హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
Published Thu, Jul 28 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
రూ.1500లు వంతున జరిమానా
రెండవ అదనపు జిల్లా జడ్జి హెచ్.చంద్రశేఖర్ తీర్పు
పార్వతీపురం: హత్యా నేరం రుజువు కావడంతో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. 1,500లు చొప్పున జరిమానా విధిస్తూ పార్వతీపురంలోని రెండవ అదనపు జిల్లా జడ్జి హెచ్.చంద్రశేఖర్ తీర్పు నిచ్చారు. దీనికి సంబంధించి కోర్టు లైజనింగ్ అధికారి ఎస్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పోలీస్స్టేషన్ పరిధిలో 25 సెప్టెంబర్ 2012లో మూలబిన్నిడి గ్రామానికి చెందిన మండంగి సిమ్మన్నకు చిల్లంగి ఉందని అదే గ్రామానికి చెందిన మండంగి అర్జునతో పాటు మరో తొమ్మిది మంది పంచాయతీ పెట్టి, సిమ్మన్నను కొట్టి, హతమార్చి, దహనపర్చారు. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామంటూ భార్య శాంతమ్మను బెదిరించారు. అయితే నెల రోజుల తర్వాత 26 అక్డోబర్ 2012న శాంతమ్మ ఎల్విన్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ కె.ఈశ్వరరావు దర్యాప్తు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరశురాం వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో మండంగి అర్జున, మండంగి చిన్నారావు, మండంగి కామన్న, మండంగి వలపారావు అనే నలుగురికి జీవితఖైదుతోపాటు, ఒక్కొక్కరికి రూ. 1,500లు చొప్పున జరిమానా విధించారు.
Advertisement
Advertisement