
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు.
అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్కు ఫోన్చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన
ఎంపీ భరత్రామ్ను పలువురు అభినందించారు.