పోలీసుల అదుపులో బాల నేరస్తులు
Published Tue, Sep 13 2016 1:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఏలూరు అర్బన్ : నగరంలోని పలుఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు బాల నేరస్తులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం కోర్టుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని ఇళ్లలో దొంగతనాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో టూటౌన్ పోలీసులు కొంతకాలంగా అనుమానితులపై నిఘా పెట్టారు. తంగెళ్లమూడికి చెందిన నలుగురు బాలురు నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితులు తంగెళ్లమూడి వంతెన వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో టూటౌన్ సీఐ ఉడతా బంగార్రాజు, ఎస్సై అల్లు దుర్గారావు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 185 గ్రాముల బంగారు నగలు, సుమారు 750 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.
Advertisement
Advertisement