
వరదతో నిండిన అంతర్గత రహదారి
గ్రామాల్లోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే చాలు కాలు వేస్తే తీయలేని పరిస్థితి. రోడ్ల పైనే మురుగు కాల్వలు ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు లేరు.
కొండాపూర్: గ్రామాల్లోని అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే చాలు కాలు వేస్తే తీయలేని పరిస్థితి. రోడ్ల పైనే మురుగు కాల్వలు ఏరులై పారుతున్నా పట్టించుకునే వారు లేరు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అంతర్గత రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది.
తొగర్పల్లి, కొండాపూర్, మల్కాపూర్, గంగారం, అనంతసాగర్, కోనాపూర్, మునిదేవునిపల్లి, మల్కాపూర్ మదిర గ్రామమైన కుతుబ్షాహీపేట్, మారేపల్లి తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే పెద్దాపూర్ నుండి అనంతసాగర్ వరకు వేసిన డబుల్రోడ్డు, తొగర్పల్లి ప్రధాన రహదారి సైతం పూర్తిగా గుంతలమయమైందని వాహనదారులు పేర్కొంటున్నారు.
కుత్బ్షాహీపేట్, మునిదేవునిపల్లి, మారేపల్లి గ్రామాల్లో అంతర్గత, కచ్చా రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. వర్షం పడడంతో కాలు వేస్తే తీయలేని పరిస్థితి.రాత్రివేళ్లలో నడవడానికి చాలా కష్టంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మండల కేంద్రమైన కొండాపూర్లోనూ అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.
మారేపల్లి, అలియాబాద్, గంగారం గ్రామాలలో మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో ఇళ్ల ముందు నుండే మురుగు నీరు ఏరులై పారుతోంది. దీంతో దోమలు, ఈగలు ప్రబలి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కనీసం కాల్వల నుండి మురుగు తీసేవారే కరువయ్యారనీ పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీగా మార్చాలంటున్నారు.