
మంజీర బ్యారేజీలోకి వరద నీరు
సంగారెడ్డి రూరల్:మండల పరిధిలోని కల్పగూర్ మంజీర డ్యామ్కు జలకళ వచ్చింది. గత ఎండాకాలంలో ఎండిపోయి బోసిపోయిన డ్యాంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర వరదనీరు చేరింది. డ్యామ్ నిర్మించినప్పటి నుంచి ఎప్పుడూ ఎండిపోని బ్యారేజి.. వేసవికాలంలో పూర్తిగా ఎండిపోయి నీరులేక వెలవెలబోయింది. దీంతో జంటనగరాలకు మంచినీరు సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు సంగారెడ్డి మండలంలోని కల్పగూర్, అంగడిపేట్, గంజీగూడెం, చింతల్పల్లి, పోతురెడ్డిపల్లి, కంది, మామిడిపల్లి, ఎర్ధనూర్తోపాటు పలుతండాలకు మంజీర నీటి సరఫరా చేయలేకపోయారు.
డ్యామ్ దిగువ భాగంలో నీటిని మోటార్ల ద్వారా రాజంపేట ఫిల్టర్బెడ్కు తరలించి అక్కడి నుంచి సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేస్తున్నారు. అయితే చాలా రోజుల తరువాత మంజీర బ్యారేజికి జలకళ రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్లోకి మరికొంత నీరు వస్తే గ్రామాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.