
కల్చరల్ సెంటర్ కృషి అభినందనీయం
విజయవాడ (మొగల్రాజపురం) : గ్రామాల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్న చారిత్రక సంపద అయిన శాసనాలు, శిల్పాలను పరిరక్షించడానికి విజయవాడ కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషి అమోఘమని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పి.విజయబాబు అన్నారు. ఆయన గురువారం ఉదయం కల్చరల్ సెంటర్ను సందర్శించారు.
జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. ఏడాదికాలంగా తాము నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కల్చరల్ సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి వివరించారు. తెలుగు వారి సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణకు కల్చరల్ సెంటర్ చేస్తున్న కృషిని విజయబాబు అభినందించారు. విజయబాబును సందీప్ మండవ సత్కరించారు. ప్రముఖ నర్తకి కీర్తి, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షుడు సింహాద్రి లచ్చయ్య పాల్గొన్నారు.