికలో ఉంది. పార్టీ తరఫున చైర్మన్గా ఎన్నికై ఐదేళ్లు కాలమే పదవిలో ఉంటారు. కానీ డీసీసీబీకి సీఈఓ పోస్టు శాశ్వతం. రైతులకు చెందిన వెయ్యి కోట్ల రూపాయల డిపాజిట్లు కలిగిన డీసీసీబీలో కీలకం సీఈఓ. ఈ విషయాన్ని కూడా పెడచెవిన పెట్టడం విమర్శలపాలవుతోంది. అధికార పార్టీ పెద్దలు పైన ఉన్నారనే ధైర్యంతో సీఈఓ, ఇతర అధికారులు నిబంధనలను గాలికొదిలేసి భవన నిర్మాణాన్ని అడ్డగోలుగా చేపట్టి లక్షలు మింగేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై నిగ్గుతేల్చాల్సిన గురుతర బాధ్యత విచారణ అధికారిపై ఉంది. -
కదులుతున్న అవినీతి డొంక
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల ఏలుబడిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వెచ్చించిన వ్యవహారాలపై సహకార చట్టంలోని కీలకమైన ‘51’ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని డీసీసీబీ వ్యవహారాలపై ఆరోపణలు రావడాన్ని వ్యవసాయ, సహకారశాఖా మంత్రి కురసాల కన్నబాబు కూడా తీవ్రంగా పరిగణించారు. రైతుల పక్షాన నిలవాలి్సన డీసీసీబీ యంత్రాంగం, ప్రతినిధులు సహకార స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని ఉపేక్షించరాదని భావిస్తున్నారు. అవినీతి డొంక కదిలిందిలా... డీసీసీబీలో గడచిన ఐదేళ్లలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ప్రాథమిక నివేదికను పరిశీలించాక డీసీసీబీ వ్యవహారాలపై విచారణాధికారిగా అమలాపురం డివిజనల్ సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. సహకార శాఖ కమిషనర్ వాణీమోహన్ ఈ మేరకు విచారణాధికారి నియామక ఆదేశాలు జిల్లా సహకార అధికారికి జారీ చేశారు. దుర్గాప్రసాద్ విచారణ రెండు రోజుల కిందటే మొదలు పెట్టాల్సి ఉంది. ఈ నెల 25నే విచారణ అధికారి నియామకం జరిగినా 27వ తేదీ అమావాస్య కావడంతో మంచి ముహూర్తం చూసుకుని విచారణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. విచారణ మొదలు పెట్టిన తేదీల దగ్గర నుంచి ఆరు నెలల కాలంలో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2013 నుంచి 2019 వరకూ విచారణ... గత పాలక వర్గ పదవీకాలం 2013 ఫిబ్రవరి నుంచి 2019 మార్చి వరకూ జరిగిన కార్యకలాపాలపై నిశిత పరిశీలన జరిపి అన్ని లావాదేవీల గుట్టును ఈ విచారణ ద్వారా రట్టు చేయాల్సిన బాధ్యత విచారణాధికారికి ప్రభుత్వం అప్పగించింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, తొలి సీఈఓ హేమసుందర్ (రిటైర్ అయ్యారు), ప్రస్తుత సీఈఓ మంచాల ధర్మారావు హయాంలో నడిచిన ప్రతి కార్యకలాపాన్నీ విచారించి నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ‘సాక్షి’లో మంగళవారం ‘ఇదేమి సహ‘కారం’ శీర్షికన ప్రచురితమైన కథనం కూడా విచారణలో ఒక అంశంగా తీసుకుంటున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర సహకారశాఖ కమిషనర్కు నివేదిక అందిస్తారు. ఈ విచారణలో అవినీతి రుజువైతే చట్టపరమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని భావిస్తున్నారు. ప్రాథమిక నివేదికతో కదిలిన ప్రభుత్వం... డీసీసీబీలో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకలపై జిల్లా సహకార యంత్రాంగం అందజేసిన ప్రాథమిక నివేదిక చూసి సహకార ఉన్నతాధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అడ్డగోలు కొనుగోళ్లు, బిల్లులు లేకుండా భవంతుల నిర్మాణం, నిబంధనలు తుంగలోకి తొక్కి విహార యాత్రలు, స్టడీ టూర్ల పేరుతో విచ్చలవిడిగా రైతుల లాభాల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేయడం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం వీటన్నింటినీ నిగ్గు తేల్చాలంటే 51 విచారణ ఒక్కటే మార్గమని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా సహా పలువురు ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ యాత్రలు కూడా డీసీసీబీ నుంచి డబ్బులు భారీగా డ్రా చేయడం, కార్లు కొనుగోళ్లు, కాకినాడ దేవాలయం వీధిలోని డీసీసీబీ బ్రాంచికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన స్థలం బ్యాంకు ఉ ద్యోగుల సంఘానికి అప్పనంగా కట్టబెట్టడం తది తర విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. -
విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం
సాక్షి , రాజమహేంద్రవరం: యువతను సన్మార్గంలో పెట్టి సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాల్సినా గురువులు గాడి తప్పుతున్నారు. కొందరి వక్రబుద్ధి మొత్తం విద్యావ్యవస్థకే కళంకం తెచ్చిపెడుతోంది. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందామని ఎన్నో ఆశలతో వందల కిలోమీటర్ల దూరం నుంచి తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చే విద్యార్థినులకు మనో ధైర్యం నింపాల్సిన బాధ్యత గురువులపై ఉంది. అటువంటి వారే ఇంటర్నల్ మార్కులను ఆసరాగా చేసుకుని బరితెగించి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగడం జుగుప్సాకరంగా మారింది. వీటిని సంస్కరించాల్సిన పెద్దలు పాలకమండళ్ల పీఠాలపై కూర్చొనికూడా అరికట్టలేకపోతున్నారు. కాకినాడ జేఎన్టీయూ, రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నతమైన విద్య అందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఆవు చేలో మేస్తే చందంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు ఏకంగా సహచర ఉపాధ్యాయినులపైనే వేధింపులకు ఒడిగట్టడం విడ్డూరం. ఈయనపై కేసు పెట్టినా గత టీడీపీ సర్కార్లో కేసును నీరుగార్చేయడం తెలిసిందే. ఈ బాగోతాన్ని ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వైఎస్సార్కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని సస్పెండ్ చేసింది. జేఎన్టీయూకేలో... గత ఏడాది కాకినాడ జేఎన్టీయులో కూడా ఇప్పుడు నన్నయ వర్సిటీలో జరిగినట్టే ఎంటెక్ విద్యార్థినులపై ప్రొఫెసర్ కె.బాబులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనమైంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఒక మంత్రి అండదండలతో టీడీపీ నేతలు ప్రొఫెసర్ కు అనుకూలంగా పావులు కదిపారు. చివరకు విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో వర్సిటీ ఐఎస్టీ డైరెక్టర్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును తప్పిం చారు. ఆ సంఘటన మరువకుండానే నన్నయలో ఇంగ్లిషు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సూర్యరాఘవేం ద్ర లైంగిక వేధింపుల బాగోతం సంచలనమైంది. విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాయడం, ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో తీవ్ర సంచలనమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను విచారణకు పంపించారు. ఇంగ్లిషు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులను స్పెషల్ క్లాసుల పేరుతో బలవంతంగా రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్కు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ రాఘవేంద్రను సస్పెండ్ చేయడానికి పాలకమండలి మీనమేషాలు లెక్కించడం విమర్శలపాలైంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థినులు నేరుగా సీఎంకు లేఖ రాసుకున్నా, రాఘవేంద్ర నిజస్వరూపం వర్సిటీలో చాలా మందికి తెలిసినా.. చర్యలకు వెనుకాడటం గమనార్హం. ఆంధ్ర మహిళా ఫో రం జోక్యం తరువాతనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలు వడ్డాయి. గురువారం వరకూ నిందితుడ్ని అరెస్టు చేయకుండా వదిలేయడం తదితర పరిణామాలు మేధావి వర్గాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రమహిళ ఫోరం చొరవ తీసుకోకుండా, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు జోక్యం చేసుకోకుండా ఉండిఉంటే రాఘవేంద్ర అకృత్యాలు వర్సిటీ కాంపౌండ్ గేటు దాటి బయటకు వచ్చేవే కావని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఓ ఎత్తైతే రాఘవేంద్రపై సమగ్ర విచారణ కోసం నియమించిన హైపవర్ కమిటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అనుబంధంగా ఉన్న కాకినాడ పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు టీచింగ్, ఇద్దరు నాన్టీచింగ్, ఇద్దరు ఎన్జీఓలతో కలిపి ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఎన్జీఓలు మినహాయిస్తే మిగిలిన ఐదుగురు వర్సిటీలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ఇటువంటి వ్యవహారాల్లో ఏర్పాటయ్యే ఈ తరహా కమిటీల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే విశ్వా సం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. ఎం దుకంటే విచారణ అనంతరం కమిటీలో మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా నివేదిక రూపొం దుతుందనేది బహిరంగ రహస్యమే. అందునా ఏడుగురు సభ్యులలో ఐదుగురు సభ్యులు వర్సిటీ ఉద్యోగులే కావడం గమనార్హం. కేవలం ఇదే కారణంతో రాజమహేంద్రవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి హైపవర్ కమిటీ నుంచి వైదొలగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చర్యలపై పలు సందేహాలు రాఘవేంద్ర లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆంధ్రమహిళా ఫోరం వర్సిటీలోకి ప్రవేశించక ముందు, ఆ తరువాత పరిణామాలను బేరీజు వేసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న విచారణ పలు సందేహాలకు తావిస్తోంది. ఇందుకుతోడు రాఘవేంద్రపై ‘ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఎ’ ప్రకారం కేసు నమోదుచేసి ఉంటే చర్యలు తీవ్రంగా ఉండేవని రాష్ట్ర బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడుతున్నారు. అటువంటి చర్యల ద్వారా మాత్రమే వర్సిటీలో ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టవచ్చునంటున్నారు. ఇదిలా ఉండగా, వర్సిటీలో గురువారం నాడు చోటుచేసుకున్న సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి. వర్సిటీ నుంచి సమాచారం బయటకు ఎలా పోతుందనే అంశం అంతర్గత సమీక్షలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇద్దరు అధ్యాపకురాలు తప్పుపట్టారని విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థినులతో రాఘవేంద్ర అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలకు తామే ప్రత్యక్ష సాక్షులమని వివరించడంతో అధికారులు మిన్నకుండిపోయారని సమాచారం. అప్పుడు జేఎన్టీయూకేలో, ఇప్పుడు నన్నయలో అయినా నిష్పక్షపాత విచారణ ద్వారా విద్యార్థినుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రభుత్వ ప్రయత్నాలకు విశ్వవిద్యాలయాల పాలకమండళ్ల ప్రతినిధులు కాస్త మానవతాదృక్పథంతో సహకరించాల్సి ఉంది. ఈ తరహా వ్యవహారాలు తలెత్తినప్పుడు గతంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బయటి వర్సిటీ ప్రొఫెసర్తో కమిటీ వేయడం లేక, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించారు. వర్సిటీలపై మరింత నమ్మకం పెరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత పాలకమండళ్లపై ఉంది. కంచే చేను మేస్తే? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ...ఇదీ మన సంప్రదాయం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని ఎంతో నమ్మకంతో పాఠశాలలకు, కళాశాలలకు పంపుతారు. గురువే కీచకునిగా మారితే, ఇక విద్యార్థినులు తమ సమస్యలçను ఎవరితో చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ఎవరు దిక్కు? విద్యాసంస్థలలో నిఘా మరింత పెంచాలి. ఇటీవల నన్నయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికే మచ్చ తెచ్చేతీరులో ఉన్నాయి. పరిస్తితిని అదుపుచేయకపోతే, విద్యావ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితులు తలెత్తవచ్చు. – ఎం.ఉమాదేవి, ప్రిన్సిపాల్, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా డి.ఎడ్.కళాశాల విచక్షణతో కూడిన కోరికలు మాత్రమే ఉండాలి మానవునికి కోరికలు ఉండాలి, కానీ అవి విచక్షణతో కూడినవై ఉండాలి. విద్యాలయాలలో ఇటువంటి కీచకులు తరచుగా కనిపిస్తున్నారు. వీరిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇలాంటివారికి వేసే శిక్షలు కఠినంగా ఉండాలి. అప్పుడే మరో కీచకుడు తయారవకుండా ఉంటాడు. – పి.శ్యామ, వైస్ ప్రిన్సిపాల్, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ గురువులు యోగా,మెడిటేషన్ తప్పనిసరిగా అలవరచుకోవాలి మానవునికి జీవులలోకెల్లా భిన్నంగా విచక్షణాజ్ఞానాన్ని ప్రకృతి ప్రసాదించింది. ఆ విచక్షణను చదువుకున్న విద్యావంతులే మంచికి ఉపయోగించకపోవటం విచారకరం. మానవుడు వివేకవంతంగా నడవాలంటే యోగా, మెడిటేషన్లు అలవరచుకోవాలి. వీటితోపాటు ఆత్మశుద్ధి కలగటానికి దైవమార్గాన్ని అలవరచుకోవాలి. అప్పుడే మానవుడు వక్రబుద్ధి వదలి సన్మార్గంలో నడవగలుగుతాడు. – డాక్టర్ డి.చిన్నారావు, రసాయన శాస్త్రం విభాగాధిపతి, ఏఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల, కాకినాడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67ఏ ప్రకారం కేసు నమోదు చేయాలి ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో విద్యార్ధినులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 67 ఏ ప్రకారం కేసు నమోదు చేసి ఉంటే బెయిల్ రావడానికి అవకాశం ఉండేది కాదు. బెయిల్ వచ్చే విధంగా పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేశారో అర్థం కావడం లేదు. పోలీసులు ఇప్పటికైనా సక్రమంగా విచారణ జరిపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం కేసు నమోదు చేసి, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ విద్యార్థుల, ప్రజల్లో నమ్మకాన్ని కలిగేట్టు చేయాల్సిన అవసరం ఉంది. – ముప్పాళ్ల సుబ్బారావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి ఆదికవి నన్నయ్య యూనిర్శిటి విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేసిన అధ్యాపకుడు సూర్య రాఘవేంద్రపై తక్షణం క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్యార్థునులను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆయన అంగికరించాడు. నిర్భయ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాలి. భవిషత్తులో ఇలాంటివి జరగకుండా యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. ఇంటర్నల్ కమిటీ వేయడంతో ఇంటర్నల్ మార్కులు వారి చేతిలో ఉంటాయి. భయం కొద్దీ చెప్పలేరు. అలాంటివి కాకుండా ప్రభుత్వం తరుపు నుంచి, ఐసీడీఎస్ అధికారులను వేసి విచారణ జరపాలి. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి చట్టాలు కఠినంగా ఉండాలి... సరస్వతీ నిలయాలుగా ఉండే విద్యాలయాల్లో ఇటువంటి చర్యలకు పాల్పడి విద్యావ్యవస్ధకే ముప్పు తెస్తున్నారు. ఇటువంటి వాటిపై వర్సిటీ స్ధాయిలో కఠినమైన చట్టాలు ఉండాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థినులకు సరైన రక్షణ ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రభుత్వం ఇంత త్వరగా స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – కాశిన మల్లేశ్వరరావు,బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు వర్సిటీలో గ్రీవెన్స్సెల్ సమర్థవంతంగా పనిచేయాలి వర్సిటీలో ఉన్న గ్రీవెన్స్ సెల్ సమర్థవంతంగా పనిచేసి మహిళలకు రక్షణ కల్పించాలి. వర్సిటీలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల తరువాత గురువులనే పూజిస్తారు. వీరి ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. – వై.జయ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్,జేఎన్టీయూకే మొగ్గలోనే తుంచి వేయాలి చదువుచెప్పే అధ్యాపకుని ప్రవర్తనలో అభ్యంతరకరమైన ధోరణి కనపడితే, విద్యార్థినులు మౌనంగా ఉండరాదు. ఈ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయడానికి అధికారులు, తల్లిదండ్రులు, సాటి విద్యార్థుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలి. విద్యార్థినులు సంఘటితశక్తిగా నిలబడాలి. తప్పు చేసినవాడిని నిలదీయాలి. అధ్యాపకులు విద్యార్థినులను తమ పిల్లలుగా భావించాలి. – గుంటూరి వెంకటేశ్వరరావు, కవి, విశ్రాంత ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ -
రాజమహేంద్రవరం – విజయనగరం వయా ఏజెన్సీ
సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి 516 –ఇ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) సిద్ధమయ్యాయి. 2017లోనే ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీపీఆర్లు పూర్తి చేయాలని కేంద్రం గతంలో సూచించినా.. అప్పటి ప్రభుత్వం పెడచెవినే పెట్టింది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం తాజాగా సంప్రదించగా, డీపీఆర్లు వెంటనే తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. దాంతో డీపీఆర్లు సిద్ధమయ్యాయి. కేంద్రానికి పంపి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత రహదారికి మొత్తం ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్లు తయారు చేశారు. రాజమండ్రి–రంపచోడవరం, రంపచోడవరం–కొయ్యూరు, కొయ్యూరు–లంబసింగి, లంబసింగి–పాడేరు, పాడేరు–అరకు, అరకు నుంచి గౌడార్ మీదుగా శృంగవరపుకోట, విజయనగరం వరకు ఆరు ప్యాకేజీలుగా డీపీఆర్లు తయారు చేశారు. మొత్తం 406 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. అధిక శాతం ఘాట్ రోడ్... ఈ మార్గంలో అధిక భాగం కొండ దారి నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రహదారి అధ్వాన్నంగా ఉంది. రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఎన్హెచ్–16 (చెన్నై–కోల్కతా) వయా తుని, అన్నవరం, అనకాపల్లి మీదుగా 227 కిలోమీటర్ల వరకు పొడవు ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే కొత్త జాతీయ రహదారి 516– ఇ పొడవు 406 కిలోమీటర్లకు పైనే. దూరం ఎక్కువైనా పర్యాటకంగా, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధితో పాటు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కేంద్రం ఈ జాతీయ రహదారి చేపట్టినట్లు ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా వచ్చే వారికీ ఇది వెసులుబాటుగా ఉంటుంది. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు... 516 జాతీయ రహదారి నిర్మాణానికి రూ.4 వేల కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. రెండు వరుసల రహదారి కావడంతో కిలోమీటరుకు రూ.10 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. డీపీఆర్లు ఆమోదం పొందితే వచ్చే ఏడాదిలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొదలవుతాయి. -
స్టేషన్ ఎదుటే మహిళను కొట్టి చంపారు
రాజమహేంద్రవరం క్రైం: అష్టా చెమ్మా ఆటలో యువకుల మధ్య నెలకొన్న వివాదం ఓ మహిళ మృతికి కారణమయ్యింది. తన కొడుకుపై దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను మరో వర్గం వారు పోలీస్ స్టేషన్ ఎదుటే కొట్టి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ మరణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు అక్కడే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెడ్డీలపేటకు చెందిన వల్లెపు శేఖర్, అదే ప్రాంతానికి చెందిన వేముల ఆంజనేయులు అనే యువకులు శనివారం అష్టా చెమ్మా ఆట ఆడుతూ డబ్బుల కోసం గొడవ పడ్డారు. శేఖర్పై ఆంజనేయులు దాడి చేశాడు. శేఖర్ తల్లి వల్లెపు బుజ్జమ్మ (35) పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చింది. అప్పుడు ఆంజనేయులు కుటుంబీకులు వచ్చి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ పోలీస్ స్టేషన్ చివరకు తీసుకువెళ్లి సొమ్మసిల్లేలా కొట్టారు. దాడి జరుగుతున్న సమయంలో కానిస్టేబుల్ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బుజ్జమ్మను ఆమె కుమారుడు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ సంతో‹Ù బాధితులతో చర్చించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నేడే చాంబర్ ఎన్నికల పోరు
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం చాంబర్ ఎన్నికల పోరు సోమవారం జరగనుంది. మెయిన్ రోడ్డులోని చాంబర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ –దొండపాటి సత్యంబాబు, గ్రంధి రామచంద్రరావు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. 2019–21 రెండేళ్ల కాలవ్యవధికి నిర్వహించే నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు –1, ప్రధాన కార్యదర్శి –1, ఉపాధ్యక్షులు– 2, కోశాధికారి–1, సంయుక్త కార్యదర్శి–1, ట్రస్ట్ బోర్డు సభ్యులు – 3, డైరెక్టర్లు – 15 పదవుల కోసం ఎన్నికలు జరగున్నాయి. ఒక్కొక్క ప్యానల్ నుంచి 24 మంది సభ్యులతో మొత్తం రెండు ప్యానల్స్ నుంచి 48 మంది పోటీలో ఉన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కొయ్యాన కుమారి, నమ్మి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. 2810 మంది ఓటర్లు ఎన్నికల్లో 2,810 మంది చాంబర్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరిలో 2710 మంది పురుషులు, వందమంది మహిళా ఓటర్లు ఉన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల కమిటీ అధ్యక్షులు మారిశెట్టి వెంకటరామారావు, గమిని రంగయ్య మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి అయిన గంట తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, ఫలితాలు ఎంత రాత్రయినా వెలువరిస్తామన్నారు. అభ్యర్థులు వీరే.. ఒక ప్యానెల్లో.. అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ జవ్వార్, గౌరవ కార్యదర్శిగా మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులుగా వంటెద్దు సూరిబాబు, కాలేపు వెంకట వీరభధ్రరావు, సంయుక్త కార్యదర్శిగా వెత్స వెంకట సుబ్రహ్మణ్యం(బాబ్జీ), కోశాధికారి బలభధ్ర వెంకటరాజు(రాజా) పోటీపడుతున్నారు. మరో ప్యానల్లో అధ్యక్షుడిగా దొండపాటి సత్యంబాబు, కార్యదర్శిగా గ్రంధి రామచంద్రరావు, ఉపాధ్యక్షులుగా మండవల్లి శివన్నారాయణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, సంయుక్త కార్యదర్శిగా దేవత సూర్యనారాయణ మూర్తి, కోశాధికారిగా మజ్జి రాంబాబు పోటీపడుతున్నారు. -
బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..
సాక్షి, రాజమహేద్రవరం: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వేప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను అమాంతం రెండింతలు పెంచుతూ రైల్వేశాఖ బాదుడు షురూ చేసింది. దక్షిణమధ్య రైల్వేలో ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో ఆదివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ 10 రూపాయలు ఉన్న ఈ ధర ఆదివారం నుంచి రెండితలు పెరిగి రూ.30 అయింది. దీంతో ప్రస్తుత రేటుకు రూ.20 అదనంగా భారం పడనుంది. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు ప్రతి ఏటా ఇలా పెంచడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. రైల్వేస్టేషన్ ఆవరణలోకి వెళ్లే వారు ప్లాట్ఫామ్ టిక్కెట్ కొనుగోలు చేయాలంటే రూ.30లు చెల్లించాల్సిందే. అదే ప్లాట్పామ్ పైకి వెళ్లాల్సిన వ్యక్తి పక్కనే ఉన్న ద్వారపూడి రైల్వేస్టేషన్, కొవ్వూరు రైల్వేస్టేషన్ కో ప్యాసింజరు టిక్కెట్ కొనుగోలు చేస్తే దాని ధర రూ.10లే. ప్యాసింజరు టిక్కెట్ ధరలో మార్పు లేకుండా ఇలా ప్లాట్ఫామ్ టిక్కెట్ ధరను అమాంతం పెంచడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు వెళ్లే వారిపై భారం పడనుంది. ప్లాట్ఫామ్ టిక్కెట్కు రెండు గంటలు చెల్లుబాటు పరిమితిని విధించారు. రూ.10లతో ప్యాసింజరు టిక్కెట్ కొనుగోలు చేసి ప్లాట్ఫామ్పైకి వెళితే 3 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇదేం చిత్రమో తెలియదు గానీ ప్లాట్ఫామ్పైకి వెళ్లడానికి రూ.30లు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కేవలం 2 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుందట. ప్రతి రోజూ ప్లాట్ఫామ్ టికెట్లు 2,500 విక్రయిస్తుండగా...పండుగ రోజుల్లో 5000 వరకు విక్రయిస్తుంటారు. అంటే ఐదు వేల మంది ప్రయాణికులపై ఈ భారం పడనుంది. గోదావరి రైల్వే స్టేషన్లో పాత ధరే... దసరా పేరుతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ బాదుడు అమలు జరుగుతుండగా గోదావరి రైల్వే స్టేషన్లో మాత్రం ప్లాట్ఫామ్ టిక్కెట్ ధర మాత్రం రూ.10లు మాత్రమే ఉంటుందని రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కల్యాణ్ తెలిపారు. -
బాబూ.. గుడ్బై..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హామీల మీద హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి, మోసం చేసిన పాపానికి.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంతటి పరాభవం ఎదురైనా.. ఏమాత్రం ఆత్మవిమర్శ లేకపోగా.. మితిమీరిన అహంకారంతో అధినాయకత్వం.. ముఖ్యంగా చంద్రబాబు, కొందరు నేతలు మోనార్క్ల్లా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్బై చెప్పేస్తున్నారు. తాజాగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం.. కునుకుతీస్తున్న నక్క మీద తాటిపండు పడిన చందాన.. టీడీపీని ఓ కుదుపు కుదిపింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు తమ అనుచరులతో గుడ్బై చెప్పేస్తున్నారు. అధిష్టానం ఒంటెత్తు పోకడలతోనే పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, అయినప్పటికీ కళ్లు తెరవకపోగా, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన ఒకరిద్దరు నాయకుల మాటలు నమ్మి చంద్రబాబు పార్టీ పుట్టి ముంచేస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని బలంగా నమ్ముతూ, ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన వీడాక ఆ నియోజవకర్గానికి ఇన్చార్జిగా ఇంతవరకూ ఎవ్వరినీ నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఇదిలా ఉండగా ఒక బలమైన సామాజికవర్గంలో పట్టున్న నాయకుడిగా పేరున్న రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి శుక్రవారం గుడ్బై చెప్పేశారు. ఆయన వెంట నియోజకవర్గంలోని ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ టీడీపీకి రాజీనామా చేశారు. తోటతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ గోపాల్బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వట్టికూటి సుబ్రహ్మణ్యం (అబ్బు), చెరుకూరి విశ్వేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు యాళ్ల సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరి దొరబాబు, కొండా పోతురాజు, భీమారావు, పదిమంది మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు.. ఇలా దాదాపు ఆ పార్టీ నాయకులందరూ టీడీపీకి గుడ్బై చెప్పేశారు. దీంతో ఒక రకంగా రామచంద్రపురంలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తీరుతోనే.. తన రాజీనామాకు చంద్రబాబు వ్యవహార శైలే కారణమని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. చంద్రబాబు ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ జిల్లా సమీక్షకు ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఉన్న తన సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో కాకినాడలో భేటీ అయినప్పుడే చంద్రబాబు తీరుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు.. సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావుతో పాటు టీజీ వెంకటేశ్ టీడీపీ నుంచి కమళ దళంలో చేరడం వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందని నాడు బహిరంగంగానే చెప్పారు. అదే విషయాన్ని తన రాజీనామా సందర్భంగా త్రిమూర్తులు పునరుద్ఘాటించడం గమనార్హం. జిల్లాలో పట్టు లేని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు విలువనిచ్చి.. క్రియాశీలకంగా పని చేస్తున్న నేతలను చంద్రబాబు దూరం చేసుకుంటున్నారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతమంది బీజేపీకి వెళ్లిపోతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. దీనిపై టీడీపీ నేతలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉందని త్రిమూర్తులు అన్నారు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో 17 ఏళ్లపాటు టీడీపీలోనే ఉన్నా.. తనకు చంద్రబాబు కనీస గౌరవం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. జొన్నాడ – యానాం ఏటిగట్టు రహదారిని రూ.175 కోట్లతో 40 అడుగులకు విస్తరించే పనులకు 2016లో ప్రతిపాదనలు ఇస్తే జీవో ఇచ్చి తరువాత పట్టించుకోకుండా అవమానించారని, ఇది కూడా తన రాజీనామాకు కారణమని చెప్పారు. కాగా తోట త్రిమూర్తులు తాజా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణు చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే. భవిత ప్రశ్నార్థకం రానున్న కాలంలో పార్టీకి మరింత గడ్డు పరిస్థితిని తప్పదని టీడీపీ నేతలే విశ్లేషిస్తున్నారు. వరుస రాజీనామాలకు పూర్తిగా చంద్రబాబుతో పాటు జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రుల తీరే కారణమని దుయ్యబడుతున్నారు. -
రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్బుక్ గ్రూప్ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ కె.అన్నపూర్ణ.. గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సుబ్బరాజుగారితోటలో... ‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్బుక్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్మూరు జీపీఆర్ రోడ్డులోని సుబ్బరాజుగారితోటలో ఉత్సాహంగా జరిగింది. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ఏడువేల మంది ఈ కార్యక్రమానికి తరలిచ్చారు. బొమ్మూరు గ్రామానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ 2015లో ఈ ఫేస్బుక్ గ్రూపును ప్రారంభించారు. మగవారు పట్టుపంచె, కండువా, ఆడవారు పట్టుచీరలు ధరించి హాజరయ్యారు. గోదావరి జిల్లాల ప్రత్యేకమైన తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, పెనుగొండ గజ్జికాయ, వివిధ రకాల పిండి వంటకాలను తయారీ చేసి గ్రూపు సభ్యులకు అందుబాటులో ఉంచారు. చిన్నారుల ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ మిత్రులు ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నాం భోజనం వరకు గోదావరి రుచులను ఆత్మీయతతో కొసరి కొసరి వడ్డించారు. వివిధ రకాల తెలుగు వంటకాలను ఫేసుబుక్ మిత్రులకు రుచి చూపించారు. ఇది నాలుగో సమ్మేళనం గోదారోళ్ల కితకితలు నాలుగో ఆత్మీయ సమ్మేళనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి ప్రాంత, యాస, హాస్యంతో బాబోయ్ ఇంక నవ్వలేం అన్నట్టుగా సాగింది. కితకితల సభ్యుల కలయిక. కేవలం ఫేస్బుక్లో మాత్రమే పోస్టింగులు చేసుకునే వీరంతా ప్రత్యక్షంగా కలవడంతో ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. గోదారోళ్ల కితకితలుపై వెటర్నరీ డాక్టర్ కోటి కాపుగంటి రాసిన పాటల సీడీని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట సీడీని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుకు అందజేశారు. గ్రూపు సభ్యురాలికి సీమంతం గ్రూపులోని సభ్యురాలైన రావులపాలెంనకు చెందిన గర్భిణి కల్యాణికి సీమంతం నిర్వహించారు. ముందుగా ఈవీవీ సత్యనారాయణ దంపతులు, అనంతరం గ్రూపుసభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. సారి పెట్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనూహ్య స్పందన గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మన యాసపై ఉన్న మమకారంతో 2015లో గ్రూపును ప్రారంభించాను. ఇప్పటికి 1,16,127 మంది సభ్యులున్నారు. నాలుగోసారి నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. – ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్ క్రియేటర్, బొమ్మూరు కలయిక అపూర్వం సోషల్ మీడియా ద్వారా ఇందరు ఒకే చోట కలవడం అపూర్వం. గోదావరి హాస్యానికి, యాసకు పెద్దపీట వేస్తూ గ్రూపు ముందుకు సాగడం అభినందనీయం. గ్రూపులో సభ్యుడిని కావడం ఆనందంగా ఉంది. – ఇరవ వెంకటసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ తప్పకుండా వస్తాం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్లో నేను కూడా ఓ అడ్మిన్. బంధువుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు వీలులేకపోతే మానేస్తాం గానీ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాత్రం రాకుండా ఉండం. ముందు నుంచే ఇంటిలో వారికి నచ్చచెప్పి వచ్చి సొంతి ఇంటిలో పండగలా నిర్వహిస్తాం. బంధువులు కంటే ఈ ఫేస్బుక్లోనే మిత్రులు ఆత్మీయులుగా ఉంటాం. – బోయపాటి పద్మ, హనుమాన్ జంక్షన్ బంధాలు పెరుగుతాయి ఆత్మీయ కలయిక ద్వారా బంధాలు పెరుగుతాయి. వేలాదిమంది తరలిరావడమే ఇందుకు నిదర్శనం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. అక్కా, బావ.. పిలుపులే మా గ్రూపులో వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా మా గ్రూపులో వేల మంది సభ్యులున్నారు. – అన్నందేవుల దేవీలక్ష్మీ, రాజమహేంద్రవరం -
‘ఆంధ్ర’ పదంపై అంత ద్వేషమెందుకు?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కన్ను తెరచి, విజయపథంలో నడుస్తున్న ఆంధ్రుల బ్యాంక్ త్వరలో జరగనున్న విలీనం తరువాత ‘ఆంధ్ర’ శబ్దం కోల్పోవడం దురదృష్టకరం. విలీనం తరువాత కూడా ఆంధ్రాబ్యాంక్ పేరే కొనసాగాలి’ అని కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి కోరారు. కళాగౌతమి ఆధ్వర్యాన ధాన్యంపాకలు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన చర్చావేదికలో కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రుల కోడలని, పేరులో ‘ఆంధ్ర’ శబ్దం తీసివేయడం ఆంధ్రుల అస్తిత్వానికే మచ్చని పేర్కొన్నారు. ‘ఆంధ్రత్వ మాంధ్రభాషా చ–అపి ఆంధ్రదేశ స్వజన్మభూః–తత్ర యాజుషీశాఖానాల్పస్య తపః ఫలమ్’ అని తమిళుడైన అప్పయ్య దీక్షితులు అన్నారని, అంటూ, ‘అల్పతపస్సు చేసిన నాబోంట్లకు ఆంధ్రత్వం ఎలా కలుగుతుంద’ని ఈ శ్లోకంలో ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి నివసించిన కుటీరానికి ‘ఆంధ్రకుటీరం’ అని, నడిపిన పత్రికకు ‘ఆంధ్రి’ అని, రచనలకు ‘ఆంధ్రపురాణం’ ‘ఆంధ్ర రచయితలు’ అని పేరు పెట్టుకున్నారని చెప్పారు. విలీనంలోని మంచిచెడ్డలపై తాము వ్యాఖ్యానించడం లేదన్నారు. తెలుగు సారస్వత పరిషత్ వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీబీ సంజీవరావు మాట్లాడుతూ, ప్రాచీన భాషల అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారని ఆవేదన చెందారు. ఆంధ్ర మహాభారతం పుట్టిన గడ్డ, తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం పేరు పాలకులకు గుర్తుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. నటరాజ నృత్యనికేతన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తెలుగువారంటే కేంద్రానికి చిన్నచూపు, లోకువ అని విమర్శించారు. ఫిలాంత్రఫిక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజా అద్దంకి యోనా మాట్లాడుతూ, విలీనం తరువాత ఏర్పడే బ్యాంక్కు ఆంధ్రాబ్యాంక్ పేరునే ఖరారు చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల మాట్లాడుతూ, కేంద్రం దిద్దుబాటు చర్య తీసుకునే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు ముంగండ సూర్యనారాయణ, లక్కోజు వీరవెంకట సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
యథా నేత... తథా మేత
‘యథారాజా తథా ప్రజా’ అని ఊరకే అనలేదు. గత టీడీపీ హయాంలో ఆ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు ‘అవినీతి మా జన్మహక్క’న్నట్టుగా చెలరేగిపోయారు. ఇందుకు దేవస్థానాలనూ మినహాయించలేదు. పాపభీతిని పక్కన పెట్టేసి పైసాయే పరమాత్మంటూ చెట్టాపట్టాలేసుకుంటూ చేతివాటాలకు దిగారు. ‘వడ్డించేవాడు మనోడైతే భయమెందు’లకనే ధీమాతో కోట్ల రూపాయలు వెనకేసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పరుగులు తీశారు. వచ్చే సర్కారు తమదే అనే అహంకారంతో ఆ అవినీతిని మరింత విస్తరింపజేసే క్రమంలో వారి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టడంతో ‘పచ్చ’ తిమింగలాల పరిస్థితి గందరగోళంగా మారింది. సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి రహిత పాలనే ప్రధాన అజెండాగా నడుస్తున్న వైఎస్సార్సీపీ సర్కారు గత ప్రభుత్వంలో అవినీతిపరులపై దృష్టిని సారించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులు కూడా ఇదే బాట పడుతున్నట్టు ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ముగిసిన ఇద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. ఉన్నతాధికారుల ముందుకు వెళ్లిన తొలి జాబితాలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు, అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న పీఆర్ఓ తులా రాము ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని వీరిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రభుత్వం మారినా పాత పంథా వీడకపోవడంతో వీరిద్దరిపై నిర్వహించిన విచారణ పూర్తయింది. దీంతో చర్యలకు సిఫార్సు చేస్తూ మూడు రోజుల కిందటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. ప్రిన్సిపాల్ వేధింపుల పర్వం... రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ మొదలు పెడితే చివరకు కాలేజీలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిసింది. ‘తీగ లాగితే డొంక కదిలినట్లుగా తవ్వేకొద్దీ అవకతవకల పుట్ట బయటపడిందని సమాచారం. కాలేజీలో పనిచేస్తున్న 17 మంది మహిళా అధ్యాపకులు పనిచేసే ప్రాంతంలో మానసిక వేధింపులపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడం, అధ్యాపకులు తమ గోడు స్త్రీ, శిశు సంక్షేమం, విద్యాశాఖా మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా పరిగణించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ నగేష్కుమార్ కళాశాలలో విచారణ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధ్యాపకుల వేధింపులే కాకుండా కళాశాలలో పలు అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడచిన మూడున్నరేళ్లుగా అరాచకాలు చేస్తున్నా సంబంధితాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వకుండా అక్రమ వసూళ్లు, నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ ధర కంటే అదనంగా యూనిఫారాలు విక్రయించడంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని నిగ్గు తేలిందని సమాచారం. కళాశాల రికార్డులను సీజ్ చేసి విచారణ అధికారులు వారి వెంట తీసుకువెళ్లారు. ఇది చదవండి : మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్ వేధింపులు మాయమైన రంగూన్ కలప... బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనంలో కలపను కూడా ప్రిన్సిపాల్ హయాంలో మాయమైందని గుర్తించారు. ఇది ఒకప్పుడు ప్రిన్సిపాల్ కార్యాలయంగా వినియోగించే వారు. ఈ భవనాన్ని రంగూన్ కలపతో 10 గదులతో నిర్మించారు. ఈ భవనం అంతా పూర్తిగా ఖరీదైన కలపతో నిర్మించినదే. ఉడెన్ స్టైర్కేస్, టేకుతో తయారుచేసిన పైకప్పుతో పాతబడి పోయిన ఈ భవనాన్ని నేలమట్టం చేసేసి అందులో కలప ఏంచేశారో తెలియని పరిస్థితి. ఎంత తక్కువ లెక్కలేసినా రూ.50 లక్షలు పైమాటేనంటున్నారు. కలపతోపాటు కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద, పెద్ద చెట్లను కూడా విక్రయించి సొమ్ము జేబులో వేసుకున్నారని విచారణలో నిగ్గు తేలిందని సమాచారం. విచారణ ఎంతవరకూ వచ్చిందనే అంశంపై రాజమహేంద్రవరం ఆర్జేడీ నగేష్కుమార్ను సంప్రదించగా అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందచేశామన్నారు. ఇంతకుమించి తాము మాట్లాడలేమని, నిర్ణయం ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. భగవంతుని సన్నిధిలో... దాదాపు ఇదే పరిస్థితి అన్నవరం సత్యదేవుని దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తులా రాము వ్యవహారం అని చెప్పుకోవచ్చు. సర్వీసు రూల్స్కు వ్యతిరేకంగా ఉద్యోగం పొందడం, డిస్మిస్ అయి కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే రెండు పదోన్నతులు పొందడం, సత్యదేవుని సన్నిధిలో అన్నింటా పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల అండదండలతో అనేక అవకతవకలు, ఇష్టానుసారం కొండపై పెత్తనం చెలాయించారని ఎమ్మెల్యే పర్వత సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని విచారణకు దేవదాయశాఖ కమిషనర్ మన్మోహన్సింగ్ను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రీజినల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథ్ సర్వీసు రూల్స్కు వ్యతిరేకంగా పోస్టింగ్, రెండు పదోన్నతులకు సంబంధించి కాగితపూర్వక ఆధారాలు, రికార్డులు, పలువురు ఈఓలు, అధికారులను రాజకీయ పలుకుబడితో పెత్తనం చెలాయించే వ్యవహారశైలిపై స్థానికులు, ఉద్యోగుల అభిప్రాయాలతో దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు రెండు, మూడు రోజుల్లో చర్యలు వెల్లడించనున్నారు. -
తవ్వేకొద్దీ బయటపడుతున్న ప్రిన్సి‘ఫ్రాడ్’
సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై ఉచ్చు బిగుస్తోంది. కళాశాలలో వేధింపులకు గురి చేస్తున్న ఆయనపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం చివరి దశకు చేరుకుంది. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి, అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు, ఉన్నతాధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదులను తనకున్న రాజకీయ పలుకుబడితో బుట్టదాఖలు చేయించి ఇన్నాళ్లూ ఆయన బయటపడుతూ వచ్చారు. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు, మార్కెట్లోకంటే ఎక్కువ ధరకు యూనిఫాం విక్రయాలు తదితర అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో రాష్ట ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్ గోవిందరావు ఆదేశాల మేరకు శనివారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ నగేష్కుమార్ విచారణ నిర్వహించారు. కాలేజీ క్యాంపస్లోని సెమినార్ హాలులో నాలుగు గోడల మధ్య గోప్యంగా జరిపిన విచారణలో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్తోపాటు సుమారు 48 మంది బోధన, బోధనేతర సిబ్బంది హాజరయ్యారు. మొబైల్ ఫోన్లను హాలులోకి అనుమతించలేదు. విచారణలో ప్రతి ఒక్కరికీ 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి బాధితులతో వ్యక్తిగతంగా పూర్తి చేసి ఇచ్చిన పత్రాలను ఆర్జేడీ రికార్డు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 8 గంటలపాటు సాగింది. తొలుత బోధన, బోధనేతర సిబ్బందిని విచారించిన ఆర్జేడీ తరువాత అధిక ఫీజులు, యూనిఫారంల విక్రయాలపై విద్యార్థులను విచారించారు. ఇదీ ప్రశ్నావళి ప్రిన్సిపాల్ వేధింపులపై 17 మంది మహిళా అధ్యాపక బాధితులు తమకు ఇచ్చిన ప్రశ్నావళిలో పూసగుచ్చినట్టు రాసి ఇచ్చారని తెలిసింది. కాంట్రాక్ట్ లెక్చరర్ ఉదయశాంతిని ప్రిన్సిపాల్ దూషించినపుడు స్వయంగా మీరు ఎలా చూశారు, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీ ఇవ్వకుండా ఫీజులు వసూలు చేశారా, పేరెంట్స్ ,టీచర్స్ అసోసియేషన్ పేరుతో రూ.100 వంతున వసూలు చేశారా, ఉదయశాంతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఆమెకు అండగా ఉన్నారా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందస్తు అనుమతి ఏమైనా తీసుకున్నారా, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారా, మీరంతా ఫిర్యాదులు చేశాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారా, ఉదయశాంతి అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు వెళ్లడం చూశారా, ప్రిన్సిపాల్పై వచ్చిన అభియోగాలు నిజమని నమ్ముతున్నారా...ఇలా 14 అంశాలతో ప్రశ్నావళి అందజేసి సమాధానాలు లిఖితపూర్వకంగా తీసుకొని రికార్డు చేశారు. బోధనేతర సిబ్బందిలో కొందరు మినహాయించి బోధనా సిబ్బంది సహా దాదాపు మూడొంతులు మంది ప్రిన్సిపాల్ వేధింపులతో కాలేజీలో పనిచేసే వాతావరణం లేకుండా పోయిందని వాంగ్మూలమిచ్చారు. ప్రిన్సిపాల్ వీర్రాజు అరుపులు, కేకలు విని పరుగున వెళ్లేసరికి ఉదయశాంతి వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారని మహిళా అధ్యాపకులు ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇంటర్బోర్డు కమిషనర్ వరకూ వెళ్లినా న్యాయం జరగకపోగా, ప్రిన్సిపాల్ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మరింత ఎక్కువైపోయాయని చెప్పుకున్నారు. సహచర అధ్యాపకురాలు కావడంతోనే ఆమెకు మద్దతుగా నిలిచామని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వెంట రాగా ఉదయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తాము కూడా వెళ్లిన మాట వాస్తవమేనని అధ్యాపకులు ధైర్యంగా చెప్పారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు వెళతామన్నా, తమ అంగాంగాలను ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడడం, చివరకు తమ నడకపై కూడా కామెంట్లు చేయడం, సెలవులు అడిగినప్పుడు వెకిలి మాటలతో మానసికంగా వేధించేవారని మహిళా అధ్యాపకులు ఆర్జేడీ నగేష్కుమార్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల ఫీజుల్లో అవినీతి నిజమే విద్యార్థుల ఫీజులు అధికంగా వసూలు చేయడం వాస్తవమేనని మెజార్టీ అధ్యాపకులు కుండబద్దలు కొట్టారు. అధిక ఫీజులు వసూలు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాయితీలు ఇవ్వకపోవడం, ఒకరి రశీదుపై ముగ్గురు, నలుగురు నుంచి ఫీజులు వసూలు చేయడం నిజమేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన రశీదులను విచారణాధికారికి అందజేశారని సమాచారం. వీటిని రికార్డుల్లో సరిచూడగా అవకతవకలు వాస్తవమేనని తేల్చి విచారణ సందర్భంలోనే అప్పటికప్పుడు ప్రిన్సిపాల్ వీర్రాజుకు ‘మెమో’ కూడా ఇచ్చారని తెలిసింది. విచారణ జరుగుతుండగా పలువురు విద్యార్థులు ఆర్జేడీ వద్దకు వెళ్లి కళాశాల భవనాలకు పెయిటింగ్లు, కరెంటు, శ్లాబ్లు కూలగొట్టే పనులు నెల రోజులపాటు చేయించుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన విషయంపై ఆర్జేడీ ప్రశ్నించగా అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు (ఒకరికి రూ.2,500లు, మరొకరికి రూ.1500) ప్రిన్సిపాల్ ఇచ్చారని తెలిసింది. విషయం బయటకు పొక్కడంతో సుమారు 30 మంది విద్యార్థులు మూకుమ్మడిగా వెళ్లి తమతో కూడా పనులు చేయించుకున్నారని, పైసా ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్జేడీ నగేష్కుమార్ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. బాధితులందరి నుంచీ వ్యక్తిగతంగా వివరాలు సేకరించామని చెప్పారు. విచారణ అంశాలను రెండు రోజుల్లో పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్జేడీ చెప్పారు. -
అధ్యాపకులను వేధిస్తోన్న ప్రిన్స్పాల్పై సీరియస్
సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్పై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని గత సర్కారు మసిపూసిన మారేడుకాయ చందంగా చేయగా.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపడుతున్న విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తున్నారు. మహిళా అధ్యాపకులపై వేధింపుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.. రెండున్నరేళ్లుగా ఈ కళాశాలలో ప్రిన్సిపాల్పై మహిళా అధ్యాపకులు ఫిర్యాదులు చేస్తున్నా పెడచెవిన పెట్టడానికి దారి తీసిన పరిస్థితులపై శనివారం నిఘా వర్గాలు సమాచారం సేకరించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు వేధింపులకు పాల్పడుతున్నారని దళిత కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన తీరును కూడా ఆరా తీశారు. ఆ సమయంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురైనట్టు ప్రిన్సిపాల్ ఆస్పత్రిలో జాయిన్ కావడం, తదనంతర పరిణామాల్లో కేసును నీరు గార్చేసిన వ్యవహారాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొన్న ఉదయశాంతితో పాటు 17 మంది మహిళా అధ్యాపకులు మూకుమ్మడిగా లిఖిత పూర్వకంగా అప్పటి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మికి ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై చర్యలకు ఇంతకాలం మోకాలడ్డిన వారెవరనే దానిపై ప్రభుత్వం నిజాలు తవ్వితీస్తోంది. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక దళిత మహిళా అధ్యాపకురాలు ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పుకున్నా గత టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం అసలు కేసు నీరుగారిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులెవరనే విషయంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ సాగిస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో కళాశాల ప్రిన్సిపాల్ తీరును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నీరుగారిస్తే గార్చారు, కనీసం ఆయనపై వేసిన విచారణలోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాధితులంతా నిరీక్షించారు. ప్రిన్సిపాల్పై విచారణకు గత ప్రభుత్వంలో అప్పటి రాజమహేంద్రవరం ఆర్జేడీ వైవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఫిబ్రవరి 11న ఆయన విచారణ జరిపారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై ఉదయశాంతితో పాటు 17 మంది ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ఒకే లేఖపై సంతకాలు పెట్టి మరీ వాంగ్మూలమి చ్చారు. అయినప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సింపుల్గా తీసుకుందనే విమర్శలున్నాయి. అందుకే వాటి పూర్వాపరాలను ప్రస్తుత ప్రభుత్వం తవ్వి తీస్తోంది. నాటి విచారణ సమయంలో మినిట్స్ నమోదు చేసిన అప్పటి, ప్రస్తుతæ ఇంటర్మీడియట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (రాజమహేంద్రవరం) కార్యాలయ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, అప్పటి ఆర్జేడీ వైవీ సుబ్బారావుల వ్యవహార శైలిపై కూడా దృష్టి సారించారని సమాచారం. మహిళా అధ్యాపకులందరూ ఒక్కటై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అప్పటి ఇంటర్మీడియట్ బోర్డులో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన వారిలో ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే అంశాలన్నింటినీ నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. స్పందించిన మంత్రులు ఇటీవల మహిళా అధ్యాపకులు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేసిన నేపథ్యం, ‘సాక్షి’లో 17న ‘వేధింపుల్లో ‘ప్రిన్స్’పాల్’, 18న ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్’ శీర్షికలన వచ్చిన వరుస కథనాలను మంత్రులు సీరియస్గా తీసుకున్నారు. ఇంతకాలం కాలయాపన చేస్తున్న తీరును వారు తప్పుపట్టారని తెలిసింది. అంతమంది మహిళా అధ్యాపకులు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడమేమిటంటూ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని ఆర్జేడీకి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ వీర్రాజును ఆర్జేడీ నగేష్కుమార్ సోమవారం విచారించనున్నారు. జూనియర్ కళాశాలలోనే ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని కళాశాలకు ఆర్జేడీ ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధమవుతూండగా ప్రిన్సిపాల్ వీర్రాజు ఆదివారం కళాశాలలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను అభివృద్ధి చేస్తూంటే వేధిస్తున్నానంటూ ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. కాగా, అభివృద్ధి ముసుగులో ఆయన డొనేషన్లు తీసుకువచ్చి లెక్కాపత్రం లేకుండా చేశారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. తాను అంతా నిజాయతీగానే పని చేశానని చెబుతున్న ప్రిన్సిపాల్ మాటల్లో వాస్తవమేమిటన్నది ఈ విచారణలోనైనా తేలుతుందని అధ్యాపకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి నలుగురిలో చులకనైపోతామనే భయంతో మహిళలు వేధింపుల వ్యవహారాల్లో ముందుకు రాని పరిస్థితి. అటువంటిది రెండేళ్లుగా ప్రిన్సిపాల్ వేధింపులపై ధైర్యంగా వారు పోరాడుతున్న తీరును ప్రభుత్వం కూడా ఆషామాషీ వ్యవహారంగా తీసుకోలేదని, అందుకే ఆర్జేడీని విచారణకు ఆదేశించిందని అంటున్నారు. విచారణ సమయంలో ప్రిన్సిపాల్ను దూరం పెట్టకుంటే మరోసారి అన్యాయమైపోతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
అక్కడంతా ‘మామూలే’గా
ప్రభుత్వానికి అధికాదాయాన్ని ఆర్జించిపెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు అవినీతి ఆర్జనలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముడుపుల బాగోతం పరాకాష్టకు చేరింది. ఆనేపథ్యంలో అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవినీతికి ఆస్కారం ఉన్న శాఖల్లో ప్రక్షాళ చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో భారీ ఎత్తున స్థానచలనాలు చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : అవినీతిరహిత పాలన అందించడమే ధ్యేయంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వానికి అధిక ఆదాయం ఆర్జించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అవినీతి నిలయంగా మారింది. ఇందులో అక్రమార్జన పతాక స్థాయికి చేరింది. దాంతో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ శాఖలో డీఐజీ స్థాయి అధికారి నుంచి సబ్రిజిస్ట్రార్ల వరకు ఇటీవల స్థానచలనం కల్పించారు. జిల్లాలో ఇలా.. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 32 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మామూళ్ల వసూలు పతాకస్థాయికి చేరుకుంది. లంచాలు తీసుకుంటూ ఒక జిల్లా రిజిస్ట్రార్, సబ్రిజిస్ట్రార్లు, సిబ్బంది ఏసీబీకి చిక్కిన సందర్భాలు ఉన్నాయి. అయినా జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో మామూళ్ల వసూలు ఆగడం లేదు. అనధికార సిబ్బంది. డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల చక్రవర్తులు జిల్లా వ్యాప్తంగా 32 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు సిబ్బంది కొరతతో సతమతముతున్నాయి. దాంతో సుమారు 20 మంది వరకు అనధికార సిబ్బంది వాటిలో పనిచేస్తున్నారు. వీరిని నియమించడానికి ప్రభుత్వం నుంచిగాని జిల్లా అధికారుల నుంచి గాని ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు తమకు అనుకూలమైన వారిని నియమించుకుని వారితోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. వీరు లేని చోట డాక్యుమెంటు రైటర్లు ఆపాత్ర పోషిస్తున్నారు. ప్రతీ నెల ముడుపుల రూపంలో అందుకున్న మొత్తాన్ని జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పంచుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూముల ధరలు ఎక్కువగా ఉన్న రాజమహేంద్రవరం, పిడింగొయ్యి, కడియం, రాజానగరం, అమలాపురం, సర్పవరం, తుని, కాకినాడ, సామర్లకోట, పిఠాపురం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతిరోజు లక్షలాది రూపాయలు మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవినీతికి అడ్డుకట్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ ఎత్తున బదిలీలు చేయడంతో జిల్లాకు కొత్త అధికారులు వచ్చారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ సొంత జిల్లా కావడంతో ఈ శాఖలో అవినీతిరహితపాలన ఈజిల్లా నుంచే శ్రీకారం చుట్టాలనే ద్యేయంతో కొత్తగా విధుల్లో చేరిన సబ్రిజిస్ట్రార్లు ఉన్నారు. దీంతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏటా జిల్లా నుంచి సుమారు రూ.600 కోట్లకు పైగా ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి లభిస్తోంది. ఒక్కో డాక్యుమెంటును రిజిస్ట్రేషన్ చేసేందుకు ముడుపుల రూపంలో ఒక శాతం క్రయ విక్రయదారులు సమర్పించాల్సి వస్తోంది. ఆ విధంగా వారి నుంచి ఏడాదికి రూ.30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముడుపులు చెల్లించనిదే డాక్యుమెంటును సిబ్బందిగాని, అధికారులు గాని ముట్టడం లేదని క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. ప్రజల్లో మార్పు రావాలి అవినీతిరహిత పాలన జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి. క్రయవిక్రయదారులు డాక్యుమెంట్రైటర్లను ఆశ్రయిస్తున్నారు. వారు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇవ్వాలంటూ వసూళ్లు చేస్తున్నారు. మా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార సిబ్బందిని తొలగించాం. క్రయవిక్రయదారులు నేరుగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రజల్లో మార్పు వస్తేనే అవినీతిరహితపాలన సాధ్యమవుతుంది. – షేక్ మౌలానా సాహెబ్, జాయింట్–1 సబ్రిజిస్ట్రార్, రాజమహేంద్రవరం -
లక్షలు కట్టించుకుని వసతులు కల్పించరా!
చసాక్షి, రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి) : లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నర్సింగ్ విద్యార్థులు గురువారం అర్ధరాత్రి ఆందోళన చేశారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద ఉన్న స్వతంత్ర మెడికల్ కాలేజీలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వారందరూ ఆందోళనకు దిగారు. ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ తమకు మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని, భోజనం, తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదన్నారు. బాత్రూమ్ల నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం ఎక్కడి నుంచో ఇక్కడకు చదువుకోవడానికి వచ్చామన్నారు. అయితే ఇక్కడ కాలేజీ యాజమాన్యం తమను చాలా హీనంగా చూస్తోందని ఆరోపించారు. కాగా.. నర్సింగ్ కాలేజీ అధినేత గన్ని భాస్కరరావు.. భోజనంపై హాస్టల్ నిర్వాహకుడితో మాట్లాడారు. అయినప్పటికి కాలేజీ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా.. విద్యార్థులతో కాలేజీ యాజమాన్యం చర్చలు కొనసాగుతున్నాయి. -
పూర్ణకుంభంతో వైఎస్ జగన్కు స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాకినాడలో వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం నివాసానికి వెళ్లారు. పూర్ణకుంభంతో శివరామసుబ్రహ్మణ్యం ఇంటి వద్ద వైఎస్ జగన్కు అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. వారందరినీ చిరునవ్వుతో జననేత పలకరించి ముందుకు సాగారు. వైఎస్సార్సీపీలోకి శివరామసుబ్రహ్మణ్యం ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ‘తూర్పు’... మార్పునకు నాంది -
ఫారం-7 పేరుతో తప్పుడు కేసులు: రౌతు
తూర్పుగోదావరి : ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ.. ఫారం-7 పేరుతో వైఎస్సార్సీపీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారేందుకు అంగీకరించని వారిని రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకులు కేసులతో భయపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లు అసలు పోలింగ్ బూత్లకే రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారని రౌతు ఆరోపించారు. -
రేడియోధార్మిక పరికరం మిస్సింగ్ కేసును చేధించాం
-
ప్రియుడి సాయంతో భర్త దారుణ హత్య
రాజమహేంద్రవరం క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసి హత మార్చింది. ఈ కేసును రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను తూర్పు మండలం డీఎస్పీ యు.రాజారావు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కడియం మండలం, కడియపు సావరానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)ను కొందరు యువకులు ఈ నెల నాలుగో తేదీన హత్య చేశారు. అతడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం రూరల్ మండలం, పిడింగొయ్యిలోని కాదా దుర్గాప్రసాద్కు చెందిన తోట సమీపంలోని తుప్పల్లో ఐదో తేదీన బొమ్మూరు పోలీసులు కనుగొన్నారు. అసలేం జరిగిందంటే.. కడియం మండలం, గుబ్బలవారిపాలెంకు చెందిన చీకట్ల సతీష్ గ్రామంలోని ఒక నర్సరీలో గుమస్తాగా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ భార్య జ్యోతితో ఏడాదిగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. జ్యోతిని తనతో కలవకుండా కట్టడి చేసిన వెంకటరమణపై కక్ష పెంచుకున్న సతీష్ అతడి హత్యకు పథక రచన చేశాడు. ఆ విషయాన్ని జ్యోతికి చెప్పగా ఆమె కూడా సమ్మతించింది. ఇందుకోసం డబ్బు ఎర చూపి సతీష్ గతంలో తనకు పరిచయం ఉన్న లావేటి నాగదేవి అనే మహిళ సాయాన్ని తీసుకున్నాడు. పథకంలో భాగంగా నాగదేవి కొత్త సిమ్ కార్డుతో వెంకటరమణకు ఈ నెల నాలుగో తేదీన ఫోన్ చేసింది. ‘నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని ఉంది. నేను కారు పంపిస్తాను. డ్రైవర్ నేను ఉన్న చోటుకు నిన్ను తీసుకు వస్తాడు’ అంటూ ఫోన్లో వగలు పోయింది. ఆ మాటలు నమ్మిన వెంకటరమణ పిడింగొయ్యి శివార్లలోని నర్సరీ కొబ్బరి తోటలో ఉన్న షెడ్ వద్దకు వచ్చాడు. అప్పటికే సతీష్ రూ. ఐదు వేలిచ్చి పురమాయించి సిద్ధం చేసిన ఎనిమిది మంది వ్యక్తులూ వెంకటరమణ తలపై బీరు సీసాలు, చైన్లు, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. వారందరూ అతడిని కొబ్బరి చెట్టుకు కట్టి ఆ రోజు రాత్రి 12.30 గంటల వరకూ కొడుతూనే ఉన్నారు. అనంతరం సతీష్ రేకుల షెడ్లో పదునైన కత్తితో వెంకటరమణ గొంతుపై నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని తోట బయట ఉన్న తుప్పల్లో దాచి కత్తిని దూరంగా పడేశాడు. దగ్గరలోనే గోతిని తవ్వి శవాన్ని పూడ్చే ఉద్దేశంతో సతీష్ మరునాడు అక్కడే తచ్చాడ సాగాడు. తోట యజమాని దుర్గాప్రసాద్కు సందేహం వచ్చి సతీష్ను నిలదీయగా, అతడు జరిగిన విషయమంతా చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మరో నలుగురు బాల నేరస్తులు ఈ కేసులో నిందితులైన చీకట్ల సతీష్, గంటేటి దుర్గాప్రసాద్, కప్పల రవికుమార్, బడుగు రాజేష్, ఖండవల్లి తరుణ్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారే గాకుండా మరో నలుగురు బాల నేరస్తులను రాజానగరం మండలం, కానవరంలో బొమ్మురు సీఐ కె.నాగమోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన జ్యోతి, నాగలక్ష్మి పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ఆత్మాభిమానం చంపుకోలేక..
అమ్మ.. నాన్న.. వారి ఆశల సౌధమైన కుమారుడు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఆమె గృహిణి. కుమారుడిని ఇంజినీరింగ్ చదివించారు. స్నేహితులతో కలసి సౌరవిద్యుత్ కార్ల యూనిట్ పెట్టాలనుకున్న అతడి ఆలోచనకు సరే అన్నారు. స్నేహితులను సమకూర్చుకుని మౌలిక వసతులకోసం కొందరు బయటి వ్యక్తుల సాయం ఆశించి రూ.లక్షల సొమ్ములు ఇచ్చి మోసపోయారు. డబ్బడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి. చస్తే చావండి అన్నారు. అంతే.. ఆ మధ్య తరగతి కుటుంబానికి ఆత్మాభిమానం దెబ్బతింది. ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు. శుక్రవారం రాత్రి గోదావరిలో దూకి తనువు చాలించారు. రాజమహేంద్రవరం రూరల్: పెట్టుబడి పెట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన విషయాన్ని, ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను కనీసం అన్నదమ్ములకు చెప్పినా.. సహోద్యోగులకు చెప్పినా.. చిన్న సలహాతో తీరిపోయేది. రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు కుటుంబం ఇతరులకు చెప్పడం అవమానంగా భావించారో.. ఏమో తమ బాధను మనసులోనే దాచేసుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబసభ్యులను, బ్యాంకు ఉద్యోగులను, స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. వివరాలలోకి వెళితే రాజమహేంద్రవరం గాదాలమ్మనగర్కు చెందిన కెనరాబ్యాంకు ఉద్యోగి కొల్లి ఆనందబాబు(46), అతని భార్య కొల్లి అరుణ (40), కుమారుడు లక్ష్మీచంద్ సాయిచరణ్లు గురువారం రాత్రి 8.10 గంటల సమయంలో ఇంటినుంచి మోటార్బైక్పై కొవ్వూరు వెళ్లారు. అక్కడ అనన్య థియేటర్లో రోబో 2.0 సినిమా చూసి రాజమహేంద్రవరం బయలుదేరారు. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై 135వ నెంబరు పోల్ వద్ద మోటార్ బైక్, సెల్ఫోన్, చెప్పులు విడిచి గోదావరిలోకి దూకి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయిచరణ్ చెప్పులు, సెల్ఫోన్ మాత్రం అక్కడ లభించలేదు. ఆనందబాబు సోదరుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబులు జాలర్లతో కలిసి విస్తృతంగా గాలించారు. ఉదయం10 గంటల సమయంలో ఆనందబాబు మృతదేహం దూకిన పిల్లర్ వద్దే పైకి తేలిందని, అరుణ మృతదేహం వాడపల్లి ఇసుకర్యాంపు వద్ద నీటిలో తేలింది. కుమారుడు సాయిచరణ్ చెప్పులు, సెల్ఫోన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు దూకాడా లేదా అన్న కోణంలో కుటుంబసభ్యలు, పోలీçసులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినా శనివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. ఆనందబాబు, అరుణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో విషాదఛాయలు.. ఆనందబాబు, అరుణల మృతదేహాలు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకోవడంతో ఆయన సోదరులు మధుబాబుతో పాటు, బెహ్రైన్లో ఉంటున్న అన్నయ్య వీరవెంకటసత్యనారాయణ, అరుణ తల్లిదండ్రులు ఆకాశపు వీరభద్రరావు, పాపాజీలతో పాటు ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం మాకు ఒక్కమాట చెప్పి ఉంటే ఈబాధ ఉండేది కాదని తామంతా చూసుకునేవారమని, ఎవరికీ చెప్పకుండా తన మనస్సులోనే పెట్టుకుని మా అందరికీ దూరమయ్యారన్నారు. అలాగే బ్యాంకు ఉద్యోగులు సైతం అక్కడకు చేరుకుని బ్యాంకు యూనియన్లో కీలకమైన పాత్ర పోషించిన ఆనందబాబు కనీసం ఒక్కమాట చెప్పి ఉంటే ఇంతకష్టం వచ్చేది కాదని అన్నారు. తులీప్ అపార్టుమెంటు వాసులు సైతం అందరితోను కలివిడిగా ఉండే ఆనందబాబు, అరుణ దంపతులు ఈ విధంగా చేస్తారని అనుకోలేదన్నారు. ఆ నలుగురే కారణమా? సంస్థ నెలకొల్పడానికి సాయం చేస్తామని వంచన డబ్బు తీసుకుని ముఖం చాటేసిన వైనం సాయిచరణ్ సూసైడ్ నోట్లో వివరాలు వెల్లడి రాజమహేంద్రవరం రూరల్: నలుగురు వ్యక్తులు యువమేధావికి ఆశలు కల్పించడంతో పాటు, దఫదఫాలుగా సుమారు రూ.23.75 లక్షలు తీసుకుని ఇప్పుడు తమకు ఎటువంటి సంబంధం లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తేచావండి అని అనడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజమహేంద్రవరం కెనరాబ్యాంకు క్యాష్ అసిస్టెంట్ ఆనందబాబు, అతని భార్య అరుణ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం, వారి కుమారుడు లక్ష్మీచంద్సాయిచరణ్ ఆచూకీ లభించకపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఆనంద్బాబు కుమారుడు రాసిన సూసైడ్నోట్లో విషయాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో సంవత్సరం చదువుతున్న చంద్సాయిచరణ్ తన సీనియర్లు రాజీవ్, మోహన్, సురేష్, హరికమల్, అఖిల్తో కలసి సోలార్కార్ల తయారీ ప్రాజెక్టును డిజైన్ చేశాడు. దీంతో ఏడాదిన్నర క్రితం ఆల్ట్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి దానికి సీఈవో, ఫౌండర్గా చరణ్ ఉన్నాడు. కళాశాల యాజమాన్యం అనుమతి తీసుకుని ఏడాదిగా ప్రాజెక్టు విషయంపై తిరుగుతున్నాడు. అయితే సోలార్ టెక్నాలజీతో తయారుచేసిన ప్రాజెక్టును పట్టాలెక్కించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో ఎవరైనా పెట్టుబడిదారుడ్ని పట్టుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు బ్రోకర్లు కె.సత్యనారాయణ, బి.అప్పల కనక శ్రీనివాస్ ఎలియాస్ స్వామిలను వీరు ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు భూమి అవసరమని అలాగే పెట్టుబడి కూడా కావాల్సి ఉంటుందని సదరు బ్రోకర్లకు చరణ్, అతని స్నేహితులు చెప్పినట్లు సమాచారం. దీంతో తాము అంతా చూసుకుంటామని భరోసా ఇచ్చిన బ్రోకర్లు.. విశాఖపట్నానికి చెందిన స్థల యజమాని దొర, గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలను రంగంలోకి దింపినట్లు సమాచారం. మొత్తం ఈ నలుగురు కలసి చరణ్ బృందం నుంచి ఖర్చులు నిమిత్తం రూ.23.75 లక్షలను తీసుకున్నట్లు సూసైడ్నోట్ ద్వారా అర్థమవుతోంది. పరిశ్రమకు సంబంధించిన 20 ఎకరాల భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా డబ్బు సమకూరుస్తామని చెప్పి చరణ్ బృందం నుంచి ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్కులు ఉద్యోగాల నిమిత్తం తీసుకున్నట్లుగా చూపిస్తూ చెక్కులు రిటర్న్ అయినట్లు సూసైడ్నోట్లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.23.75 లక్షలు చరణ్, అతడి స్నేహితులు సత్యనారాయణ ద్వారా స్వామి, దొర, ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డిలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు నలుగురు మోసం చేయడంతో చరణ్ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకపోయింది. మిగిలిన వారి నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో ఆనందరావు, అరుణ, చరణ్లు మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. స్థలం యజమాని దొర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఫైనాన్షియర్ శ్రీనివాసరెడ్డి, బ్రోకర్లు సత్యనారాయణ, బీఏకే శ్రీనివాస్లను ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేయించమన్నా, అగ్రిమెంటు చేయమన్నా, కనీసం డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నా వారు వాయిదాలు వేస్తూ రావడంతో చరణ్ కుటుంబం విసిగి వేసారిపోయింది. వారికి ఎన్నిసార్లు ఫోన్చేసినా ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అంటూ సమాధానాలు రావడంతో ఆకుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆనందబాబు సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలోనే బొమ్మూరు ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి, ఎస్సై యూవీఎస్ నాగబాబు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. -
సయోధ్యకు వెళ్తే చంపేశారు
రాజమహేంద్రవరం రూరల్: సయోధ్య కెళ్లితే ప్రత్యర్థుల దాడిలో రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన పరిమి నందకిశోర్ (34) మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తొర్రేడులో శుక్రవారం రాత్రి 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన పరిమి నందకిశోర్(34) తండ్రి చనిపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం తల్లితో కలిసి రాజమహేంద్రవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నారు. నందకిశోర్ తొర్రేడుకు చెందిన చిట్టూరి సుధీర్కు స్నేహితుడు. అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి సుధీర్తో అతని స్నేహితులతో కలసి తిరుగుతుంటాడు. ఈ ఏడాది జనవరిలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాముకు వచ్చిన గొడవల నేపథ్యంలో ఉప్పులూరి రాము స్నేహితుడు ఉప్పులూరి బూమేష్ తండ్రి రామకృష్ణ తలపై పరిమి నందకిశోర్ దాడి చేశాడు. ఈ దాడిలో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చిట్టూరి సుధీర్, పరిమి నందకిశోర్పై రాజానగరం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం ఇరువురి మధ్య రాజీ అవ్వడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇటీవల కాలంలో చిట్టూరి సుధీర్, ఉప్పులూరి రాములు మరి కొంతమంది కొంతమూరులో కల్చ రల్ క్లబ్ నిర్వహించేందుకు రూ.15 లక్షల పెట్టుబడితో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో పెట్టిన పెట్టుబడి నష్టం వచ్చిందని సుధీర్, రాముల మధ్య వివాదం నెలకొంది. ఇరువురు మధ్య సయోధ్య కుదుర్చుతానని పరిమి నందకిశోర్, రాజమహేంద్రవరం ఆవ ప్రాంతానికి చెందిన వరుణ్కుమార్, మరి కొంతమంది రాజమహేంద్రవరంలోని ఒక ప్రముఖ హోటల్లో మద్యం సేవించి శుక్రవారం రాత్రి తొర్రేడు గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాలు మాట్లాడుకునే సమయంలో మాటామాటా పెరిగి ఉప్పులూరి రాము మరి కొంతమంది పరిమి నందకిశోర్, వరుణ్కుమార్ తదితరులపై పదునైన కత్తులతో దాడి చేయబోగా పరుగులు తీశారు. తొర్రేడు సొసైటీ కార్యాలయానికి ఎదురుగా వచ్చేసరికి నందకిశోర్ తలపై, ఒంటిపైన విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పరుగులు తీసిన వరుణ్కుమార్ గాయాలపాలు కావడంతో అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సంఘటన స్థలాన్ని అర్బన్ పోలీస్ జిల్లా ఏఎస్పీ(లా అండ్ ఆర్డర్) లతా మాధురి, తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు, రాజానగరం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కేఎన్ మోహన్రెడ్డి తదితరులు పరిశీలించారు. అలాగే డాగ్ స్క్వాడ్ను తీసుకువచ్చారు. పాతకక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే పరిమి నందకిశోర్ హత్యకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలన తొర్రేడు సొసైటీ కార్యాలయం ఎదురుగా పరిమి నందకిశోర్ హత్యకు గురికావడంతో కార్యాలయం ఆవరణలోని సీసీ ఫుటేజీ హార్డ్కాపీ తీసుకుని వెళ్లి ఏఎస్పీ, డీఎస్పీలు పరిశీలిస్తున్నారు. అయితే రాత్రి సమయం కావడంతో సరిగా కనిపించడం లేదు. వరుణ్కుమార్ ఫిర్యాదు మేరకు రాజానగరం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మోహన్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా... మేనకోడల్ని చూడాలని ఉంది అక్కా అని చెప్పిన తమ్ముడు ఇలా మృత్యువాత పడతాడని అనుకోలేదని పరిమి నందకిషోర్ అక్క విజయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అమ్మా ఉమాదేవి, తమ్ముడు ఇద్దరూ కలిసి ఉంటారని, ఇప్పుడు అమ్మకు పుత్రశోకం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. తొర్రేడులో నందకిషోర్ నిర్జీవంగా పడి ఉండడాన్ని అతని తల్లి ఉమాదేవి తట్టుకోలేక పోయింది. తన కుమారుడును ఈ విధంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. -
బ్లేడ్ బ్యాచ్ ఎఫెక్ట్... రౌడీ షీటర్ హత్య
రాజమహేంద్రవరం క్రైం: బ్లేడ్ బ్యాచ్ ముఠా తగాదాలలో మరో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. కంబాలపేటకు చెందిన చల్లా భరత్ (25) అనే రౌడీ షీటర్ను ప్రత్యర్థులు బుధవారం పథకం ప్రకారం హత్య చేశారు. రెండు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చోడేశ్వరనగర్లోని చింతతోపులో భరత్ మద్యం సేవిస్తున్నట్లు భరత్ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న వీరభద్రనగర్కు చెందిన గంజాయి వ్యాపారి రింగ్(అలియాస్ రెడ్డి దుర్గ), బాలాజీపేటకు చెందిన పెద్దజగ్గ (అలియాస్ అల్లం జగదీష్), తాడితోటకు చెందిన సూరి (అలియాస్ బూరా సురేష్) మోటారు సైకిల్పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవించేందుకు సిద్ధమవుతున్న భరత్ను ముందుగా సర్వే కర్రతో తలపై బలంగా కొట్టడంతో తల పగిలిపోయింది. దీనితో పక్కకు పడిపోయిన భరత్ను నిందితులు వెంట తెచ్చుకున్న బటన్ నైఫ్తో గుండెల్లో పొడిచి హత్య చేశారు. కొన ఊపిరితో ఉన్న భరత్ను అతని స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్ కుమార్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఎలా జరిగిందంటే... రెండు నెలల క్రితం చంపేస్తామని ప్రత్యర్థి వర్గం భరత్ ఇంటికి వచ్చి గోడవ చేశారు. భరత్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే భరత్ తమ్ముడు శరత్ మృతి చెంది బుధవారానికి మూడు నెలలు కావడంతో కుటుంబ సభ్యులతో కలసి రాజమహేంద్రవరం, ప్రకాష్నగర్లోని చిన ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉదయం పూజలు చేసి 8 గంటల సమయంలో తల్లి, భార్యను ఇంటికి పంపేశాడు. తన స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్ తదితరులతో కలసి మద్యం సేవించేందుకు చోడేశ్వరనగర్లోని చింతతోపు వద్ద కూర్చొని తన ఇద్దరు స్నేహితులను మద్యం తీసుకువచ్చేందుకు పంపించా డు. అయితే స్నేహితుల ద్వారా భరత్ చోడేశ్వరనగర్లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రత్యర్థులు మోటారుసైకిల్ పై వచ్చి సర్వే కర్ర, చాకులతో హత్య చేశారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి, డీఎస్పీలు జె.కులశేఖర్, యు.నాగరాజు, త్రీటౌన్ సీఐ శేఖర్బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై పైలు కేసులు మృతుడి పై త్రీటౌన్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్ ముఠాలుగా ఏర్పడి అమాయకులను టార్గెట్ చేసుకొని వారిపై దాడులు చేసి నగదు చోరీ చేయడం, మద్యం షాపులలో గొడవలు పడడం వంటి నేరాలలో మృతుడు భరత్పై కేసులు ఉన్నాయి. దీనితో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచారు. మృతుడి తమ్ముడు చల్లా శరత్ గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్న తరువాత కొంత వరకూ గొడవలు తగ్గించుకున్నప్పటికీ పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం భరత్ను హత్య చేసేందుకు అతని ఇంటి చుట్టూ తిరిగే వారు. బ్లేడ్ బ్యాచ్ ముఠా ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం నగరంలో రెండు బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ఆధిపత్య పోరులో హత్యల పరంపర కొనసాగుతోంది. గతంలో రాజేంద్రనగర్కు చెందిన ధనాల దుర్గారావు అనే ఆటో డ్రైవర్ను బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా పేపర్ మిల్లు వద్ద గల పెట్రోల్ బంక్ వెనుక శివ అనే యువకుడిని హత్య చేశారు. అప్పటి నుంచి నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆధిపత్య పోరు కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న దారా మహేష్, ఉప్పు శివ, తదితరులకు ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లేడ్ బ్యాచ్లకు చెందిన ఇరువర్గాల వారికి రాజకీయ ప్రాబల్యం ఉండడంతో పోలీసులు వీరిని వివిధ కేసులలో అరెస్ట్ చేసి జైల్కు పంపించినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చేస్తున్నారు. దీంతో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు నగరంలో పెచ్చుమీరుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తే తప్ప వీరి ఆగడాలకు అడ్డుకట్టపడదు. -
గో‘దారులు’ కావివి.. రహదారులే..
సాక్షి, రాజమహేంద్రవరం: ఏడాదంతా నగరం పక్కన గోదారమ్మను చూస్తున్న రాజమహేంద్రవరంవాసులు వర్షం వచ్చినప్పడల్లా నగరంలోనే గోదావరిని చూస్తున్నారు. వరదల సమయంలో గోదావరి ప్రవాహాన్ని తిలకిస్తున్న ప్రజలు వరుణుడు వచ్చిన ప్రతిసారీ తమ ఇళ్ల ముందు రోడ్లపైనే గోదావరి నది ప్రవాహంలా సాగుతున్న వర్షపు నీటిని చూసి ఇదేమి నగర పాలక సంస్థంటూ మండిపడుతున్నారు. అరగంట వర్షం పడితేనే ఉభయగోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరం ముంపునకు గురవుతుండడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన పురాతన నగరంలో శతాబ్ధాల నాటి డ్రైనేజీలే దిక్కు కావడంతో వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. ప్రజావసరాలకు అనుగుణంగా డ్రైనేజీల పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో నగరంలోని ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వాగులను తలపిస్తున్న రహదారులు.. రాజమహేంద్రవరం నగరంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవిని తలపించేలా భానుడు తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దాదాపు 45 నిమిషాలపాటు కురిసిన వర్షంతో నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామలా సెంటర్, ఆర్యాపురం, తుమ్మలోవ, పేపర్మిల్లు రోడ్డులోని వీరభద్రాపురం, లలితానగర్, సీతమ్మపేట, కోరుకొండ రోడ్డులోని సుభాష్నగర్, మార్కెట్ ఏరియా వెనుక ప్రాంతం, కంబాల చెరువు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంబాల చెరువు హైటెక్ బస్స్టాండ్ ప్రాంతంలో నడుములోతు నీరు నిలిచింది. పక్కనే ఉన్న ప్రధాన కాలువ ఉధృతంగా ప్రవహించింది. బస్స్టాండ్ ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డులో మోకాలు లోతు నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు మూడు మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు. శ్యామలా సెంటర్లో జలమయమైంది. పేపర్మిల్లు రోడ్డులోని వీరభద్రాపురం రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లింది. పేపర్మిల్లు రోడ్డు నుంచి వచ్చే వర్షపు నీరు ఆదెమ్మదిబ్బ, సీతమ్మపేట ప్రాంతం వైపు ఉధృతంగా ప్రవహించింది. వర్షం తెరపిచ్చినా దాదాపు రెండుమూడు గంటల సేపు వరద నీరు ప్రవహించింది. మోకాలు లోతు నీటిలోనే వాహనదారులు, పాదచారులు ప్రయాణించేందుకు అవస్థలు పడ్డారు. మృత్యుకుహరాలుగా మ్యాన్హోల్స్... వర్షం పడిన ప్రతిసారీ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో 625 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇందులో ప్రధాన డ్రైనేజీ 14 కిలోమీటర్లు, 213 కిలోమీటర్లు మేర మూడు అడుగుల డ్రైనేజీలు ఉండగా మిగతా 398 కిలోమీటర్లు డివిజన్లలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఉంది. సాధారణ నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో ప్రతి ఏడాది కోట్ల రూపాయలతో డ్రైనేజీ ఆధునికీకరణకు నగరపాలక సంస్థ ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. అయితే నగర జనాభా పెరుగుతున్న మేరకు మౌలిక సదుపాయాలు కల్పన జరగకపోవడంతో ముంపు తప్పడంలేదు. డ్రైనేజీలు పొంగినప్పుడు ఆయా ప్రాంతాల్లోని మ్యాన్హోల్స్ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. -
స్నేహితురాలితో బైక్పై వెళుతుండగా..
రాజమహేంద్రవరం క్రైం: లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీనివాసనగర్, రామగిరి ప్రాంతానికి చెందిన ఉత్తమ రాజు నిఖిల్ కుమార్(35) హైదరాబాద్లో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాడు. అతడి స్నేహితురాలు హైదరాబాద్, శారదా నగర్ రోడ్డు, సరూర్ నగర్కు చెందిన నివేదితతో కలసి హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్పై విశాఖపట్నం వెళుతుండగా దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద రోడ్డుపై గుంత ఉండడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి బైక్ను ఢీ కొట్టి, నిఖిల్కుమార్పై నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో నిఖిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న నివేదితకు కుడి కాలు, కుడి చేయి విరిగాయి. గాయాలు పాలైన ఇద్దరినీ రోడ్డు సేఫ్టీ కానిస్టేబుళ్లు ఎన్. లక్ష్మణరావు, నర్సయ్యలు హుటాహుటిన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివేదిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుడు నిఖిల్ కుమార్, నివేదితకు వేరు వేరుగా వివాహాలైనట్టు పోలీసులు తెలిపారు. కొంత కాలంగా వారు స్నేహంగా ఉంటున్నారన్నారు. సోమవారం హైదరాబాద్లో బయల్దేరి ఉంటారని, మార్గం మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలో చర్చిని సందర్శించుకొని రోడ్డు మార్గంలో గామన్ ఇండియా బ్రిడ్జి మీదుగా వైజాగ్ వెళుతుండగా వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్నారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. బొమ్మూరు సీఐ నాగమోహన్ రెడ్డి, ఎస్సైలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాయకుల ప్రమేయంతోనే.. హైటెక్ వ్యభిచారం!
రాజమహేంద్రవరం క్రైం: అర్బన్ జిల్లా పరిధిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత శ్రేణి వర్గాలకు చెందిన యువకులు, వ్యాపారులకు వలలు వేసి ఆన్లైన్, వాట్సప్ల ద్వారా అమ్మాయిల చిత్రాలు చూపించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఫోన్ల ద్వారా సాగుతుండడంతో పోలీసులు రైడింగ్కు వచ్చే సరికి మొత్తం వ్యవహారం ముగుస్తుంది. నగరంలో కొన్ని ఖరీదైన హోటళ్లలో, శివారు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఈ వ్యవహారం సాగిస్తున్నారు. ఈ ముఠాలు సంపన్న వర్గాల వ్యక్తులను ఫోన్ ద్వారా కంట్రాక్ట్ చేస్తారు. ఏదో ఒక రాష్ట్రం నుంచి అమ్మాయిలు వచ్చారని, వారి చిత్రాలను ఫోన్ ద్వారా పంపిస్తారు. డీల్ కుదిరితే ఒక గంటలో తాము చెప్పిన ప్రాంతానికి రావాలని చూసిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రాంతానికి చేరుకొని నిర్ణీత సమయంలో వ్యవహారం ముగించుకొని బయటపడుతున్నారు. కొన్ని సమయాల్లో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించినా.. వారు వచ్చేసరికి మొత్తం సీను మారిపోతుంది. పోలీసులు వచ్చినా ఆ ప్రాంతంలో ఏవిధమైన ఆధారాలు లేకుండా చేస్తున్నారు. దీంతో పోలీసులకు చిక్కకుండా వ్యభిచార ముఠాలు వ్యవహారం నడిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రాజమహేంద్రవరానికి ఎయిర్ పోర్టు సౌకర్యం ఉండడంతో విమానం ద్వారా ముంబయి, ఢిల్లీ, కోల్కత్తా, ఈశాన్య రాష్ట్రాలు, గోవా తదితర ప్రాంతాల నుంచి నగరానికి అమ్మాయిలను తీసుకు వస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మాయిలకు నెలకు, 15 రోజులకు వారం రోజులకు కొంత సొమ్ము చెల్లిస్తామని చెప్పి మాట్లాడుకొని ఇక్కడికి తీసుకువస్తున్నారు. నిర్ణీత సమయం వరకూ శివారు ప్రాంతాలలో అద్దె ఇళ్లలో ఉంచి రాత్రి సమయాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అమ్మాయిలకు చెల్లిస్తామని చెప్పిన సొమ్ములు మొత్తం కూడా ఎగ్గొట్టిన సందర్భాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు విషయం బయటకు చెప్పలేకపోతున్నారు. ఈ హైటెక్ వ్యభిచారం కొందరి రాజకీయ నాయకుల ప్రమేయంతోనే నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో పోలీసులు దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గోదావరి లంక గ్రామాల్లోని ప్రజలను అల్కాట్ గార్డెన్స్ కార్పొరేషన్ కల్యాణమండపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆ పునరావాసకేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. బాధితులకు అందుతున్న భోజనాలు, పాలు, బ్రెడ్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆహారంతోపాటు గుడ్లను కూడా అందించాలని అధికారులకు సూచించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఎప్పటికప్పడు బాధితుల ఆరోగ్యాన్ని పరిశీలించి అవసరమైన మందులు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్ధ కమిషనర్ సుమిత్ కుమార్ ఉన్నారు. ఏడు పునరావాస కేంద్రాల ఏర్పాటు గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున జిల్లా వ్యాప్తంగా 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కార్తి్తకేయ మిశ్రా వెల్లడించారు. ఆయన శనివార ం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వరద పరిస్థితుల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడు పునరావాస కేంద్రాల్లో మొత్తం 832 మంది తలదాచుకున్నట్టు ఆయన తెలిపారు. అమలాపురం డివిజన్ పరిధిలో 4 పునరావాస కేంద్రాలను, రాజమహేంద్రవరం పరిధిలో 2 పునరావాస కేంద్రాలు, రంపచోడవరం డివిజన్లో 1 పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం పరిధిలో ఒక గ్రామం, రంపచోడవరంలో 2 గ్రామాలు, ఎటపాక ప్రాంతంలో 17 గ్రామాల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు. వరదబాధిత ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వచ్చే వారంలో శబరి బేసిన్లో వర్షాలు కురుస్తాయనే సమాచారం ఉండడంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం గోదావరి ఉధృతి ఎగువ ప్రాంతాల్లో తగ్గిందన్నారు. విలీన మండలాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసినట్టు అయన తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.6 అడుగులు, రంపచోడవరం ప్రాంతంలో 47.2 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 14.6 అడుగుల నీటి మట్టం నమోదు అయినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ సాయికాంత్వర్మ, అర్బన్ ఎస్పీ íషిమోషి బాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించిన యువతి బంధువులే హత్య చేశారు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: యువకుడు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్పై మృతి చెందిన ఘటనపై రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. ఆల్కట్ తోటకు చెందిన రేగుళ్ల అరుణ్ కుమార్(22) రాజమహేంద్రవరం బాలాజీ పేట రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడు ఆల్కట్ తోట ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తుండగా.. నాలుగు నెలల క్రితం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో యువకుడిని చంపుతామని బెదిరించిన యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హతమార్చి రైల్వే ట్రాక్పై పడేశారని యువకుడి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. అరుణ్ కుమార్ తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోవడంతో తల్లి జీవీకే విద్యుత్ ప్లాంట్లో కేటరింగ్ పని చేస్తూ తన ముగ్గురి పిల్లల్ని పోషిస్తోంది. మృతి చెందిన అరుణ్ కుమార్ రెండో వాడు కాగా, అతడు టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరూ సెంటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతదేహం, తలపైన మూడు చోట్ల గాయాలుండడం, అలాగే నొసటి పైనా గాయం ఉండడం, కాలిపై నుంచి రైలు చక్రం ఎక్కి నుజ్జునుజ్జుకావడంతో బంధువులు ఆ యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆల్కట్ తోటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టూ టౌన్ సీఐ ముక్తేశ్వరరావు సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జీఆర్పీ ఎస్సై సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో తల్లడిల్లుతున్న తల్లి ఎదిగి వచ్చిన కుమారుడు మృతి చెందడంతో మృతుడి తల్లి, అన్నదమ్ములు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. -
నేనున్నానని భరోసా ఇస్తూ..
సాక్షి, రాజమహేంద్రవరం: ఓ వైపు భానుడి ఉష్ణోగ్రతలు, మరో వైపు ఉక్కపోత, మంచినీరు తాగినా నిమిషాల్లో చెమటగా వెళ్లిపోతున్నా లెక్కచేయలేదు. తమ అభిమాన నాయకుడు, రాజన్న బిడ్డను చూడాలంటూ చేబ్రోలు పోటెత్తింది. తమ తోబుట్టువును చూడాలని చంటి బడ్డలతో అక్కాచెల్లెమ్మలు, తమ మనవడిని పలకరించాలని ఊత కర్రతో అడుగులో అడుగేసుకుంటూ అవ్వాతాతలు, తమ అభిమాన నాయకుడి ఆటోగ్రాఫ్లు, సెల్ఫీల కోసం యువత చేబ్రోలు రోడ్లపై వరుసకట్టింది. ఉదయం నుంచి ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడన్న మాటలు వింటూ రోడ్ల వెంబడి గంటల తరబడి ఎదురు చూశారు. తమ రాజన్న బిడ్డను చూశామన్న ఆనందంతో వారంతా చిన్నపిల్లల్లా మురిసిపోయారు. సామాన్యులు చెప్పుకున్న సమస్యలను జగన్ సావధానంగా విన్నారు. తానున్నానని వారికి భరోసా కల్పించారు. మరి కొద్ది రోజులు ఓపిక పట్టండంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు. కష్టాలు, సమస్యలు చెప్పుకున్న ఆపన్నులు కష్టాలు తీర్చే చల్లనయ్య వచ్చాడంటూ వివిధ వర్గాల ప్రజలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ బాధలు, సమస్యలను జగన్కు చెప్పుకున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని కాపాడాలని గొల్లప్రోలుకు చెందిన చేనేత కార్మికులు బండారు బాబూరావు, పలకా సుబ్బారావులు విన్నవించారు. వైఎస్సార్ హయాంలో జిల్లాలో 50 సంఘాలు ఉండగా ప్రస్తుతం 8 మాత్రమే ఉన్నాయని తమ దుస్థితిని వివరించారు. చదువుకున్న దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని మేడిశెట్టి నాగమణి విజ్ఞప్తి చేసింది. ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న తమకు ఏదైనా ఆధారం చూపించాలని పెంకే రాంబాబు, రమాదేవి దంపతులు కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పార్ట్టైం టీచర్స్ వినతిపత్రం విచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు రక్షణ కల్పించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విద్యార్థులు మానస, దేవి, పద్మ, దుర్గాభవాని వినతి పత్రం ఇచ్చారు. అందరి సమస్యలు, కష్టాలు విన్న జగన్ పరిష్కారంపై స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో పార్టీ శ్రేణులు.. పాదయాత్రలో శనివారం పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మళ్ల విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు అనంత ఉదయ్భాస్కర్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, బుర్రా అనుబాబు, రావి చిన్నారావు, వెంగలి సుబ్బారావు, మాదిరెడ్డి దొరబాబు, చింతపల్లి ఏసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు మురిసింది ప్రజా సంకల్ప పాదయాత్ర 228వ రోజు శనివారం చెందుర్తి క్రాస్ నుంచి మొదలై చేబ్రోలు గ్రామం మీదుగా దుర్గాడ క్రాస్ వరకు సాగింది. రాత్రి బస కేంద్రం వద్ద ఉదయం నుంచే తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, అక్కచెల్లెమ్మలను పలకరించిన జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మరో రెండు అడుగులు వేయగానే పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు. చేబ్రోలు గ్రామంలోకి అడుగుపెట్టగానే వారు హారతులు పట్టి స్వాగతం పలికారు. రామాలయం సెంటర్ వద్దకు చేరుకునేందుకు మధ్యాహ్నం 12 గంటలు పట్టింది. అక్కడ భోజన విరామం అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలైంది. చిన్నారులు, యువత, అభిమానులు సెల్ఫీల కోసం ఉవ్విళ్లూరారు. వివిధ వర్గాల వినతులు, ఆపన్నుల ఆరోగ్య బాధలు వింటూ పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపుతూ, భవితపై భరోసా ఇస్తూ జగన్ 216వ నంబర్ జాతీయ రహదారిపైకి అడుగుపెట్టారు. గ్రామం చివరన జాతీయ రహదారి పక్కన ఉన్న ఆదర్శ కాలేజీ విద్యార్థులు రెడ్ కార్పెట్తో జగన్కు స్వాగతం పలికారు. పార్టీ రంగులతో కూడిన బెలూన్లు ఎగరవేసి కేరింతలు కొట్టారు. భారీ ఎత్తున గాలిలో ఎగురుతున్న బెలూన్లు అందరినీ ఆకర్షించాయి. జగన్తో విద్యార్థులు సెల్ఫీలు దిగిన అనంతరం పాదయాత్ర కొనసాగింది. సాయంత్రం 5:40 గంటలకు దుర్గాడ జంక్షన్లోని రాత్రి బస కేంద్రం వద్దకు చేరుకుంది. ఆదివారం పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. యాత్రలో భాగంగా సాయంత్రం కత్తిపూడిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నలతగా ఉన్నా పాదయాత్రలోనే.. శనివారం ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉన్నా వైఎస్ జగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం పాదయాత్ర కొనసాగించారు. ఉదయం నుంచి స్పల్ప జ్వరం, డస్ట్ అలెర్జీ, జలుబు, దగ్గుతో బాధపడుతున్న జగన్ మండుటెండలోనూ పాదయాత్ర సాగించారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి కష్టాలు సావధానంగా విన్నారు. డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతున్నా మోములో దరహాసంతో అభిమానుల కోరిక మేరకు స్వయంగా సెల్ఫీలు తీసి ఇచ్చారు. -
రాజన్న రాజ్యం తేవాలన్నా..
సాక్షి, రాజమహేంద్రవరం: అప్పటి వరకూ భారీ వర్షం పడి, మళ్లీ కమ్ముకున్న కారుమబ్బులు ప్రజాభిమాన వెల్లువతో తేలిపోయాయి. మధ్యాహ్నం వరకు వరుణుడి హోరు.. సాయంత్రం జనజోరులో రామచంద్రపురం పట్టణం తడిసి ముద్దయ్యింది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి జేజేలు పలికారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే జగన్ తన పాదయాత్రను జగన్నాయకులపాలెం నుంచి ప్రారంభించారు. మధ్యాహ్నం మూడు గంటలకు వరుణుడు శాంతించడంతో సాయంత్రం జరిగే బహిరంగసభకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్న భావన నెలకొన్న సమయంలో ఒక్కసారిగా దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంటుందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఉప్పెనలా జన ప్రవాహం వెల్లువెత్తింది. వెల్ల జంక్షన్ నుంచి రామచంద్రపురం పట్టణం మార్కెట్ సెంటర్లోని బహిరంగ ప్రదేశం వరకు రోడ్డు పొడవునా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, యువత, కాలేజీ, పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో నిలుచున్నారు. వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. డప్పులు, బాణసంచా పేలుళ్లతో రామచంద్రపురం పట్టణం మార్మోగిపోయింది. సాయంత్రం 4:40 గంటలకు ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రసంగం 5:43 గంటల వరకు సాగింది. పాదయాత్రలో స్థానిక ప్రజలు తన దృష్టికి తెచ్చిన నెలపర్తిపాడు పంచాయతీ పరిధిలోని రోడ్డు ఏర్పాటులో వివక్ష, నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కొరత సమస్య, ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత, రక్షిత నీటి పథకాల నిర్వహణ లోపం తదితర సమస్యలను ఎత్తి చూపుతూ వైఎస్ జగన్ ప్రసంగం సాగింది. నియోజకవర్గం అభివృద్ధికి పాలకులు ఇచ్చిన హామీలు అటకెక్కాయంటూ ద్రాక్షారామ రింగ్ రోడ్డు, రామచంద్రపురం డంపింగ్ యార్డు తరలింపు అంశాలను ప్రస్తావిస్తూ ఇలాంటి పాలన మనకు కావాలా? అంటూ ప్రజల అభిప్రాయం అడగ్గా ప్రజలు వద్దూ వద్దూ అంటూ చేతుల పైకెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఇంటికి పంపేలా, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు తనకు మీ అందరి సహకారం కావాలని కోరుతూ, ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అశేష జనవాహిని పాదయాత్రలో వెంట రాగా రాత్రి బసకు పసలపూడి చేరుకున్నారు. పాదయాత్ర సాగిందిలా.. ప్రజాసంకల్ప యాత్ర 207వ రోజు రామచంద్రపురం రూరల్ మండలం జగన్నాయకులపాలెం నుంచి ప్రారంభమైంది. తనను చూసేందుకు వేకువజాము నుంచి వేచియున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉదయం 8:40 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వివిధ వర్గాల ప్రజల వినతులు స్వీకరించిన జగన్ వాటిని పరిశీలిస్తూ ముందడుగు వేశారు. చినతాళ్లపొలం గ్రామంలో గ్రీన్ కార్పెట్ పరిచి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 2011లో ఓదార్పు యాత్రలో తన ఏడు నెలల కుమారుడికి వైఎస్ జగన్తో రాజశేఖరరెడ్డి అని నామకరణం చేయించుకోవడంతో తన కుటుంబానికి రేషన్కార్డు, తనకు వికలాంగ పింఛన్ నిలిపివేశారని మారిశెట్టి రూతమ్మ అనే దివ్యాంగురాలు వైఎస్ జగన్కు ఫిర్యాదు చేసింది. పెదతాళ్లపాలెంలో అభిమానాలు, అక్కాచెల్లెమ్మలు ఎదురేగి స్వాగతం పలికారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసే తన కుమారుడు ప్రకాశ్ దమ్ము ట్రాక్టర్ తిరగబడడంతో చనిపోయాడని మేడిశెట్టి వెంకట లక్ష్మి జగన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్ తాను అండగా ఉండానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. ఆర్టోస్ కంపెనీ వద్ద కార్మికులు ఇచ్చిన శీతల పానీయం జగన్ రుచి చూశారు. వెల్ల జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం అనంతరం సాయంత్రం తిరిగి పాదయాత్ర మొదలైంది. రామచంద్రపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలు జగన్కు నీరాజనాలు పలికారు. అశేష జన సందోహాన్ని ఉద్దేశించి సాగిన వైఎస్ జగన్ ప్రసంగం స్థానిక సమస్యలను స్పృశిస్తూ, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, వివక్ష పాలనను ఎండగడుతూ సాగింది. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర మండపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రాయవరం మండలం పసలపూడిలోని రాత్రి బస చేసేందుకు జగన్ ఆగారు. శనివారం వైఎస్ జగన్ 8.4 కి.మీ మేర నడిచారు. పాదయాత్రలో పార్టీ శ్రేణులు... 207వ రోజు ప్రజా సంకల్ప యాత్ర, బహిరంగ సభలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, నరసాపురం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్చంద్రబోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి కొప్పన మోహన్రావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణుగోపాల్, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, అనంత ఉదయ్భాస్కర్, వేగుళ్ల లీలాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్రెడ్డి, పార్టీ నేతలు పితాని అన్నవరం, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టికూటి రాజశేఖర్, యువ నేత పిల్లి సూర్యప్రకాశ్, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, రాష్ట్ర బీసీ విభాగం కార్యనిర్వాహక సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు యనమదల మురళీకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు టేకిమూడి సత్యనారాయణ, చిల్లే నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు, రామచంద్రపురం పట్టణ కన్వీనర్ గాదెంశెట్టి శ్రీధర్, రామచంద్రపురం మండల కన్వీనర్ పంతగడ విజయప్రసాద్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా ఆదివారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, పాదయాత్ర 2500 కిలో మీటర్లు సాగిన సందర్భాలను పురస్కరించుకుని అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు. వివక్ష చూపుతున్నారన్నా...! పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు, స్థానికులు తమ సమస్యలు, కష్టాలను వైఎస్ జగన్కు చెప్పుకున్నారు. స్థానిక నేతలు అభివృద్ధి చేయాల్సింది పోయి రోడ్డు పనులు అడ్డుకుంటున్నారని రామచంద్రపురం సమీపంలోని నెలపర్తిపాడు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. పది గ్రామాల ప్రజల రాకపోకలకు అవసరమై రోడ్డు కోసం రూ.40 లక్షలు మంజూరైతే ఎమ్మెల్యే వెనక్కి పంపేశారని వాపోయారు. కాపు సామాజిక వర్గంలోని పేదలకు రుణాల మంజూరులో కాపు కార్పొరేషన్ కపట నాటకం ఆడుతోందని కాకినాడ రూరల్కు చెందిన లింగం రవి జగన్కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాలతో తమకు మేలు జరుగుతుందని విశ్వ బ్రాహ్మణులు జగన్ను కలిసి మద్దతు తెలిపారు. ఎండ, వానకు తడుస్తూ తెగిన చెప్పులు కుట్టుకుంటున్న తమ బతుకుల్లో వెలుగులు నింపాలని చర్మకారులు వినతిపత్రం ఇచ్చారు. శ్మశాన స్థలం, కమ్యూనిటీ భవనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నియోజకవర్గ ఫెలోషిప్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమను మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు వాపోయారు. ఎరువులు, పురుగు మందుల ధరలు భారంగా మారాయని, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని రైతు మట్టపర్తి వెంకట్రావు కోరారు. వైఎస్సార్ సీపీకి మద్దతుదారుడనే నెపంతో తనను అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నుంచి తొలగించారని దడాల సూర్యనారాయణ భార్య పిల్లలతో వచ్చి జగన్కు చెప్పుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన భర్తకు వైద్య సహాయమందించాలని షేక్ రాజాబీ వేడుకుంది. తాతపూడి జయమ్మ, మట్టపర్తి వెంకాయమ్మ తదితరులు తమకు అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదని జగన్ వద్ద వాపోయారు. పింఛన్ ఇప్పించాలని కోరారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
రాజమహేంద్రవరం క్రైం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన బిక్కవోలు శ్రీనివాస్(20) శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దమయంతి అనే యువతితో వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ చాగల్లు గ్రామానికి చెందిన మరో యువతి బొల్లెపు స్వప్న గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 3న ఇద్దరూ కలసి చాగల్లు నుంచి విజయవాడ వెళ్లిపోయి, కనక దుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. అక్కడ నుంచి శ్రీనివాస్, స్వప్న రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొన్ని రోజులు లాడ్జిలో గడిపారు. రాజమహేంద్రవరానికి చెందిన ముప్పిడి రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతని ద్వారా శుక్రవారం జాంపేట గాంధీబొమ్మ ప్రాంతంలోని ఓ బిల్డింగ్లోని నాల్గో అంతస్తులో ఇద్దరూ కలసి రూమ్ అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రూమ్ శుభ్రం చేసుకొని 9 గంటలకు ఆ గదిలోకి దిగారు. రాత్రి చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అతడు నిద్రలో దమయంతి అని కలవరించడంతో ముందు భార్య గుర్తుకు వచ్చిందా? అంటూ స్వప్న అతడితో గొడవకు దిగడంతో ఇరువురూ ఘర్షణ పడ్డారు. దీంతో బయటకు వచ్చేసిన శ్రీనివాస్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కొక్కానికి చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. తనతో గొడవపడి వెళ్లిన శ్రీనివాస్ ఎంతకీ రాకపోవంతో బయటకు వచ్చి చూసే సరికి ఫ్యాన్ కొక్కేనికి వేలాడుతూ కనిపించాడని స్వప్న పోలీసులకు తెలిపింది. కింద పోర్షన్లోని వారి సాయంతో చాకుతో చీరను కోసి కిందకు దింపామని అప్పటికే మృతి చెందాడని ఆమె చెప్పింది. మొదటి భార్యకు అన్యాయం చేశాననే ఆత్మహత్య చేసుకున్నాడా? మొదటి భార్య దమయంతికి అన్యాయం చేసి, మరో వివాహం చేసుకున్నానన్నే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణమైనా ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని త్రీటౌన్ సీఐ మారుతిరావు, ఎస్సై రాములు సందర్శించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
అడ్డంకులు దాటి.. అన్నను చూడాలని..
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రత్యర్థుల ఆశలు అడియాసలయ్యాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు చిత్తయ్యాయి. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం ముమ్మిడివరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ ప్రసంగానికి జేజేలు పలికారు. ప్రత్యర్థుల ఊహకందని విధంగా ప్రజా ‘సంకల్పం’ ఉవ్వెత్తున ఎగసిపడడంతో అవాక్కవ్వడం వారి వంతైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర శనివారం అమలాపురం నియోజకవర్గం నుంచి ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మొదటి రోజు ముమ్మిడివరంలో జరిగిన బహిరంగ సభకు ప్రజలు తరలివెళ్లకుండా ప్రత్యర్థులు, అధికార పార్టీ నేతలు అనేక పన్నాగాలు పన్నారు. ఎలాగైనా సభను విఫలం చేయాలన్న లక్ష్యంతో ఉపాధి కూలీలకు పని ఇవ్వబోమని, సభకు వెళితే పింఛన్ కట్ చేస్తామని, ఇకపై ఏ ప్రభుత్వ పథకం ఇవ్వబోమని.. ఇలా పలు విధాలుగా బెదిరింపుల పర్వానికి తెరతీశారు. మరికొందరు సభకు వీలైనంత మంది వెళ్లకుండా చేసే ఉద్దేశంతో నగదు, మద్యం పంపిణీ చేశారు. ప్రజల అభిమానం ముందు ఇవన్నీ పటాపంచలయ్యాయి. వైఎస్ జగన్ ప్రసంగానికి నీరాజనం... ముమ్మిడివరం పట్టణం హైస్కూల్ సెంటర్లో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని వైఎస్ జగన్ ప్రసంగానికి నీరాజనాలు పలికింది. సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రసంగం స్థానిక సమస్యలను స్పృశిస్తూ, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, ఎన్నికల హామీల అమలు చేయడంలో మోసాన్ని వివరిస్తూ సాగింది. గంటా పది నిమిషాల పాటు ఏకథాటిగా సాగిన వైఎస్ జగన్ ప్రసంగం సభికులను ఉత్తేజితులను చేసింది. మధ్య మధ్యలో జగన్ వేసిన ప్రశ్నలకు ప్రజలు చేతులెత్తి తమ మద్దతును, సమాధానాన్ని తెలిపారు. తీవ్రమైన ఉక్కపోతలో కూడా సభలో ఉన్న ప్రతి ఒక్కరూ జగన్ ప్రసంగం ముగించే వరకు నించుని విన్నారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి.. వైఎస్ జగన్ తన ప్రసంగంలో స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీవనది గోదావరి పక్కనే పారుతున్నా ముమ్మిడివరంలో తాగునీటికి దిక్కులేకుండా పోయిందంటూ ప్రజలు చెప్పిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. కలుషిత నీటిని బాటిల్లో చూపుతూ రూ.2కే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని ఎన్నికల్లో çహామీ ఇచ్చి, ప్రమాణస్వీకారం రోజున చేసిన ఐదు సంతకాల్లో ఇదీ ఉందని చెబుతూ ప్రభు త్వ వైఫల్యాన్ని ఎండగట్టడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదల సమయంలో లంకల్లో నష్ట నివారణకు ఏటి గట్టు, గ్రోయిన్స్ నిర్మాణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. జూన్లో సాగునీరు విడుదల చేయాలని రైతులు మొత్తుకుంటున్నా జూలై వస్తున్నా నేటికీ నియోజకవర్గంలో పంట పొలాలకు సాగునీరందని విషయాన్ని ప్రస్తావిస్తూ తుఫాన్లపై రైతుల ఆందోళనను ప్రస్ఫుటం చేశారు. ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీ మేరకు కోనసీమలో కొబ్బరి పరిశ్రమ ఎక్కడైనా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. జి.మూలపొలం–గొల్లగరువు బిడ్జ్రిని 2009లో వైఎస్ హయాం లో శంకుస్థాపన చేసి 30 శాతం పనులు పూర్తి చేసినా ఆ తర్వాత ఆ పనులను గాలికొదిలేసిన పరిస్థితి ప్రభు త్వ తాత్సారాన్ని తేటతెల్లం చేస్తోందని మండిపడ్డారు. గుత్తెనదీవి–గోగుల్లంక వంతెన ప్రతిపాదనలూ పక్కనపెట్టేశారని, లంక గ్రామాలకు బయట ప్రపంచంతో అనుసంధానానికి ఎంతో అవసరమైన రెండు వంతెలనపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. పాదయాత్ర సాగిందిలా... ప్రజా సంకల్పపాదయాత్ర 201వ రోజు అమలాపురం నియోజకవర్గం నుంచి ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి శనివారం ఉదయం 8:40 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కొద్దిసేపటికి సింగరాయపాలెం దాటి అనాతవరం గ్రామం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గంలోని ప్రవేశించింది. మహిపాలచెరువు దాటిన తర్వాత శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో భోజన విరామం తర్వాత ప్రారంభమైన పాదయాత్ర బొండాయికోడు, కొండాలమ్మచింత మీదుగా ముమ్మిడివరంలోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంది. మార్గంమధ్యలో అక్కచెల్లెమ్మలు వైఎస్ జగన్కు హారతులు పట్టి స్వాగతం పలికారు. యువత, పిల్లలు తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగారు. కష్టాలు, సమస్యలు చెప్పుకున్న వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. బహిరంగ సభ అనంతరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో రాత్రి బస ప్రాంతానికి చేరుకున్న జగన్ను పలువురు పార్టీ నేతలు కలిశారు. 201వ రోజున 10.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. పాదయాత్రలో జననేతతో పార్టీ నేతలు.. పాదయాత్ర, బహిరంగ సభలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డి, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్చంద్రబోస్, కరసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, కొయ్యే మోషేన్రాజు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తోట సుబ్బారావునాయుడు, వేగుళ్ల లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు, పాముల రాజేశ్వరి, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శలు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పెనుమత్స చిట్టిరాజు, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయడు, జిల్లా రైతు విభాగం అ«ధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, బీసీ విభాగం అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం పార్లమెంట్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కసిరెడ్డి అంజిబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు కాశి మునికుమారి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పార్టీ కన్వీనర్లు జగతా పద్మనాభం, నల్లా నరసింహమూర్తి, పిన్నమరాజు వెంకటపతిరాజు, కాదా గోవిందకుమార్, పార్టీ నేతలు కాలే రాజబాబు, బళ్ల వెర్రబ్బాయి, భూపతిరాజు బుల్లిరాజు, ఢిల్లీ నారాయణ, రాయపురెడ్డి జానకిరామయ్య, దున్నా జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. -
చీమల మందు తాగించి, బ్లేడ్తో కోసి..
రాజమహేంద్రవరం క్రైం: పోలీసుల దర్యాప్తులో శాడిస్టు తల్లి శారద రాక్షస కృత్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. సినిమాల్లోని సైకో పాత్రలను మించిన ఆమె క్రూరత్వాన్ని చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ యు. నాగరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన మచ్చా శారద తన కుమార్తె మహాలక్ష్మిపై బ్లేడ్తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించింది. శారద, శివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి కాగా, చిన్న కుమార్తె నాగేశ్వరి. శారద తనకు తానుగా బ్లేడ్తో గాయపరుచుకుని భర్త కొడుతున్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పి అతడిపై పోలీసు కేసు పెట్టి విడాకులు తీసుకుంది. దివాన్ చెరువులోని ఒక హాటల్లో పనిచేస్తూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆ కోపాన్ని శారద తన పిల్లలపై చూపేదని ఇరుగుపొరుగు వారు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి శారద హోటల్లో పని ముగించుకొని ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేసింది. అల్లరి చేస్తున్న మహాలక్ష్మిని తిట్టి మందలించింది. మహాలక్ష్మి ఇంటి బయట వాకిట్లోని నీళ్ళ డ్రమ్ముని కాళ్ళతో తన్ని నీళ్ళు ఒలకబోసింది. దీంతో శారద కోపంతో ఆ బాలికను కొట్టగా రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. శారద బాలిక వెనుకే తల్లి ఇంటికి వెళ్లి కుమార్తెను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకు వచ్చింది. తన మాట వినడం లేదంటూ చీమల మందు నీటిలో కలిపి, ఆ నీటిని బలవంతంగా తాగించింది. కుమార్తె సృహ కోల్పోయాక ఆమెను హత్య చేయాలనేది శారద ఉద్దేశం. రాత్రి 12 గంటల సమయంలో కుమార్తెను భుజంపై వేసుకొని దివాన్ చెరువు అంబికా లేఅవుట్లోని పాత బ్రాందీ షాపు దగ్గరలోని శ్మశానం వద్దకు చేరుకుంది. అక్కడి తుప్పల్లోకి తీసుకు వెళ్ళి తువ్వాలును ముక్కలుగా చేసి కుమార్తె కాళ్లు, చేతులు కట్టి బ్లేడుతో బాలిక వంటిపై గాయపరచసాగింది. సృహలోకి వచ్చిన బాలిక ‘అమ్మా కోయవద్దు’ అంటూ కేకలు వేస్తూ బతిమిలాడింది. అయినా కనికరించకుండా గుడ్డలు నోట్లో కుక్కి ముఖంపైన, తలపైన, కాళ్లపైన, బాలిక మర్మావయవాలపైనా ఇస్టానుసారం కోసింది. సృహ కోల్పోయి పడిపోగానే మృతి చెంది ఉం టుం దని భావించి ఎవరికీ తెలియకుండా అర్ధ రా త్రి ఒం టి గంట సమయంలో శారద ఇంటికి చేరుకొంది. శరీరమంతా గాయాలతో అమ్మమ్మ ఇంటికి తెల్లవారుజామున బాలిక మహాలక్ష్మికి సృహ వచ్చింది . ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తాతయ్యకు జరిగిన విషయం చెప్పింది. అమ్మ వద్దకు తీసుకువెళ్ళవద్దని తాతయ్యను ప్రాధేయపడింది. దీంతో తాతయ్య ఆమె శరీరంపై గాయాలను డెట్టాల్తో శుభ్రం చేశాడు. కాగా తెల్లవారు జాము ఐదు గంటలకు శారద తన తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె కనిపించడం లేదంటూ చెప్పింది. దెబ్బలతో రాత్రి ఇంటికి వచ్చిందని, నిద్రపోతున్న లక్ష్మిని చూపించాడు. దీంతో నిందితురాలు శారద జరిగిన విషయం తండ్రికి చెప్పకుండా దాచింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ తన తండ్రితో కలిసి కుమార్తెకు వైద్యం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్కు తీసుకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సృహలోకి వచ్చిన బాలిక తల్లి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచీ శాడిజమే మచ్చా శారద మొదటి నుంచీ శాడిజంతో ప్రవర్తించేందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులతో గొడవ పడడం, తండ్రి చెవి కొరికేయడం, చెల్లి, తమ్ముడితో గొడవలు పడి, వారిని కొట్టేది. భర్త శివ కొట్టకపోయినప్పటికీ బ్లేడ్తో చేతుల మీద కొసుకొని వచ్చి తల్లికి భర్త కొట్టాడని చెప్పడంలో అది నిజమని నమ్మిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో భర్త శివపై ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరితో శారద వివాహేతర సంబంధం సాగించింది. భయంతో బాలిక బూచాడి కథ తాను కొట్టినట్టు ఎవరికైనా చెబితే చచ్చిపోతానని శారద తన కుమార్తె మహాలక్ష్మిని భయపెట్టింది. దీంతో ముసుగు వేసుకొని బూచాడు వచ్చి తనను గాయపరిచాడని ఆ బాలిక తొలుత పోలీసులకు చెప్పింది. అనంతరం అర్భన్ జిల్లా ఎస్పీ రాజకుమారి దర్యాప్తు చేపట్టి బాలిక నుంచి అసలు విషయం రాబట్టారు. బాలికకు వైద్యులు 103 కుట్లు వేశారు. విలేకరుల సమావేశంలో బొమ్మురు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. నిందితురాలు శారదను ఏడో ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. -
బట్టబయలైన ‘బాబు’ నైజం
సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల్లో ఓట్ల కోసమే తప్ప ప్రజలు, సామాజిక వర్గాల కోసం సీఎం చంద్రబాబు ఏ పనీ చేయడన్న విషయం సోమవారం రాష్ట్ర సచివాలయం వద్ద మరోమారు బయటపడిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాలయాల్లోని కేశ ఖండనశాలల్లో పని చేసే నాయి బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళితే వారిని నోటికొచ్చినట్లు మాట్లాడి భయపెట్టిన చంద్రబాబుకు బుద్ధిలేదని మండిపడ్డారు. ఈ ఘటనతో సామాన్యులు, శ్రామికుల పట్ల ఆయన బుద్ధి భేమిటో తేటతెల్లమవుతోందన్నారు. ఓటమి భయంతోనే అసహనం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు భారీగా ప్రజలు వచ్చి, సమస్యలు చెప్పుకుంటుండడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని విజయలక్ష్మి అన్నారు. 2014 ఎన్నికల్లో కులాల వారీగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈ వయస్సులో ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి, ఆ తర్వాత తాను చెప్పినట్లు చేయకపోవడంతో అవమానకరంగా పదవి నుంచి దింపారని గుర్తు చేశారు. తిరుపతిలో చంద్రబాబు చేసిన ఘన కార్యాలను బయటపెట్టిన ప్రధానార్చకులు రమణను తొలగించారన్నారు. తనకు అనుకూలంగా, తన కుమారుడు లోకేష్కు ముడుపులు ఇచ్చే వారికే పదవులు, కాంట్రాక్టులు ఇస్తూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గోముఖవ్యాఘ్రం లాంటి వాడని విమర్శించారు. ‘మీకిది ఇస్తే నాకేం’టని ఆలోచించే చంద్రబాబు జీవితం అంతా అవినీతిమయమని ఆరోపించారు. -
ఖాకీలకు అవినీతి మరక
రాజమహేంద్రవరం క్రైం: పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపకుండా తమ స్వలాభం కోసం హౌస్ ఆఫీసర్లు ఇరువర్గాల వద్ద లంచాలు గుంజుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి పోలీస్స్టేషన్లో సెటిల్మెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు స్థానిక రాజకీయ నేతల అంగీకారం లేనిదే ఆ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించాలంటే ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని అనంతరం వారు చెప్పిన రేటు చెల్లించిన తరువాత పోస్టింగ్లు తీసుకోవలసి వస్తుందని పోలీస్ అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాలని కొందరు పోలీస్ అధికారులు లంచాలకు పాల్పడుతున్నారు. ఏసీబీకీ చిక్కిన సౌత్జోన్ డీఎస్పీ అలాగే 2017 మే 31వ తేదీన రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్ కుమార్, సామర్లకోటకు చెందిన కీర్తిప్రియ అనే మహిళ వద్ద ఇల్లు కొన్నాడు. ఇంటి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కీర్తిప్రియ ఇంటికి మరికొంత ఎక్కువ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విల్సన్ కుమార్పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. ఈ కేసులో సౌత్జోన్ డీఎస్పీ నారా యణరావు, కీర్తిప్రియ వద్ద లంచం తీసుకొని వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునే విధంగా విల్సన్ కుమార్పై వత్తిడి తెచ్చాడు. రూ.ఏడు లక్షల నష్టానికి విల్సన్, కీర్తిప్రియతో రాజీ చేసుకున్నాడు. కేసు రాజీ కుదుర్చుకున్న అనంతరం సౌత్జోన్ డీఎస్పీ పి.నారాయణరావు తన వద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్తో ఫోన్లు చేయిస్తూ రాజీ కుదుర్చుకున్న తరువాత తనకు రావలసిన వాటా రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో విల్సన్ కుమార్ రూ.50 వేలు డీఎస్పీకి, రూ.5 వేలు కానిస్టేబుల్ రమేష్కు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై బాధితుడు విల్సన్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో రూ.55 వేలు కానిస్టేబుల్ రమేష్కు ఇస్తుండగాఏసీబీ అధికారులు మే 31వ తేదీ గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం కానిస్టేబుల్ రమేష్కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న సౌత్జోన్ డీఎస్పీ పి.నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకూ అవినీతి మయంగా మారింది. కొందరు అవినీతి పోలీస్ అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పట్టుబడిన పోలీస్ అధికారులు వీరే అవినీతికి పాల్పడుతూ పోలీస్ అధికారులు ఏసీబీకీ చిక్కుతున్నారు. 2016 మార్చి 15వ తేదీన రాజమహేంద్రవరం ప్రకాష్నగర్ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే 2016 డిసెంబర్ 12వ తేదీన అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న జక్కి నాగేశ్వరరావు, హోమ్ గార్డు గంటి శ్రీనివాసరావు హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవనిగడ్డ టెంపోరావుకు చెందిన ఒక కేసు విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీన ద్రాక్షారామ పోలీస్స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న ఫజల్ రహ్మన్, రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన యనమదల భరత్ వద్ద ఒక కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి, చార్జ్షీట్ దాఖలు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హేండెడ్గా చిక్కాడు. -
రేషన్ కార్డుకు అవాంతరాలు
సాక్షి, రాజమహేంద్రవరం: తెల్ల రేషన్ కార్డు మంజూరుకు అర్హులైన లబ్ధిదారులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నా యి. అర్హత ఉన్నా ప్రజా సాధికారిత సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోకపోవడం, ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉండ డం కొత్త కార్డు మంజూరుకు అవరోధంగా మారాయి. కొత్త రేషన్ కార్డు పొందడానికి లబ్ధిదారులు చేయాల్సిన పనులపై యం త్రాంగం అవగాహన కల్పించకపోవడంతో ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో తీసుకున్నారు. జిల్లాలో 33 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తు ఎప్పడు ఇచ్చినా జనవరిలో నిర్వహించే జన్మభూమి సభల్లో కొత్తకార్డులు మంజూ రు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. సభల్లో 16,200 మందికి కార్డులు మంజూరు చేశారు. మిగిలిన వారికి ఎందుకు రాలేదోనన్న విషయంపై స్పష్టత కరువైంది. తమకు కార్డు ఎందుకు రాలేదో అన్న విషయం జన్మభూమి సభల్లో అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైంది. కొంతమంది తమకు కార్డు ఎందుకు రాలేదు? అంటూ తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డులో మీరు సభ్యులుగా ఉన్నారంటూ కార్యాలయాల్లోని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దరఖాస్తుదారుల్లో కొంతమంది వివరాలు ప్రజా సాధికారిత సర్వేలో నమోదు కాకపోవడం వల్ల కార్డులు మంజూరు కాలేదు. ఇప్పుడూ పాత కథే.. జూన్ రెండో తేదీన కొత్త రేషన్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ఆదివారం నుంచి అనుమతిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మంగళవారం వరకూ గడువు ఇచ్చింది. జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఆదివారం నుంచి రాత్రి వేళల్లో కూడా పని చేసి ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎప్పటిలాగే పాతకథే పునరావృతం అయింది. ప్రజా సాధికారిత సర్వేలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్లే అత్యధిక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులుగా ఉండడం వల్లనూ దరఖాస్తులు ఆన్లైన్ కాలేదు. ఎమ్మెల్యే పంపారు.. ఎందుకు రాదు? కొత్త కార్డు కోసం పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసులతో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. వారి దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగా కారు, ఆదాయం ఎక్కువగా ఉండడం, ప్రజా సాధికారిత సర్వేలో లేకపోవడం, ఇప్పటికే కార్డులో సభ్యులుగా ఉండడంతో ఆన్లైన్ కావడంలేదు. అదే విషయాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు వారికి చెబుతున్నా ‘ఎమ్మెల్యేగారు, ఎమ్మెల్సీగారు పంపారు? ఎందుకు కాదు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారికి వివరంగా, అర్థమయ్యేలా చెప్పేసరికి కంప్యూటర్ ఆపరేటర్ల తల ప్రాణం తోకకు వస్తోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పరిశీలిస్తే కొత్త కార్డులు ఎంత శాతం వస్తాయో అర్థం చేసుకోవచ్చు. 50 డివిజన్ల నుంచి 1,062 దరఖాస్తులు రాగా ఇందులో 600 దరఖాస్తులకు సంబంధించి ప్రజా సాధికారత సర్వేలో లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఆన్లైన్ కాలేదు. మరో 353 దరఖాస్తులు ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో నమోదై ఉండడంతో వెబ్సైట్ తిరస్కరించింది. 9 దరఖాస్తులు ఇప్పటికే ఆన్లైన్ అవగా కొత్తగా 100 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ అవడం గమనార్హం. దీనినిబట్టి నగరంలో దరఖాస్తు చేసుకున్న 1,062 మందికిగాను 109 మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఈ దరఖాస్తులను కూడా అధికారులు ఆరు దశల్లో పరిశీలన చేసిన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు. -
భార్యను నరికి చంపేసిన భర్త
కడియం(రాజమహేంద్రవరం రూరల్): మండలంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధి గుబ్బలవారిపాలెంలో దొంగల శ్రీనివాసు అనే వ్యక్తి తన భార్య దొంగల జయ (31)ను కత్తితో నరికి చంపాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్కు అదే గ్రామానికి చెందిన జయతో దాదాపు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సింధువైష్ణవి, అర్జున్వెంకటసాయి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కొంతకాలంగా తగాదాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు పెద్దల సమక్షంలో వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి సఫలం కాకపోవడంతో ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి సమీపంలోనే శ్రీనివాసు గులాబీ తోటను సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సదరు తోట మీదుగా మరో ఇద్దరు మహిళలతో కలిసి జయ కూలిపనికి వెళుతోంది. గులాబీ తోట వద్దకు వచ్చేసరికి శ్రీనివాసు, జయతో వాగ్వాదానికి దిగాడు. హఠాత్తుగా తన కూడా తెచ్చుకున్న కత్తితో జయ మెడ భాగంలో విచక్షణా రహితంగా నరికేశాడు. ఉన్నట్టుంటి కత్తితో దాడికి దిగడంతో జయతోపాటు వస్తున్న ఇద్దరు మహిళలు పారిపోయి స్థానికులకు సమాచారమిచ్చారు. స్థానికులు వచ్చి చూసేసరికి కత్తిగాట్లతో తీవ్ర రక్తస్రావమవుతున్న జయ అక్కడే రక్తపుమడుగులో పడి ఉంది. ఆమెను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చేశారు. జయ మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి మంగాయమ్మ ఫిర్యాదు మేరకు టుటౌన్ ఇన్స్పెక్టర్ ముక్తేశ్వరరావు, కడియం ఎస్సైలు ఎల్ గౌరీనాయుడు, కె. సురేష్బాబులు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శ్రీనివాసు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
కల్తీ దొంగలు
సాక్షి, రాజమహేంద్రవరం: అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం అని ఓ మహా కవి అన్న మాటలను కొంత మంది మద్యం వ్యాపారులు బాగా వంటపట్టించుకుంటున్నారు. కారం, నెయ్యి, నూనె తదితర ఆహార వస్తువులను కల్తీ చేయగా లేనిది తాము ఎందుకు చేయకూడదని కొంత మంది మద్యం వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చట్టవిరుద్ధంగా మద్యం కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం తాగుతున్న వారికి కనీసం నాణ్యమైన మద్యం ఇవ్వకుండా అందులో కల్తీ చేసి వారి మత్తును సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట రాజమహేంద్రవరంలోని జాంపేట అశోక థియేటర్ పక్కన ఉన్న మేనక బార్ అండ్ రెస్టారెంట్ను మద్యం కల్తీ కేసులో అధికారులు సీజ్ చేయడంతోఅసలు గుట్టు తేటతెల్లమైంది. మీడియం బ్రాండ్ మద్యంలో చీఫ్ లిక్కర్, నీళ్లు, సారా కలిపి విక్రయిస్తున్నారు. హెట్టీ, ఎనీటైం తదితర చీప్ లిక్కర్లను ఆఫీసర్స్ చాయిచ్, ఇంపీరియల్ బ్లూ తదితర మీడియం బ్రాండ్లలో కలుపుతున్నారు. మీడియం బ్రాండ్ మద్యం ఫుల్ బాటిల్ (720 ఎంఎల్)లో చీప్ లిక్కర్ 180 ఎంఎల్ నుంచి 240 ఎంఎల్ను కలిపి మీడియం బ్రాండ్ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మేనక బార్ అండ్ రెస్టారెంట్లో గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతోందని అధికారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదుల నేపథ్యంలో గత నెల 21వ తేదీన బార్లో రాజమహేంద్రవరం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. మీడియం బ్రాండ్లలో మద్యాన్ని పరీక్షించారు. మద్యం మీడియం బ్రాండ్లలో చీప్ లిక్కర్, నీళ్లు, సారా కలుపుతున్నట్లు గుర్తించారు. అధికారులపై పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు... గత ఏడాది నూతన బార్ పాలసీ వచ్చే వరకు మేనక బార్ అండ్ రెస్టారెంట్ తాడితోట ప్రాంతంలో షెల్టాన్ హోట్కు ఎదురుగా ఉండేది. నూతన మద్యం పాలసీలో ప్రస్తుతం ఉన్న బార్ స్థానంలో ఉన్న దుకాణం రాకపోవడతో మేనకబార్ను అక్కడ ఏర్పాటు చేశారు. బార్ను అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేయడంతో బార్ యజమాని, స్థల యజమాని రగంలోకి దిగారు. మేనక బార్ యజమాని అయిన రామకృష్ణా రెడ్డి (మేనక రెడ్డి) గతంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి సారా వ్యాపారం చేశారు. స్థల యజమాని కూడా రాజకీయ పరిచయాలు ఉండడంతో కేసు నమోదు కాకుండా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. అయినా వెరవని అధికారులు గత నెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి బార్ను సస్పెండ్ నిర్ణయాన్ని అమలు చేయనీయకుండా అడ్డుపడ్డారు. అయితే ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసిన స్థానిక అధికారులు దాన్ని ఉన్నతాధికారులకు పంపారు. బార్ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు రావడంతో శుక్రవారం స్థానిక అధికారులు బార్ను మూసివేశారు. మద్యం ప్రియులకు ప్రాణసంకటం.. కొంత మంది మద్యం వ్యాపారుల ధనదాహం మద్యం ప్రియులకు ప్రాణసంకటంగా మారింది. జిల్లాలో 524 మద్యం దుకాణాలు, 40 బార్లు నిర్వహణలో ఉన్నాయి. బార్లు, మద్యం దుకాణాల వద్ద లూజు విక్రయాలు చేపడుతున్నారు. పేదలు, మురికివాడల వద్ద ఉన్న దుకాణాలు, బార్లలో మేనక బార్ అండ్ రెస్టారెంట్లోలా మద్యం కల్తీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
‘రాజమహేంద్రవరం అడ్డా’లో ‘భాగమతి’
-
పగులు కొడతారు..
రాజమహేంద్రవరం క్రైం: చోరీ కేసుల్లో అంతర్ జిల్లా నేరస్తులు నలుగురిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను ఎస్పీ ఇలా వెల్లడించారు. మూడు నెలలుగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని అపార్ట్మెంట్లలో జరుగుతున్న చోరీలపై రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ జె.కుల శేఖర్, వన్టౌన్ ఇనస్పెక్టర్ ఎం. రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ వారి సిబ్బంది నిఘా ఉంచి గోదావరి గట్టున రామకృష్ణ మఠం వద్దగల ఇసుక ర్యాంప్ వద్ద పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారిలో చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు తెలంగాణ రాష్ట్రం, మహబుబ్ నగర్కు చెందిన ఆవుల కిరణ్ కుమార్ అలియాస్ రాహుల్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన కోరుమిల్లి సత్య సాయి పాండురంగ విఠల్, ఉర్ల శ్రీనివాసరావు, మానేపల్లి వీర వెంకట సూర్య సత్య నాగ మోహన్ గుప్త ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరు ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి అపార్ట్మెంట్లలో పగటి పూట చోరీలకు పాల్పడుతుంటారని తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ప్రకాష్ నగర్ పరిధిలో ఏడు, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ మొత్తం 16 చోరీలు చేశారని తెలిపారు. రూ 36 లక్షల విలువైన నగలు స్వాధీనం నిందితుల వద్ద నుంచి కేజీ బంగారు నగలు, ఆరు కేజీల వెండి వస్తువులు మొత్తం రూ.36 లక్షల విలువైన నగలు, యాక్టివా మోటారు సైకిళ్లు రెండు, ఐదు మొబైల్ ఫోన్లు, 63 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆవుల కిరణ్ కుమార్ పాత నేరస్తుడని, ఇతడిపై 70 చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిడదవోలు గ్రామానికి చెందిన ఉర్ల శ్రీనివాస్ సైకిళ్ల చోరీలతో పాటు రైలులో సూట్ కేసులు చోరీ చేసిన కేసులు ఉన్నాయని తెలిపారు. ఐదు, పది నిమిషాల్లో తుడిచిపెట్టేస్తారు ఈ నలుగురు నిందితులు చోరీలకు అలవాటు పడ్డారని తెలిపారు. అపార్ట్మెంట్లో తలుపులను ఐరన్ రాడ్తో గొళ్లాలను తొలగించి ఇంటి యజమానులు వచ్చే లోపు ఐదు, పది నిమిషాల్లో ఇంట్లో ఉన్న వస్తువులు చోరీ చేస్తుంటారని తెలిపారు. పోలీసులకు రివార్డులు నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై సీహెచ్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, ఎస్.వీరబాబు, బి.నెహ్రూ, వి.సురేష్, డి.శ్రీనివాస్లకు రివార్డులు ఇస్తామని తెలిపారు. సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్యాల 'చిత్ర'హింస..
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను బాక్ల్లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ టికెట్ల దందా చేస్తూ కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతున్నాయి. మరుసటి రోజు శని, ఆదివారాలు కావడంతో ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ మూడు రోజుల్లో థియేటర్ల కౌంటర్లలో ఒక్క టికెట్ కూడా విక్రయించడంలేదు. నాలుగు ఆటల టికెట్లు అయిపోయాయని థియేటర్ల వద్ద బోర్డులు పెడుతున్నారు. ఎవరైనా ప్రేక్షకులు అడిగితే ఆన్లైన్లో అన్నీ విక్రయించామని థియేటర్ల మేనేజర్లు చెబుతున్నారు. థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల దందా రెండు విధాలుగా జరుగుతోంది. నాలుగు షోల టికెట్లను బ్లాక్ చేస్తున్న యాజమాన్యాలు వాటిని గంపగుత్తగా బయట వ్యక్తులకు విక్రయిస్తున్నాయి. రూ.110 టికెట్లను రూ.160లకు, రూ.40 టికెట్లను రూ.70కు విక్రయిస్తున్నారు. వారు రూ.110 టికెట్లు డిమాండ్ను బట్టీ రూ.200లకు పైగా విక్రయిస్తున్నారు. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు తమ సిబ్బందితోనే రెట్టింపు ధరలకు టికెట్లు బ్లాక్లో అమ్మిస్తున్నాయి. శుక్రవారం విడుదలైన భాగమతి, పద్మావత్ చిత్రాల ప్రదర్శిస్తున్న థియేటర్లలో సూర్యా మినీ, సూర్యా కాంప్లెక్స్, శ్యామలా, స్వామి, శివజ్యోతి, రాజా థియేటర్ల వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయించారు. రూ.110 టికెట్లు రూ.200 నుంచి రూ.300, రూ.40 టికెట్లు రూ.100 లెక్కన అమ్మి ప్రేక్షకులను నిలువదోపిడీ చేశారు. నలుగురు సభ్యుల కుటంబంతో వెళ్లిన వారు రూ. టికెట్లకే రూ.800 నుంచి రూ.1200 వరకు వెచ్చించాల్సి వచ్చింది. అంత మొత్తం వెచ్చించలేని సామాన్యులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. 50 శాతం నిబంధన ఎక్కడ? థియేటర్లలోని టికెట్లలో 50 శాతం ఆన్లైన్లో విక్రయించేందుకు అనుమతి ఉంది. మిగతా 50 శాతం టికెట్లు కౌంటర్లలో విక్రయించాలి. కానీ ఎక్కడా ఇది అమలు కావడంలేదు. వంద శాతం ఆన్లైన్లో పెడుతున్నామని సూర్యా కాంప్లెక్స్ మేనేజర్ చెబుతున్నారని రమేష్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నారు. తాము కుటుంబంతో సహా వచ్చామని, సినిమా చూడకపోతే పిల్లలు నిరాశ చెందుతారని బ్లాక్లో రూ.110 టికెట్లు రూ.200లకు కొనుగోలు చేశానని శనివారం ‘సాక్షి’ వద్ద వాపోయారు. సామాన్యులకు టికెట్లు అందేలా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రేక్షకులు కోరుతున్నారు. -
మౌజన్ హత్యకేసులో నిందితుడి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మసీదు మౌజన్ మహ్మద్ ఫరూఖ్ హత్య కేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీలంక కాలనీకి చెందిన ఆరుముగం మణిరత్నం, అలియాస్ మణి, అలియాస్ రాజుని బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మసీదులో, ప్రకాశంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి విలేకరులకు వెల్లడించారు. గత ఏడాది డిసెంబరు 29 అర్ధరాత్రి లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్గా పని చేస్తున్న మహ్మద్ ఫరూఖ్ (67) నిద్రపోతుండగా కర్రతో తలపైన కొట్టి చంపిన విషయం విదితమే. -
ఉద్రిక్తత నడుమ మౌజాన్ మృతదేహం తరలింపు
రాజమహేంద్రవరం క్రైం: మసీదులో హత్యకు గురైన మౌజాన్ మహ్మద్ ఫారూఖ్ (61) మృతదేహాన్ని ఉద్రిక్తత నడుమ శనివారం బీహార్ రాష్ట్రానికి తరలించారు. శుక్రవారం తెల్లవారు జామున మసీదులో హత్యకు గురైన మౌజాన్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఉదయం పోస్టుమార్టం జరిగిం ది. ఈ సందర్భంగా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో ముస్లిం చేరుకున్నారు. దీనితో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అదనపు బలగాలు మోహరించారు. అనంతరం మహ్మద్ ఫారూఖ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. పోలీస్ బందోబస్తు మధ్య అంబులెన్స్లో మృతదేహాన్ని లాలాచెరువు సెంటర్కు తరలించారు. అక్కడ ముస్లిం మత పెద్దలు నమాజ్ నిర్వహించి అనంతరం బీహార్ రాష్ట్రం తరలించారు. ఆస్పత్రి వద్ద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేయాలంటూ ర్యాలీ మౌజాన్ మృతదేహాన్ని తరలించిన అనంతరం ముస్లిలు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేస్తు ర్యాలీగా లాలా చెరువు, ప్రభుత్వాస్పత్రి, వై.జంక్షన్, దేవీచౌక్, మీదుగా ఆజాద్చౌక్కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. దారి పొడవునా తెరచి ఉన్న షాపులు నిరసనగా మూయించి వేశారు. ఆజాద్ చౌక్ వద్ద మానవ హారం నిర్వహించారు. ఈ ర్యాలీ వెంట సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, వన్టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీరావు ఉన్నారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు మౌజాన్ హత్య అనంతరం నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి నిరంతర పర్యవేక్షణలో డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది అలుపెరగని గస్తీ నిర్వహించి సమస్య జటిలం కాకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్నప్పటికీ సామరస్యపూరకంగా మృతదేహాన్ని మౌజాన్ సొంత రాష్ట్రం బీహార్కు తరలించారు. ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మోషేన్రాజు దానవాయిపేట (రాజమహేంద్రవరం): లాలాచెరువు బత్తిన నగర్లో నౌరానీ మసీదులో మౌజాన్ మహ్మద్ ఫారుఖ్ను హత్య చేసి, ఖురాన్ని తగలబెట్టడం ప్రభుత్వం వైఫల్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్రాజు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులపైన దాడులు అధికమవుతున్నాయని టీడీపీ, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల్లే ఉత్తరప్రదేశ్లో సైతం ఇటువంటి ఘట్టన జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆహారపు అలవాట్ల పైనా దాడులు జరుగుతున్నాయని ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి ఉంటే బాగుండేది పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజమహేంద్రవరం రూరల్: మౌజాన్ ఫారూఖ్ హత్య సంఘటనపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆయన లాలాచెరువులోని నౌరానీ మసీదులో మౌజన్ మహ్మద్ ఫారూఖ్ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ముస్లిం పెద్దలతో సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఈ సంఘటనపై పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ముస్లింలకు తమ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మాజీ కేంద్ర మంతి ఎంఎం పళ్ళంరాజు, ఉభయగోదావరి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంతం నానాజీ, రఫీ ఉల్లాబేగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
హెల్మెట్ ధరించండి: నటుడు
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యం గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే పరిసరాల పరిశుభ్రతతో నగరం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్లో నెంబర్ వన్ చేయాలని నగర ప్రజలకు ప్రముఖ సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. గురువారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్రోడ్, కోటగుమ్మం మీదుగా పుష్కరఘాట్ చేరుకుంది. ఈ ర్యాలీలో మేయర్ రజనీ శేషసాయి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు పాల్గొన్నారు. పుష్కరఘాట్లో ఏర్పాటు చేసిన సభలో ఆలీ మాట్లాడుతూ.. అందరూ శుభ్రత పాటించాలన్నారు. ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా వేస్తారన్నారు. ప్రతీ ఒక్కరూ తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. మేయర్ రజనీశేషసాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించగలమన్నారు. హెల్మెట్ ధరించండి : ఆలీ ‘తల్లిదండ్రులు పిల్లలను చదివించాలి. అయితే మోటారుసైకిళ్లు కొనిచ్చి ప్రమాదాలకు ఆస్కారమివ్వకండి. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అని సినీ నటుడు ఆలీ పిలుపునిచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి నిమిషం చాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు హైస్పీడ్ మోటారు సైకిళ్లు కొనిచ్చి, ప్రమాదాలు కొని తెస్తున్నారన్నారు. కమిషనర్ను ఆకాశానికెత్తిన ఆలీ స్వచ్ఛ సర్వేక్షణ్ సభలో సినీ నటుడు ఆలీ ఎక్కువ సమయం కమిషనర్ విజయరామరాజును పొగిడేందుకే కేటాయించారు. పాలక మండలి ప్రస్తావన తేకుండా నగరంలో అభివృద్ధి అంతా కమిషనర్ ఒక్కరే చేసినట్లు చెప్పుకొచ్చారు. కమిషనర్ను సినీ హీరోలు మహేష్బాబు, పవన్ కళ్యాణ్లతో పోల్చి మాట్లాడారు. ఆలీ మాట్లాడిన సమయంలో సగం పైగా కమిషనర్ను పొగిడేందుకే వెచ్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
గంగరాజు పాలకోవా ఇష్టం: గీతామాధురి
రాజమహేంద్రవరం సిటీ: సినీ నేపథ్య గాయకులు గీతామాధురి, అనుదీప్దేవ్ శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర ప్రజలను ఉర్రూతలూగించారు. ఆఫీసర్స్ ఛాయిస్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తూ రేడియోమిర్చి 98.3 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘లైవ్ ఇన్ కన్సర్ట్ ’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుషారైన సినిమా పాటలతో ఆలరించారు. కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్గా కరూర్ వైశ్యాబ్యాంక్ వ్యవహరించగా మీడియా పార్టనర్గా ‘సాక్షి మీడియా’ వ్యవహరించింది. రోజ్మిల్క్, గంగరాజు పాలకోవా ఇష్టం : గీతామాధురి రాజమహేంద్రవరం తనకు ఇష్టమైన ఊరు. ఇక్కడ రోజ్మిల్క్, గంగరాజు పాలకోవాలంటే చాలా ఇష్టం. మాది పశ్చిమగోదావరి జిల్లా కావడంతో పక్కనే ఉన్న రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందరు సంగీత దర్శకుల వద్ద పనిచేసి గాయనిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. 70 పాటలు పాడా : అనుదీప్ దేవ్ ఉయ్యాలజంపాల, సినిమా చూపిస్తా మావా, పిల్లా నువ్వులేని జీవితం, ఇటీవల విడుదలైన ఖాకీ చిత్రాల్లో నేను పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2013లో గాయకుడిగా అవతారమెత్తి ఇప్పటివరకూ 70 చిత్రాల్లో 70 పాటలు పాడాను. రాజమహేంద్రవరం ఇప్పటికి చాలాసార్లు వచ్చాను. హైదరాబాద్ నా సొంతూరు. ఏవిధమైన సంగీత వాయిద్య పరికరాలు వినియోగించకుండా గొంతుతో ‘‘ఆకపెల్లా’’ పక్రియలో ఇప్పటి వరకూ అనేక పాటలు పాడాను. -
మరోసారి మూడుముళ్లు పడిన ఆ రాత్రి..
బాల్య వివాహాలను నిరసిస్తూ ... వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ మహాకవి గురజాడ తన కన్యాశుల్కం నాటకం ద్వారా జాతిని జాగృతం చేశారు. సాహిత్యపరంగా గురజాడ యుద్ధం ప్రకటించగా కందుకూరి వీరేశలింగం ఈ దుష్ట సంప్రదాయంపై పిడికిలి బిగించారు. ప్రతిఘటనలు ఎదురైనా తన సతీమణి రాజ్యలక్ష్మి సహకారంతో రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో జరిపించారు. ఆ బృహత్తర ఘట్టానికి ... చరిత్ర మలుపు తిప్పిన ఆ చారిత్రక శుభ ఘడియకు రాజమహేంద్రవరం వేదికగా నిలవడం జిల్లావాసులు గర్వించదగ్గ విషయం. ఈ వివాహానికి బాలిక తల్లే సూత్రధారిగా మారి ముందడుగు వేయడం ఓ విప్లవం. 136 సంవత్సరాల కిందట జరిగిన ఈ పరిణామం జాతి మలుపునకు దారితీసింది. రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఇప్పుడు యీ వెధవ ఇంగిలీషు చదువు నుంచి ఆ ఫకీరు వెధవ దాన్ని లేవదీసుకుపోయాడుగాని.. వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్ఠగా బతికారు కాదు..’ ‘ప్రారబ్ధం చాలకపోతే (వైధవ్యం) ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?’ ‘వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీకాలం పట్టుకుందేవి పెద్దపెద్ద వాళ్ళకి కూడాను?’ ‘అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంతలాభం కలిగింది? భూవులకు దావా తెచ్చామా లేదా?’....... మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధానులు నోట పలికించిన ఈ మాటలు చాలు, నాటి సమాజంలోని దురాచారాలను చూపడానికి. అగ్నిహోత్రావధానులు పాత్ర ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాటి సమాజంలోని దుర్నీతిని కళ్ళారాచూసిన గురజాడ కలం ద్వారా ఈ బ్రహ్మాస్త్రాలు సంధిస్తే, కందుకూరి సంస్కరణోద్యమం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశాడు. ముక్కుపచ్చలారని బాలికను, డబ్బుకోసం కాటికి కాళ్లుచాపుకున్న వాడికి అంటగట్టడం, ఆ బాలిక వివాహం అంటే అర్థం తెలుసుకునేలోపునే వితంతువు అయితే, ఆడదాని తల రాత అంతేనని సమాధానం చెప్పడంనాడు పరిపాటి. తీవ్ర ప్రతిఘటనల మధ్య.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం చేపట్టిన వితంతు వివాహాలకు అసాధారణమైన ప్రతిఘటనలు ఎదురయ్యాయి. వంటవాళ్లు, మంత్రాలు చెప్పేవారిని సైతం అడ్డుకున్నారు. కందుకూరి సతీమణి రాజ్యలక్ష్మిద్వారా భర్తమీద ఈ ప్రయత్నాలు వదులుకోమని ఒత్తిడి తెచ్చారు.. అయినా, ఆమె కందుకూరికి బాసటగా నిలబడ్డారు. నాటి విద్యార్థిలోకం కందుకూరికి అండగా నిలబడింది. రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి జరిగింది. కందుకూరి ప్రాణాలు తీయడానికి కూడా నాటి కుహనా పండితులు కొందరు వెనుకాడలేదు. సుమారు 136 సంవత్సరాలకు ముందు జరిగిన ఈ పునర్వివాహానికి మంత్రాలు చదివే యాజకునికి వంద రూపాయలు ఇవ్వవలసి వచ్చిందని కందుకూరి స్వీయచరిత్రలో వివరించారు. ఆ రోజుల్లో వందరూపాయలంటే, నేటి విలువ ఎంతో ఆర్థిక నిపుణులు అంచనా వేయవచ్చును. తొలి వితంతు వివాహానికి నాటి విద్యార్థిలోకం అండగా నిలిచింది. రక్షకభటశాఖ పూర్తి సహకారం అందించింది అన్నిటికీ మించి అర్ధాంగి పూర్తి సహకారం తోడైంది. కందుకూరి స్వీయచరిత్రలో వితంతు వివాహం ‘కృష్ణామండలం, తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందము గారు తమ తాలూకాలోని గ్రామములో పండ్రెండేళ్ల యీడుగల ఒక వితంతువు (గౌరమ్మ) యున్నదని, తగు మనుష్యులను పంపగలిగినయెడల తల్లిని సమ్మతిపరచి యా చిన్నదానిని వారివెంట బంపునట్లు ప్రయత్నము చేసెదననియు, నాకొక లేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంత యుత్తరప్రత్యుత్తరములు జరిగిన తరువాత నా మిత్రుడు తిరువూరు నుండి 1881వ సంవత్సరం నవంబరు నెల అయిదవ తేదీన నాకిట్లు వ్రాసెను. ‘ఇక్కడకు మీ మనుష్యులను పంపుతోడనే తన కొమరితను మీ వద్దకు బంపెదనని యామె వాగ్దానము చేసినది. ఈ చిన్నదానిని వెంట బెట్టుకుని పోవుటకు నమ్మదగినవారును, ఋజువర్తనులను, దృఢచిత్తులునయిన మనుష్యులనుబంపుడు. వివాహము నిజముగా జరుగువరకు వారెందు నిమిత్తము వచ్చిరో యాపని యక్కడ నెవ్వరికి తెలియకుండవలెను. ఈ పని నిమిత్తము యిద్దరికంటె నెక్కువ మనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువుతల్లి) మిమ్ములను కోరుచున్నది. విశాఖపట్టణములో రక్షకశాఖయందిరువది రెండు సంవత్సరముల ప్రాయముగల యొక చిన్నవాని భార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్తించినది. అతడు చిరకాలము నా శిక్షణలో నుంచి పెరిగినవాడగుటచే వితంతు వివాహములు మొదలయిన కొత్తమార్పులందు ఆసక్తియు నుత్సాహము కలవాడు. వరుడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసిన తోడనే మా పట్టణమున యాతని బంధువులు మొదలయినవారు వచ్చి, వివాహము చేసుకోవలదని హితోపదేశము చేసి, కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి. ‘మహాసంక్షోభమున’ 1881వ సంవత్సరము డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపు పునర్వివాహము జరిగినది. పలువురు మార్గాంతరము లేక, ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి’ 11న వార్షికోత్సవం కందుకూరి జన్మగృహంలో ఈ చరిత్రాత్మక సంఘటనకు ఆనవాలుగా తొలి వితంతు వివాహానికి గుర్తుగా కొన్నిశిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం కందుకూరి జన్మగృహంలో జరిగే తొలి వితంతు వివాహ వార్షికోత్సవంలో డాక్టర్ అరిపిరాల నారాయణరావు, వై.యస్.నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ( కందుకూరి జన్మగృహంలో తొలి వితంతు వివాహానికి ఆనవాలుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ) -
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి
-
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో గురువారం ఇద్దరు గాయపడ్డారు. రాజమహేంద్రవరంలో పవన్ బస చేసిన రివర్ బే హోటల్ దగ్గర పవన్ అభిమానులు కోలాహలం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఇక్కడి నుంచి బయలుదేరిన ఆయనను చూసేందుకు అభిమానులు పోటీపడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పవన్ కల్యాణ్ కారులో నుంచి అభివాదం చేసే సమయంలో ఓ అభిమాని అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు గాయమైంది. మరోవైపు రోడ్డు కం రైలు వంతనపై పవన్ కాన్వాయ్లోని వాహనం తగిలి ఓ కానిస్టేబుల్ కాలికి గాయమైంది. బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందులు పడ్డామంటూ రాజమహేంద్రవరం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశంకానున్నారు. -
నకిలీ డాక్టర్ అరెస్టు
-
పలు క్లినిక్లపై విజిలెన్స్ దాడులు
ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం రూరల్): అనధికారికంగా క్లినిక్లు నిర్వహిస్తున్న వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్పీ రామప్రసాదరావు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఐఎల్టీడీ సెంటర్లోని సాయిక్లినిక్పై విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ కోమలి దాడులు నిర్వహించారు. ద్వారపూడి పీహెచ్సీలో కాంట్రాక్టు పద్ధతిలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పీఎస్ రంగప్రసాద్ అనధికారికంగా ఈ క్లినిక్ను నిర్వహిస్తున్నాడు. ప్రిస్కిప్షన్ వినియోగంతోపాటు, పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని సైతం వినియోగిస్తున్నాడు. అలాగే అనుమతులు లేకుండా లేబొరేటరీ నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. యాపిల్ డెంటల్ ఆసుపత్రి వైద్యులు ఎ.సత్యప్రసాద్, శైలజ ఇక్కడ కన్సల్టెంట్ నిర్వహిస్తూ మెడికల్ షాపు నడుపుతున్నారు. మెడికల్షాపులో ఫార్మాసిస్టు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని విజిలెన్స్ ఎస్పీ టి.రామప్రసాదరావు పరిశీలించారు. అనధికారికంగా క్లీనిక్ను నిర్వహిస్తున్న పీఎస్ రంగప్రసాద్పై క్రిమినల్ కేసు నమోదు చేసి జిల్లా వైద్య ఆరోగ్యాశాఖాధికారికి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదే ప్రాంతంలో ప్రసాద్ చర్యవ్యాధుల ఆసుప్రతిని తనిఖీ చేశారు. అక్కడ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఎస్పీ రామప్రసాదరావు తెలిపారు. ధవళేశ్వరంలోనూ.. ధవళేశ్వరం: ధవళేశ్వరం పోలీస్స్టేషన్ వీధిలోని శ్రీ సద్గురు కాళీకృష్ణ సీతామహలక్ష్మి క్లినిక్పైనా శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లపై ఆసుపత్రి వైద్యుడు రాజగోపాల్ గిరీష్ను విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావు ప్రశ్నించారు. రాజగోపాల్గిరీష్కు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించగా వేరే వారి పేర్లు వస్తున్నాయన్నారు. వాటిపై దర్యాప్తు చేపడతామన్నారు. ఆయన వెంట విజిలెన్స్ సీఐ టి.రామ్మోహనరెడ్డి, ధవళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి సుధాకర్ తదితరులు ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. నకిలీ డాక్టర్ అరెస్టు రాజమహేంద్రవరం క్రైం: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మెడికల్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో నకిలీ డాక్టర్ను, అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు. టూ టౌన్ సీఐ రవి కుమార్ కథనం ప్రకారం.. ఐఎల్టీడీ సెంటర్లో శ్రీ సాయి క్లినిక్ నిర్వహిస్తున్న పీఎస్ రంగా ప్రసాద్, అతడి సహాయకుడు సుధీర్ను అరెస్ట్ చేశామన్నారు. వీరిపై చీటింగ్, సెక్షన్ 2 ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిస్మెంట్ రూల్ 5 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు టూటౌన్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. -
సమన్వయ లోపమే శాపం
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిర్లిప్త వైఖరి, ఇరిగేషన్ శాఖ ఏకపక్ష ధోరణి పాపికొండల పర్యాటకులకు శాపంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల పర్యటన ప్రారంభమైన పన్నెండేళ్ల తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్యక్షతన రెగ్యులేటరీ ఆథారిటీ కమిటీ సమావేశం జరిగింది. పటిష్ట ప్రణాళికలేవీ లేవనే విషయం జేసీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన వివిధ శాఖల అధికారులు, బోటు యజమానుల సమావేశంలో తేటతెల్లమైంది. నిరంతర పక్రియగా సాగాల్సిన పర్యవేక్షణలు ప్రమాద ఘటనలు జరిగిన తరువాత మాత్రమే గుర్తుకు వస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ బోటు యజమానుల బోట్ల నిర్వహణపై తనిఖీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేయడంలో చర్యలకు దిగిన తహసీల్ధార్ నివేదికలను ఇరిగేషన్ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమన్వయలోపం కనిపిస్తోంది. మంగళవారం అంగుళూరులో అధిక లోడుతో ఉన్న మూడు బోట్లను తహసీల్ధార్ గుర్తించినా చర్యలు చేపట్టడంలో ఇరిగేషన్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇరిగేషన్ ఈఈని వివరణ కోరినా ఇంకా నివేదిక రాలేదని చెబుతుండటం...చర్యలు చేపట్టడంలో సన్నాయి నొక్కులు నొక్కుతుండడంతో ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జాడలేని రెగ్యులేటరీ అధారిటీ కమిటీ... బోటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం, డ్రైవర్, సరంగు లైసెన్స్ మంజూరు చేయడంలో అధికారులు అమ్యామ్యాలకు లొంగిపోతూ నచ్చిన వారి బోట్లకు అనుమతులు మంజూరుచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీకీ తెలియకుండా ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో టూరిజం టిక్కెట్ ధర ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు పెంచుకుంటున్నారు. పర్యాటక బోట్లలో ఏ ఇబ్బందులు తలెత్తినా పురాతన బ్రిటిష్ చట్టం ఆధారంగా బోటు సూపరింటెండెంట్ మాత్రమే చర్యలు చేపట్టాలనే నిబంధన మిగిలిన శాఖల అధికారుల పాత్రను డమ్మీగా చేసింది. అంగుళూరు బోటింగ్ పాయింట్లో నిత్యం వేలాదిమంది పర్యాటకులు రాకపోకలు సాగిస్తున్నా కనీసం మెట్లు సదుపాయం కూడా లేదు. లైటింగ్ సౌకర్యం అంతంతమాత్రమే. పర్యాటక శాఖ అధ్వర్యంలో ఉన్న మూడు బోట్లను కూడా నడపలేని దుస్థితిలో ఉండటంతో ప్రయివేట్ బోట్లు జోరందుకున్నాయని అభిప్రాయపడుతున్నారు. పాపికొండల పర్యటనకు వెళ్లేందుకు ఆన్లైన్లో రిజర్వేషన్ పొందిన పర్యాటకులను ప్రయివేట్ బోట్లలో పంపిస్తున్నారంటే టూరిజం శాఖ దీనావస్థ బయటపడుతోంది. బుట్టదాఖలైన ఏకగవాక్ష విధానం ఏడాదిన్నర క్రితం టూరిజంలో సమస్యలు తలెత్తినపుడు పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లన్నింటినీ టూరిజం శాఖ ద్వారా పంపేందుకు సింగిల్ విండో (ఏకగవాక్ష విధానం) అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటి టూరిజం ఎండీ ఆధ్వర్యంలో బోటు నిర్వాహకులతో సమీక్ష నిర్వహించిన అధికారులు తరువాత రోజుల్లో ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కృష్ణా జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంతో మళ్లీ బోట్ల నిర్వహణ విషయంలో ఏకగవాక్ష విధానాన్ని అమలు చేయాలనే విషయం తెరమీదకు వచ్చింది. ఈ హడావుడి ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచి చూడాల్సింది. -
అక్రమార్కులపై ఉక్కుపాదం
రాజమహేంద్రవరం క్రైం: ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకు ప్రయత్నించే అక్రమార్కుల నుంచి వాటిని రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ రీజనల్ ఆఫీసర్ టి.రాంప్రసాద్ వెల్లడించారు. ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అవినీతి వారోత్సవాలలో భాగంగా శని వారం రాజమహేంద్రవరం, తిలక్ రోడ్డులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కుల నుంచి రూ.346.56 కోట్లను రాబట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై నివేదికలు ఎఫ్సీఐ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ బియ్యం, ధాన్యం, కోనుగోలు పై చెల్లించాల్సిన అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) ఆర్డీ సెస్, వృత్తి పన్ను, వ్యాట్ ఎగవేతన గ్రీన్ టాక్స్ మోటారు వెహికిల్స్ టాక్స్ ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నుల కింద రూ 186.56 కోట్లు మొత్తం గుర్తించి ఆ మొత్తం వసూలు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో.. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలపై ఆకస్మిక తనిఖీలు చేసి రూ 4,34,672 విలువ చేసే పీడీఎస్బియ్యం రూ.1,25,941 విలువ చేసిన బియ్యం, ఇతర ఉత్పత్తులు రూ.15,12,071 ఎల్పీజీ ఆయిల్, కిరోసిన్, ఇతర సరుకులు రూ.45,65,306 పప్పులు, నూనెలు, నిత్యావసర వస్తువులు మొత్తం కలిపి రూ.2.13 కోట్ల వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నా రు. ల్యాండ్ మాఫియాపై.. కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట పంచాయితీ పరిధిలో 30 ఏళ్లుగా అభివృద్ధి చేసిన భూముల లే అవుట్లపై విచారణ చేయగా సుమారు 68 లేఅవుట్లలో గుర్తించామని తెలిపారు. సుమారు రూ.68.29 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఆక్వా సాగులో అవకతవకలు తూర్పు గోదావరి జిల్లాలో అక్వా సాగుపై విచారణ చేయగా సుమారు 22,890 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్వా సాగు జరుగుతున్నట్లు, మిగిలిన 16,126 ఎరాలలో అక్వా రైతులు అధిక శాతం ప్రాథమిక అనుమతులు పొంది సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. సహజ వనరులపై దోపిడీపై.. కోరంగి మడ అడవుల సమీపంలో నిర్మించిన రోప్వే, బ్రిడ్జిల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుర్తించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వంతాడ పరిసరాలలో లేటరైట్ గనుల నిర్వహణలో జరిగిన అక్రమాలను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్లు వేయడం, రిజర్వ్ ఫారెస్ట్ లో తవ్వకాలు సాగించిన మినరల్ కంపెనీల నుంచి రికవరీకి, బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల ద్వారా 2016 రబీలో చేపట్టిన కార్యక్రమాలలో లోపాలు గుర్తించి రూ.16 కోట్లు రికవరీ, సంబంధిత అధికారులపై చర్యలకు నివేదిక ఇచ్చామన్నారు. ఈ తనిఖీలలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని గుర్తించి దాడులు నిర్వహించడంలో, నివేదికలు తయారు చేయడంలో బదిలీపై వెళ్లిన విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్ర కుమార్, సీఐలు, ఎస్వీ భాస్కరరావు, వై.సత్యకిషోర్, టి.రామ్మోహన్ రెడ్డి, బి.సాయిరమేష్, జి. శ్రీనివాస్, జె.భార్గవ్ మహేష్, పీడీ రత్నకుమార్, కుమార్ పాల్గొన్నారని తెలిపారు. -
ఇంటికో ఉద్యోగం ఎక్కడ బాబూ..?
కోటగుమ్మం (రాజమహేంద్రవరం): విద్య, వైద్యం వ్యాపారంగా మార్చి అంగడి సరుకుగా అమ్మడం దారుణమనని, విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం యువత ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక అంబళ్ళ సూర్యారావు భవన్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. విద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు తీసుకువెళుతున్నారని విమర్శించారు. ఇటువంటి తరుణంలో విద్యార్ధి, యువజనుల పోరాటాల ద్వారానే తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని దుయ్యబట్టారు. రూ. 2 వేల నిరుద్యోగ భృతి సంగతి ఎప్పుడో మరచిపోయారన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో చట్టాలు చేయాలని, అశ్లీల చిత్రాలపై నిషేధం విధించాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నాయకులు వంగమూడి కొండలరావు, కరిబెండి శ్రీనివాస్, వీసరపు రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక...: సమావేశం అనంతరం నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా గంటా జాన్ప్ర కాష్, ఎఐవైఎఫ్ జిల్లాఅధ్యక్షుడిగా అప్పారావునుఎన్నుకున్నారు. -
బతకనివ్వడం లేదు..
దేవీపట్నం (రంపచోడవరం), తాడితోట (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగాయి. తాజాగా దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి చెందిన సాదల మంగాదేవి(26) గతనెల 31వతేదీ మంగళవారం పురుడు పోసుకునే నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో భర్త సాధల వెంకటరెడ్డితో కలసి వచ్చి చేరింది. ఆసుపత్రిలో బెడ్స్ కేటాయించకపోవడంతో మూడు రోజులుగా ఆసుపత్రి వరండాలోనే నేలపై పడుకోబెట్టారని భర్త సాదల వెంకట రెడ్డి పేర్కొన్నాడు. గురువారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో పురుడు పోయాలని డాక్టర్లను కోరామని అయితే వారు పురుడు పోసేందుకు జాప్యం చేశారని తెలిపారు. అదే సమయంలో మరో మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిందని, డాక్టర్లు ఆమె కోసం గది కేటాయించి తమను పట్టించుకోలేదని వాపోయాడు. దీంతో పరిస్థితి విషమించిందని పేర్కొన్నాడు. చాలా సేపు బతిమిలాడిన తరువాత పురుడు పోసేందుకు ఆపరేషన్ రూమ్లోకి తీసుకువెళ్లారని, ఆ తరువాత పరిస్థితి బాగోలేదని కాకినాడ తీసుకువెళ్లాలని చెప్పారని తెలిపారు. కవల పిల్లల్లో ఒకరి పరిస్థితి బాగోకపోవడంతో వారితో పాటే మంగాదేవిని కాకినాడ తరలించేందుకు ప్రయత్నించారని, బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ ఎక్కించేందుకు ప్రయత్నించి మరలా వార్డులోకి తీసుకువెళ్లారని, ఈ నేపథ్యంలో పురుడు పోసే సమయంలో జాప్యం జరగడంతో ఉమ్మనీరు తాగి గర్భంలోనే శిశువు మృతి చెందింది. గంట తరువాత శిశువు మృతి చెందినట్టు డాక్టర్లు భర్త వెంకట రెడ్డికి చెప్పారు. అనంతరం మరో రెండు గంటల తరువాత భార్య మంగాదేవి కూడా మృతి చెందినట్టు చెప్పారని అవేదన వ్యక్తం చేశాడు. పురుడు పోయడంలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే రక్తం గడ్డకట్టి తల్లి మృత్యువాత పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. హడావుడిగా మృతదేహాల తరలింపు డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతి చెందిన మృతదేహాలను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రి ఆర్ఎంఓ తరలించారు. మృతదేహాలను ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉంచకూడదని భర్త వెంకట రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను దేవీపట్నం మండలం వి.రామన్నపాలేనికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రిలోని కేస్ షీట్లు కూడా ఆర్ఎంఓ వద్ద దాచారని బాధితులు ఆరోపించారు. డాక్టర్స్ లోపం లేదు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లీ బిడ్డ మృతి సంఘటనలో డాక్టర్స్ లోపం లేదని పేషంట్ను కాపాడాలని వారు ఎంతో ప్రయత్నించారని, అయితే గర్భంలో ఉన్న మాయ అనేది పగిలిపోవడంతో ఆపరస్మారక స్థితికి చేరుకొని ఆమె మృతి చెందిందని,ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ అధికారి, ఇన్చార్జ్ డీఎంఅండ్ హెచ్ఓ ఎం. రమేష్ కిషోర్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యానికి బలి నా భార్య సాధల మంగాదేవికి పురిటినొ ప్పులు రావడంతో అ క్టోబర్ 31న రంపచో డవరం ఏరియా ఆసు పత్రికి తీసుకువెళ్లాం. అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తీసుకువెళ్లగా వైద్యులు గురువారం పురిటినొప్పులు వస్తున్నా కనీసం పట్టించుకోలేదు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయాడని, తక్షణం ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని హడావుడి చేసిన వైద్యులు ఆపరేషన్ చేసి మృతశిశువును అప్పగించారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే నా భార్య బాలింత మంగాదేవి కూడా మృతి చెందింది. మాతా శిశు సంరక్షణ రికార్డులో మంగాదేవికి అక్టోబర్ ఆరో తేదీన కాన్పు తేదీని నమోదు చేశారు. ఇచ్చిన గడువుకు 25 రోజులు గడిచిన తర్వాత ఆసుపత్రికి వెళ్లినా.. అటు రంపచోడవరం, ఇటు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించలేదు. – వెంకటరెడ్డి, మంగాదేవి భర్త -
షర్మిల కొడుకు కిడ్నాప్.. ఎవరి పని?
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఘటన జరిగిన తీరును బట్టి అది వారికి బాగా తెలిసిన వ్యక్తులు చేసినట్లుగా స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి బాలుడితో సహా కారును దుండగుడు ఎత్తుకెళ్లగా కారు వేగం తగ్గిన సమయంలో బాలుడు దూకేసిన విషయం తెలిసిందే. అయితే తెల్లవారు జామున వాహనాన్ని అగంతకుడు గోకవరంలో వదిలాడు. కారు ఉన్న ప్రదేశాన్ని వివరిస్తూ రాసిన లేఖను గురువారం ఉదయం ఆరు గంటలకు షర్మిలా రెడ్డి నివాసం వద్ద వదలడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షర్మిలా రెడ్డి ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి తన కుమారుడితో నూతన ఇన్నోవా వాహనంలో ఇంటికి వచ్చారు. కుమారుడిని కారులోనే ఉంచిన ఆమె తన కుమార్తెను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లారు. వెంటనే అగంతకుడు బాలుడితో సహా కారును ఎత్తుకెళ్లాడు. నగరంలోని ఎపెక్స్ ఆస్పత్రి వద్ద వాహన వేగం తగ్గడంతో బాలుడు కిందకు దూకేశాడు. నగదు కోసం బాలుడుని కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు పక్కా ప్రణాళికతో వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని స్పృహతప్పే విధంగా చేయడం, బాలుడు కిందకు దూకేస్తుంటే అడ్డుకోకపోవడం, కారు డోర్లు లాక్ చేసే అవకాశం ఉన్నా చేయకపోవడం వల్ల అగంతకుడు బాలుడుని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని ఘటన జరిగిన తీరు తెలుపుతోంది. నిన్ను ఏం చేయనంటూ నిందితుడు బాలుడితో చెప్పడం, కారులో నుంచి దూకుతుంటే అడ్డుకోకపోవడం అతను బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చినట్లుగా లేదని పోలీసులు అంచనాకు వస్తున్నారు. కిడ్నాప్ చేయాలనుకుంటే అగంతకుడు ఒక్కడే రాడని పలువురు బృందంగా వచ్చేవారని భావిస్తున్నారు. కావాలనే చేశారా...? తెల్లవారితే దీపావళి పండుగ నేపథ్యంలో రాజకీయ నేత అయిన షర్మిలా రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిపారా అన్న అనుమానాలకు ఘటన జరిగిన తీరు, అనంతరం పరిణామాలు బలపరుస్తున్నాయి. షర్మిలా రెడ్డి కుటుంబం అంటే పడని బంధువులు, లేదా రాజకీయ ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండగ రోజున ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే తెలిసిన వారు ఈ పని చేశారని నగరంలో చర్చ జరుగుతోంది. ఘటన జరిగినప్పటి నుంచి షర్మిలారెడ్డి కుటుంబం ఇంకా కోలుకోలేకపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేత కుటుంబానికి ఇలా జరగడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అగంతకుడి కోసం ముమ్మర గాలింపు... అగంతకుడి కోసం ఒకటో పట్టణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఐ రవీంద్ర పర్యవేక్షణలో ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలిస్తున్నాయి. అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి ఈ కేసును సవాల్గా తీసుకున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని పట్టుకుంటామని సీఐ రవీంద్ర చెప్పారు. కారు వదిలి.. లేఖ రాసి... బాలుడు దూకేసిన తర్వాత కారుతో వెళ్లిపోయిన అగంతకుడు వాహనాన్ని గోకవరం సమీపంలో వదిలాడు. ఆ విషయాన్ని గురువారం తెల్లవారు జామున ఆరు గంటలకు ఓ లేఖలో వివరిస్తూ దానవాయిపేటలోని షర్మిలారెడ్డి ఇంటి ముందు వదిలాడు. బుధవారం రాత్రి ఘనట జరిగిన తర్వాత తెల్లవారు జాము 3 గంటల వరకు ఆమె ఇంటి వద్ద పలువురు రాజకీయ నేతలు, నగర ప్రముఖులు ఉన్నారు. పోలీసులు 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అయినా ఆరు గంటలకు అగంతకుడు అక్కడ లేఖను వదలడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తెలిసిన వారు అక్కడే ఎవరో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే జన సంచారం లేని సమయం చూసి ఖచ్చితంగా అదే సమయానికి అక్కడికి ఎలా వస్తాడన్నది ప్రశ్నగా మారింది. లేఖను అక్కడ అగంతకుడు వదిలాడా? లేక అతనికి సంబంధించిన వారు వదిలారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే కొనుగోలు చేసిన రూ.18 లక్షల విలువైన తెలుపురంగు ఇన్నోవా కారును తీసుకెళ్లి మళ్లీ గంటల వ్యవ్యధిలో నగరం బయట వదిలి ఆ సమాచారం చేరవేయడంతో అతను దొంగ కాదని పోలీసులు భావిస్తున్నారు. బాలుడిని వదిలివేయడంతో అతను కిడ్నాపర్ కాదని, రూ.18 లక్షల విలువైన కారును తిరిగి వారికి అప్పగించేలా లేఖలో సమాచారం ఇవ్వడంతో దొంగ కాదన్న విషయం స్పష్టమవుతోంది. -
కాంట్రాక్టర్ల సమ్మెట..
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రాజమహేంద్రవరం సర్కిల్లో కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్(ఎస్ఎస్ఆర్) సవరణలో ధరలు పెరగకపోగా, తగ్గించడంతో తమకు గిట్టుబాటు కాదంటూ నెల రోజుల నుంచి పనులు నిలిపివేశారు. చివరగా 2014 ఏప్రిల్లో ఎస్ఎస్ఆర్ రేట్ల సవరణ జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో 2014 ఎస్ఎస్ఆర్ రేట్లలో ఏపీఈపీడీసీఎల్ మార్పులు చేసింది. ఆ మార్పుల్లో పాత రేట్లలో పెరుగుదల లేకపోగా సగటును 30 శాతం రేట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు ఏడాదికి ఒకసారి సవరిస్తారు. ఆయా జిల్లాల్లో కూలీల అందుబాటు, రేట్లు ఆధారంగా కలెక్టర్లు ఏటా లేబర్ చార్జీలు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఏపీఈపీడీసీఎల్ కూడా జిల్లాల వారీగా ఎస్ఎస్ఆర్ రేట్లు నిర్ణయిస్తుంది. ఫలితంగా ఐదు జిల్లాల్లో ఎస్ఎస్ఆర్ రేట్లు భిన్నంగా ఉన్నాయి. 30 శాతం మేర తగ్గిన రేట్లు... ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్ఎస్ఆర్ రేట్లతో 2014–15 రేట్లను పోల్చితే పెరగకపోగా సరాసరి 30 శాతం ప్రస్తుతం తగ్గిపోయాయి. 2014–15లో విద్యుత్ స్తంభాన్ని కిలోమీటర్ దూరం తరలిస్తే రూ.545 ఇచ్చేవారు. అదే రెండు కిలోమీటర్లకు రూ.681, మూడు కిలోమీటర్లకు రూ.818, ఐదు కిలోమీటర్లలోపు దూరానికి రూ. 980లు చెల్లించేవారు. అయితే తాజాగా ఇవన్నీ ఎత్తివేసిన ఏపీఈపీడీసీఎల్ ఎంత దూరం విద్యుత్ స్తంభం తరలించినా రూ.510 చెల్లించేలా ఎస్ఎస్ఆర్ రేట్లను సవరించింది. స్తంభాలు పాతే గుంతలు తొవ్వితే గతంలో రూ.357 చెల్లించగా ప్రస్తుతం ఆ రేటును రూ. 312.50లకు తగ్గించారు. స్తంభం పాతినందుకు పాత రేటు రూ.575 ఉండగా, తాజాగా ఆ రేటు రూ.507లకు కుదించారు. గృహ అవసరాలకు వినియోగించే విదుత్య్ వైరు కిలో మీటర్ మేర స్తంభాలపై అమర్చినందుకు గతంలో రూ.1797 చెల్లించగా, ప్రస్తుతం ఆ రేటులో రూ.297 కోత విధించి రూ.1500లకు పరిమితం చేశారు. పాత విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలను అమర్చినందుకు ఉన్న రేట్లను రూ.1390 నుంచి రూ.690లకు కుదించారు. గిట్టుబాటు కాదంటున్న కాంట్రాక్టర్లు... 2014–15 ఆర్థిక ఏడాదిలో జరిగిన ఎస్ఎస్ఆర్ రేట్ల సవరణలో వాస్తవానికి అధికంగా రాజమహేంద్రవరం సర్కిల్లో రేట్లు నిర్ణయించామని ఏపీఈపీడీసీఎల్ భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మూడేళ్ల తర్వాత సవరించిన ఎస్ఎస్ఆర్లో రేట్లు పెంచకపోగా తగ్గించిన రేట్లతో తమకు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చిచెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సవరించిన ఎస్ఎస్ఆర్ రేట్లు అమలులోకి వచ్చాయి. అప్పటి నుంచి రేట్లను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. అయితే సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నెలరోజుల నుంచి కొత్త పనులు చేపట్టడం ఆపేశారు. వినియోగదారులు డీడీలు చెల్లించిన మూడు నెలల లోపు విద్యుత్శాఖ అధికారులు వారి పనులు పూర్తి చేయాలి. అయితే ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు చేయకపోవడంతో రాజమహేంద్రవరం సర్కిల్లోని ఐదు డివిజన్లలో వందలాది పనులు పెండింగ్లో ఉన్నాయి. తుపాను హెచ్చరికలతో ఆందోళన... ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు తుపాను హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లాలోని విద్యుత్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. తుపాను వల్ల స్తంభాలు కూలి, వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. తిరిగి విద్యుత్ పునరుద్ధరణలో కాంట్రాక్టర్ల వద్ద ఉండే సిబ్బందే కీలక ప్రాత పోషిస్తారు. నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులో లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో 20 స్తంభాలు కూలిపోయాయి. అ సమయంలో విద్యుత్ అధికారులు, సిబ్బందే అష్టకష్టాలు పడి మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి తిరిగి పునరుద్ధరించారు. కాంట్రాక్టర్లు ఎలాంటి సహాయం అందించలేదు. ప్రస్తుతం పాత రేట్లు చెల్లిస్తూ కొత్త రేట్లలో మార్పులు చేర్పులు చేస్తే తాము పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టర్లు అధికారులకు చెబుతున్నారు. -
తీర్థయాత్రా స్పెషల్
రాజమహేంద్రవరం సిటీ: కార్తికమాసంలో పంచారామాలు, శ్రీశైలం తీర్థయాత్రలకు, నవంబర్లో శబరిమల వెళ్లే భక్తుల కోసం 490 ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక సర్వీసులకు నిర్ణయించిన ధరల బ్రోచర్ను ఆవిష్కరించారు. నవంబరు 23, 29 తేదీలలో శబరిమలకు 4 రోజులు, 5 రోజుల తీర్థయాత్ర ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేసామన్నారు. 4 రోజుల ప్యాకేజీలో విజయవాడ, తడ బైపాస్, తేనేగాటి, శబరిమల ఉంటాయని, ధర రూ.3500 అని చెప్పారు. 5 రోజుల యాత్రలో కాణిపాకం, ఎరుమేళి, శబరిమల, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఉంటాయని, ధర రూ.3800గా నిర్ణయించామన్నారు. గత ఏడాది 22 బస్సులు నడపడం ద్వారా రూ.29 లక్షల ఆదాయం గడించగా ఈ ఏడాది 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఆదాయంలో తూర్పు రీజియన్కు అగ్రస్థానం.. ఆరు నెలల కాలంలో ఆర్టీసీలో తూర్పురీజియన్ రూ.9.83 కోట్ల రాబడి సాధించి రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్ఎం చెప్పారు. రీజియన్ చరిత్రలో ఇంత ఆదాయం సాధించడం ఇదే మొదటి సారన్నారు. దసరాకు గత ఏడాది 610 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.1.18 కోట్లు ఆదాయం సాధించామని, ఈ ఏడాది 925 బస్సులను నడిపి రూ.రెండు కోట్లు సాధించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్, ప్రత్యేక బస్సుల నిర్వహణాధికారి బాషా, పీఆర్ఓ రాజబాబు పాల్గొన్నారు.