Manjeera Project
-
గుంతలో మొసలి.. జడుసుకున్న కూలీలు!
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్కల్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి -
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : ఉత్తమ్
సాక్షి, సంగారెడ్డి: ప్రజల పక్షాన, రైతుల సమస్యలపై పోరాటం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టు సంద ర్శనకు వస్తున్న ఆయనను పటాన్చెరు సమీపం లోని టోల్గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేసిన అనంతరం స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. విపక్షాలు ప్రజల పక్షాన పోరాటం చేసే క్రమంలో బయటకు వెళ్తే చాలు.. అక్రమంగా, అవమాన కరంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్ష పార్టీ నేతగా, టీపీసీసీ అధ్యక్షుడిగా, ఓ ఎంపీగా ప్రాజెక్టులను పరిశీలించడానికి వెళ్తే అరె స్టులు చేస్తారా?’అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పది మందిమి.. ఎండిపోయిన మంజీరా డ్యామ్ సందర్శనకు స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలసి వెళ్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా సింగూరు, మంజీరలను నింపు తామన్న కేసీఆర్ హామీ ఏమైందని అన్నారు. కొండ పోచమ్మ నుంచి కేసీఆర్ ఫాంహౌస్కు నీళ్లు వెళుతు న్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ తప్ప మిగతా ప్రాంతాల్లో సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నా రు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను సందర్శిస్తే కేసీఆర్కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి సరికాదన్నారు. కల్వకుంట్ల సైన్యంలా పోలీసులు.. పోలీసుల తీరుపై ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తే అరెస్టులు చేస్తారా అని ధ్వజమెత్తారు. ‘డీజీపీని ప్రశ్నిస్తున్నా.. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? కేసీఆర్ పదివేల మందితో కలసి కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎలాంటి ఆంక్షలు ఉండవు.. అదే మేము పది మందితో కలసి ప్రాజెక్టులు సందర్శిస్తే అడ్డుకుంటారా’అని మండిపడ్డారు. హోం మినిస్ట్రీ నోటిఫికేషన్ ప్రకారం అరెస్టులు చేస్తున్నామని డీజీపీ చెబుతున్నారని, వేలాది మందితో ప్రారంభోత్సవాలు, వ్యవసాయ సభలు పెడుతున్న కేసీఆర్కు, ఆయన అనుచరులకు ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. దేశంలోనే తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఈ కార్యక్రమంలో సంగా రెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి), కాంగ్రెస్ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఉత్తమ్తోపాటు మరో ఇద్దరిపై కేసు పెట్టారు. -
సీఎం కేసీఆర్ మాట తప్పారు
-
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. సీఎం ఈనెల 11, 12, 13, 14 తేదీలలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లు నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల శివారులో ఉన్న మంజీర నదిపైన రూ. 476.2 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించాలని సంకల్పించిన విషయం తెలిసిందే.. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ పట్టణం నుంచి బస్సు ద్వారా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ మార్గాన్ని కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, హరితహారం మొక్కలు నాటడం, వాటి చుట్టూ ట్రీగార్డుల ఏర్పాటు పనులపై అధికారులకు సూచనలిచ్చారు. వారి వెంట బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో పర్బన్న, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్, కోమలంచ సర్పంచ్ అనురాధ, ఎంపీటీసీ బండారు లక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఎడారిలా మంజీరా
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ నదులు ప్రాజెక్టులు నిండుతున్నాయి. కానీ మంజీరా నది మాత్రం నీరు లేక బోసిపోతోంది. నది గర్భం ఎడారిని తలపిస్తోంది. పరీవాహక ప్రాంతంలోని బోర్లన్నీ వట్టిపోయాయి. లక్షల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఉత్తగానే ఉన్నాయి. వందలాది ఎకరాల సాగు భూమి బీడుగా మారింది. వ్యవసాయమే జీవనాధారమైన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పరీవాహక ప్రాంత రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాక్షి, టేక్మాల్/ మెదక్: మండలంలోని కుసంగి, దనూర, ఎలకుర్తి, శేర్పల్లి, ఎలకుర్తి, లక్ష్మణ్తండా, చంద్రుతండా, అచ్చన్నపల్లి తదితర గ్రామాలు మంజీర నది పరివాహక గ్రామాలు. నదిని ఆధారంగా చేసుకొనిఒక్కో గ్రామంలో సుమారు 1200 ఎకరాలకు పైగా వరి సాగు చేసేవారు. ఎత్తిపోతల పథకాలతో నిండిన చెరువులు, కుంటలను ఆసరా చేసుకొని పంటలు సాగు చేసుకున్నారు. ఒక్కో రైతు 20 నుంచి 30 ఎకరాల వరకు కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవారు. అయితే గతేడాదికి ఇప్పటికి పరిస్థితి తారుమారైంది. అయితే నదీ పరివాహక ప్రాంత సాగు భూములన్నీ బీడు భూములను తలపిస్తున్నాయి. పిచ్చిమొక్కలు మొలిచి వెక్కిరిస్తున్నాయి. కొంతమంది రైతులు ఆశతో పత్తి పంటను సాగు చేసినా ఎదుగదల తగ్గి పెట్టుబడి అధికమవుతుందని రైతులు వాపోతున్నారు. వర్షాలు సరిగా కురవకపోవడంతో సింగూరు వెలవెలబోయింది. మంజీరలో చుక్క నీరులేక ఇసుకదిబ్బలు తేలాయి. లక్షల వ్యయంతో కోరంపల్లి, అచ్చన్నపల్లి శివారుల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు వృథాగా మారి దయనీయ స్థితికి చేరుకున్నాయి. రైతులకు నిరాశే.. గత పదిహేను రోజుల క్రితం కురిసిన కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మంజీర నది జలజలా పారుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. చిటపట చినుకులకు ఖరీఫ్లో వేసిన పంటలకు తాత్కాలిక ఊరట లభిస్తున్నా, భవిష్యత్తు నీటి అవసరాల విషయంలో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయె రోజుల్లో అయినా గట్టి వర్షాలు కురవకుంటే తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నా చిరుజల్లులతో సరిపెడుతున్నాయి. ఇప్పటికిప్పుడే ప్రమాద ఘంటికలు లేకున్నా, ఖరీఫ్ చివరి దశలో, రబీలో పంటల సాగుకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే మంచినీటి కొరతతో రోజువిడిచి రోజు పద్ధతి, మరికొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని నెలల్లో మంచినీటి కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పత్యామ్నాయ చర్యలు చేపట్టి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని వేడుకుంటున్నారు. 25 ఎకరాలు సాగు చేసేటోన్ని.. సమృద్ధిగా వర్షాలు కురిస్తే కౌలుకు 25 ఎకరాలు తీసుకొని వరి సాగు చేసేవాన్ని. సరిపడా నీరు లేనందున కేవలం రెండెకరాల్లో మాత్రమే పంట వేశాను. ఆశలన్నీ ఈ పంటపైనే.. నేటికీ మంజీరా నదిలో చుక్క నీరు లేదు. పంటలు పండకపోతే వలసే గతి. – యాదయ్య, రైతు, కోరంపల్లివృథాగానే ఎత్తిపోతల రెండెళ్ల క్రితం మా ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. చాలా సంబరపడ్డాం. ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకొని రెండు పంటలు వేసుకోవచ్చు అనుకున్నాం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కడా చుక్క నీరులేదు. ఎత్తిపోతలు నిర్మించినా ఉత్తగనే ఉన్నాయి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – సర్దార్నాయక్, చంద్రుతండా -
‘మంజీర’కు కొత్త లైన్లు!
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తాగునీటినిసరఫరా చేసేందుకు సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి తాగునీటి పైపులైన్లు వేశారు. పైపులు శిథిలావస్థకు చేరుకుంటుం డడంతో లీకేజీల మూలంగాతాగునీరు వృథాగా పోతోంది. పాత పైపులైన్ల స్థానంలో రూ.30 కోట్లతో కొత్త లైన్లువేయాలని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలుసమర్పించింది. మున్సిపల్ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వు ్డలు వెలువడిన వెంటనే పనులు చేపట్టేందుకు మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంజీర జలాశయంలో నీరు అడుగంటిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్కు తాగునీటి సరఫరా నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నది నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు సుమారు నాలు గు దశాబ్దాల క్రితం పైపులైన్లు వేశారు. వీటి నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు చూస్తోంది. ప్రస్తుతం మంజీర ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లోని 3.22లక్షల జనాభాకు తాగునీరు అందుతోంది. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. లీకేజీల మూలంగా జనావాసాలకు నీటి సరఫరా ఆలస్యం కావడం, తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు పటాన్చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పైపులైన్ల మీదుగా రోడ్లు వేయగా, పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో రోడ్లు కుంగే ప్రమాదం ఉందని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకుంటున్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.30 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, పురపాలక శాఖ నుంచి అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వెలువడిన రెండు మూడు వారాల వ్యవధిలోనే 900 మి.మీ వ్యాసం కలిగిన పైపులైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల రోడ్లను తవ్వాల్సి ఉండడం, ట్రాఫిక్ను దారి మళ్లించాల్సి రావడంతో అనుమతి కోసం ఇప్పటికే వాటర్ వర్క్స్ బోర్డు జీహెచ్ఎంసీకి లేఖ రాసింది. ఆరు నెలల్లో పైపులైను పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రస్తుతమున్న విధానంలోనే తాగునీటిని సరఫరా చేస్తారు. ఎడారిని తలపిస్తున్న ‘మంజీర’ మంజీర , సింగూరు జలాశయాల నుంచి హైదరాబాద్కు తాగునీటిని తరలించేందుకు నాలుగు దశల్లో పైపులైన్లు నిర్మించారు. సంగారెడ్డి శివారులోని మంజీర జలాశయం నుంచి ఫేజ్–1, ఫేజ్–2లో పైపులైన్లు వేశారు. తర్వాతి కాలంలో మంజీర జలాలకు డిమాండ్ పెరగడంతో సింగూరు జలాశయం నుంచి ఫేజ్–3, ఫేజ్–4 పేరిట మరో రెండు పైపులైన్లు నిర్మించారు. వర్షాభావంతో సింగూరు, మంజీర జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 1, 2 ద్వారా 150 ఎంఎల్డీ, ఫేజ్ 3, 4 ద్వారా 860 ఎంఎల్డీ నీరు ప్రతీ రోజూ హైదరాబాద్కు సరఫరా అవుతోంది. 29.91 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో ప్రస్తుతం 1.6 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. 1990 ఫిబ్రవరి నాటి జీఓఎంఎస్ 93 ప్రకారం సింగూరు జలాశయంలో కనీసం 518 అడుగుల మేర నీరుంటేనే హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 512 అడుగులకు నీటి మట్టం పడిపోయినా, మంజీర పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఏప్రిల్ నాటికి మంజీర జలాశయం పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉండడంతో ఒకటి రెండు రోజుల్లో మంజీర ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఘనపురం పరవళ్లు
పాపన్నపేట(మెదక్): బీళ్లు వారిన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు నుంచి మంగళవారం విడుదల చేసిన 1.6 టీఎంసీల నీరు వరదై పోటెత్తింది. మంజీర బ్యారేజి నుంచి 2 గేట్లు ఎత్తి వదిలిన నీరు 9,800 క్యూసెక్కుల పరిమాణంలో పరుగులు తీస్తోంది. ఎడారిలా మారిన మంజీర గర్భాన్ని తడుపుకుంటూ.. మార్గం మ«ధ్యలో చిన్న చిన్న మడుగులు నింపుకుంటూ.. గురువారం రాత్రికి ఘనపురం ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. దీంతో ఘనపురం ఆనకట్ట కింద.. మంజీర తీరం వెంట వేసిన వరి పంటకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఘనపురం ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాల పంటలు గట్టెక్కినట్లేనని రైతన్నలు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రైతన్నల ఆశలకతీతంగా సింగూరు నుంచి విడిచిన 1.6 టీఎంసీల నీటితో ఘనపురం ప్రాజెక్టు కింద వేసిన పంటలతో పాటు, నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ప్రయోజనం కలగనుంది. సుమారు టీఎంసీ నీరు దిగువన ఉన్న నిజాంసాగర్కు చేరనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు కురువలేదు. అయినా ఆశ చావని రైతన్నలు జూన్ నెలలోనే మంజీర మడుగుల్లో నిలవ ఉన్న నీటిని.. బోరుబావుల ఊటలను నమ్ముకొని 18 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. కింది పొలాలను దృష్టిలో ఉంచుకొని.. సింగూరు ఎగువన సైతం వర్షాలు పడక పోవడంతో సింగూరు నిండలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో మిషన్ భగీరథకే 6 టీఎంసీల నీరు అవసరం కానుంది. దీంతో సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 3 వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందదర్రెడ్డి అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. సాధారణంగా అయితే ఘనపురం ప్రాజెక్టుకు ప్రస్తుత తరుణంలో 0.4 టీఎంసీలు సరిపోతాయని అంచనా. అయినప్పటికీ ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను, నిజాంసాగర్ ఆయకట్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ 1.6 టీఎంసీల నీటి విడుదల కోసం జీఓ విడుదల చేశారు. విడుదల చేసిన నీరు, రెండు రోజుల పాటు, ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగి పొర్లనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరదలు ఉదృతంగా ఉండే అవకాశం ఉన్నందున నది వైపు ఎవరూ వెళ్లొద్దని ఇరిగేషన్ ఈఈ యేసయ్య సూచించారు. -
బొట్టు బొట్టు కూడబెట్టు!
‘‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’’ అంటాడు ఓ సినిమాలో హీరో. ‘‘నీటి చుక్కే కదా అని వృథా చేస్తే.. గుక్కెడు నీళ్లు కూడా దొరకని గడ్డు కాలం వస్తుందని’’ హెచ్చరిస్తోంది గర్విత. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ కాదు. నీరు ఎంత విలువైనదో చెప్పడానికి ఒక ఉద్యమమే నడుపుతోన్న వాటర్ వారియర్! భోజనానికి కూర్చుంటాం, పక్కనే గ్లాసు నిండా నీటిని పెట్టుకుంటాం. తాగినన్ని తాగి మిగిలిన వాటిని వదిలేస్తాం. హోటళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ. భోజనానికి ముందే నీటిని పెడతారు, భోజనం చేస్తున్నంత సేపు వెయిటర్లు గ్లాసు నింపుతూనే ఉంటారు. భోజనం చివరికి వచ్చిన తర్వాత కూడా గ్లాసు సగానికి తగ్గితే వెంటనే నింపేస్తుంటారు. ఇది వాళ్లకు ఆదేశించిన ఉద్యోగ నియమావళి. కస్టమర్లు తాగినన్ని తాగి మిగిలినవి వదిలేస్తారు సహజంగానే. అయితే కేవలం ఈ ఒక్క కారణంగానే ఏడాదికి రెస్టారెంట్లో 14 మిలియన్ లీటర్ల నీరు వృథా అవుతోంది. మొదట ఎవరూ వినలేదు ఇక ఇళ్లలో మంచి నీటిని ఒక బిందెలో పట్టుకుంటాం. ఆ రోజు వాడినన్ని వాడి మరుసటి రోజు ఉదయం వాటిని పారబోసి బిందె కడిగి తాజా నీటిని పట్టుకుంటాం. అలా పారబోసేటప్పుడు కనీసం ఆ నీటిని మరో బకెట్లోకి మార్చుకుని ఇతర అవసరాలకు వాడుకోవడం కొంతమంది మాత్రమే చేస్తారు. చాలామంది నీటిని వృథా చేస్తున్నామనే స్పృహ ఏ మాత్రం లేకుండా ‘నీళ్లే కదా’ అన్నంత ఈజీగా పారబోసేస్తారు. ఈ పారబోతకు ఇంకా ఎవరూ లెక్కకట్టలేదు. అయితే రెస్టారెంట్లలో వృథా అయ్యే నీటి మీద బెంగళూరు అమ్మాయి గర్విత ‘వై వేస్ట్’ అంటూ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. బెంగళూరులోని రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లి నీటిని వృథా చేయవద్దని చెప్పి చూసింది. ‘నీరు అత్యంత విలువైన వనరు, దానిని పొదుపుగా వాడుకోవాలి’ అని వారి మైండ్కి ఎక్కించే ప్రయత్నం చేసింది. అయితే నీటి పరిరక్షణ అనే సామాజిక బాధ్యత నిర్వర్తించడం కంటే తమ వ్యాపారాన్ని పరిరక్షించుకోవడమే తమకు ముఖ్యం అని ఆ రెస్టారెంట్లు చెప్పకనే చెప్పేశాయి. దాంతో ఆమె తన ఉద్యమాన్ని ‘చేంజ్ డాట్ ఓఆర్జీ’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇదే భావసారూప్యం కలిగిన వారితో పంచుకుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి వెయ్యి మంది ఆన్లైన్లో తోడయ్యారు. వారంతా 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు వారే. అలాగని పట్టు వదల్లేదు ఆన్లైన్ మిత్రులు ఇచ్చిన నైతిక మద్దతులో గర్విత తన ఉద్యమాన్ని కొనసాగించింది. రెస్టారెంట్లకు వెళ్లి మళ్లీ చెప్పి చూసింది. వెళ్లిన రెస్టారెంట్కే మళ్లీ మళ్లీ వెళ్లేది. తానొక్కతే ఎంత చెప్పినా కంఠశోష తప్ప విన్న వాళ్లలో చలనం కనిపించట్లేదని తన స్నేహితులను కలుపుకుంది. అలా రెండేళ్లు నగరమంతా పర్యటించింది. ఆడపిల్లలు అదే పనిగా చెప్తుండటం, ‘ఒక్కసారి ట్రై చేయండి అంకుల్’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో క్రమంగా కొందరిలో ‘ఒకసారి ప్రయత్నించి చూద్దాం’ అనే ఆలోచన రేకెత్తింది. 2015లో మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఒక గాడిన పడటానికి రెండేళ్లు పట్టిందని చెబుతోంది గర్విత. ఈ రెండేళ్లలో ఆమె స్కూలు దాటి కాలేజ్కొచ్చింది. పరీక్షలు, ఎంట్రన్స్ టెస్ట్ల సమయంలో కొంత విరామం తీసుకుంటూ, అవి పూర్తి కాగానే మళ్లీ ‘వై వేస్ట్’ నినాదాన్ని బయటకు తీస్తున్నారీ అమ్మాయిలు. ఇంట్లో కూడా పాటించాలి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సామాజికోద్యమా లను నిర్వహిస్తున్న 60 మందిని ‘గ్లోబల్ చేంజ్ మేకర్స్’ అవార్డుతో సత్కరించింది చేంజ్ డాట్ ఓఆర్జీ. స్విట్జర్లాండ్, జ్యూరిక్లో గడచిన ఆగస్టు నెలలో 12 నుంచి 18 వరకు జరిగిన వర్క్షాప్లో ఈ అరవై మందిని సత్కరించారు. వారిలో ఇండియా అమ్మాయి గర్విత ఒక్కరే. పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నట్లు రాబోయే తరాలు నీటి యుద్ధాలు చేయకుండా, భూమి పొరల్లో నీటిని నాలుగు కాలాలపాటు పరిరక్షించుకోవాలంటే.. రెస్టారెంట్లే కాదు, ఇళ్లలో కూడా నీటిని నీళ్లే కదా అని పారబోయకుండా జాగ్రత్తగా వాడటం అలవరచుకోవాలి. రెస్టారెంట్లలో మార్పు వచ్చింది! గర్విత చేపట్టిన ఉద్యమ ప్రభావంతో చాలా రెస్టారెంట్లు గ్లాసు సైజు తగ్గించాయి. కొన్ని రెస్టారెంట్లు కస్టమర్ రాగానే గ్లాసు నిండా నీటిని పెట్టకుండా అరగ్లాసు నీటినే పెట్టడం, భోజనం చేస్తున్నప్పుడు కూడా గ్లాసును సగం వరకే నింపడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కస్టమర్కి చిరాకు కలగకుండా ఉండటానికి అందుబాటులో జగ్ని ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు బెంగళూరులో ముప్పై రెస్టారెంట్లు ‘వై వేస్ట్’ ఉద్యమంలో భాగమయ్యాయి. నీటి వినియోగం గణనీయంగా తగ్గిందని, వేలాది లీటర్ల తేడా వచ్చిందని చెబుతున్నాయి ఆ రెస్టారెంట్లు. అంతకు ముందు ఈ అమ్మాయిలను ‘మీకు టైమ్ వేస్ట్ తప్ప, ఈ ప్రచారంతో మీరు సాధించేదేమిటి’ అన్న రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ఇప్పుడు ‘మంచి పని చేస్తున్నారు’ అంటూ గర్విత బృందాన్ని ప్రశంసిస్తున్నారు. – మంజీర -
సాయం చేయబోతే...
‘‘సస్పెన్స్, ప్రేమ అంశాలను మేళవిస్తూ నిర్మించిన ‘అలా జరిగింది’ చిత్రం పాటలు బాగున్నాయి. ‘అలా మొదలైంది’ సినిమాలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి చిన్న సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ అన్నారు. మహేశ్ కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.రవికుమార్రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’. ఈ చిత్రం టీజర్ని సాయివెంకట్ రిలీజ్ చేయగా, పాటలను చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. అనసూయాదేవి రిలీజ్ చేశారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ట్విస్ట్లతో ఆసక్తిగా సాగుతుంది. సాయం చేయబోయిన హీరో ఒక ఆరోపణకు గురవుతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్నదే కథ. ఈ నెల 22న సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రవికుమార్ రెడ్డి, అనసూయాదేవి. -
కన్నుల పండుగగా మంజీరా మహా కుంభమేళ
-
తెలుసుకో మిస్టర్!
భార్యకు గౌరవం... భర్త ఇవ్వక్కర్లేదు ఒకరు ఇవ్వాలనుకుని ఇస్తే వచ్చేది కాదు గౌరవం గౌరవం మనసులో ఉంటే అది మాటలో వినిపిస్తుంది ఎక్కడైతే గౌరవం ఉండదో...అక్కడ ప్రేమ లేమి ఉన్నట్లే మరి భార్యను గౌరవించకపోతే... ఆ భార్య ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? విడిపోకుండా ఉండడానికి... మార్గం ఏదన్నా ఉందా? ఉంది! ‘‘ఏంటీ! పంటి నొప్పా. రోజూ ఏదో ఒక న్యూసెన్స్’’ విసుక్కుంటూ, భార్య మీద ధుమధుమలాడుతూ హాస్పిటల్కి వెళ్లి పోయాడు డాక్టర్ రాజేశ్. భార్య పడుతున్న బాధకు భర్తగా హృదయంతో స్పందించలేదు, పోనీ ఒక డాక్టర్గా కూడా రెస్పాండ్ కాలేదతడు. మౌనంగా బాధను అదిమి పెట్టింది స్వప్న పంటిబాధతోపాటు మనసు బాధను కూడా. ఇలాంటి మనిషి కోసమా డాక్టర్గా తన కెరీర్ను వదులుకున్నది. రాజేశ్ పీజీ చేస్తానంటే తాను ఉద్యోగం చేస్తూ అతడిని చదివించింది. ఆ సంగతులేవీ గుర్తులేవు కాబోలు. పిల్లల కోసం తాను కెరీర్కి దూరమైంది. ఇవేవీ అతడికి పట్టడమే లేదు. రాజేశ్ వెళ్లి పోయిన తర్వాత మెల్లగా లేచి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది స్వప్న. పిల్లలకు స్కూలు వదిలేలోపు పన్ను తీయించుకుని, వాళ్లను స్కూలు నుంచి ఇంటికి తీసుకురావాలి. అందుకే ఆమె భోజనం కూడా చేయకుండా కదిలింది. ‘రూట్ కెనాల్ చేయాలి’ అన్నాడు పంటిని పరీక్షించిన డెంటిస్ట్. ‘పన్ను తీసేయండి’ అన్నది స్వప్న నిర్లిప్తంగా. డెంటిస్ట్ తలెత్తి ఆమెను చూశాడు, తాను విన్నది నిజమేనా అన్నట్లు. మెల్లగా ‘పన్ను తీయాల్సిన అవసరం లేదు’ రూట్కెనాల్ చేసి క్యాప్ వేసి పంటిని కాపాడుకోవచ్చు’ వివరించాడు. ‘పన్ను తీసేయండి డాక్టర్’ అన్నది స్వప్న. మరో మాటకు తావులేదన్నట్లు. ‘మీరు చెప్పిన ట్రీట్మెంట్కి కావలసినంత డబ్బు నా భర్త ఇవ్వడు’ అని చెప్పలేక. ‘నేనూ డాక్టర్నే, నాకూ తెలుసు’ అని చెప్పుకోలేక. కుటుంబం కోసం చేజేతులా తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని జారవిడుచుకుంది. ఆ త్యాగమే ఇప్పుడు తనను చూసి నవ్వుతోంది. ‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పన్ను ఠాప్ మని విరిగిన శబ్దం. తీసిన పంటిని ట్రేలో పెట్టి, ఖాళీలో దూదిని నింపి దవడను పైకి అదుముతూ ‘అదిమి పట్టుకో’మని చెప్పాడు డాక్టర్. ‘‘పిల్లలిద్దరూ చిన్నవాళ్లు, ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టడం, ఉద్యోగంలో చేరడం రెండూ కష్టమే. ఆలోచించుకో’’ స్వప్నకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆమె తల్లి. ‘‘నా అవసరాలను మానుకున్నాను, పిల్లల అవసరాలు తప్పవు కదా. అతడు చికాగ్గా విదిలించే డబ్బుతో ఎన్నాళ్లని’’ నిలదీసినట్లే ఉంది స్వప్న మాట. ‘‘ఆ ప్రాక్టీసో, ఉద్యోగమో ఏదైనా నీ భర్తతో కలిసి ఉంటూనే చేసుకోవచ్చుగా’’ ప్రత్యామ్నాయం ఆలోచించు అన్నట్లుగా ఉందామె మాటలో అర్థింపు. ‘‘ఆయనకు అమర్చి పెట్టి, పిల్లల పనులు చూసి, వాళ్లను స్కూల్లో దించి, స్కూలు నుంచి తీసుకువచ్చి... కెరీర్లో కొనసాగడం అయ్యే పని కాదమ్మా. అన్నీ అయ్యాక నాకు ఉద్యోగానికి మిగిలేది మూడు గంటలే’’ పుల్ల విరుపుగానే ఉన్నాయి స్వప్న మాటలు. స్వప్న విసిగిపోయి ఉందని అర్థమవుతోంది. కన్నీళ్ల కాపురాన్ని కూతురు వద్దనుకున్నంత సులువుగా తల్లి అనుకోలేదు, చక్కదిద్దాలని చూస్తుంది. ‘‘స్వప్నా! నేనూ హైదరాబాద్కి వస్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది. ‘‘బాబూ రాజేశ్! స్వప్నకి ఒంట్లో బాగోలేదు. పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్తూ స్కూల్లో దింపి వెళ్లాలి’’ అన్నది అత్తగారు. ‘‘అలాగే అత్తయ్యగారూ’’ అన్నాడు చికాకును అణుచుకుంటూ.ఇద్దరు పిల్లలు, రెండు స్కూలు బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్ల బాస్కెట్లు రెండు. ‘‘నాకేమైనా ఆరు చేతులున్నాయా’’ నోటి దాకా వచ్చింది రాజేశ్కి. ఎదురుగా ఉన్నది స్వప్న కాదు అత్తగారు. స్కూల్ బ్యాగ్లు బైక్ హ్యాండిల్కి తగిలించాడు. అత్తగారు పిల్లల్ని ముందు ఒకరిని వెనుక ఒకరిని కూర్చోబెట్టింది. ఇక లంచ్ బాస్కెట్లు ఎలా? రాజేశ్ కళ్లలో అసహనం కనిపిస్తోంది కానీ అదేమీ పట్టనట్లు అల్లుడి చేతికి అందించిందామె. ‘‘హే... నాన్న బైక్లో తీసుకెళ్తున్నాడు’’ కేరింతలతో పిల్లలు ముఖాలు వెలిగిపోతున్నాయి. ‘‘స్కూలు వదిలే టైమ్కి మీరు వెళ్తారు కదా’’ బలవంతంగా వినయాన్ని పలికించాడు గొంతులో. ‘‘నాకు మోకాళ్ల నొప్పులు. పైగా ఇంత బరువుతో అడుగు వేయలేను. స్వప్నకు ఓపిక వస్తే వెళ్తుంది. అమ్మాయి లేవలేకపోతే మీకు ఫోన్ చేస్తాను’’ అందామె. ఆమె మాటల్లో అర్థం సహేతుకంగా ఉన్నప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ‘నీ చావు నువ్వే చావు’ అన్నట్లుగా అర్థమవుతోంది రాజేశ్కి. బైక్ కదిలించాడు. ‘‘నాన్నా! అమ్మకు స్కూటీ కొనివ్వు నాన్నా! మమ్మల్ని రోజూ ఇలాగే స్కూల్కి తీసుకెళ్తుంది’’ అడిగింది వెనుక నుంచి రాజేశ్ని చుట్టుకుని కూర్చున్న పాపాయి. ‘‘అమ్మ స్కూటీ అడిగితే నువ్వు కొననన్నావు కదా’’ రాజేశ్కి ముందు కూర్చున్న కొడుకు మాటల్లో ‘నువ్వింతే’ అనే ఆరోపణ ధ్వనిస్తోంది. ‘స్వప్న వీటన్నింటినీ ఎలా పట్టుకునేది’ ఆలోచన మెదిలిందే తడవుగా పాపాయిని అడిగాడు. ‘‘అమ్మ ఈ బ్యాగ్లను వీపుకు తగిలించుకుని, ఒక చేతిలో బాస్కెట్లను పట్టుకుని మరో చేత్తో తమ్ముడిని పట్టుకుంటుంది. చేయి వదిలితే వాడు రోడ్డు మీదకు పరుగెత్తుతాడు. నేను అమ్మ పక్కనే నడుస్తాను’’ పాపాయి చెప్తుంటే రాజేశ్కి గుండె మెలిపెట్టినట్లయింది. ‘‘మన కాలనీలో ఉన్న పాలీక్లినిక్లో జాయిన్ అవుతున్నాను. మా అమ్మ వచ్చి మూడు వారాలైంది. ఊరికి వెళ్తానంటోంది’’ అన్నది స్వప్న కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెడుతున్న రాజేశ్తో.స్వప్న క్లినిక్లో చేరడానికి, అత్తగారు ఊరికి వెళ్లిపోవడానికి మధ్య లింక్ ఎక్కడో ఏమీ తెలియలేదతడికి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.‘‘నిన్ననే అత్తయ్యకు చెప్పాను. రోజంతా ఇంట్లో ఉండి పిల్లల పనులు, వంట చేసి పెట్టడానికి మనిషిని చూసి పంపించమని’’ అని స్వప్న చెబుతుండగానే రాజేశ్కి పై మొదటి రెండు స్టేట్మెంట్ల లింక్ దొరికింది.‘‘జీతం ఎంత’’ రాజేశ్ జీతమొక్కటే అడిగాడు కానీ ఊరి నుంచి వచ్చినామెకి గది ఇవ్వాలంటే పెద్ద ఇంటికి మారాలి. ఆమెకి మూడు సార్లు భోజనం ఆ పైన జీతం... అంకెలు వేలల్లో తిరుగుతున్నాయి.‘‘పది వేలు ఇవ్వందే రారు. ఊరిని వదిలి రావాలి కదా. అత్తయ్యకు వీలు కాకపోతే మా ఊరి నుంచి పంపించమని అమ్మకు చెబుతాను’’ రాజేశ్కి మరో మాటకు చోటివ్వకుండా లోపలికి వెళ్లిపోయింది. ‘‘స్వప్నకు కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చిన మాట నిజమే. మరో రెండేళ్లు టైమివ్వండి. పిల్లలు కొంచెం పెద్దవుతారు’’ స్వప్న పిల్లలను స్కూలుకి తీసుకెళ్లిన గ్యాప్ చూసి అత్తగారిని అడిగాడు రాజేశ్. ‘‘వంద, రెండొందలకు చేయి చాస్తూ బతకడం తనకూ కష్టమే. ఇంత చదివించి మా అమ్మాయి డాక్టర్ అని గర్వంగా చెప్పుకున్న, మాక్కూడా అమ్మాయి ఇలా చేయి చాచాల్సి రావడం కష్టంగానే ఉంటుంది. రూట్కెనాల్ ట్రీట్మెంట్కి చేతిలో డబ్బులేక పన్ను పీకించుకుందని వాళ్ల నాన్నకు తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది’’ ఆమె మెల్లగానే అంటున్నప్పటికీ సూటిగానే తగులుతున్నాయి రాజేశ్కి.పిల్లల్ని స్కూల్లో వదిలి ఇంటికొచ్చిన స్వప్న... రాజేశ్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఉండడంతో విచిత్రంగా చూసి గదిలోకి వెళ్లిపోయింది.స్వప్నతోపాటు గదిలోకి వెళ్లి ‘సారీ స్వప్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ. హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈవెనింగ్ మాట్లాడుతాను’ అని అంతే వేగంగా ఇంట్లో నుంచి బయట పడ్డాడు.‘‘ఏమైంది’’ హాల్లోకి వచ్చి తల్లిని అడిగింది.‘‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ అని నువ్వన్నప్పుడు నేనేమన్నాను?’’ కూతుర్ని ప్రశ్నించింది.‘‘ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నావు’’ ‘‘ఇప్పుడు జరిగింది అదే’’ అని వంటగదిలోకి వెళ్లింది స్వప్న తల్లి. కష్టమేంటో తెలిసేలా చేస్తే... గౌరవం లేని చోట చూరుపట్టుకుని వేళ్లాడ్డం ఎవరికైనా కష్టమే. ఈ డాక్టర్ల విషయంలో భర్త బయట ప్రెషర్స్తో సున్నితత్వాన్ని కోల్పోయాడు, భార్య ఇంట్రావర్ట్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడవుతుందని విడాకులు తీసుకుని పిల్లలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం... ‘తాము పడుతున్న ఆవేదన, కష్టం ఎదుటి వారికి ఆచరణలో తెలిసేలా చేయడమే’. స్వప్న విషయంలో ఆమె తల్లి ఆ పని చేసింది. భార్యాభర్తలిద్దరితో విడి విడిగా మాట్లాడడం వల్ల మనసులో గూడు కట్టుకున్న ఆవేదన బయటకు వస్తుంది. భర్త కోసం భార్య పడిన శ్రమ, భార్య కోసం భర్త చేసుకున్న సర్దుబాట్లు తెలిశాక... ఇద్దరూ ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచిస్తారు. ఈ సూత్రం... కరడు గట్టిన వాళ్లకు పని చేయదు, కానీ చాలా మందిలో గ్యాప్ను పూరిస్తుంది. స్వప్న మళ్లీ కెరీర్ ప్రారంభించే వరకు ఆమె అకౌంట్లో నెలనెలా డబ్బు వేశాడు రాజేశ్. అంతకంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య గ్యాప్ తొలగిపోయింది. పదేళ్లు ఉనికి కోసం పోరాడిన స్వప్న ఇప్పుడు తన ప్రయారిటీస్ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. – చెరువు వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ – మంజీర -
‘మహా’ దోపిడీ మళ్లీ షురూ!
మంజీర తీరంలో ‘మహా’ అలజడి మొదలైంది.. మన భూభాగంలో ఇసుక దోపిడీ మళ్లీ షురువైంది.. అనుమతుల ముసుగులో మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అంతర్రాష్ట్ర సరి‘హద్దులు’ దాటుతున్నారు. జిల్లా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మరోవైపు, మన వారే ‘మహా’ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఆ ఇసుకను దెగ్లూర్, మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ తదితర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఇసుక తరలిస్తుండగా, జిల్లా అధికారులు దాడి చేసి జేసీబీని పట్టుకున్నారు. సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించుకు పోయినట్లు అధికారులు నిర్ధారించారు. తరచూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుక తవ్వేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారి తీస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ‘మహా’ దోపిడీ మళ్లీ షురువైంది. మహారాష్ట్ర క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోని మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారు. నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. శాఖాపూర్ (మహారాష్ట్ర) ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమంగా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతుండగా.. నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తోడేస్తున్న భారీ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నదిలో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా.. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నాలుగు ఎకరాల లోనికి సరిహద్దు లు దాటి తెలంగాణ భూభాగంలో అక్ర మంగా ఇసుక తోడేసినట్లు గుర్తించారు. ఈ ఒక్కచోటే సుమారు 16 వేల క్యూ బిక్ మీటర్ల ఇసుకను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తవ్వుకు పోయినట్లు ప్రాథమికంగా గుర్తించా రు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మంజీర న ది వెడల్పులో సగ భూభా గం తెలంగాణది.. మరోసగం మహారాష్ట్రకు ఉంటుంది. అయితే తెలంగాణ భూభాగంలో ఇసుక తోడేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారితీస్తోంది. రాత్రయితే చొరబాట్లు.. చీకటి పడితే చాలు మహారాష్ట్ర జేసీబీలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి అక్రమంగా చొరబడుతున్నాయి. భారీ జేసీబీలతో రాత్రికి రాత్రి వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేయడం పరిపాటిగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికార యంత్రాంగం ఈ అక్రమ చొరబాట్ల గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఇసుక వనరులు దోపిడీకి గురవుతుండగా.. ఈ క్వారీల ఆదాయంతో మహారాష్ట్ర సర్కారు ఖజనా నిండుతోంది. మన వారే ‘మహా’ కాంట్రాక్టర్లు.. మహారాష్ట్ర క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి తెర లేపిన కాంట్రాక్టర్లు మన రాష్ట్రం వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మహారాష్ట్ర వ్యక్తులను తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీకి తెర లేపుతున్నారు. పైగా ఇక్కడి ఇసుకను దెగ్లూర్ (మహారాష్ట్ర), మద్నూర్ మీదుగా హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయి. మన ఇసుకను మహారాష్ట్ర క్వారీల పేరుతో తోడేసి.. మళ్లీ మన తెలంగాణలోనే విక్రయిస్తూ.. మహారాష్ట్ర సర్కారు ఖజానాను నింపుతున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్లల్లో ఆదాయం ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నదిలో తమ వైపు ఉన్న ఇసుక క్వారీలకు టెండర్లు పిలుస్తుంది. ఈ ఏడాది సుమారు పది క్వారీలకు టెండర్లు పిలిచారు. ఒక్కో క్వారీకి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు మహారాష్ట్ర సర్కారు ఆదాయాన్ని గడిస్తోంది. అక్కడి గనుల శాఖ ద్వారా నాందేడ్ జిల్లా అధికారులు ఈ క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్వారీల్లో ప్రస్తుతానికి శాఖాపూర్, షెల్గాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా క్వారీల కాంట్రాక్టర్లు తమకు నిర్దేశించిన మహారాష్ట్ర భూభాగంలో కాకుండా.. అక్రమంగా తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి ఇసుకను తోడేస్తున్నారు. అటువైపు నిండుకున్న ఇసుక నిల్వలు.. మంజీర నదికి అవతలి వైపు క్వారీలకు ఏటా టెండర్లు పిలిచి భారీగా తవ్వేస్తుండడంతో అటువైపు ఇసుక నిల్వలన్నీ అయిపోయాయి. నాణ్యత లేని నల్ల ఇసుక, మట్టితో కూడిన ఇసుక మాత్రమే మిగిలింది. దీంతో కాంట్రాక్టర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ భూభాగం పరిధిలోకి చొచ్చుకొచ్చి తవ్వకాలు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. -
స్వచ్ఛ జన్నత్
జమ్మూకశ్మీర్ పర్యటనలో శ్రీనగర్లోని దాల్ లేక్ విహారం ఓ మధురానుభూతి. దాల్ లేక్లో శికార్ రైడ్ చేసి ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకునే వాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆ ఫొటోలకు వస్తున్న లైక్లకూ లెక్కే ఉండటం లేదు. ఫొటో తీసుకుని, లైక్ చూసుకుని మురిసిపోతే చాలా? సరస్సు శుభ్రంగా ఉండొద్దా? అనుకుందో ఐదేళ్ల పాపాయి. తండ్రితోపాటు పడవ ఎక్కి పొడవాటి కర్రకు వల కట్టి సరస్సులో తేలుతున్న ఖాళీ కూల్డ్రింక్ బాటిళ్లు, స్నాక్స్ తిని పారేసిన అల్యూమినియం రేపర్లు, పాలిథిన్ కవర్లు... ఒకటేమిటి పర్యాటక ప్రియులు బాధ్యతారహితంగా సరస్సులోకి విసిరేసిన చెత్తను అందిన వరకు పడవలోకి చేర్చింది. ఒడ్డుకు కొట్టుకుపోయి మట్టిలో కూరుకుపోయిన చెత్తను మడమల వరకు కూరుకుపోతున్న బురదలో దిగి మరీ ఏరి పారేసింది. ఆ తర్వాత పెద్దవాళ్లందరికీ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. నిజానికి ఆ పాపాయి ఇచ్చిన సందేశం పిల్లలకే. కానీ పెద్దవాళ్లకూ అందే సందేశం. ‘‘ఫ్రెండ్స్! దాల్ సరస్సు చాలా అందమైన సరస్సు. చెత్త లేకపోతే ఇంకా అందంగా ఉంటుంది. అందుకే మన సరస్సును మనం శుభ్రంగా ఉంచుకుందాం. మీరు కూడా మీ పడవల్లో వచ్చి దాల్ సరస్సులో చేరుతున్న చెత్త తొలగించండి. మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి’’ అని చెప్పింది. ఇదంతా ఆమె తండ్రి స్మార్ట్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది దేశాన్ని చుట్టే లోపే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిలో పడింది. స్వచ్ఛభారత్కు ఓ బుల్లి అంబాసిడర్ దొరికిందని మురిసిపోయారు. ‘ఈ పాపాయి మన సూర్యోదయాలను మరింత అందంగా మారుస్తోంది. స్వచ్ఛత మీద ఆమెకున్న అభిరుచి చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పేరేంటో తెలుసా? జన్నత్... అంటే స్వర్గం. కశ్మీర్ భూతల స్వర్గం అంటారు. అలాంటి స్వర్గంలో పుట్టిన తన బిడ్డ అంతకంటే అపురూపమైన స్వర్గాన్ని ఆవిష్కరించాలని ఆ తండ్రి ఆమె పుట్టినప్పుడే అనుకున్నాడేమో! ఆమెకు అంత స్వచ్ఛమైన ఆలోచన రావడానికి ఆ పేరు కూడా కారణమేనేమో!ఆమె పేరు కారణం అయినా కాకపోయినా జన్నత్ సందేశాన్ని మాత్రం అందరం పాటించాల్సిందే. మనం ఒక సమస్యను సృష్టించడంలో భాగస్వాములం కావద్దు, పరిష్కారం వెతకడంలో భాగస్వాములవుదాం. – మంజీర -
మంజీరా కాలుష్య ధార
పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకుండానే విడుదల చేస్తుండడంతో మంజీర నది కాలుష్య కాసారంగా మారుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, వాటి నుంచి వెలువడే కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేక పోతోంది. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ, నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. మంజీర పరిసర గ్రామాల్లో మాత్రం పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు కాలుష్య భూతం బారిన పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. -- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండల్లో పుడుతున్న మంజీర కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లా మనూరు మండలం గౌడ్గావ్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. మంజీర ప్రవహించే మార్గంలో కాలుష్య వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో నదీ జలాలు హానికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో థేర్నా వాగు ద్వారా ఉస్మానాబాద్, లాతూరు ప్రాంతాల పారిశ్రామిక వ్యర్థాలు మంజీరాలోకి చేరుతున్నాయి. కర్ణాటకలోని బీదర్ పరిసరాల్లోని చక్కెర కర్మాగారాలు సైతం మంజీరలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత హుగెల్లి చక్కెర కర్మాగారాం, దిగ్వాల్ ఔషధ కంపెనీల రసాయన వ్యర్థాలు చిల్కపల్లి చెరువు మీదుగా సింగూరు ఎగువన మంజీరలోకి చేరుతున్నాయి. గంగకత్వ పరీవాహక ప్రాంతంలో ఉన్న పలు రసాయన కంపెనీల ద్వారా కూడా నది కలుషితమవుతోంది. మంజీర బ్యారేజీ దిగువన చక్కెర, బీరు కర్మాగారం నుంచి వెలువడే కాలుష్య జలాలు నిశ్శబ్దంగా మంజీరా ప్రవాహంలో కలిసిపోతున్నాయి. వందల సంఖ్యలో రసాయన, బల్క్డ్రగ్ పరిశ్రమలు కలిగిన పటాన్చెరు, పాశమైలారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి విడుదలవుతున్న విషపూరిత రసాయనలు నక్కవాగు ద్వారా మంజీరలో కలుస్తున్నాయి. ఫార్మా, పెట్రో కెమికల్, రంగులు, అద్దకం, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా భూ గర్భంలోకి వెళ్లి స్థానికంగా పశు, మత్స్య సంపదతో పాటు పచ్చని పొలాలు, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిషన్ భగీరథ పథకంతో పాటు సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా ఇస్తుండడంతో కాలుష్య ప్రభావం విస్తరించే అవకాశం ఉంది. విషం చిమ్ముతున్న నక్కవాగు.. పటాన్చెరు, గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు ఉసికెవాగు నుంచి నక్కవాగులోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట శివారు గౌడిచర్ల వద్ద మంజీరలోకి వ్యర్థాలు చేరుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి వదిలేందుకు పటాన్చెరు ఎన్విరోటెక్ లిమిటెడ్ (పీఈటీఎల్) ఆధ్వర్యంలో కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు చేశారు. పీఈటీఎల్ పనితీరుపై విమర్శలు రావడంతో 2009లో పటాన్చెరు నుంచి మూసీ ఒడ్డున ఉన్న అంబర్పేట ట్రీట్మెంట్ ప్లాంటు వరకు పైప్లైన్ వేసి, రసాయన వ్యర్థాలను తరలిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం పీఈటీఎల్కు వ్యర్థాలను నామమాత్రంగా తరలిస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా వివిధ చెరువుల ద్వారా నక్కవాగులోకి విడుదల చేస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నక్కవాగు, మంజీరలో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్న ఘటనలు పలుమార్లు వెలుగు చూశాయి. వర్షాకాలంలో విడుదలైన వ్యర్థాలతో గండిగూడెం, గడ్డపోతారం చెరువుల్లో చేపలు మృత్యువాత పడగా, పరిశ్రమల నుంచి రూ.1.30 కోట్ల పరిహారం మత్స్యకారులకు చెల్లించారు. నక్కవాగులో చేరుతున్న వ్యర్థాలతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలం కలుషితమవుతోంది. పరిసర గ్రామాలవాసులు తీవ్ర దుర్గంధం పీల్చుకుంటుండగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం మంజీర పరీవాహక ప్రాంతంలో ఉన్న హత్నూర మండలం గుండ్ల మాచునూరులో రసాయన పరిశ్రమలు ప్రత్యేక ఔట్లెట్లు ఏర్పాటు చేసి రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. ఇవి భూగర్భంలోకి చేరుకుని తాగు, సాగునీటిని కాలుష్యం చేస్తున్నాయి. దిగువన ఉన్న మంజీరలోకి కాలుష్య జలాలు చేరుకుంటుండడంతో పరిసర గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొ లా లను నష్టపోతున్నా పరిహారం అందించడంలో అటు అధికారులు, ఇటు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. – కే.భద్రేశ్, వ్యవస్థాపకుడు, మెదక్ పర్యావరణ పరిరక్షణ సమితి నమూనాలు సేకరిస్తున్నాం నక్కవాగు మంజీరలో కలిసే చోట గౌడిచర్ల, బచ్చుగూడెం తదితర గ్రామాల్లో తరచూ నీటి నమూనాలు సేకరిస్తున్నాం. పుల్కల్ మండలం శివ్వంపేటలోని ఓ బ్రూవరేజెస్ ఫ్యాక్టరీ నదిలోకి కాలుష్య జలాలను వదులుతుందనే ఫిర్యాదులు రావడంతో గతంలో మూసివేతకు నోటీసులు కూడా జారీ చేశాం. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో తిరిగి తెరిచేందుకు అనుమతులు ఇచ్చాం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహిస్తూ.. కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నాం. – భద్రగిరీష్, ఈఈ, టీఎస్పీసీబీ, సంగారెడ్డి జిల్లా జన్మస్థానం : బాలాఘాట్ కొండలు (మహారాష్ట్ర) ప్రవహించే మార్గం : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మంజీర నది పొడవు : 724 కి.మీ పరివాహక ప్రాంతం : 30,844 చ.కి.మీ ప్రధాన ప్రాజెక్టులు : సింగూరు, ఘణపురం, నిజాంసాగర్ గోదావరిలో కలిసే చోటు : కందకుర్తి (నిజామాబాద్ జిల్లా) -
మంజీరా’ వద్ద జింకల వేట
► నదీ పరీవాహక పరిధిలో పట్టుబడిన వేటగాళ్లు ► నిందితుల వద్ద రైఫిల్, పిస్టల్, కత్తులు స్వాధీనం మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మంజీరా పరీవాహకంలో కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వేటగాళ్లు జింకలను, ఇతర వన్యప్రాణులను వేటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు.. బీదర్ ప్రాంతం నుంచి డస్టర్ వాహనం (ఏపీ 11ఏఆర్ 3600)లో మోర్గి మీదుగా నాగల్గిద్ద వైపు ఓ వేటగాళ్ల ముఠా వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనాన్ని మోర్గి మోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెద్దఎత్తున ఆయుధాలు లభించాయి. వాహనంలో ముగ్గురు వ్యక్తులతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిలో బీదర్కు చెందిన సయ్యద్ ఓవైసీ ఖాద్రి (31), హైదరాబాద్లోని సంతోష్నగర్కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్ తాపక్ (48), మహ్మద్ నయీమొద్దీన్ (40)ను విచారించి.. వణ్యప్రాణుల వేటకు వచ్చినట్టు నిర్ధారించారు. వాహనంలో 0.22 రైఫిల్, ఒక మ్యాగ్జిన్ తుపాకీ, పిస్టల్, టార్చిలైట్, రెండు కత్తులు, కటింగ్ ప్లేయర్, తదితర పరికరాలు లభించాయి. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ యాదగిరి రాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సైదానాయక్ మాట్లాడుతూ.. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. కాగా, నాగల్గిద్ద మండలం బీదర్కు సమీపంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
రాష్ట్రాల మధ్య ఇసుక చిచ్చు
⇒ మంజీర నదిలో తేలని సరిహద్దులు ⇒ మహారాష్ట్ర అనుమతులు... మన భూభాగంలో తవ్వకాలు ⇒ సరిహద్దు గ్రామాల్లో తరుచూ ఘర్షణలు కోటగిరి (బాన్సువాడ) : మంజీర నదిలో ఇసుక తవ్వకా లు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య వివాదం రేపుతోంది. నదిలో సరిహద్దుల కొలతలు లేకపోవడంతో పలుమార్లు ఇసుక వివాదాలు తెరపైకి వస్తున్నాయి. నిర్మాణరంగంలో అతిముఖ్యమైన ఇసుక క్వారీ ల నిర్వహణ ఈ వివాదాలకు దారితీస్తోంది. నదిలోని మహారాష్ట్ర భూభాగంలో ఇసుక క్వారీలకు అనుమతులు పొంది తెలంగాణ పరిధి నుంచి ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతాయనే కారణంతో మం జీరలో నుంచి ఇసుక తవ్వకాలకు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. అయితే ప్రతిఏటా మహా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తోంది. కాంట్రాక్టర్లు మన భూభాగంలోకి కూడా చొచ్చుకొని ఇసుకను తోడుకెళ్తున్నారు. దీంతో కోట్లాది రూపాయిల నష్టం జరగుతోంది. ఈ క్రమంలోనే కోటగిరి మండలంలోని సుంకిని గ్రామస్తులకు, మహారాష్ట్రలోని శాఖాపూర్ గ్రామస్తుల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఇరువురి మధ్య ఘర్ష ణ తలెత్తడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగప్రవేశం చేశారు. శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వాహకులు ఓదశలో మన అధికారులు, సుంకిన గ్రామస్తులపై చేయి చేసుకున్నంత పని చేశారు. ఒకేసారి పోలీసులు, రెవె న్యూ సిబ్బంది, గ్రామస్తులు ఎదురు దాడి చేయడంతో వారు పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తీస్తున్న జేసీబీని సీజ్చేసిన పోలీసులు కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. ఇలా ప్రతిసారి మహారాష్ట్ర ఇసుక నిర్వాహకులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి చొరబడుతూ ఇసుకను తోడేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. గతంలో కూడా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన షెల్గావ్ వద్ద కాంట్రాక్టర్లు క్వారీ అనుమతులు పొంది మన భూభాగంలోని ఇసుకను కొల్లగొట్టారు. సరిహద్దులు నిర్ధారించక పోవడంతో మన భూభాగంలోకి చొరబడి ఇసుకను తరలిస్తున్నారు. -
హద్దులు తేలకున్నా..
నిజామాబాద్ : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల మ«ధ్య ప్రవహిస్తున్న మంజీర నదిలో సరిహద్దు వివాదం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. గతంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సరిహద్దులను తేల్చేందుకు సంయుక్త సర్వేలు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. తాజాగా మంజీర నదిలో మహారాష్ట్ర సర్కారు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సరిహద్దుల్లోని మండలాలకు ఆనుకుని ఈ నది ప్రవహిస్తోంది. మన జిల్లాలకు అవతలివైపు ఉన్న 12 ఇసుక క్వారీలకు ఈ సారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం టెండరు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే మహారాష్ట్ర క్వారీల పేరిట నదిలో జిల్లా భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు జరిగాయి. దీంతో జిల్లా భూభాగంలోని ఇసుక తరలిపోగా.. ఈ ఇసుకపై రూ.కోట్లలో ఆదాయం మహారాష్ట్ర సర్కారుకు వెళ్లింది. సరిహద్దు వివాదం పరిష్కారమైతేనే మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని సరిహద్దు రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా నాందేడ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఈ క్వారీలకు గత నెల 5న నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 నుంచి ఈ–ఆక్షన్ నిర్వహిస్తోంది. మంజీరలో 12 క్వారీలకు ‘మహా’ ప్లాన్ నాందేడ్ జిల్లా దెగ్లూర్, బిలోలి, ధర్మాబాద్ తాలూకాల పరిధిలో మంజీర నదిలో 12 ఇసుక క్వారీల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. శెల్గాం, శావ్లా, శాఖాపూర్, గంజ్గాం, హున్గుందా, కార్లా (బీకే), బొలేగాం, మచ్నూర్, సగ్రోలి, హెస్గీ, నాగిని, సంగం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే జుక్కల్ నియోజకవర్గం పరిధిలో ప్రవహించే లెండి నదిలో సంగ్వి ఉమార్, సంగడి, తంతార్, మెదన్కలూర్, హవార్గా క్వారీలకు కూడా అక్కడి కలెక్టరేట్ అనుమతులు మంజూరు చేసింది. ప్రతిసారి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించి అనుమతి ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించింది. ఈ రెండు నదులతో పాటు పెన్గంగా, గోదావరి, రవాంగన్నాలాలపై కూడా ఇసుక క్వారీలకు మహారాష్ట్ర సర్కారు తెరలేపింది. కాగా, మహారాష్ట్ర అనుమతుల పేరిట ఇసుకాసురులు మంజీర నదిలోని మన ప్రాంత ఇసుకను య«థేచ్ఛగా తరలించారు. ఈ క్రమంలో నకిలీ వేబిల్లులు కూడా సృష్టించి తెలంగాణ సర్కారుకు కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్ర క్వారీల ఇసుక రవాణా సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా రాష్ట్రంలోకి తరలించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణాకు పాల్పడిన పలువురు కాంట్రాక్టర్లపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. అప్పట్లో రైతుల ఆందోళనలు నదిలో మహారాష్ట్ర క్వారీలకు ఇవతల వైపు కోటగిరి, బోధన్ మండలాల గ్రామాలు సుంకిని, మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గాం, బిక్నెల్లి గ్రామాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాల ఆధారంగా ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. ఆయా మండలాల వాసుల తాగునీటి అవసరాలు తీర్చే ఈ పథకాలు పని చేయలేదు. దీనికి తోడు ఈ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో బోరుబావులు అడుగంటిపోయాయని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇసుక క్వారీలకు అనుమతిస్తే ఇంకేన్ని దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందోనని రైతుల్లో కలవరం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చేప కాదు.. కొండ చిలువ చిక్కింది!
కొల్చారం: చేపలు పట్టేందుకు ఓ జాలరి వల విసరగా కొండచిలువ చిక్కింది. ఈ అరుదైన ఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ సమీపంలోని మంజీర వాగులో చేపలు పడుతున్న ఓ జాలరి వలకు కొండచిలువ చిక్కింది. దాదాపు 10 ఫీట్ల వరకు ఉన్న కొండచిలువను మరికొందరు వ్యక్తులతో కలిసి గట్టుపైకి చేర్చారు. సమీపంలోని చెట్ల పొదల్లోకి వదిలేసినట్లు స్థానికలు తెలిపారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
చేపల వేటకు వెళ్లి..
మెదక్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతిచెందిన సంఘటన మెదక్ జల్లా రంగంపేట ఎత్తిపోతల వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దుర్గయ్య(32) చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నీట మునిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. -
నిండా ముంచిన వరదలు
ఇంకా నీటిలోనే పంటలు పరిశీలనకే పరిమితమైన అధికారులు ఆందోళనలో మంజీర తీర రైతులు రాయికోడ్: మంజీర నది తీరానికి ఆనుకుని ఉన్న పంట పొలాలను వరద నీరు ముంచుతోంది. పొలాల్లో వారాల తరబడి వరద నీరు నిలుస్తోంది. కొన్ని పొలాల్లో మట్టి, ఇసుక మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. మంజీర నదితో పాటు, చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లాయి. మంజీర నదికి ఆనుకుని ఉన్న ఖాంజమాల్పూర్, మాటూర్, ఇటికేపల్లి, శాపూర్, పాంపాడ్, సిరూర్, దౌల్తాబాద్, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్, కర్చల్, తదితర 18 గ్రామాల్లో వేల ఎకరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిదంగా రాయికోడ్, నాగ్వార్, యూసుఫ్పూర్, ధర్మాపూర్, అల్లాపూర్, హుల్గేర, కుసునూర్, రాయిపల్లి గ్రామాల వాగులు, సింగితం, జంమ్గి, కర్చల్, ఇందూర్, హస్నాబాద్, నాగన్పల్లి, ఔరంగానగర్, కుసునూర్ తదితర గ్రామాల్లోని చెరువులు పొంగిపొర్లడంతో పొలాలన్నీ నీట మునిగి నష్టాల పాలయ్యారు. ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న పత్తి, మినుము, సోయాబీన్, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంజీర నది, నీటి వనరులు ఉప్పొంగి వరద నీటిలో మునిగి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచన వేశారు. ఈ నెల ఒకటిన కురిసిన 20 సెంటీమీటర్ల వర్షానికి మంజీర నది సమీప ప్రాంతాల్లోని పంటపొలాల్లో వరద నీరు చేరింది. ఇంకా పంటలు నీటిలోనే ఉన్నాయి. పంటలు చేతికందే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలతో పంటలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చామని ఈ క్రమంలో అకాల భారీ వర్షాలు తమకు కోలుకోలేని నష్టాలను మిగిల్చాయని రైతులు తమ కష్టనష్టాలను వివరిస్తున్నారు. మండలంలో సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షాపాతం 190 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా 362 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అక్టోబర్లో సాధారణ వర్షాపాతం 80 మిల్లీమీటర్లకుగాను.. ఒక్క రోజులోనే 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులవుతున్నా పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. నీటమునిగిన పంటలు జీవం కోల్పోయాయని ఏఓ తెలిపారు. అభిప్రాయాలు.. చేతికొచ్చిన గింజలు నీటిపాలు నాకున్న ఎకరంన్నర పొలంలో కంది, పత్తి సాగు చేశాను. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుతూ వచ్చాను. మొక్కలు పూత దశకు చేరుకున్నాయి. కొన్ని రోజుల్లో గింజలు చేతికందుతాయని ఆశించాను. కానీ అకాల కుంభవృష్టితో పంటంతా నీటిలో మునిగిపోయింది. వారం రోజులుగా పొలం వరద నీటిలోనే ఉంది. ఎం చేయాలో పాలుపోవడంలేదు. - నర్సింలు రైతు ఇందూర్ గ్రామం. పరిహారం చెల్లించాలి పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించాలి. అప్పు చేసి సాగు చేశారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయా. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. -బీ. వెంకట్రావ్ పాటిల్ ఎంపీపీ రాయికోడ్. పంట నష్టంపై అంచనా వేస్తున్నాం రెండు వారాలుగా ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అంచనా వేస్తున్నాం. పంటల రకాలు, సర్వే నంబర్లు, రైతు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నాం. త్వరలో ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తాం. - అభినాష్ వర్మ, మండల వ్యవసాయ అధికారి -
ఉధృతంగానే..
ఉప్పొంగుతున్న మంజీర, గోదావరి నదులు ఇద్దరు మృత్యువాత పడగల్లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం జిల్లాలో 25 వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు నేడు ఎస్సారెస్పీకి రానున్న ముఖ్యమంత్రి వర్షం, వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్న సీఎం సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వరుణుడు జోరు తగ్గించినా వరద ఉధృతి మాత్రం ఉగ్రంగానే కొనసాగుతోంది. మంజీర, గోదావరి నదులు ఉధృతంగా పారుతున్నాయి. సోమవారం జిల్లాలో 26.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ధర్పల్లిలో 7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా 25 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సందర్శించారు. అధికారులతో మాట్లాడి వరద ప్రభావం గురించి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. పంటనష్టంపై వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని, తక్షణమే సహాయం అందేలా చూస్తామన్నారు. పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూర పునరావాస కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్రెడ్డి, అధికార యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. కలెక్టర్ నేతృత్వంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టారంటూ అభినందించారు. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీట మునిగాయి. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. తుంగవాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యం సదాశివనగర్లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మరణించారు. ఈ సంఘటన మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. సదాశివనగర్కు చెందిన కోతి విష్ణువర్ధన్ రెడ్డి(21), పోలబోయిన రంజిత్కుమార్(23) గిద్దలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి శనివారం రాత్రి బైక్పై తిరిగి వస్తూ సదాశివనగర్ శివారులోని తుంగవాగులో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు సోమవారం కనిపించాయి. దెబ్బతిన్న ఇళ్లు.. కోటగిరి మండలంలో 18 ఇళ్లు పూర్తిగా, 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్ని మండలంలో ఏడు ఇళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా, బీర్కూర్ మండలంలో రెండు ఇళ్లు పూర్తిగా, 29 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది .మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీటమునిగాయి. సోయా, చెరుకు, వరి పంటలు నీటమునిగాయి. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆదివారం రాత్రి గ్రామంలో తహసీల్దారు, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పర్యటించారు. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలను ఆదివారం అర్ధరాత్రి నుంచే పునరావాస కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. సుమారు 200 మంది వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సాలూర ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భోజన వసతి, తాగు నీటి సౌకర్యం కల్పించారు. బోధన్ మండలంలోని హున్పా, మందర్న , ఖాజాపూర్ గ్రామాల ప్రత్యేక అధికారి, స్టెప్ సీఈవో ఉపేందర్రెడ్డి, ఆర్డీవో సుధాకర్రెడ్డి, తహసీల్దార్ వినోద్ కుమార్, టౌన్ సీఐ వెంకన్న, ఎస్సై ప్రభాకర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో మూడు గ్రామాల్లో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి నదిలో మంజీర నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందకుర్తి శివారులో 1,500 ఎకరాలలోని సోయా, పత్తి, పొగాకు పంటలు నీట మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నవీపేట మండలంలోని బినోల గ్రామంలో పెద్ద చెరువు కట్ట మళ్లీ కోతకు గురైంది. నీళ్లు వృథాగాపోతున్నాయి. బాన్సువాడ దిగువన ఉన్న మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటల కట్టలు ప్రమాదకరంగా మారాయి. చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉండడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టింది. సోమవారం వర్షం కురవ లేదు. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ వద్ద, ఆర్మూర్ మండలం రాంపూర్లో కాలువలకు పడిన గండ్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో పూజలు చేశారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని మోర్తాడ్ కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్ మండలాల్లో సోయా పంట పూర్తిగా తడిసి ముద్దఅయ్యింది. పంటకు చేనులోనే మొలకలు వచ్చాయి. పంట ఎంత మాత్రం పనికిరాకుండా పోతుంది. రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేసిన సీడ్ వల్లనే నష్టం ఏర్పడింది. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. పెద్దవాగు ప్రవాహం జోరుగా ఉంది. నిజామాబాద్రూరల్ నియోజకవర్గంలో సోమవారం సాధారణ వర్షపాతం నమోదైంది. డిచ్పల్లి మండలం ఘన్పూర్ రాజేశ్వర్ చెరువు కట్ట కోతకు గురైంది. ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేశారు. జక్రాన్పల్లి, సిరికొండ మండలాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టులోకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. బోధన్-హైదరాబాద్ రోడ్డుపై నీరు అలాగే ఉండడంతో రాకపోకలు సాగడం లేదు. వరద నష్టాలను అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. చెరువులు, కుంటలు నిండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇంకా నాలుగు లక్షల క్యూసెక్కుల వరకు ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. 41 వరద గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే నిజాంసాగర్ తదతర ప్రాజెక్టులు సైతం నిండిపోయాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల పంటలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టరేట్కు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా.. అనంతరం ఎస్పీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్అండ్బీ, పీఆర్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి సోమవారం రాత్రి పోచంపాడ్ వెళ్లి, హెలిపాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా సందర్శిస్తారన్న సమాచారం మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారులతో కలిసి సోమవారం రాత్రి నిజాంసాగర్ వెళ్లి, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. నూటికి నూరు శాతం వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారానే సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, లేదంటే రోడ్డుమార్గంలోనైనా వస్తారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. -
ఆగని వర్షం.. వరద
నిజామాబాద్లో 25 వేల హెక్టార్లలో పంటలు నష్టం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆర్మూరు, బోధన్, బాన్సువాడ తదితర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పర్యటించారు. జిల్లావ్యాప్తంగా 26.3 మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. 25వేల హెక్టార్ల పంట నష్టం జరగా.. రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. సదాశివనగర్లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందగా, మూడు రోజుల తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోటగిరి, వర్ని, బీర్కూర్ మండలాల్లో మొత్తం 158 ఇళ్లు పూర్తిగా, 27 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. మంజీర నది తీరంలో ఉన్న బోధన్ మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామ శివారులో వరద నీరు చేరింది. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కందకుర్తి శివారులోని సోయా, పత్తి, పొగాకు పంటలు 1,500 ఎకరాల వరకు నీటి మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల మండల స్థాయి అధికారులు సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోచారం ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1.4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 19 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 14 గేట్ల గోదావరికి 2 లక్షల అవుట్ఫ్లో, 2.4లక్షల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కాగా, మంగళవారం సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించనున్నారు. కరీంనగర్లో నష్టం రూ.24కోట్లు కరీంనగర్ అగ్రికల్చర్/మెదక్: కరీంనగర్ జిల్లాలో వరద నష్టం రూ.24 కోట్లుగా అంచనా వేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 34 గేట్లు ఎత్తి 2.57 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీలో నీటిమట్టం 20 టీఎంసీలకు చేరింది. మిడ్మానేరుకు ఆదివారం రాత్రి 20మీటర్ల మేర పడిన గండి సోమవారం ఉదయం వరకు 130 మీటర్లకు పెరిగింది. మెదక్ జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 9 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. సింగూరు, మంజీర రిజర్వాయర్లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. -
‘మంజీరా’ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
న్యాల్కల్: మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్తానని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన చీకూర్తి, హుస్సెన్నగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజీరా బ్యాక్ వాటర్ వలన కొంత మేర నష్టం జరిగిందని, ఈ మేరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ముంపు ఏమేరకు జరిగిందనే విషయాన్ని సర్వే చేపట్టి, అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. నివేదికలను సర్వే చేసి అందజేయాలని ఆయన ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో కురిసిన వర్షాల వలన ప్రాథమిక అంచనా ప్రకారం 50వేల హెక్టార్లలో పంట నష్ట జరిగిందన్నారు. 9600 ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 247 పూర్తిగా దెబ్బతినగా మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28టీఎంసీలుగా ఉందన్నారు. మంజీరకు ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలామన్నారు. తాము మంజీర బ్యాక్ వాటర్ వలన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు శాశ్విత పరిష్కారం చూపాలని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. బ్యాక్ వాటర్ ఇళ్ల వద్దకు రావడంతో విష పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు మంజీర నది పరీవాహక ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. -
వీడిన జల ‘చెర’
సాక్షి, హైదరాబాద్/పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీర నదిలో చిక్కుకున్న 24 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. వీరిని రక్షించడానికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ ఫలిం చింది. సీఎం విజ్ఞప్తి మేరకు ఎయిర్ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్తో కూలీ లంతా ఒడ్డుకు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్.. ఏడుపాయల్లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులు, ఎయిర్ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ, బాధిత కూలీలకు సెల్ఫోన్ ద్వారా ధైర్యం చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్ ప్రారంభించిన ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లు 50 నిమిషాల్లో 24 మంది బాధితులను జల‘చెర’ నుంచి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాయి. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు పొట్టకూటి కోసం నెల రోజుల కిందట మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ప్రాంతానికి వచ్చారు. మంజీర పాయల మధ్య టేకుల బొడ్డెపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు మంజీర వరదగా మారి ఘనపురం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతూ టేకుల బొడ్డెను చుట్టుముట్టింది. దీంతో కూలీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను రక్షించేందుకు శనివారం జాతీయ విపత్తుల సహాయక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శనివారం విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చింది. దీంతో కేసీఆర్ అక్కడికి ప్రభుత్వ హెలికాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ అయితే తప్ప మనుషులను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో కేసీఆర్ ఎయిర్ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. హెలికాప్టర్లను పంపించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 50 నిమిషాల్లోనే..: కూలీలను రక్షించేందుకు వైమానిక దళం శనివారం రెండు సార్లు ప్రయత్నించగా భారీ వర్షం, మేఘాలు, ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. అయితే ఆదివారం మరోమారు ఆపరేషన్ చేపట్టి.. 50 నిమిషాల్లోగా పని పూర్తి చేశాయి. రెండు హెలికాప్టర్లు ఉదయం 7.45 గంటలకు టేకులబొడ్డెపై ల్యాండ్ అయ్యాయి. 4 విడతలుగా రెండేసి హెలికాప్టర్లు ఒక్కోసారి ముగ్గురు బాధితులను ఏడుపాయల వైపు తీసుకొచ్చాయి. బాధితులంతా సురక్షితంగా ఇవతలి వైపునకు చేరగానే డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ అల్పాహారం అందజేశారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించారు. ఆపై వారికి ఏడుపాయల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులంతా తమ స్వస్థలాలకు వెళ్తామని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
నగరానికి మంజీరా పరుగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు శుభవార్త. సుమారు ఆరునెలలుగా నగరానికి నిలిచిపోయిన మంజీరా జలాల పంపింగ్ ఆదివారం మొదలైంది. తొలివిడతగా ఈ జలాశయం నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నీటి తరలింపుతో లింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల రివర్స్ పంపింగ్ కష్టాలు తీరినట్లు తెలిపాయి. కాగా ఇటీవలి భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారడంతో ఈ రెండు జలాశయాల నుంచి నగర తాగునీటి అవసరాలకు నిత్యం 120 ఎంజీడీల నీటిని తరలించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. సింగూరు, మంజీరా జలాల తరలింపుతో కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి గ్రేటర్కు తరలిస్తున్న గోదావరి జలాల పంపింగ్ను 86 ఎంజీడీల నుంచి 28 ఎంజీడీలకు క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. తద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయాలని జలమండలి నిర్ణయించింది. -
మంజీరా నది వాగులో వ్యక్తి గల్లంతు
-
23 మంది కార్మికులను రక్షించిన వాయుసేన
-
మంజీరానదిలో చిక్కుకున్న 23 మంది
-
మంజీరానదిలో చిక్కుకున్న 27 మంది కార్మికులు..
పాపన్నపేట: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల్లోని ఓ గడ్డపై శనివారం ఉదయం 27 మంది భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఏడుపాయలు దాటుతుండగా.. ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు. మంజీరా ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో వారిని వీలైనంత త్వరగా రక్షించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కార్మికులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. కూలీలను రక్షించే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. హెలికాప్టర్లను రప్పించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్న ప్రయత్నం వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్లను రప్పించటం ఇబ్బందిగా మారడంతో సహాయక చర్యలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆపివేశారు. ఇదిలా ఉండగా, ఏడుపాయల వద్ద వరద ఉధృతి మరింత పెరగడం ఆందోళన వ్యక్తమవుతోంది. -
మంజీరా జిల్లా ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు రేగోడ్: అందోల్ కేంద్రంగా మంజీరా జిల్లాను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు, మండలాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నా అందుకనుగుణంగా జరగటం లేదన్నారు. రాజకీయలబ్ధి కోసమే పునర్విభజన చేస్తున్నారన్నారు. అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మంజీరా జిల్లాలో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కలపాలన్నారు. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోందన్నారు. పునర్విభజన సరిగా లేదంటూ నియోజకవర్గంలోని రేగోడ్, అల్లాదుర్గం వంటి మండలాల్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతమైన అందోల్ను మంజీరా జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
ఝుమ్మంది మంజీర!
సంగారెడ్డికి పూర్తిస్థాయిలో మంజీర నీళ్లు రోజు విడిచి రోజు సరఫరా నేటి నుంచే పట్టణమంతా అమలు పెరిగిన నీటి మట్టంతో కలెక్టర్ నిర్ణయం సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణవాసులు పానీ ఖబర్తో ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు మూడు రోజులకు ఒకసారి వచ్చే మంజీర నీరు.. ఇకపై రోజు విడిచి రోజు వస్తుందన్న సమాచారంతో సంబరపడుతున్నారు. బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరడంతో కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. గతంలో మూడు రోజులకు ఒకసారి పట్టణానికి ఇప్పటి వరకు ఇప్పటి వరకు మంజీర నీరు పట్టణానికి మూడు రోజులకు ఒకసారి వచ్చేది. కానీ, తాజాగా మంజీర బ్యారేజీలోకి భారీగా వరద నీరు రావడంతో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ రోనాల్డ్రోస్ ఆదేశించినట్టు మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, ఏజేసీ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణానికి మంచినీరు సరఫరా చేసే ప్రధాన జలాశయమైన మంజీరలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అధికంగా రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. బ్యారేజీ సామర్థ్యం 1.50 టీఎంసీలు. ఇప్పటి వరకు 1.01 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు తెలిపారు. వర్షాలు కొనసాగితే... మరో వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈసారి మంజీర పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీనికి తోడు మంజీర నిండలేని పరిస్థితిలో ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి పట్ణణానికి నీరు వదిలే అవకాశం లేకపోలేదు. అయితే, నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజులకు ఒకసారి నీరు విడుదల చేసి వేసవి వరకు ఇబ్బందు లేకుండా చూడాలని ఆదేశించారు. రోజుకు 9 ఎంఎల్డీల నీరు 2006 జనాభా లెక్కల ప్రకారం పట్టణానికి ప్రతిరోజు 9 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. కాగా, 2016 సంవత్సరానికి పట్టణ జనాభా పెరిగిన నేపథ్యంలో నీటి వినియోగం సైతం అధికమైంది. దీంతో ప్రతిరోజు అందించే 9 ఎంఎల్డీల నీరు సరిపడం లేదు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 11 ఎంఎల్డీల నీరు అందిస్తే పట్టణవాసుల దాహర్తి పూర్తిస్థాయిలో తీర్చవచ్చు. అదనంగా మరో 2 ఎంఎల్డీల నీటిని బోర్ల ద్వారా సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మంజీరకు మూడేళ్ల తర్వాత జలకళ
రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటితో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది. -
ప్రపంచ దేశాల్లో తెలంగాణ నంబర్వన్
రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు రాష్ట్రంలో 2,600 కిలోమీటర్లు జాతీయరహదారులు రాజకీయాల కోసం కాంగ్రెస్ అరోపణలు నిజాంసాగర్ : రాష్ట్ర రహదారులను సుందరంగా తీర్చిదిద్ది రెండేళ్లల్లో ప్రపంచదేశాల్లోనే తెలంగాణ న ంబర్వన్ స్టేట్గా నిలుస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ అన్నారు. ఆరవై ఏళ్లపాటు సింగిల్ రోడ్లుగా 2,600 కిలోమీటర్లను తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ర హదారుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. మంజీరనదిపై రూ. 25 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో శిలాఫలకాన్ని మంత్రి అవిష్కరించారు. రైతులు పండించిన పంటల విక్రయాలకు రహదారులు ఎంతో అవసరమని, సీమాంధ్ర పాలనలో ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో రోడ్డు రవాణా వ్యవస్త భ్రష్టు పట్టిందన్నారు. రోడ్లపై కేజ్వీల్స్ తిర గకుండా ప్రజాప్రతినిధులు, ఆర్ఆండ్బీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లులేక ఏడారిగా మారిందన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్ర శేఖర్రావ్ ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ సర్వే చేయించారన్నారు. కాం్రVð స్ నాయకులు రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ప్రాణహిత, చేవేళ్ల, తుమ్మిడి హట్టి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ఎంతకష్టమోచ్చినా, నష్టమోచ్చినా, తలతా కట్టు పెటైనా సరే తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాలను తెచ్చి తీరుతా మన్నారు. అర్థంపర్థం లేకుండా ఆరోపణలు చే స్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులు భూస్థాపితం చేస్తారన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై ఆరోపిస్తున్న ఉత్తమ్, జానారెడ్డిలు దమ్ముంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు.కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్,జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో ‘మంజీర’ ఎడారి
మల్లన్న సాగర్ మన ప్రాజెక్టులకు గుండెకాయ కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం రాజకీయదురుద్దేశంతో ప్రతిపక్షాల అడ్డంకులు నిజాంసాగర్ రిజర్వాయర్ భూగర్భంలో వేదిక రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీటి ప్రవాహం లేక మంజీర నది ఏడారిగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంజీర నదికి ఎగువన 47 అక్రమ ప్రాజెక్టులతో సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు చేరని దుస్థితి వచ్చిందన్నారు. అలాగే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 400 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వలన శ్రీరాంసాగర్ పరిస్థితి అన్నమో రామచంద్రా అన్నట్లు మారిందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని అదుకునేందు కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయ భవిషత్తు ఉండదన్న దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి మల్లన్నసాగర్ సాధన సదస్సును పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొ న్నారు. ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన మల్లన్నసాగర్ సాధన సదస్సు కోసం శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల కింద రిజర్వాయర్ భూగర్భంలో సభాస్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు 20 వరదగేట్ల వద్ద ఆరేడ్ శివారులో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు వేసుకున్నారన్నారు. కృష్ణా నది పరీవాహకంలో జురాల, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టులు పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయన్నారు. కాని మంజీర, గోదారి నదీ పరీవాహకంలో సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు చేరని పరిస్థితులు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల వల్లే గోదావరి, మంజీరలు నీళ్లులేక ఎండాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నిర్మిస్తున్న మల్లన్నసాగర్ను అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రెండేళ్ల లో మల్లన్నసాగర్ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ సాధన సదస్సుకు అన్ని జిల్లాల రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్రాజు, టీఆర్ ఎస్ నాయకులు వినయ్కుమార్, మోహన్రెడ్డి, దుర్గారెడ్డి, విఠల్, పోచారం భాస్కర్రెడ్డి, సురేందర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, నార్ల సురేశ్, రజనీకాంత్రెడ్డి, అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సాగౌడ్, ఎజాజ్ తదితరులు న్నారు. -
మెతుకు సీమకు జలసిరి
రైతుల్లో ఆశలు నీళ్లతో సింగూరు, మంజీర కళకళ పొంగిపొర్లుతున్న నల్లవాగు వర్షాలతో చెరువులు, కుంటలు తొణికిస పెరగనున్న ఆయకట్టు సాగు సాక్షి, సంగారెడ్డి:రెండేళ్లు కరువు బారిన పడిన మెతుకుసీమ.. ఇటీవలి వర్షాలతో జలసిరి సంతరించుకుంటోంది. వర్షాభావంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయి నెర్రెలు బారాయి. మంజీర నది జీరబోయింది. సింగూరు ప్రాజెక్టు, మంజీర బ్యారేజీలు గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ప్రాజెక్టులు ఎండిపోయాయి. దీంతో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. రబీలో పంటనష్టాన్ని చవిచూసిన రైతాంగం ఖరీఫ్లోనైనా వర్షాలు కురిస్తే బాగుండునని ఆశపడ్డారు. వరుణదేవుడికి పూజలు చేశారు. మొత్తానికి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలో సైతం వరదలు రావటంతో మంజీర నదిలోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ నీళ్లతో నిండుతున్నాయి. తాగునీటికి కటకటలాడే నారాయణఖేడ్లో వర్షం నీటితో ప్రాజెక్టులు, చెరువులు కుంటలు కళకళలాడుతున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. చెరువులు, కుంటలు సైతం నిండుతున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.మీ నేపథ్యంలో ఆయకట్టు సాగు విస్తీర్ణం ఖరీఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులోకి మొదలైన వరద జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవటంతో పాటు మంజీర నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో వరదలు రావటంతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాభావం కారణంగా సింగూరు ప్రాజెక్టు పూర్తి డెడ్స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి 6.4 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మున్ముందు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు మరింత వచ్చే అవకాశముంది. దీనికితోడు ఈనెలలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే మంజీరలోకి మరింత నీరు చేరుకుంటుంది. కాగా, సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీర రిజర్వాయర్లోకి 0.50 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి. రిజర్వాయర్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీ. నల్లవాగు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,493 అడుగులు కాగా ప్రాజెక్టులో పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నారు. పాపన్నపేట మండలంలోని ఘనంపురం ప్రాజెక్టులోకి మాత్రం పెద్దగా నీళ్లు చేరలేదు. నీటితో చెరువులు కళకళ జిల్లాలో గత నెలలో సాధారణ వర్షపాతం 211 మిల్లీమీటర్లు కాగా, 200 మి.మీ. పైగా వర్షం కురిసింది. ఈ నెలలో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. మరోపక్క మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడికతీత తీయటంతో వాటిల్లో గతంలో కంటే ఎక్కువగా నీళ్లు నిల్వ ఉంటున్నాయి. ఇటీవల పూర్తిగా ఎండిపోయిన అన్నసాగర్ పెద్ద చెరువు ప్రస్తుతం నీళ్లతో నిండుగా ఉంది. అలాగే నారాయణఖేడ్ మండలం గంగాపూర్లోని ర్యాకల్ చెరువు పూర్తిగా నిండింది. జిల్లాలో మొత్తం 7,186 చెరువులు ఉండగా వీటిలో 105 చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. 153 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీళ్లు ఉండగా 554 చెరువుల్లో 75 శాతం నీళ్లు ఉన్నాయి. 456 చెరువుల్లో 50 శాతం, 5,918 చెరువుల్లో 25 శాతం మేర నీళ్లు ఉన్నాయి. దీంతో రైతులు చెరువు కట్ట కింద భూముల్లో సాగుకు సిద్ధమవుతున్నారు. -
మంజీర బ్యారేజీలోకి వరద నీరు
సంగారెడ్డి రూరల్:మండల పరిధిలోని కల్పగూర్ మంజీర డ్యామ్కు జలకళ వచ్చింది. గత ఎండాకాలంలో ఎండిపోయి బోసిపోయిన డ్యాంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర వరదనీరు చేరింది. డ్యామ్ నిర్మించినప్పటి నుంచి ఎప్పుడూ ఎండిపోని బ్యారేజి.. వేసవికాలంలో పూర్తిగా ఎండిపోయి నీరులేక వెలవెలబోయింది. దీంతో జంటనగరాలకు మంచినీరు సరఫరా నిలిచిపోయింది. దీంతోపాటు సంగారెడ్డి మండలంలోని కల్పగూర్, అంగడిపేట్, గంజీగూడెం, చింతల్పల్లి, పోతురెడ్డిపల్లి, కంది, మామిడిపల్లి, ఎర్ధనూర్తోపాటు పలుతండాలకు మంజీర నీటి సరఫరా చేయలేకపోయారు. డ్యామ్ దిగువ భాగంలో నీటిని మోటార్ల ద్వారా రాజంపేట ఫిల్టర్బెడ్కు తరలించి అక్కడి నుంచి సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేస్తున్నారు. అయితే చాలా రోజుల తరువాత మంజీర బ్యారేజికి జలకళ రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్లోకి మరికొంత నీరు వస్తే గ్రామాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఖేడ్ జిల్లా కోసం మంజీర నదిలో పుణ్యస్నానాలు
జ్ఞానసరస్వతీకి వినతిపత్రంఽ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నారాయణఖేడ్: నారాయణఖేడ్ కేంద్రంగా మంజీర జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి బాధ్యులు ఆదివారం వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజక వర్గానికి సరిహద్దులో గల పుల్కుర్తి వద్ద మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించచారు. అనంతరం సరస్వతీ ఆలయంలో అమ్మవారి పేరిట పూజారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ అశోక్ తోర్నాల్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా బంగారు నారాయణఖేడ్ చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్ను కోరారు. మంజీర నదిలో పూజలు చేయడంతోపాటు దీపాలు వదిలినట్టు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి సిద్దారెడ్డి, కార్యదర్శులు కె.సంత్చారి, శంకర్, సర్దార్, కోశాధికారి కుమార్ స్వామి, మల్లేశ్, బస్వరాజ్, బాబు పాల్గొన్నారు. -
మం‘జీరో’!
నదిలోని నీరొస్తున్నా కళతప్పిన నీటి పథకాలు ‘శాపూర్’ వద్ద పనులు చేపట్టని అధికారులు ఎగువున మరిన్ని భారీ వర్షాలు కురిస్తేనే ఆశలు నారాయణఖేడ్: మంజీరా నదిలోకి చేరుతున్న వరద.. నీటి పథకాలకు ఏమాత్రం ఊతమివ్వడం లేదు. ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే నదికి జీవకళ వచ్చేది. ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో నది వట్టిపోయింది. ఈనేపథ్యంలో రెండ్రోలుగా ఎగువు ప్రాజెక్టుల నుంచి కొద్దికొద్దిగా నీరు వస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే, భారీ వరదలు వస్తే తప్ప సింగూరు వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు నీరు చేరని పరిస్థితి. ప్రస్తుతం చిన్నపాటి ఇన్ఫ్లో వల్ల సింగూరు ప్రాజెక్టుకు ఆదివారానికి కొద్దిగా నేరు చేరే పరిస్థితి ఉంది. మంజీరా నది జిల్లాలో మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, మెదక్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టు ఎగువున మంజీరాపై నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ తదితర నియోజకవర్గాల నీటి పథకాలు ఉన్నాయి. వరద పెరిగి బ్యాక్వాటర్ నిలిస్తే తప్ప నీటిపథకాలు పనిచేయని పరిస్థితి. శాపూర్ నీటిపథకం వద్ద భారీ లోయ ఉండటంతో అక్కడ కొద్దిగా నీరు పంపింగ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం వద్ద మోటార్ల మరమ్మతులతో పాటు చిన్నపాటి పనులు చేయాలని ఎమ్మెల్యే ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించినా పనులు ప్రారంభం కాలేదు. ఖేడ్ నియోజకవర్గం బోరంచ, గూడూరు ఇన్టేక్వెల్.. జహీరాబాద్ నియోజకవర్గం పుల్కుర్తి వద్ద ఉన్న ఇన్టేక్వెల్ వరకు పూర్తిస్థాయిలో వరద నీరు రాలేదు. ఇవీ పథకాలు గూడూరు వద్ద 13 ఏళ్ల క్రితం రూ.14కోట్లతో మంజీరా నదిపై 74 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నీటిపథకం నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేజ్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గంలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. దీంతో పాటు పుల్కుర్తి సమీపంలోని నీటి పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. నీరు నిలవాల్సిందే సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరితే తప్ప నీటి పథకాలు పనిచేసేందుకు పరిస్థితి లేదు. ఎగువ నుంచి ఇన్ఫ్లో ఉన్నా.. మంజీరా నదిలో నీరు లేని కారణంగా వరద నీరు కిందకు పోతోంది. సింగూరు ప్రాజెక్టు నిండితేనే మంజీరా నదిలో నీరు నిలిచి బ్యాక్వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఇందుకు మరిన్ని వరదలు రావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నదిలోకి నీరు చేరకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వారం రోజుల పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్ప.. నీటి పథకాలు పనిచేయని దుస్థితి ఉంది. మంజీరా నదిలోకి నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోరు, బావులు రీచార్జ్ కానున్నాయి. -
మంజీర
ఈ పేరుతోనే ‘సంగారెడ్డి జిల్లా’! తెరపైకి కొత్త ప్రతిపాదనలు ♦ మెదక్లో కలవడానికి ఖేడ్, అందోల్, నర్సాపూర్ నేతల ‘నో’ ♦ పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ ♦ అయిష్టంగానే అంగీకరించిన ప్రజాప్రతినిధులు ♦ ప్రతి జిల్లాకు రెండేసి రెవెన్యూ డివిజన్లు ♦ తీర్మానం చేసి కేకేకు అందజేసిన జిల్లా ప్రజాప్రతినిధులు ♦ రాజధానిలో ముగిసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం మంజీర జిల్లా.. సంగారెడ్డి, కొండాపుర్, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం. నారాయణఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టితోపాటు కొత్త మండలాలైన కంది, అమీన్పుర్, గుమ్మడిదల, మొగుడంపల్లి (జహీరాబాద్ నియోజకవర్గం), సిర్గాపూర్, నాగల్గిద్ద(నారాయణఖేడ్), వట్పల్లి(అందోల్) మండలాలు. రెవిన్యూ డివిజన్లు: సంగారెడ్డితోపాటు జహీరాబాద్ లేదా నారాయణఖేడ్లో ఏదో ఒకటి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణతో కీలక ఘట్టం ముగిసింది. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లోని ప్రాంతాల పంపకాలపై ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంజీర పేరిట సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ చేసిన ప్రతిపాదనకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఏకంగా మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లాలో కలవడానికి ససేమిరా అనడంతో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినట్టు విశ్వసనీయ సమాచారం. చివరకు మంత్రి జోక్యంతో సదరు ప్రజాప్రతినిధులు అయిష్టంగానే ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెద్ద జిల్లాగా సంగారెడ్డి... కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాల్లో మంజీర పేరుతో సంగారెడ్డి అత్యంత పెద్ద జిల్లాగా అవతరించనుంది. మంజీర (సంగారెడ్డి)లో 26 మండలాలు, సిద్దిపేటలో 18, మెదక్ జిల్లాలో 17 మండలాల చొప్పున పంపకాలు చేస్తూ తీర్మానం చేశారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు, కార్యక్రమ సమన్వయకర్త కె.కేశవరావుకు అందజేశారు. ఆయన వాటిని సీఎం కేసీఆర్కు అందించనున్నారు. ప్రజాప్రతినిధుల అభ్యంతరం.. అధికారులు సీసీఎల్ఏకు పంపిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు అధికారులు నారాయణఖేడ్ను సంగారెడ్డి జిల్లాలో, అందోల్ను మెదక్ జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ప్రజా ప్రతినిధుల తీర్మానం మాత్రం కొంత భిన్నంగా ఉంది. నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపడాన్ని సదరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఏ మాత్రం ఇష్టపడలేదు. తమ నియోజకవర్గాలను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకొని మధ్యేమార్గంగా ఓ పరిష్కారం చూపుతూ తీర్మానం చేసినట్టు తెలిసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం... ⇒ కొత్త తీర్మానం ప్రకారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఒక్క పెద్దశంకరంపేటను మాత్రమే మెదక్ జిల్లాలో కలుస్తుంది. ఇదే నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న సిర్గాపూర్, నాగల్గిద్ద మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలుపుతున్నారు. ⇒ అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాలను సంగారెడ్డిలోనే కలుపుతున్నారు. అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని తీర్మానం చేశారు. మెదక్ జిల్లాలో కలుస్తున్న ఈ మూడు మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ వట్పల్లి మండల కేంద్రాన్ని చేసి దాన్ని సంగారెడ్డిలోనే కలపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ⇒ నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మినహా మిగిలిన మండలాలను మెదక్లోనే కలుపుతూ తీర్మానించారు. దీన్ని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినట్టు తెలిసింది. నర్సాపూర్ మండలాన్ని కూడా సంగారెడ్డిలోనే కలపాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు ఫారెస్టు ఉందని, ఒక్క సంగారెడ్డి రోడ్డుకు మాత్రమే ఫారెస్టు లేదని, తమ ప్రాంతం అభివృద్ధి కేవలం అటువైపు మాత్రమే జరుగుతుందని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది. ఇదే మండలంలోని మూసాపేట సంగారెడ్డి పట్టణానికి కేవలం 14 కిలో మీటర్ల దూరంలో ఉంటుందని, ఇబ్రహింబాద్ 16 కిలో మీటర్లు ఉంటుందని, అదే మెదక్ జిల్లాలో కలిపితే 60 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారి ఆందోళనను పట్టించుకోకుండానే నర్సాపూర్ మండలాన్ని మెదక్ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. -
దూప తీరదు.. దగా ఆగదు
♦ జిల్లా కేంద్రంలో నీటి కష్టాలు ♦ ఎండిపోయిన మంజీర ♦ అవసరాలు తీర్చని ప్రత్యామ్నాయ చర్యలు ♦ అడ్డగోలుగా నీటిదందా ♦ దోపిడీ చేస్తున్న వ్యాపారులు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ ప్రజలు నీటికోసం నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రధాన నీటి వనరైన మంజీరలో నీరు లేకపోవడంతో పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వేసవిని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల క్రితం 72 బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోక జనం సతమతమవుతున్నారు. నీటి కొరత దృష్ట్యా కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా డబ్బులు గుంజుతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణానికి ప్రధాన ఆధారమైన మంజీర ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రమైంది.గత రెండు నెలలుగా మంజీర నుంచి వస్తున్న మూడు ఎంఎల్డీల నీటిని కేవలం 10 వార్డులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇలా మూడు రోజులకోసారి ఒక్కో వైపు అందిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో జనం ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. మూడు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నా ఏ మూలకూ సరిపోవడం లేదు. ట్యాంకర్ల కోసం ప్రజల కంటే కౌన్సిలర్లే పోటీపడి తమ వార్డులకు తీసుకెళ్తున్నారు. నీటి సమస్య తీవ్రం కావడంతో గత సెప్టెంబర్లో కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు 75 బోర్లను తవ్వినా ఇంతవరకు మోటార్లు బిగించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. కొందరు వ్యక్తులు నీటి దందాను సాగిస్తున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తూ జనాన్ని దోపిడీ చేస్తున్నారు. సింగూరు నుంచి తెస్తాం... పట్టణ అవసరాలకు గాను సింగూర్ నుంచి 80 ఎంఎల్డీల వరకు నీటిని మంజీరలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం సింగూర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీలో ఉన్నా ఎగువన ఉన్న నీటిని మంజీరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. నూతన పద్ధతుల్లో పైప్ల ద్వారా నీటిని కిందికి తోడి తీసుకొస్తాం. ఆ నీరు మరో రెండు రోజుల్లో మంజీరకు చేరుతుంది. పట్టణానికి రెండు నెలల వరకు ప్రస్తుతమున్న నీటిని సరఫరా చేస్తాం. నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని పొదుపుగా వాడుకోవాలి. - విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, సంగారెడ్డి చర్యలు తీసుకుంటాం.. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిల్ ఆమోదం మేరకు వేసిన బోర్లలో 40 మోటార్లను బిగించేందుకు గాను ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచాం. వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరో రెండుమూడు రోజుల్లో 70 శాతం వరకు నీటి సమస్యను పరిష్కరిస్తాం. - వెంకటేశ్వర్, ఏజేసీ, ఇన్చార్జి కమిషనర్ అధికారుల నిర్లక్ష్యం.. పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 14వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గత మూడు నెలల క్రితం బోరు వేశారు. మోటారు బిగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. మంచినీటి సరఫరా కాకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - అజీజ్ అహ్మద్, 14వ వార్డు నీళ్లు కొంటున్నాం... తాగేందుకు నీళ్లు దొరక్క కొంటున్నాం. మా కాలనీకి మంజీర నీరు రావడం లేదు. కనీసం బోరు నీరు కూడా పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. - స్వర్ణలత, కిందిబజార్ ట్యాంకర్ల నీళ్లూ వస్తలె... కనీసం అద్దె ట్యాంకర్ల ద్వారా అయినా జలాల్ భాగ్ కాలనీకి మంచినీటిని సరఫరా చేయాలి. ఈ కాలనీకి మంజీర నీటితో పాటు బోరు నీటి సరఫరా సైతం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటి సరఫరా చేసి ఆదుకోవాలి. - బీపాషా, 18వ వార్డు కౌన్సిలర్ బోరు వేసినా ప్రయోజనం లేదు... నీటి సమస్య పరిష్కారం కోసం బోర్లు వేశారు. మోటార్లు బిగించకపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. ఫలితంగా మేం అద్దె ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నాం. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వ్యాపారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు నీటిసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - పద్మ కల్వకుంట్ల -
ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దుస్థితి ఇది! రెండేళ్లుగా వర్షాల్లేక, వరద లేక ఇలా పూర్తిగా అడుగంటిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 5.30 టీఎంసీల నీరు(డెడ్ స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ నుంచి గత ఖరీఫ్లో ఆయకట్ట్టుకు నీరివ్వలేదు. రబీలో అదే పరిస్థితి. కనీసం తాగు నీటి పథకాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే తెలంగాణలోని 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం నెలకొంది. నిజామాబాద్లో 1,60,578, ఆదిలాబాద్లో 1,45,387, వరంగల్లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు వెలవెలబోతుండడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. నిజామాబాద్లో 19 ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మిగిలాయి. నిజామాబాద్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. 38 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇందూరుపై కరువు గజ్జకట్టింది. ప్రధాన ప్రాజెక్టులన్నీ డెడ్స్టోరేజీకి చేరాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్లో నిండా మునిగిన రైతన్న రబీకి రాం..రాం.. చెప్పాడు. చాలాచోట్ల భూగర్భజల నీటి మట్టం 22.4 మీటర్లకు పడిపోయింది. మంజీర నది ఏడారిని తలపిస్తుంది. తెలంగాణ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ఎండిపోయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం దారుణంగా పడిపోయింది. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం - గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ డెడ్స్టోరేజీకి శ్రీరాంసాగర్, నిజాంసాగర్.. ఎడారిగా మంజీర నది * వట్టిపోతున్న ఎత్తిపోతల పథకాలు * కరువు దెబ్బకు ఖరీఫ్, రబీలకు రైతులు దూరం * జిల్లాలో తాగునీటికి కటకట.. కబేళాకు చేరుతున్న పశువులు * దారుణంగా పడిపోయిన భూగర్భ జలాల నీటిమట్టం ఎడారిగా మంజీర.. కర్ణాటక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవహించే మంజీరా నది ఇలా ఎడారిని తలపిస్తోంది. జిల్లా రైతాంగానికి మంజీర, గోదావరి నదులే జీవనాధారం. రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో హరిద్రా, గోదావరి నదులతో సంగమించి ప్రవహించే ఈ నది ద్వారా 58 టీఎంసీల నీరు లభ్యమవుతుంది. మంజీరా నది ఆధారంగా బుడ్మి, దామరంచ, హన్సా, కారేగావ్, కిష్టాపూర్, పోతంగల్, కుర్తి, పైడిమాల, సంగోజీపేట తదితర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. మంజీర పరిస్థితే ఇలా ఉండడంతో దీనిపై ఆధారపడి నిర్మించిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒక్కో మనిషికి 80 లీటర్లే.. శీతాకాలం ప్రారంభం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. రిజర్వాయర్లు ఎండిపోవడం.. భూగర్భజలాలు అడుగంటి పోవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు ఉన్నాయి. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు వీరికి 38 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఒక్క మనిషికి 146 లీటర్ల నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం 80 నుంచి 85 లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ‘ఉపాధి’ అంతంతే.. ఉపాధి హామీ పథకం అమలు అంతంతే ఉంది. బోధన్, మోర్తాడ్ మండలాల్లో ‘సాక్షి’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధి కూలీల్లో కొందరికే పని లభిస్తోందని తేలింది. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో 721గ్రామాలు, 1302 హ్యాబిటేషన్లలో 4,70,544 మందికి అధికారులు జాబ్కార్డులు మంజూరు చేశారు. అయితే గతవారం వరకు 604 గ్రామాలలో 1,65,961 మంది పనిచేయగా.. శుక్రవారం నాటికి వారి సంఖ్య ఒకేసారి 92,725 మందికి పడిపోయింది. కూలీలకు రూ.15.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన రఘునాథ, మంచిప్ప చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. అలీసాగర్ నుంచి నిజాంసాగర్ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం 11,500 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు వేగంగా తగ్గిపోతోంది. నీటి కోసం నిజామాబాద్ నగరంలో 3,600 బోర్లు వేశారు. నగర కార్పొరేషన్లో ప్రతి మనిషికి కనీసం 140 లీటర్ల నీరివ్వాలి. కానీ రోజు విడిచి రోజు 110 లీటర్ల నీరే ఇస్తున్నారు. బోధన్ పట్టణంలో 35 వార్డులు ఉన్నాయి. పట్టణానికి ప్రధానంగా నీటిని బెల్లాల్ చెరువు నుంచి నీటిని అందిస్తున్నారు. 10 వేల కుళాయిలు ఉన్నాయి. రోజుకు 10 ఎంఎల్డీలు అవసరం. కానీ చెరువులో నీరు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో 60 వేల జనాభా ఉంది. ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా.. 58 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రతి మనిషికి 150 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 120 లీటర్లు ఇస్తున్నారు. ఇక తండాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్తున్నారు. వాగులోని చెలిమ నీటితో దాహం తీర్చుకుంటున్నారు. కబేళాలకు పశువులు.. జిల్లాలో గత ఆరునెలల కాలంలో ప్రధాన సంతలో వేల సంఖ్యలో పశువులు అమ్ముడుపోయాయి. కరువు, పశుగ్రాసం కొరత, నీళ్లు లేక రైతులు పశువులను అంగట్లో పెడుతున్నారు. కామారెడ్డి, సాటాపూర్, బాన్సువాడ, ఇందల్వాయి, బీబీపేట, పెద్దమల్లారెడ్డి, పిట్లం, నవీపేట్, నందిపేట్ తదితర సంతల్లో పశువులు అధికంగా అమ్ముడుపోయాయి. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో గత నాలుగు నెలల్లో 500 వరకు పశువులను అమ్మేశారు. దోమకొండ మండలం మాందాపూర్లో ఒకప్పుడు 100 జతల ఎడ్లు ఉంటే ప్రస్తుతం 10 జతలు కూడా లేవని స్థానికులు చెప్తున్నారు. రెతులు అమ్మేసిన పశువుల్లో 90శాతం పశువులు కబేళాలకు తరలుతున్నాయి. గత ఐదు నెలల కాలంలో 50 వేలకుపైగా పశువుల అమ్మకాలు సాగినట్లు అంచనా. జిల్లాలో 8 లక్షల పశువులు, మరో 8 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటి గ్రాసానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులకు గ్రాసం, నీటి వసతి కోసం రూ.58.15 కోట్ల సాయం కావాలని కేంద్ర కరువు బందానికి నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్కపైసా రాలేదు. రోజుకు 15 కోట్ల నీళ్ల వ్యాపారం నీటి సమస్య వ్యాపారులకు వరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో క్యాన్ (20లీటర్లు) ధర రూ.15ల నుంచి రూ.25లకు పెంచారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 380ల వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా... కేవలం ఐదింటికీ మాత్రమే భారత ప్రమాణాల సంస్థ (బీఎస్ఐ) అనుమతి ఉంది. మిగతా చోట్ల నాణ్యతా ప్రమాణాలను మచ్చుకైనా పాటించడం లేదు. అయినా రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అధికారుల అంచనా. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఎస్ఐ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఖరీఫ్, రబీలకు రైతులు దూరం గడచిన ఖరీఫ్లో జిల్లాలో 4,18,100 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు.. 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని భావించారు. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా వేశారు. అయితే వర్షాల్లేక రైతులు 53 శాతం సాగుతోనే సరిపెట్టారు. రబీ విషయానికొస్తే 2,03,900 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారని అంచనా వేయగా...81,768 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. సరిపడే నిధులున్నాయి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా మొదట్నుంచీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నాం. ముందస్తుగా పం పిన ప్రతిపాదనల మేర కు ప్రభుత్వం కూడా సరిపడ నిధులు విడుదల చేసింది. తాగునీటి సమస్య ఉండే గ్రామాలను గు ర్తించి రైతుల నుంచి వ్యవసాయ బావులు, బోర్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నాం. మారుమూల గ్రామాలు, తండాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కింద వచ్చిన రూ.7 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజాప్రతిని ధుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నీటి సమస్యను పరిష్కరిస్తున్నాం. - ఎ.రవీందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ మేత లేక పశువులను అమ్ముకుంటున్నారు పశువులకు మేత కరువైంది. పశు పోషణ భారంగా మారింది. అందుకే రైతులు పశులను పోషించలేక అమ్మేస్తున్నారు. గడ్డి విత్తనాల సరఫరా లేదు. పశువులను వ్యాపారులు తక్కువ ధరలకు కొంటున్నారు. పంటలు పండక ఇప్పటికే నష్టపోయిన రైతులు.. పశువులకు ధరలు పలకకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. - దుబాస్ రాములు, రైతు సంఘం నేత నీళ్లకు చాలా తఖీలీబు ఉన్నది మా వజ్జపల్లి తండాలో బోరు బావులు లేవు. ఉన్న ఒక్క చేతి పంపు ఎండిపోయింది. నీళ్ల ట్యాంకుకు నీళ్లు సరఫరా చేసే బోరు ఎత్తి పోయింది. తాగునీళ్లకు చాలా తఖీలీబు అయితుంది. ప్రైవేటు బోరులు కిరాయికి తీసుకున్నరు. కానీ అవి కూడ సన్నం అస్తున్నయి. ఇంకో బోరు వేస్తే బాగుంటది. - బూలీ బాయి, వజ్జపల్లి తండా, గాంధారి మండలం అడుగంటిన నిజాంసాగర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఇలా పూర్తిగా అడుగంటింది. ప్రాజెక్టు పరిధిలోని 2.53 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణం సహా 28 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతుంది. నిజాంసాగర్ సామర్థ్యం 58 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 0.30 టీఎంసీల నీరు(డెడ్స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్టులో నీరు మరో 15 రోజుల వరకే సరిపోతుంది. ఆ తర్వాత తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. కామారెడ్డి డివిజన్లోని మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు కింద 283 ఉప కాలువల ద్వారా 1,771 కిలోమీటర్ల వరకు నీటి పంపిణీ ఉంటుంది. -
మన బీరు మనకే!
రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు పంపిణీ ప్రతి బ్రూవరీలో నిత్యం లక్ష కార్టన్లకు తగ్గకుండా నిల్వలు ఎండలు మండుతున్నందున ఉత్పత్తి పెంచాలని ఆదేశం మంజీరా నుంచి బ్రూవరీలకు పెరిగిన నీటి సరఫరా సాక్షి, హైదరాబాద్: మంటెక్కిస్తున్న ఎండలతో తాగునీటికే కాదు, బీర్లకు కూడా కొరత వచ్చేసింది. దాంతో మద్యం ప్రియులకు అవసరమైనంత బీరును ఇక్కడే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బీర్లను ఇక్కడి అవసరాలు తీరాకే వేరే రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది. అవసరమైతే పని గంటలు పెంచుకునైనా రాష్ట్ర అవసరాలకు సరిపడా బీరును ఉత్పత్తి చేయాలని బ్రూవరీలను ఆదేశించింది. ప్రజల తాగునీటికి కోత పెట్టి మరీ బీర్ల ఉత్పత్తికి కోట్లాది లీటర్ల నీటిని సరఫరా చేస్తున్న దృష్ట్యా వేసవిలో ఎక్కడా బీర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత బ్రూవరీ కంపెనీలదేనంటూ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన జిల్లాలకు సరఫరా చేసేందుకు ప్రతి బ్రూవరీలో కనీసంగా లక్ష కార్టన్ల (12 బీరు సీసాలతో కూడిన పెట్టె) బీర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశాలందాయి. బీర్ల ఉత్పత్తి, సరఫరా తీరుపై ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ శనివారం అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లతో సమావేశమై సమీక్షించారు. రోజుకు 20 వేల నుంచి 75 వేల పెట్టెల బీర్లు రాష్ట్రంలో ఏడాదికి 50 కోట్ల లీటర్ల బీర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు బ్రూవరీ కంపెనీలు పనిచేస్తున్నాయి. బీర్ల తయారీ కోసం వీటికి నెలకు సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్ల లీటర్ల నీటి ని హైదరాబాద్ వాటర్బోర్డు సరఫరా చేస్తుంది. రోజూ ఒక్కో కంపెనీ 2.4 లక్షల నుంచి 7 లక్షల దాకా బీరు సీసాలను (20 వేల నుంచి 75 వేల కార్టన్లు) ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా డి మాండ్కు సరిపడా సరఫరా ఉండటం లేదంటూ పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్లోనే ఎన్నడూ లేనంతటి ఎండలు మాడు పగలగొడుతుండటంతో చల్లని బీర్లకు డిమాండ్ మరింత పెరిగింది. దాంతో సరఫరా కష్టమవుతోంది. వచ్చే నెల రోజుల్లో ఎండలు మరింత పెరిగేలా ఉండటంతో సర్కారు అప్రమత్తమైంది. అందుకే ఇక్కడ ఉత్పత్తయ్యే బీర్లను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. బడ్వైజర్, కాల్స్బర్గ్, హైవర్డ్స్ 5000, నాకౌట్ తదితర బ్రాండ్ బీర్లకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా 40 నుంచి 60 శాతం ఎగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరాకే ఎగుమతి చేసేలా బీర్ల కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీర్ల కంపెనీలకు పెరిగిన నీటి కోటా బీర్ల తయారీకి అవసరమైన నీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు జనవరి నాటికే ఎండిపోవడంతో నీటి సరఫరాను అప్పట్లో వాటర్బోర్డు ఆపేసింది. బీర్ల కంపెనీల ఒత్తిళ్లు, ఖజానాకు సమకూరే ఆదాయం దృష్ట్యా మంజీరా నుంచి ఐదు బ్రూవరీలకు ప్రత్యేకంగా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటికి నెలకు ఏకంగా 6 నుంచి 8 కోట్ల లీటర్లు సమకూరుస్తున్నారు. రాష్ట్రంలోని బ్రూవరీల ఉత్పాదన సామర్థ్యం, నీటి సరఫరా వివరాలు బీర్ల కంపెనీ వార్షిక ఉత్పాదన సామర్థ్యం నెలకు నీటి సరఫరా (లీటర్లలో) సౌత్ ఏషియా బ్రూవరీస్ 15,00,00,000 2,30,00,000 క్రౌన్ బీర్స్ ఇండియా లి. 5,00,00,000 2,02,61,000 యు.బి. నిజాం బ్రూవరీస్ 5,00,00,000 1,11,60,000 యు.బి. లిమిటెడ్ 20,00,00,000 2,79,00,000 కార్ల్స్బెర్గ్ ఇండియా ప్రై.లి. 6,00,00,000 2,00,000 -
నేటి నుంచి చండీరుద్ర మహాయాగం
♦ 12 ఏళ్ల పాటు కొనసాగనున్న మహత్కార్యం ♦ వంచవటి క్షేత్రంలోప్రారంభించనున్న కాశీనాథ్బాబా న్యాల్కల్: మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులో మంజీర నది సమీపంలో వెలసిన పంచవటి క్షేత్రంలో కుంభమేళ ఉత్సవాలు నిర్వహించిన పీఠాధిపతి కాశీనాథ్బాబా మరో మహత్కార్యాన్ని తలపెట్టారు. దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని పుష్కర కాల చండీరుద్ర మహాయాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగా పండి దేశప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ ఈ యాగాన్ని తలపెట్టినట్టు కాశీనాథ్బాబా చెప్పారు. 12 సంవత్సరాలు పాటు(2028 మార్చి 28 వరకు) ఏకదాటిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పంటలు పండక, దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న ప్రజల క్షేమం కోసం ఈ యాగాన్ని 36 లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహామునులు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయని కాశీనాథ్బాబా తెలిపారు. గతంలో రాజులు ఇ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంఘట నలు ఉన్నాయన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని క్షేత్రం ఆవరణలో యజ్ఞాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. హాజరుకానున్న ప్రముఖులు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల పీఠాధిపతులు, రుషులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. నేడు బీదర్ సిద్దరూడ మఠం పీఠాధిపతి శివకుమార్స్వామి, తమ్లూర్ పీఠాధిపతి సద్గురు శివానంద శివాచార్యస్వామి, 9న అంతర్గామ పీఠాధిపతి ఏకాంబ గజేంద్ర కరుణ్ మహారాజ్, 10న బిచుకుంద సంస్థానం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్, 11న అనంతగిరి సరస్వతి క్షేత్రం పీఠాధిపతి అష్టావధాని అష్టకాల నర్సింహ రామశర్మ, 12న శ్రీ వేంకటస్వామి మహారాజ్తో పాటు బర్దీపూర్, కుప్పానగర్, రాయగిరి, అంగడిపేట, కొండాపూర్, ముంగి, కమలాపురం మఠాల పీఠాధిపతులు దత్తగిరి మహారాజ్, మల్లికార్జునస్వామి, బసవలింగ మల్లయ్య గిరి మహారాజ్, శ్రీవాసుదేదానంద సరస్వతి స్వామి, సచ్చిదానంద ఉద్దవ మహారాజ్, సంగ్రాం మహారాజ్, దేవగిరి మహారాజ్ తదితరులు యాగంలో పాలుపంచుకోనున్నారు. ముఖ్య అథితులుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గీతారెడ్డి తదితరులు వస్తారని కాశీనాథ్బాబా చెప్పారు. కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగించనున్నారు. -
పురపాలికల్లో నీటి ఎద్దడికి అడ్డుకట్ట
♦ రూ.63 కోట్లతో వేసవి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ♦ మున్సిపల్ కమిషనర్లకుపురపాలక శాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ కిం ద ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని, అవసరమైతే కొత్త బోరుబావులను తవ్వి నీటి సరఫరాను కొనసాగించాలని సూచించింది. రాష్ట్రంలోని నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లతో పురపాలక శాఖ సంచాలకులు దాన కిశోర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద ఇప్పటికే పట్టణ ప్రాంతాలకు రూ.36 కోట్లు విడుదల చేశామని, మరో రూ.64 కోట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల కావచ్చన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో కరీంనగర్ జిల్లా మెట్పల్లి, జగి త్యాల, కోరుట్ల పట్టణాలకు నీరు సరఫరా చేసే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు సైతం మరో 15 రోజుల్లో ఖాళీ కానున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద కొత్త బోర్లను తక్షణమే వేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి నీటి కొరత తీర్చాలన్నారు. సింగూరు, మంజీర జలాశయాలు అడుగంటడంతో జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యామ్నాయంగా భూగర్భ జలాలను సరఫరా చేస్తున్నారన్నారు. హల్దీ వాగు ఎండిపోవడంతో మెదక్ పట్టణంలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్పాడు రిజర్వాయర్కు త్వరలో నీళ్లు విడుదల కానున్నాయని, దీంతో మహబూబ్నగర్తో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలకు నీటి సరఫరా మెరుగవుతుంద న్నారు. నాగార్జునసాగర్ నుంచి పానగల్ ఉదయ సముద్రంలోకి ఒక విడతగా నీటిని విడుదల చేయనున్నారని, దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంకు సరిపడా నీళ్లు ఉంటాయన్నారు. -
మది నిండా భక్తి భావం
♦ అట్టహాసంగా జనజాతర ప్రారంభం ♦ జనారణ్యంగా మారిన మంజీర తీరం ♦ ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు ♦ హెలికాప్టర్లో తరలివచ్చిన మంత్రులు పాపన్నపేట: మంజీర తీరం.. జనసంద్రమైంది... ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు.. మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి జాతరను డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డిలు ప్రారంభించారు. ఉదయం 8.45గంటలకే హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈఓ కార్యాలయం నుంచి ఊరేగింపుగా ఆలయం వరకు పట్టు వస్త్రాలను తీసుకెళ్లి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఏడుపాయల్లో స్నానాలుచేసి దుర్గమ్మతల్లిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివదీక్షలు చేపట్టారు. శివసత్తులు సిగాలూగుతూ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఏడుపాయల్లో గల శివాలయంలో శివపూజలు చేసి ఉపవాస దీక్షలను విడిచి పెట్టారు. తెల్లవార్లు జాగరణ చేశారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆకట్టుకున్న జాతర: ఏడుపాయల దుర్గమ్మ ఆలయ ప్రాంగణాన్ని, రాజగోపురాన్ని రంగు రంగుల డిజిటల్ బల్బులతో అందంగా అలంకరించారు. రాత్రివేళ అమావాస్య చీకట్లో రంగు రంగుల కాంతులతో దుర్గమ్మతల్లి ఆలయం వింతశోభ సంతరించుకుంది. పిల్లల ఆనందం కోసం ఏర్పాటుచేసిన రంగుల రాట్నం, గ్లోబల్ బైక్ రేసింగ్, బ్రేక్ డాన్సింగ్ తదితర ఆట వస్తువులు ఆందరిని ఆకట్టుకున్నాయి. జాతరను పురస్కరించుకొని ఏడుపాయల్లో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖల అధికారులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అటవీశాఖ వివిధ రకాల మొక్కలను ప్రదర్శనకు ఉం చారు. మంజీరా నది పొడవున ఏర్పాటు చేసిన షవర్బాత్ల కింద స్నానాలు చేసి భక్తులు పులకరించిపోయారు. భారీ ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, జాతర నిర్వహక ప్రతినిధి విష్ణువర్ధన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీఎస్పీ రాజారత్నం ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్, డివిజన్ పంచాయతి, ఇరిగేషన్, వైద్యశాఖ, ఫైర్స్టేషన్, ఎక్సైజ్శాఖ, సమాచారశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. కాగా భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. -
‘బోరు’న మంజీర!
మంజీరమ్మ.. మరింత గోసకు గురిచే స్తోంది. ఎన్నడూ ఇంతటి దుస్థితికి గురిచేయని నదీమ తల్లి నేడు అగ్ని పరీక్ష పెడుతోంది. ఇప్పటికే నది పూర్తిగా ఎండిపోగా అందులో వేసిన బోర్లూ వట్టిపోతున్నాయి. మంచినీటి పథకాలకు నీరు అందడం గగనంగా మారింది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే నడి వేసవిని తలుచుకుని జనాలు తల్లడిల్లుతున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు మంజీర నదిపై ఆధారపడ్డారు. ఈ నియోజకవర్గాలకు నీటి పథకాలు నదిపై ఏర్పాటు చేశారు. నది ఎండిపోవడంతో అధికారులు పలుచోట్ల బోరుబావులను తవ్వించి మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. బోరుబావులు సైతం వట్టిపోతుండటంతో నీటి గోస అంతా ఇంతా కాదు.. నారాయణఖేడ్: మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న మంజీర నది జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్లమేర ప్రవహిస్తుంది. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల పథకాలు, ఇన్టెక్వెల్లు సైతం ఈ నియోజకవర్గం సమీపంలోనే నిర్మించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాలకు మంజీర నీటిని సరఫరా చేసేందుకు పలు పథకాలు నదిపై నిర్మించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో 13 ఏళ్ళ క్రితం రూ.14కోట్ల వ్యయంతో గూడూరు వద్ద 74 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేస్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేట నియోజకవర్గానికి ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. మంజీర నది ఎండిపోవడంతో పథకాల ద్వారా నీటిని సరఫరా చేయడం ఇబ్బందికరంగా పరిణమించింది. నవంబర్ మాసంలో ఇన్టెక్వెల్ వరకు కాల్వలు తీయడం, పైపులు వేసి తదితర ఏర్పాట్లతో నీటిని పంపింగ్ చేశారు. అనంతరం అవీ ఎండిపోయాయి. నదిలో బోర్లూ ఎండిపోయాయి... మంచినీటి పథకాల ఇన్టెక్వెల్లకు నీరు అందని పరిస్థితి ఉండండంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నదిలో బావుల తవ్వకం, బోర్లను ఢ్రిల్లింగ్ చేశారు. డిసెంబర్ మాసంలో శాపూర్ ఇన్టెక్వెల్ సమీపంలో 6 బోర్లను అధికారులు ఢ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండు బోర్లు ఫేయిల్ అవగా, నాలుగు బోర్లలో నీరుపడింది. గుడూరు ఇన్టెక్వెల్ సమీపంలో 6 బోర్లను తవ్వగా నాలుగు బోర్లలో నీరు పడగా రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. ఇదే పథకం వద్ద పెద్ద బావిని అధికారులు తవ్వించారు. 9 ఫీట్ల లోతు, 30 మీటర్ల వెడుల్పుతో బావిని తవ్వారు. కాగా ప్రస్తుం నడుస్తున్న 8 బోర్లలో నాలుగు బోర్లు నీరు తగ్గిపోయి గ్యాప్ ఇస్తున్నాయి. ఇవీ నడవని పరిస్థితి నెలకొంది. అంటే శాపూర్లో రెండు, గూడూర్లో రెండు బోర్ల చొప్పునే నడుస్తున్నాయి. ఇవీ ముందు ముందు ఏం చేస్తాయోనన్న భయంలో అధికారులు ఆందోళనతో ఉన్నారు. నదిలో తవ్విని బావుల్లోనూ నీటి జాడలు కరువయ్యాయి. శాపూర్ వద్ద తవ్విని బావిమధ్యలో భారీ బండ రావడంతో అధికారులు మధ్యలోనే వదిలేశారు. నదిలోని ఫలింగా గూడూర్, ఎన్ఏపీ, బోరంచ పథకాల ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందించడం కష్టతరంగా మారింది. ఈ దుస్థితిని పరిశీలించిన అధికారులు నల్లవాగు ప్రాజెక్టు నీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనచేస్తూ జిల్లా కలెక్టర్కు నివేదించారు. నదిలో బోర్లు ఫెయిల్ కావడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. -
మంజీరా నీటి ట్రయల్ రన్లో అపశృతి
హైదరాబాద్ : నగరంలోని పుప్పాలగూడ వద్ద మంజీరా నీటి ట్రయల్ రన్లో అపశృతి చోటుచేసుకుంది. గేట్వాల్ కప్పుపై నిల్చుని వాల్ తిప్పుతుండగా శ్లాబ్ విరిగి మీద పడటంతో పంచాయితీ పంపు ఆపరేటర్గా పనిచేస్తున్న మల్లేష్ అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురు కిందపడ్డారు. శ్లాబ్ మల్లేష్ నడుముపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో మల్లేష్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అందాల కోవెల.. ఏడుపాయల
ఓ వైపు పరీక్షలు.. మరోవైపు రాష్ట్రంలో జాతర సందడి. వనదేవతలు సమ్మక్క, సారక్క జాతరకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. పని ఒత్తిడి, సెలవులు లేకపోవడం.. ఇలా ఏదో కారణం వల్ల ఆ జాతరకు వెళ్లలేని వారు ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకటీ రెండ్రోజులు కాదు... ఏకంగా 365 రోజులూ జాతర వాతావరణముండే ఏడుపాయల సిటీకి దగ్గర్లోనే ఉంది. మరి ఆలస్యమెందుకు ఈ వీకెండ్ అక్కడికి ప్యాకప్ అయిపోండి. - ఓ మధు స్థలపురాణం ఇదీ.. ఏడు పాయలుగా చీలి ప్రవహించే మంజీర, వనదుర్గమాత మందిరం, వనభోజనాలకు విశేషంగా వచ్చే జనంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం. వనదుర్గ ఆలయం చుట్టూ నీరు ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గురించి ఆనేక పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నాగజాతిని తుదముట్టించేందుకు జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం జరిగింది ఇక్కడేనని అని స్థలపురాణం. సర్పయాగం అనంతరం యాగస్థలిని పుణీతం చేయడానికి గరుడ్మంతుడు.. భోగావతి నదిని తీసుకొచ్చాడని, అందుకే ఈ ప్రవాహాన్ని గరుడగంగ అని అంటారని ప్రతీతి. ఏడుగురు రుషుల యాగకుండాలను తాకేందుకు గరుడగంగ ఏడుపాయలుగా చీలిందని చెప్తారు. అత్రి, జమదగ్ని, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమ సప్తరుషులు ఈ ఏడుపాయలను స్వాగతించినందున వీటిని ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. అలా ఇది ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. ఆలయాల నిలయం.. స్వయంభూ దుర్గాభవానీ ఆలయం ఇక్కడి మరో ప్రత్యేకత. సొరంగంలో దుర్గామాత దర్శనమిస్తుంది. ఏకోత్తర శతకుండలం, పాపాలమడుగు, ముని పుట్ట, తపోభూమి ఆలయ పరిసరాల్లో ఉంటాయి. పాపాలమడుగులో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోతాయనేది ప్రజల నమ్మకం. దీనికి సమీపంలోనే శివాలయం, ముత్యాలమ్మ గుడి, ఎల్లమ్మ ఆలయాలున్నాయి. శివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహిస్తారు. జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ జాతరకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాలిపల్లిలో ఉందీ ఏడుపాయల. సిటీ నుంచి 110 కి.మీ, మెదక్కు 20 కి.మీ దూరంలో ఉంటుంది. ఏడుపాయలకు హైదరాబాద్ నుంచి బస్ సౌకర్యం ఉంది. పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. -
మెతుకు కతలు
మొత్తం ప్రపంచ కథా సాహిత్యానికి నాంది పలికింది మెదక్ జిల్లా. ఈ జిల్లాలోని కొండాపూర్లో ఉంటూనే గుణాఢ్యుడు ‘బృహత్కథ’ రాసిండు. పైశాచీ భాషలో ఈ సాహిత్యాన్ని సృజించిండు. ఈ భాష ఇప్పుడు అప్ఘ్ఘానిస్తాన్లో ‘పుష్తూ’ రూపంలో పుష్టిగానే ఉంది. బృహత్కథలో ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉన్న పదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. శాసనాల్లో తెలంగాణ పేరున్న మొట్టమొదటి శాసనాన్ని కూడా ఈ జిల్లాలోని తెల్లాపూర్లోనే కనుగొన్నరు. అశ్మక రాజ్యము, మంజీరికా దేశము, ఆ తర్వాత కాసలనాడు, అటు తర్వాత గుల్షానాబాద్- ఇప్పటి మెదక్ ప్రాంతానికి చరిత్ర క్రమంలో ఉన్న పేర్లు. కన్నడ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలు ఈ జిల్లాలో మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఈ జిల్లా వాసులు పైన పేర్కొన్న అన్ని భాషల్లోనూ సాహిత్యాన్ని సృజించారు. నారాయణ్ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు మొదట బీదర్ జిల్లాలో ఉండేవి. 1956లో మెదక్ జిల్లాలో చేర్చబడ్డాయి. ఆధునిక యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య, పండరి రామానుజరావు, గడ్డం రామదాసు, చిదిరె లక్ష్మణశర్మ, వేముగంటి నరసింహాచార్యులు, నిన్న మొన్న మరణించిన రంగకృష్ణమాచార్యులు తదితరులందరూ ఈ జిల్లా నుంచి సాహిత్యాన్ని సృజించారు. జిల్లాకు చెందిన దాదాపు 119 మంది ప్రాచీన, ఆధునిక కవుల్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 1969లో మల్యాల దేవిప్రసాద్ యాదవ్ ‘మెదకు మండల సాహిత్య చరిత్ర’ పేరిట వెలువరించిండు. ఈ సాహిత్యచరిత్రకు కొనసాగింపుగా ‘మెదక్ జిల్లా సర్వస్వము’ వెలువడింది. మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జిల్లా కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఆ పరంపరలోనిదే ఈ ‘మెతుకు కతలు’. మునుపు కవిత్వ ‘మునుం’ పట్టిన వేముగంటి మురళీకృష్ణ, మెదక్ జిల్లా సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బెల్లంకొండ సంపత్కుమార్లు ఈ సంకలనం తీసుకురావడాన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగింపుగా కూడా చూడాలి. దాదాపు ఒక శతాబ్ద కాలంలో(కచ్చితంగా చెప్పాలంటే 89 యేండ్ల కాలంలో) మెదక్ జిల్లాలో రాజకీయార్థిక సామాజిక సాహిత్య రంగాల్లో వచ్చిన/ఆశించిన మార్పుల్ని ఈ కథలు కండ్లముందుంచాయి. - సంగిశెట్టి శ్రీనివాస్ 9849220321 (ఫిబ్రవరి 21న సిద్దిపేటలో ఆవిష్కరణ కానున్న 504 పేజీల 52 మంది కథకుల ‘మెతుకు కతలు’ పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం) ఎవరిదీ ముఖం ఆవిష్కరణ రెడ్డి రామకృష్ణ కవితా సంపుటి ‘ఎవరిదీ ముఖం’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 19న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జరగనుంది. ఆవిష్కర్త: ఆదిభట్ల సూర్యజ్యోతి. కవి యాకూబ్, కె.శివారెడ్డి, కోడూరి విజయ్కుమార్, నారాయణ వేణు, బజరా పాల్గొంటారు. నిర్వహణ: రామకృష్ణ మిత్రులు, కవిసంగమం వెంకటప్పయ్య పుస్తకావిష్కరణ ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 20న సాయంత్రం 6:30కు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య. పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, అప్పాజోస్యుల సత్యనారాయణ, జూపూడి రంగరాజు, మోదుగుల రవికృష్ణ పాల్గొంటారు. తెరవే మహబూబ్నగర్ మహాసభలు ‘ఒక తెలంగాణ సాహిత్యం - వర్తమాన కర్తవ్యం’ అంశం కేంద్రంగా తెలంగాణ రచయితల వేదిక మహబూబ్నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి 21న జిల్లా కేంద్రంలోని అనంత లక్ష్మీ నరసింహా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు జరగనున్నాయి. సభ ప్రారంభం: అల్లం నారాయణ. ముఖ్య అతిథి: జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి. ‘సామాజిక తెలంగాణ- సాహిత్యం- దిశానిర్దేశం’, ‘సామాజిక తెలంగాణ- సాహిత్యం- సాంస్కృతిక రంగం’ అంశాలపై ప్రసంగాలుండే ఈ సభల్లో ఎస్వీ రామారావు, అమ్మంగి వేణుగోపాల్, గాజోజు నాగభూషణం, జి.లక్ష్మణ్, గూడూరు మనోజ, గుడిపాటి, కోట్ల వేంకటేశ్వరరెడ్డి, జయధీర్ తిరుమలరావు, మాడభూషి శ్రీధర్, గోరటి వెంకన్న పాల్గొంటారు. కపిలవాయి లింగమూర్తి, ఉందేకోడం రత్నయ్యను సన్మానిస్తారు. ‘కాలనాళిక’ సంకలనాన్ని ఆవిష్కరిస్తారు. పన్నెండు కిన్నెర మెట్ల కళాకారులు దర్శనం మొగులయ్య, డక్కలి పోషప్పల కిన్నెర వాద్య ప్రదర్శన ఉంటుంది. అరుణ్సాగర్ సంస్మరణ సభ ఫిబ్రవరి 12న హఠాన్మరణం చెందిన కవి, పాత్రికేయుడు అరుణ్సాగర్ సంస్మరణ సభ ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది. అరుణ్సాగర్ ‘మేల్కొలుపు’, ‘మ్యాగ్జిమమ్ రిస్క్’, ‘మియర్ మేల్’, ‘మ్యూజిక్ డైస్’ పుస్తకాలను వెలువరించారు. భాష - సంస్కృతి రచన: ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి; పేజీలు: 252; వెల: 500; ప్రతులకు: డాక్టర్ కోరాడ రామకృష్ణ, 1/448, ద్వారకా నగర్, అనంతపురం-515004 తెలుగులో తొలి నాటకం ‘మంజరీ మధుకరీయం’ రాసింది కోరాడ రామచంద్రశాస్త్రి. ఆయన మనవడు కోరాడ రామకృష్ణయ్య ‘తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు కనుగొనడానికి సంస్కృత ప్రాకృతాలకంటే, తమిళ కన్నడాది దక్షిణ భాషలే ఎక్కువ సహాయకారులని నిరూపించిన భాషావేత్త. తండ్రిబాటలో భాషాక్షేత్రంలోకి దుమికారు మహాదేవశాస్త్రి. సునీతీ కుమార్ ఛటర్జీ పర్యవేక్షణలో ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ పరిశోధన వ్యాసం రాశారు. ‘హాండ్బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు’, ‘వ్యాకరణ దీపిక’, లాంటి గ్రంథాలు వెలువరించారు. ప్రస్తుత పుస్తకం, భాషల వర్గీకరణతో మొదలుపెట్టి, పదాల్లో వచ్చిన మార్పును వివరిస్తుంది. ఉదాహరణకు తిక్కన కాలంలో (13వ శతాబ్దం) భాష ఒక మలుపు తిరిగిందని చెబుతూ ప్రాఙ్నన్నయ యుగంలో ప్రారంభమైన కొన్ని లక్షణాలు ఆ దశలో స్థిరపడ్డాయంటారు. అలాగే, అనంతర మార్పులకు ఆ శతాబ్దంలో ప్రారంభదశ కనిపిస్తుందంటారు. ‘త్య్రక్షర ధాతువులలో పదమధ్య అకారం ఉకారమగుట. కలపు-కలుపు; చెఱచు- చెఱుచు; చెదరు-చెదురు. గకారం వకారమగుట. అగును-అవును’. భాషను అధ్యయనం చేసేవారికి ఇది ఉపయుక్త పుస్తకం. తెలంగాణ సాహిత్యోద్యమాలు రచన: కాసుల ప్రతాపరెడ్డి; పేజీలు: 468; వెల: 275; ప్రతులకు: సాయి వెంకటరామం బుక్ డిస్ట్రిబ్యూటర్స్, గాంధీనగర్, హైదరాబాద్; ఫోన్: 9676799500 కవి, కథకుడు అయిన ప్రతాపరెడ్డి ‘తెలంగాణ సాహిత్యం తాత్విక పునాది, కవిత్వం, కథ, నవల, విమర్శలపై సాధికారికంగా’ వ్యాఖ్యానించగలిగే విమర్శకుడు కూడా! ‘తెలుగు సాహిత్యంలో విమర్శ అనేది థాంక్లెస్ జాబ్’ అని తెలిసీ ఈ మార్గంలో కొనసాగడం ఆయన సాహిత్య ప్రేమకు నిదర్శనం. అట్లా గత ముప్పై ఏళ్లలో తెలంగాణ కేంద్రంగా రాసిన సాహిత్య వ్యాసాలతో కూర్చిన సంకలనం ఇది. ‘తెలంగాణ ఉనికి, అస్తిత్వవాదం, ప్రపంచీకరణం పడగనీడలో ప్రాంతీయ చైతన్యాన్ని సాధారణీకరణం చేయటం, వివిధ ప్రక్రియల్లో తెలంగాణ సాహిత్యం వికసించటం, తెలంగాణ భాష వివక్షను, అవమానాలను ఎదుర్కొని సాహిత్యభాషగా నిలబడటం గురించి ఎన్నో విశ్లేషణ విమర్శనా వ్యాసాలు ఇందులో వున్నాయి. వాటినన్నిటిని ఒక్కచోట వేయటంవల్ల తెలంగాణ సాహిత్యోద్యమం అస్తిత్వవాద ఆరంభ వికాసాలు, గమనం తీరులను గురించి మంచి అవగాహనను కలిగిస్తున్నాయి’. -
మంచినీటి పైపుల్లో మురికినీళ్లు
రంగారెడ్డి జిల్లా బోడుప్పల్లోని బొమ్మన బ్రదర్స్ కాలనీలో గత కొంత కాలంగా మంచినీటి పైపుల్లో మురికినీళ్లు వస్తున్నాయి. మంజీరా నీళ్లు సరఫరా అయ్యే పైపుల్లో మురికినీళ్లు రావడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం ఆదివారం తీసుకెళ్లారు. తాను సంబంధిత అధికారులతో మాట్లాడతాని ఆయన హామీ ఇచ్చారు. -
మంజీరా నీళ్లు నేల పాలు
ఓ వైపు హైదరాబాద్ నగరంలో మంచినీరు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాత్రం మంచినీరు రోడ్డు పై వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం మధ్యాహ్నం బోరబండలో మంజీర వాటర్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో నీళ్లు వరదగా రోడ్డమీదికి వచ్చాయి. ఇది గుర్తించిన స్థానికులు నీటి సరఫరాను నిలిపి వేయాల్సిందిగా.. అధికారులకు సమాచారమిచ్చారు. అయితే.. గంటలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అధికారులు అలక్ష్యంగా ఉన్నారని విమర్శిస్తున్నారు. -
నీళ్లు లేక జనావాసాల్లోకి వస్తున్న మొసళ్లు
నీళ్లు లేక మంజీరా నది ఎండిపోతుండటంతో నదిని ఆవాసంగా మార్చుకున్న జీవులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో మంజీరా పరివాహక ప్రాంతాల వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మంజీరా నది నుంచి మంగళవారం నాడు ఒక మొసలి బయటకు వచ్చింది. మెదక్ జిల్లా మనూరు మండలం ఎన్జీ హుక్రానా శివారులోని స్థానికుల కంటబడింది. నదిలోంచి వచ్చిన మొసలి స్థానిక ఎస్సీ కాలనీలోని మురుగు కాల్వలోకి ప్రవేశించింది. కాల్వలో కాసేపు ఉన్న మొసలి స్థానిక రైతు నర్సింహారెడ్డికి చెందిన చెరుకు తోటలోకి వెళ్లింది. స్థానికులు నారాయణ ఖేడ్ అటవీశాఖ అదికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణుల విభాగం అధికారులు వచ్చి మొసలిని బంధించి సంగారెడ్డి వద్ద ఉన్న మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన మొసలి 10 అడుగుల పొడవు, 250 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. కాగా.. గత వారం ఇదే ప్రాంతంలో మంజీరా నది నుంచి ఓ మొసలి జనావాసాల్లోకి వచ్చింది. -
భయం.. భయం
మంజీర తీరం వెంట పొంచి ఉన్న ముప్పు పల్లెలపై జంతువుల కరువు దాడి ఊర్ల మీద పడుతున్న చిరుతలు, మొసళ్లు తీరం వెంట 700 మొసళ్లు, 20కి పైగా చిరుతలు బిక్కుబిక్కుమంటూ పల్లె జనం జీవనం పరీవాహక పల్లె జనం.. ప్రమాదపుటంచున జీవనం సాగిస్తోంది. మంజీర నదిలో నీరు లేక... క్రూర జంతువులు సమీప పల్లెలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా తుక్కాపూర్లో చిరుత సృష్టించిన కలకలం పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. మరికొన్ని పల్లెల్లోకి మొసళ్లు చొరబడుతున్నాయి. ఏకంగా క్రూర జంతువులు జనావాసంలోకి వచ్చి దాడులకు దిగుతున్నాయి. నదీ పరీవాహకం వెంట ఉన్న గ్రామాల వారు ఈ ఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ రకంగా ప్రమాదం పొంచి ఉందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మంజీర నదీ తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలకు ప్రాణ భయం పట్టుకుంది. జీవనది ఎండిపోవడంతో మొసళ్లు పంట పొలాల్లోకి జొరబడుతున్నాయి. సమీప అటవీ ప్రాంతంలోని చిరుతలు పల్లెలపై కరువు దాడి చేస్తున్నాయి. జిల్లాలో 95 కిలో మీటర్ల మేర ఉన్న మంజీర పరీవాహక ప్రాంతంలో 700 మొసళ్లు, దాదాపు ఇరవైకిపైగా చిరుతలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర కరువుతో ఆహారం, నీళ్లు దొరక్క క్రూర మృగాలు విలవిల్లాడుతున్నాయి. నీళ్లు, తిండి కోసం తీర ప్రాంత సమీపంలోని పల్లెల మీదకు అడవి జంతువులు ఎగబడుతున్నాయి. ఇటీవల కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలోకి చిరుత చొరబడడం కరువు దాడిగానే అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి దాడు లు మరిన్ని జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. మహారాష్ర్టలోని బాలాఘాట్ కొండల్లో పుట్టి న మంజీర నది కర్ణాటక మీదుగా మనూర్ మండలం గౌడ్గాం జన్వాడ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మెదక్ జిల్లాలో 95 కిలోమీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 65 కిలో మీటర్ల మేరకు ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. దాదాపు 30 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎండిపోలేదు. మొదటి నుంచి మొసళ్ల పెరుగుదలకు అనుకూలంగా ఉన్న మంజీర తీరంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టడంతో ఇటీవలి కాలంలో మొసళ్ల సంతానం భారీగా పెరిగింది. కల్పగూరు మంజీర బ్యారేజీ నుంచి సింగూర్ డ్యాం వరకున్న పరీవాహక ప్రాంతంలో 583 మొసళ్లు ఉన్నట్టు అటవీ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సింగూర్ డ్యాం వెనుక జలాల్లో మరో 150 వరకు మొసళ్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మంజీర ఎండిపోనందున మొసళ్లతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ప్రస్తుతం తీవ్ర కరువు నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులో కేవలం 1.1 టీఎంసీలు, సంగారెడ్డి మండలం కల్పగూరు మంజీర బ్యారేజ్ వద్ద కేవలం 0.01 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నదిలో నీళ్లు లేక మొసళ్లు ఆహారాన్ని వెతుక్కుంటూ మొసళ్లు సమీప పొంట పొలాల్లోకి వస్తున్నాయి. మనూర్ మండలంలోని శాపూర్, గుడూర్, ఎన్జి హుక్రానా గ్రామాల పరిధిలోని మంజీర నది ఒడ్డున చెరుకు తోటల్లోకి వచ్చాయని అన్నారు. ఫలితంగా గ్రామస్థులు మొసళ్ల బారిన పడుతున్నారు. మంజీరలో చుక్క నీరు లేకపోవడంతో నీటిని వెతుక్కుంటూ చిరుతలు, ఎలుగు బంట్లు ఊళ్లలోకి వస్తున్నాయి. కుక్కలు, మేక లు, పశువుల మీద దాడులు చేస్తున్నాయి. చిరుతలు గ్రామ శివారుల్లో కనిపిస్తున్నాయి. పశువులపై దాడి చేసిన ఘటనలు ఏడాది కాలంలో 15 వరకు జరిగినట్టు సమాచారం. పరీవాహక ప్రాంతమైన కొల్చారం మండ లం తుక్కాపూర్లోకి ఇటీవల చొరబడిన చిరుత తొమ్మిదిమందిని గాయపరిచిన విష యం తెల్సిందే. ఆహారం వెతుక్కుంటూ వ చ్చిందని అటవీ అధికారులు భావిస్తున్నారు. నీళ్లు లేకే మొసళ్లు బయటికి.. ఎగువ మంజీర నదిలో దాదాపుగా 150 వరకు మొసళ్లు ఉండవచ్చని అటవీ శాఖ నారాయణఖేడ్ సబ్ రేంజ్ అధికారి విజయ్కుమార్ తెలిపారు. నది ఎండిపోవడంతో మొసళ్లు బయటికి వస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు తాము మూడు మొసళ్లను పట్టుకుని సంగారెడ్డి వద్ద మొసళ్ల (సాంచురికి) తరలించినట్టు పేర్కొన్నారు. నదిలో నీరుతగ్గిపోతున్నకొద్దీ మొసళ్లు దిగువన సింగూర్ ప్రాజెక్టు వద్దకు వెళతాయని, అక్కడక్కడా మడుగులో ఉన్న నీటిలోంచి మిగిలిన మొసళ్లు బయటికి వచ్చే అవకాశం ఉందన్నారు. మంజీర ఎండిపోవడం వల్లే నీళ్లు లేక చిరుతలు గ్రామాల మీదకు వస్తున్నాయని, కొల్చారం మండలం తుక్కాపూర్ సంఘటన అలాంటిదేనని డీఎఫ్ఓ శివాని డోగ్రా తెలిపారు. -
బోరున మంజీర
నీటి కోసం భగీరథ యత్నం వట్టిపోయిన నదిలో బోర్ల డ్రిల్లింగ్ 12 బోర్లు.. ఓ బావి తవ్వకం ఎప్పుడూ ఏర్పడని దుర్భర స్థితి మున్ముందు గడ్డుకాలమే.. తాగునీటి కోసం జనం విలవిల్లాడుతున్నారు. రాత్రనక, పగలనక బోరుబావుల వద్ద పడిగాపులుకాస్తున్నారు. నడి వేసవిలోనూ ఏర్పడని దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు వేసవిని తలచుకుని పల్లె ప్రజలు భీతిల్లుతున్నారు. కాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతానికి భిన్నంగా నదిలో బోర్లు, బావుల తవ్వకాన్ని చేపడుతున్నారు. నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గం దాదాపు మంజీర నదిపైనే ఆధారపడి ఉంది. జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సైతం మంజీర నదినుంచే నీటి సరఫరా జరుగుతోంది. మనూరు మండలం గౌడ్గాం జన్వాడ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న మంజీర నది జిల్లాలో అత్యధికంగా ఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో మంచినీటి పథకాలు, ఇన్టెక్వెల్లు సైతం ఈ నియోజకవర్గం సమీపంలోనే నిర్మించారు. ఖేడ్ గ్రామాలకు మంజీర నీటిని సరఫరా చేసేందుకు పలు పథకాలు నదిపై నిర్మించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో 13 ఏళ్ళ క్రితం రూ.14 కోట్ల వ్యయంతో గూడూరు వద్ద 74 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని నిర్మించారు. ఎన్ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేస్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేటలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు. ఎండిన నది.. అందని నీరు మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా పథకాల ద్వారా నీటిని సరఫరా చేయడం ఇబ్బందికరంగా పరిణమించింది. నెల క్రితం నుంచే పరిస్థితి దారుణంగా ఉండడంతో అధికారులు ఇన్టెక్వెల్ వరకు కాల్వలు తీయడం, పైపులు వేయడం తదితర ఏర్పాట్ల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ప్రస్తుతం మరీ గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి పథకాలు వట్టిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నదిలో బోర్లు.. బావులు... వేసవిలో ఎండలు మండినా, నది ఎండుదశ పట్టినా మంచినీటి పథకాలకు ఇప్పుడున్నంత దుర్గతి ఎన్నడూ ఏర్పడలేదు. ఫలితంగా మంచినీటి పథకాల ఇన్టెక్వెల్లకు నీరు అందని పరిస్థితి ఉంది. దీంతో చేసేది లేక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నదిలో బోర్లు, బావుల తవ్వకాలకు నడుం బిగించారు. శాపూర్ ఇన్టెక్వెల్ సమీపంలో 6 బోర్లను అధికారులు డ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండు బోర్లు ఫేయిల్ అవగా, నాలుగు బోర్లలో నీరుపడింది. గుడూరు ఇన్టెక్వెల్ సమీపంలో 6 బోర్లను తవ్వగా నాలుగు బోర్లలో నీరు పడగా రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. ఇదే పథకం వద్ద పెద్ద బావిని అధికారులు తవ్వించారు. 9 ఫీట్ల లోతు, 30 మీటర్ల వెడల్పుతో బావిని తవ్వారు. ఈ బావిని మరింత వెడల్పు, లోతుగా తవ్వేందుకు ఆలోచిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ రాజరత్నం ‘సాక్షి’కి తెలిపారు. శాపూర్వద్ద సైతం ఓ బావిని తవ్వేందుకు యోచిస్తున్నామని, ఈ ప్రాంతంలో బండ ఉందని, ఏ ప్రాంతంలో తవ్వాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. కాగా అధికారులు తవ్విన బోర్లు, బావుల్లో ఊరిన నీటిని ఇన్టెక్వెల్ల ద్వారా గ్రామాలకు పంపింగ్ చేయనున్నారు. భూగర్భజలాలు పడిపోతున్న తరుణంలో బోర్లు నడివేసవిలో ఇబ్బందులు కలిగిస్తే పరిస్థితి ఏమిటని తలచుకొని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నదిలోనే కొన్ని బోర్లు ఫెయిల్ అవుతుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా గూడూరు ఇన్టెక్వెల్ నుంచి బోర్లు, బావి నీటి ద్వారా నీటి పంపింగ్ జరిగితే 6 గంటలకు మించి నడవడంలేదు. నీటి పథకాల వద్ద ఇప్పడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఏమిటన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. -
రాజధానికి మంజీరా బంద్
సింగూరు నీళ్లు కూడా... 50 ఏళ్ల తరవాత ఇదే తొలిసారి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కి యాభై ఏళ్ల తరవాత సింగూరు, మంజీరా జలాల సరఫరా మంగళవారం ఒకేసారి నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జలాశయాలు వట్టి పోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటిల్లో ఉన్న కొద్దిపాటి జలాలను మెదక్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలకు నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాజధాని హైదరాబాద్కు1965 నుంచి సింగూరు (మంజీరా ఫేజ్-1), 1982 నుంచి మంజీరా జలాలు (మంజీరా ఫేజ్-2) జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా మంగళవారం ఒకేసారి 120 మిలియన్ గ్యాలన్ల జలాలకు కోత పడడంతో పలు ప్రాంతాలు తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నాయి. దీంతో పాటు జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, కృష్ణా మూడు దశల ద్వారా జలమండలి సరఫరా చేస్తున్న మొత్తం 357 ఎంజీడీల నీటిలో 120 ఎంజీడీలకు కోత పడింది. ఫలితంగా వాస్తవ సరఫరా 237 మిలియన్ గ్యాలన్లకు మించలేదు. ఫలితంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఆనంద్నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, బోరబండ, కేపీహెచబీ, భాగ్యనగర్ సెక్షన్, బంజారాహిల్స్, యూసుఫ్గూడా, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బాలానగర్, చింతల్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన 600 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు జలమండలి ఈఎన్సీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయంగా బుధవారం నుంచి గోదావరి మంచినీటి పథకం ద్వారా ప్రస్తుతం ఘన్పూర్ రిజర్వాయర్కు తరలిస్తున్న 28 ఎంజీడీలు, కృష్ణా మూడోదశ ద్వారా 5 ఎంజీడీల జలాలను లింగంపల్లి రిజర్వాయర్కు తరలించి, అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు. ఈ నెల 5 నుంచి గోదావరి మంచినీటి పథకం ద్వారా 56 ఎంజీడీల నీటిని నగరానికి తరలించి దాహార్తి తీరుస్తామన్నారు. అలాగే ఈ నెల 10 నుంచి 86 ఎంజీడీల గోదావరి జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జంట జలాశయాల నుంచి ప్రస్తుతం 10 ఎంజీడీల నీటిని పాత నగర తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ బుకింగ్లు 57 వేలకు పైనే... శీతాకాలంలోనే నీటి కష్టాలు తీవ్రమవడంతో నవంబరు నెల మొత్తంగా జలమండలిలో ఏకంగా 57,672 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇందులో 47,454 మందికి సరఫరా చేశారు. మరో 10,218 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. దీంతో చేసేది లేక ప్రైవేటు ట్యాంకర్ (5 వేల లీటర్లు) నీటికి రూ.1000 నుంచి రూ.2 వేల వరకు వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. -
మంజీరాపై తొలి ‘నీటి వంతెన’
- 350 మీటర్ల పొడవు.. రూ.50 కోట్లతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: ఒకే నిర్మాణం.. రెండు ప్రయోజనాలు.. ఈ తరహాలో తొలి భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నది దాటేందుకు రోడ్డుతోపాటు, నది నీటిని నిల్వ చేసే డ్యామ్ తరహా ఏర్పాటుకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకర తొలి భారీ వంతెన సిద్ధం కాబోతోంది. నిజామాబాద్-మెదక్ సరిహద్దులో వెంకంపల్లి వద్ద మంజీరా నదిపై దీనిని నిర్మించనున్నారు. దాదాపు 350 మీటర్ల పొడవుండే ఈ వంతెనకు దాదాపు రూ.50 కోట్లకుపైగా వ్యయం కానుంది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం-మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలాలను అనుసంధానించటంతోపాటు ఆ ప్రాంతాల్లోని గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు అవకాశం కలుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో సత్ఫలితాలనిస్తున్న ఈ తరహా నిర్మాణాలను తెలంగాణలో చిన్న నదీ పాయలు, పెద్ద వాగులపై నిర్మించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంజీరా నదిపై కూడా చేపట్టాలని తాజాగా రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించటంతో ఆ శాఖ అధికారులు దీనిని ఎంపిక చేశారు. ఇక్కడ రోడ్డు కోసం వంతెన నిర్మించే ప్రతిపాదన మాత్రమే ఉంది. మంత్రి ఆదేశాలతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి వంతెన డిజైన్ మార్చి టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. దీనికి సంబంధించి సర్వే పని మొదలుపెట్టారు. గతంలో మాటూరు వద్ద వంతెన నిర్మాణానికి ప్రయత్నించినా.. ఆ ప్రాంతం అనువైంది కాదని మట్టి పరీక్షలో తేలడంతో.. ఇప్పుడు వెంకంపల్లిని ఎంపిక చేశారు. -
అక్రమాలపై ఉక్కుపాదం
- ఇక రాత్రి 8 దాటితే ఇసుక రవాణా నిషేధం - నకిలీ వే బిల్లుల లారీలను అడ్డుకున్న అధికారులు - ఈ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ - కలెక్టర్ ఆదేశాలతో అధికారుల చర్యలు - మళ్లీ ‘మహా’ ఇసుక తుఫాన్ - తాజాగా రెండు క్వారీలకు మహారాష్ట్ర సర్కారు అనుమతి బోధన్ : మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. బోధన్ మండలంలోని సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు సమీపంలోని మంజీర నదికి ఆవతలి ఒడ్డున మహారాష్ట్ర ప్రాంతంలోని ఇసుక క్వారీల నుం చి లారీలు చెక్పోస్టు మీదుగా తెలంగాణలోకి వస్తున్నా రుు. ఆ క్వారీల నుంచి నకిలీ వే బిల్లులతో లారీల్లో రవాణా చేస్తున్నారు. ఈ విషయూన్ని ఇటీవల ‘ఇసుకాసురులు బరితెగించారు’ శీర్షికతో సాక్షి కథనం ప్రచురించింది. దీంతో నకిలీ వే బిల్లులు, ఇసుక అక్రమ రవాణ ను కలెక్టర్ సీరియస్ పరిగణించారు. ఆమె ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక లారీల వే బిల్లులు తనిఖీ చేస్తున్నారు. సాలూర వద్ద మంజీర నది కొత్త వంతెన సమీపంలో ఆదివారం రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మహారాష్ట్ర క్వారీల నుంచి వచ్చిన లారీలను నిలిపి వే బిల్లులను తనిఖీ చేశారు. కొన్ని లారీల వద్ద నకిలి బిల్లులను గుర్తించి రవాణాను అడ్డుకున్నారు. వాటిని మహారాష్ట్రకు తిప్పి పంపించారు. బోధన్ టౌన్, రూరల్ సీఐలు వెంక న్న, శ్రీనివాసులు, ఎడపల్లి, వర్ని ఎస్సైలు ఆసిఫ్ అహ్మద్, అంజయ్య, బోధన్ ఎంఆర్ఐ అశోక్ సింగ్, వీఆర్వో జావిద్ తదితరులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా నియంత్రకు చర్యలు... మంజీర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళింపించారు. మహారాష్ట్ర ఇసుక క్వారీల నుంచి నకిలీ వే బిల్లులు, ఓవర్లోడ్తో రవాణా చేస్తున్న లారీలను అడ్డుకునేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఐదారేళ్లుగా అడ్డూఅదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం విదితమే. దీనిద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అరుుతే కొత్తగా వచ్చి కలెక్టర్ యోగితా రాణా ఆదేశాలతో అధికార యంత్రాగం ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. మూడు చెక్పాయింట్లు.. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు.. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల సమన్వయంతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్టు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్ మండలంలోని రెండు చోట్ల, ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఇసుక లారీల రవాణను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించి రవా ణా చేస్తే వాహనాలను స్వాధీ నం చేసుకుని లారీ యాజమానులపై క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ వే బిల్లులతో రవాణా చేసినా చర్యలు తప్పవని ప్రకటించారు. మళ్లీ ‘మహా’ఇసుక తుఫాన్.. సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు సమీపంలో గల మంజీర నది తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలో మంజీర నదిలో అక్కడి ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించి రవాణాకు అనుమతిస్తోంది. వేలంలో క్వారీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మన భూబాగంలోని నదిలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్న విషయం పలుమార్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ప్రస్తుతం గంజ్గాం క్వారీ కొన్ని నెలలుగా నడుస్తోంది. తాజాగా కార్లా, ఎస్గీ క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని సమాచారం. రెండు రోజులుగా ఈ రెండు క్వారీల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. బోలేగాం క్వారీకి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో మళ్లీ మంజీర తీరంలో మహా ఇసుక తుఫాన్ రానుంది. దీని ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కోట్లు దండుకుంటుండగా మన ప్రాంతంలో రోడ్లు దెబ్బతినడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
మాజీ ఎంపీ ఫాంహౌస్కు నల్లా కనెక్షన్ కట్
మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఓ మాజీ ఎంపీ తన వ్యవసాయక్షేత్రానికి వేసుకున్న మంజీర పైపులైన్ను అధికారులు సోమవారం తొలగించారు. మండల పరిధిలోని చందానగర్ పంచాయతీ అనుబంధ గ్రామమైన రెడ్డిపల్లి వద్ద ఉన్న తన ఫాంహౌస్కు సదరుప్రజాప్రతినిధి నీటిని తరలించేందుకు అక్రమంగా కనెక్షన్ తీసుకున్నదానిపై ఆదివారం పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిం దే. దీంతో సోమవారం ఆర్డబ్ల్యూఎస్ చేవెళ్ల డివిజన్ డీఈ రాజేష్, మొయినాబాద్ మండల ఇన్చార్జ్ ఏఈ శ్రీనివాస్లు అక్కడికి చేరుకుని అనుమతులు లేకుండా కనెక్షన్ ఎలా తీసుకుం టారంటూ వ్యవసాయక్షేత్ర సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈ రాజేష్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రమే వర్క్ఇన్స్పెక్టర్తో అక్రమ కనెక్షన్ను తొలగించినట్లు తెలిపారు. ఫాంహౌస్కు మంజీరా నీటి కనెక్షన్ ఇవ్వాలని తమ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపామన్నారు. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన పైప్లైన్ వేసుకుని కనెక్షన్ తీసుకోవడం సరికాదన్నారు. అయితే మొదటితప్పుగా భావించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మళ్లీ ఇలా అక్రమ కనెక్షన్ తీసుకుంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమ్మో.. నీటి ముప్పు!
సంగారెడ్డి పట్టణానికి నీటి ముప్పు పొంచి ఉంది.. మంజీర బ్యారేజ్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు.. మరో మూడు రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సైతం మంజీరలో నీరు లేకపోవడంతో కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. - మంజీర బ్యారేజీలో అడుగంటిన నీరు - మూడు రోజులకు మాత్రమే సరిపడే దుస్థితి - సంగారెడ్డి పట్టణ ప్రజలకు తప్పని నీటి కష్టాలు - ప్రత్యామ్నాయం వైపు అధికారుల చూపు సంగారెడ్డి మున్సిపాలిటీ: మంజీర బ్యారేజీ (కల్పాగూర్ డ్యాం)లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. బ్యారేజ్ నుంచి సంగారెడ్డి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తదితర కాలనీలకు తాగు నీరు సరఫరా అవుతోంది. నీటి నిల్వలు తగ్గిపోడంతో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. మరో రెండు, మూడు రోజులకు మాత్రమే నీళ్లు సరిపోనుండటంతో.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పట్టణంలో ఉన్న చేతిపంపుల మరమ్మతులు, కొత్త బోర్ల తవ్వకాలు, సింగల్ఫేస్ బోరు మోటార్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణానికి మంజీరా నీటి సరఫరా పథకం మినహా మరోమార్గం లేకపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనుకున్నా మంజీరాలో నీరు లేకపోవడంతో అది సాధ్యం కాకపోవచ్చు. పట్టణంలోని వివిధ కాలనీలలో కొత్తగా బోర్లు వేస్తేనే నీటి సమస్యను కొంతమేర తీర్చవచ్చన్న ఉద్దేశంతో అధికారులున్నారు. అందుకు అనుగుణంగానే వార్డుల వారీగా అవసరమైన బోర్లకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోవడంతో మంజీరకు నీరు వదిలేపరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా పట్టణ వాసులకు నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఎలాగైనా సింగూరు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మంజీర బ్యారేజీలో కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా కేవలం అర టీఎంసీకి తక్కువే ఉంది. హైదరాబాద్ నగరానికి సైతం ఇక్కడి నుంచే నీరు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్కు సరఫరా అయ్యేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు డ్యాం మధ్యలో ఉన్నందున.. నీరు ఉన్నంత వరకూ సరఫరా చేసే అవకాశం ఉంది. కాని సంగారెడ్డికి సరఫరా చేసే పంపింగ్కు డ్యాం చివరి భాగాన మోటార్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గాగానే పట్టణానికి నీరు సరఫరా చేసే అవకాశం లేకుండా పోతోంది. రోజూ 22.22 లక్షల గ్యాలన్ల నీరు అవసరం పట్టణంలోని 31 వార్డులకు రోజూ 22.22 లక్షల గ్యాలన్ల(మిలియన్ క్యూబిక్ మీటర్) నీరు సరఫరా చేయాల్సి ఉంది. అందులో మంజీర ద్వారా 16.30 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు 25 చేతిపంపులు, రెండు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని అన్ని వార్డులతో పాటు కొత్తగా విస్తరించిన కాలనీలకుసైతం మంజీర పైపులైన్లు వేశారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే 25 శాతం అదనంగా అవసరం ఉంటుంది. దీనికి తోడు మంజీర బ్యారేజీలో 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 0.36 మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇది సంగారెడ్డి పట్టణానికి కేవలం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా సరఫరా అయ్యో అవకాశం లేదు. ప్రభుత్వానికి లేఖ రాస్తాం: పట్టణానికి నీటి సమస్య తలెత్తనున్నందున ముందస్తుగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ తెలిపారు. మంజీరలో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్ల ద్వారా నీరు రావడం లేదని అందుకు సింగూరు నుంచి నీటిని విడుదల చేయించాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు. -
పాడుబడిన బావిలో మొసలి
మర్పల్లి: పాడుబడిన ఓ బావిలో మొసలి కనిపించిన ఘటన రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం బిల్కల్లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన చింతల గట్టు అంతయ్య బుధవారం తన పొలంలోని పాడుబడిన బావి చుట్టు ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు బావిలో ఓ మొసలి పిల్ల కనిపించింది. వికారాబాద్ ఫారెస్టు బీట్ అధికారి అరుణ, మెదక్ జిల్లా సంగారెడ్డి బీట్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మొసలి పిల్లను పట్టుకున్నారు. దానిని మెదక్ జిల్లా మంజీర ప్రాజెక్టులో వదిలి పెడుతామని అధికారులు తెలిపారు. -
మంజీర ఒడ్డుకు భారీ మొసలి
మనూరు: మంజీర నది వట్టిపోవడంతో అందులోని మొసళ్లు ఒడ్డుకు వస్తున్నాయి. మెదక్ జిల్లా మనూరు మండలం షాపూర్ వద్ద ఆదివారం ఉదయం ఓ భారీ మొసలి చెరకు తోటలోకి వచ్చింది. దీని బరువు దాదాపు ఐదు క్వింటాళ్ల వరకు ఉండవచ్చని రైతులు తెలిపారు. మొసలి చెరకు తోటలోకి వచ్చిన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా సాయంత్రం వరకు స్పందించలేదు. చేసేది లేక తోట యజమాని కాల్వల ద్వారా మొసలి వద్దకు నీటిని వదిలి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. -
అడుగంటిన ఆశలు!
ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం సింగూరు, మంజీర జలాశయాలు డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ఆనకట్టల్లోనూ అదే దుస్థితి నెలకొంది. ఈసారైనా ఖరీఫ్లో సాగు చేసి కష్టాలనుంచి గట్టెక్కుదామనుకున్న రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. ఎగువప్రాంతమైన కర్ణాటక, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే మంజీర నదిలోకి నీళ్లు వచ్చి దిగువన పంటలకు, తాగునీటికి నీళ్లు అందే అవకాశం ఉంది. సాక్షి, సంగారెడ్డి : మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సిన్నబోతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 4.5 టీఎంసీ నీళ్లే ఉన్నాయి. మరో 0.5 టీఎంసీల నీటి మట్టం తగ్గితే ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరుకుంటుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 4.06, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8.35 టీఎంసీల సాగునీరు కేటాయింపులు ఉన్నాయి. ఖరీఫ్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవటంతో ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్లో రైతులకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు కనిపించటంలేదు. ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటక, ఇక్కడ వర్షాలు కురిస్తేనే సింగూరు ప్రాజెక్టు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మంజీర డ్యామ్లో సైతం నీళ్లు లేవు. మంజీర పూర్తిస్థాయి నీటిమట్టం 1,645 మీటర్లు కాగా ప్రస్తుతం 501.37 మీటర్ల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మంజీర సైతం డెడ్స్టోరేజీ లెవల్కు సమీపంలో ఉంది. సింగూరు, మంజీర ద్వారా జంటనగరాలతోపాటు సంగారెడ్డి, సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్, గజ్వేల్ నియోజవకర్గాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే సింగూరు, మంజీరాల్లో నీళ్లు అడుగంటుతుండటంతో తాగునీటికి ఇబ్బందుల తప్పని పరిస్థితి నెలకొంది. ఘనపురం, నల్లవాగు వెలవెల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన ఘనపురం, నల్లవాగులో నీళ్లు అడుగంటాయి. ఘనపురం ప్రాజెక్టు కింద మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖరీఫ్లో సుమారు 21వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 0.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆనకట్ట కింద సాగు చేయాలని ఎదురుచూస్తున్న రైతులకు దిక్కుతోచటంలేదు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలటం లేదా వర్షాలు కురిసి ఆనకట్టలోకి నీళ్లు వస్తే తప్ప పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు సైతం నీళ్లులేక వెలవెల బోతుంది. నల్లవాడు ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 1493 మీటర్ల కాగా ప్రస్తుతం 75 మీటర్ల మేర నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్స్టోరేజీ లేవల్కు చేరుకోవటంతో ప్రస్తుతం ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందని పరిస్తితి ఉంది. ప్రాజెక్టు కింద ఖరీఫ్లో 4వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. గత ఖరీఫ్లో ప్రాజెక్టులో నీళ్లులేకపోవటంతో రైతులు పంటలు సాగు చేయలేదు. ఈసారైనా ఖరీఫ్లో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేయవచ్చని రైతులు ఆశించారు. అయితే ప్రాజెక్టులోకి ఇంకా నీళ్లు వచ్చిచేరలేదు. దీంతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీళ్లు రావాలని వరుణ దేవుణ్ని కోరుకుంటున్నారు. -
మంజీర తీరాన... మహా జలహారం
మెదక్: మంజీర తీరాన మహా జలహారం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న వాటర్గ్రిడ్ పథకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు పది లక్షల మందికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. గ్రిడ్ పైలాన్ కూడా సిద్ధమైంది. పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ ఈ పైలాన్ను శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లాలో చేపట్టనున్న వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. 873 గ్రామాల్లో సుమారు పది లక్షల మందికి తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ దిగువన గల పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని బ్యాక్ వాటర్ నుంచి సెకండ్ లెవల్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నారాయణఖేడ్, అందోల్, మెదక్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తారు. ఈ పథకం కింద నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అందోల్లోని ఐదు మండలాలు, మెదక్లోని నాలుగు మండలాలతోపాటు మెదక్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలకు తాగునీరందిస్తారు. రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి వంద లీటర్లు, మున్సిపల్ ప్రాంతంలో 130 లీటర్ల తాగునీటిని అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దారెడ్డిపేట నుంచి ప్రారంభమయ్యే పైప్లైన్ మధ్యలో ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించనున్నారు. రామాయంపేట మండలం వరకు సెకండ్ లెవల్ గ్రిడ్ ద్వారా తాగునీరందుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేశ్కుమార్ తెలిపారు. నేడు పైలాన్ ఆవిష్కరణ.. మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వాటర్ గ్రిడ్ పైలాన్ సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. -
పడిపోయిన నీటిమట్టం
- పొంచి ఉన్న నీటి ముప్పు - ఆందోళనలో రైతులు - జంటనగర వాసులకూ ఇబ్బందులే - గత సీజన్లో సరైన వర్షాల లేకపోవడమే కారణం నీటి ముప్పు పొంచి ఉంది. ఏటా నీటితో కళకళలాడే మంజీర నది ప్రస్తుతం వెలవెలబోతోంది. రోజురోజుకూ ముదురుతున్న ఎండల కారణంగా మంజీరలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఏటా వేసవిలోనూ నీటితో కళకళలాడే మంజీర నది గత సీజన్లో భారీ వర్షాలు కురవకపోడంతో నీరు అంతంత మాత్రంగానే చేరింది. ఫలితంగా పరీవాహకంలో వేసుకున్న పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. న్యాల్కల్: మంజీర నది న్యాల్కల్ మండలం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గత సీజన్లో జిల్లాలో పెద్దగా వర్షాలు పడకపోవడం, ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురవక పోవడంతో మంజీరలోకి నీరు చేరలేదు. ఫలితంగా నది పరీవాహక ప్రాంతాల పంటలు సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చెరకు, అరటి పంటలకు మంజీర నది ద్వారానే నీటిని అందిస్తున్నారు. ఇదిలావుండగా జంట నగరాలకు కూడా తాగు నీరు మంజీర ద్వారానే వెళ్తోంది. ప్రస్తుతం మంజీరలో నీరు అడుగంటుతుండడంతో జంట నగరాలకు నీటి సరఫరా కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. మంజీర ఎగువ ప్రాంతం నీరులేక పూర్తిగా ఎండిపోయింది. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో మంజీరలో నీటి మట్టం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా నది పరీవాహక ప్రాంత పంటలు దెబ్బతినడంతోపాటు తాగు నీటి సమస్య తలెత్తే అవకాశముంది. -
డేంజర్ బెల్!
పొంచి ఉన్న మంచి నీటి ముప్పు మంజీరలో పడిపోయిన నీటిమట్టం జంటనగర వాసులకూ ఇబ్బందులే న్యాల్కల్: జంట నగరాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మంజీర నది ప్రస్తుతం వెలవెలబోతోంది. రోజురోజుకూ నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా నగరానికి నీటిసరఫరా ఆగిపోయే ప్రమాదం పొంచివుంది. మండు వేసవిలోనూ నీటితో కళకళలాడే మంజీర నది గత సీజన్లో భారీ వర్షాలు కురవకపోడంతో దాదాపు ఎండిపోయింది. మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం మీదుగా మంజీర హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గత సీజన్లో పెద్దగా వర్షాలు పడకపోవడం, ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురవక పోవడంతో నదిలోకి నీరు చేరలేదు. ఫలితంగా నది పరీవాహక ప్రాంతాల పంటలు సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సిటీకి తాగునీటి ఎద్దడి ప్రమాదం ఏర్పడుతోంది. -
రావి కొండలరావు జ్ఞాపకాలు నాగావళి నుంచి మంజీర వరకు...
రావి కొండలరావు ఇప్పటికి చాలా పుస్తకాలే రాశారు. ఇది మరొకటి. కాని పెద్దవాళ్లలో ఉండే విశేషం ఏమంటే వాళ్ల దగ్గర ఎంత జీవితం ఉంటుందో అన్ని జ్ఞాపకాలుంటాయి. పదహారేళ్ల వయసులో మద్రాసు పారిపోయిన వ్యక్తి దాదాపు 60-70 ఏళ్లు ఆ రంగంతో పెనవేసుకుపోతే జ్ఞాపకాలకేం కొదువ? అయితే ఈ పుస్తకం కొంచెం ఆత్మకథ వరుసలో సాగింది. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ అనడంలో ఆ వరుస కనిపిస్తుంది. కళింగాంధ్ర నాగావళి తీరం నుంచి తెలంగాణ మంజీర తీరం వరకూ తన ప్రస్థానంలో తారసపడిన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. చేయి తిరిగిన కలం కనుక చకచకా నడిపించుకొని పోతుంది. సినిమా అంటే ఎవరికైనా ఆసక్తి కనుక కుతూహలం నిలబెడుతుంది. ‘ఆనందవాణి’ పత్రిక యజమాని ‘వంద ఇస్తాను. చేరు’ అంటే చేరారు రావి కొండలరావు. కాని ఆ వంద ఎప్పటికీ రాదు. రేపిస్తాను అంటుంటాడు యజమాని. అదాయన ఊతపదం అని ఈయనకు తెలియదు. ఆ సీట్లోనే అంతకు ముందు శ్రీశ్రీ, ఆరుద్ర చేసి ఆ వంద అందక పారిపోయారు. ఈయనా పారిపోక తప్పలేదు. ఈ పుస్తకం చదివితే అర్థమయ్యేదేమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. వినయం ఉంటే అవకాశం లభిస్తుంది అని. ఈ రెంటినీ రెండు చేతులు చేసుకొని పెద్దల ప్రోత్సాహం, ఆశీర్వాదంతో జీవితాన్ని ఈదేశారు రావి కొండలరావు. రేలంగి, పింగళి, చక్రపాణి, పెండ్యాల, మల్లాది, బాపు, రమణ... ఎందరు పెద్దలవో జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. ఇంతకు మించిన అనుభవాలు ఉన్నవారు ఉండొచ్చు. వారు రాయరు. రాసే అదృష్టం రావి కొండలరావుకు దక్కింది. పాఠకులకు ఈ అనుభవఫలం సంప్రాప్తమయ్యింది. వెల: రూ.150 ప్రతులకు: 98480 71175, 7893809839 -
మాఫియూకు ఝలక్
బోధన్ : ఇసుక అక్రమ రవాణాదారులపై మహారాష్ట్ర అధికారులు కొరడా ఝుళిపించారు. బోధన్ మండలంలోని సాలూర శివారులో ‘తెలంగాణ- మహారాష్ట్ర’ మధ్య ప్రవహిస్తున్న మంజీరా నది అవతలి ఒడ్డున, నాందేడ్ జిల్లా, బిలోలి తాలూకా పరిధిలోని ఏస్గీ ఇసుక క్వారీని నాందేడ్ జిల్లా కలెక్టర్ మంగళవారం సీజ్ చేశారు. కలెక్టర్తోపాటు రెవెన్యూ అధికారులు ఇసుక క్వారీపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని గుర్తించారు. దీంతో మధ్యాహ్నం నుంచి అక్కడ ఇసుక తవ్వకాలు నిలి చిపోయూరుు. మంజీరా నదికి ఆనుకుని మహారాష్ట్ర భూ భాగంలోని పట్టాభూమిలో ఇసుక తరలింపునకు అనుమ తి పొందిన మాఫియా పరిమితికి మించి యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టింది. వారం రోజుల నుంచి రవా ణా సాగుతోంది. కొత్త వంతెనపై నుంచి వెళ్లాల్సిన భారీ లోడ్ లారీలు పాత వంతెన మీదుగా వెళ్తున్నారుు. సా లూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు మీదుగా అక్రమ రవాణా సాగుతున్నా మన జిల్లా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించింది. దీంతో ట్రాఫిక్ కు అంత రాయం కలుగడమేకాకా, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వరుస గా రెండు రోజుల నుంచి కథనాలు ప్రచురిస్తోంది. దీనికి స్పందించిన నాందేడ్ కలెక్టర్ క్వారీని తనిఖీ చేశారు. పరి మతికి మించి ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించి క్వారీ ని సీజ్ చేశారు. గ్రామస్తులు మొత్తుకున్నా ఎస్గీ క్వారీ నుంచి వారం రోజులుగా ఇసుక రవాణా సాగుతోంది. ఓవర్లోడ్ వాహనాలతో మన రోడ్లు ధ్వంసమవుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వ చ్చారుు. అటువైపున అనుమతి పొందిన మాఫియా,మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నారని గ్రామస్తులు మొత్తుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. మా ఫియా ఆగడాలను నియంత్రించడంలో అధికారులు ఉదాసీనత చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్గీ క్వారీ నుంచి రోజుకు 200 లారీలు, టిప్పర్లు ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నారుు. బోధన్ నుంచి ఎడపల్లి, నిజామాబా ద్, డిచ్పల్లి, కామారెడ్డి మీదుగా, మరో వైపు బాన్సువాడ మీదుగా హైదరాబాద్కు వాహనాలు నడి చారుు. హైదరాబాద్లో ఇసుక డిమాండ్ హైదరాబాద్లో ఇసుకకు ధర అధికంగా ఉండటంతో లారీ ల యాజమానులు, వ్యాపారులు ఇసుక దందాపై దృష్టిసారించారు. మన పరిధిలోని ఇసుక క్వారీలు మూ తపడడం తో సరిహద్దుపై వాలారు. దీంతో అధిక సంఖ్యలో లారీలు ఎస్గీ క్వారీకి క్యూ కట్టాయి. బోధన్ పట్టణ శివారు నుంచి ఎస్గీ క్వారీ వరకు సుమారు పది కిలోమీట ర్ల మేరకు రహదారి ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా మారింది. డబ్బుల కోసం పడిగాపులు ఎస్గీ ఇసుక క్వారీ సీజ్ కావడంతో ఇసుక కోసం వచ్చిన లారీలు సాలూర అంతర్రాష్ట్ర చెక్పోస్టు సమీపంలో అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. లారీల డ్రైవర్లు క్వారీ నిర్వాహకులకు ఇసుకకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే చెల్లిం చారు. ఒక్కొక్క లారీకి రూ. 13,500 వరకు చెల్లించామని వారు చెబుతున్నారు. క్వారీ సీజ్ కావడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో లారీల యాజమానులు, డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. క్వారీ నిర్వాహకులతో సంప్రదిం పులు కొనసాగించారు. వారి నుంచి సంతృప్తికరంగా స మాధానం రాకపోవడంతో అయోమయంలో పడిపోయూ రు. క్వారీ మళ్లీ ప్రారంభమవుతుందని ఆందోళన చెందవద్దని నిర్వాహకులు అంటున్నారని, ఒక వేళ ప్రారంభం కాకపోతే డబ్బులు వాపస్ ఇస్తామంటున్నారని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. చెక్పోస్టు సమీపంలో అధిక సంఖ్యలో లారీలు నిలిచిపోయినా మన జిల్లా అధికార యంత్రాంగం వాటిని తొలగించే చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మొత్తానికి మహారాష్ర్ట అధికారులు మంజీరా నది తీరాన కలవరం సృష్టించారు. -
నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి
నిజాంసాగర్(నిజామాబాద్): జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రలోని మంజీర బ్రిడ్జిపై నుంచిఓ బైకు అదుపుతప్పి నిజాంసాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్గౌడ్ అని గుర్తించారు. -
మంజీరా మాల్లో ప్లాష్మాబ్
-
నెలకు రూ.కోటి
వాగుల్లో.. ⇒ ఇసుక దొంగలు ⇒అధికారమే పెట్టుబడిగా.. ⇒అధికారులే అండదండగా.. ⇒నేతలే మాఫియాగా.. ⇒వల్లభపూర్, చిక్లీ, గుంజిలిలో దందా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార పార్టీ నేతలకు ఇసుక దందా కాసులు కురిపిస్తోంది. ఓ వైపు పట్టాభూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట ‘ఇసుక మాఫియా’ మంజీరను తోడేస్తుంటే.. మరోవైపు అధికారుల అండదండలతో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్మూరు నియోజకవర్గం లో సర్కారుకు రూపాయి చెల్లించకుండా వాగులను కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని వాగులను తోడేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని జనం మొత్తుకుంటున్నారు. అడపా దడపా కేసులు నమోదు చేసేందుకు రెవెన్యూ,పోలీసుశాఖల అధికారులు సిద్ధమైనా.. హైదరాబాద్ ఫోన్ల ద్వారా ఒత్తిడి చేస్తుండటంతో ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తుందని వారు అంటున్నారు. అయితే ఈ ఇసుక దందాకు పోలీసుశాఖకు చెందిన ఓ ‘నిలయం’ అధికారే కాపు కాస్తున్నట్లు జిల్లా కేంద్రం వరకు ఫిర్యాదులు వస్తుండటం చర్చనీయూంశమైంది. రోజుకు రూ.3.50 లక్షలు వాగులో ఇసుకే కదా అని వదిలేస్తే.. ఈ దందా ఏడాదిలో రూ.కోట్లకు చేరుతోంది. ఆర్మూరు నియోజకవర్గంలోని మాక్లూరు మండలానికి చెందిన మూడు వాగులు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ వాగుల్లో ఇసుక తోడేందుకు టెండర్లు లేవు. సర్కారుకు రాయల్టీ కట్టే ది లేదు. గుడులు, బడులకు చందాలు కూడా లేవు. కేవలం అధికారపార్టీ నేతలమన్న ఒకే ఒక కారణంతో కొందరు రెండు నెలలుగా వాగులను తోడేస్తున్నారు. రోజుకు మాక్లూరు మండలం నుంచి 50 నుంచి 75 వరకు టిప్పర్లలో ఇసుకను నందిపేట, నవీపేట, ఆర్మూరు, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ లోడు ఇసుకకు పరిస్థితులను బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతుండగా.. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రోజుకు ఇసుక వ్యాపారులు దండుకుంటున్నారు. నెలలో రూ. 1 కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇసుకదందా వెనుక ఉన్న కొందరు నేతలు జేబులో వేసుకుంటున్నారు. అంటే ఏడాదిలో రూ.12 కోట్ల నుంచి రూ.14.50 కోట్ల వరకు ఇసుకదందా ద్వారా అక్రమ ఆదాయం సమకూరుతోంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను సైతం లెక్కచేయడం లేదు. కీలక నేతల పేర్లు వాడుకుంటూ రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖల అధికారులపై ఒత్తిడి చేస్తుండటం ఇటీవల వివాదాస్పదంగా మారింది. వాగుల్లో ఇసుక దొంగలు మాక్లూరు మండలంలోని వల్లభపూర్, చిక్లీ, గుంజిలి వాగుల్లో ‘ఇసుక’ దొంగలు విజృంభిస్తున్నారు. వాస్తవంగా మంజీర నది చుట్టూ ‘పట్టాభూముల’లో ఇసుక మేటల తొలగింపు పేరిట పొందిన అనుమతులను ప్రభుత్వం తిరస్కరించింది. ఏడు అనుమతులను రద్దుచేస్తూ కలెక్టర్ రోనాల్డ్రోస్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్టీఎంసీ ద్వారానే ఇసుక విక్రయాలు జరిపేందుకు భూగర్భ గనుల శాఖ అధికారి భాస్కర్రెడ్డి 8 రీచ్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ తదతర ప్రాంతాల్లో ఇసుక ధరలు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు వారి అండదండలతో ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుంచి విచ్చల విడిగా ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మైనింగ్ కార్యాలయంలో కూడ కొందరు ఫిర్యాదు చేశారు. చిక్లీ వాగు నుంచి చిక్లీ, చిక్లీ క్యాంపు ఇసుక వ్యాపారులు గ్రామాభివృద్ది పేరిట అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. గుంజిలి వాగు నుంచి గుంజిలి గ్రామానికి చెందిన కొందరు అక్రమ ఇసుక దందా సాగిస్తుం డటం వివాదాస్పదం అవుతోంది. భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్న తరుణంలో నిబంధనలకు విరుద్ధంగా వాగులను తోడేస్తున్నా... నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జనసంద్రంగా మారిన మంజీరా తీరం
వెల్లువలా తరలి వచ్చిన జనాలతో మంజీరా తీరం జనసంద్రంగా మారింది. జనమే జయుని సర్పయాగ స్ధలిలో..పవిత్ర స్నానం చేసిన జనం పులకించి పోయారు. వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు. మాఘస్నానాల కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాముకు ముందే ఏడుపాయల చేరుకున్న భక్తులు..ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా మంజీర నదిలో పుణ్య స్నానాలు చేసి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్రెడ్డి ఉదయం 11 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ విప్ జగ్గారెడ్డి దుర్గమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
వికారాబాద్కు మంజీరా
వికారాబాద్ పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందు కు తక్షణమే మంజీరా జలాలను విడుదల చేయాలని రవాణా మంత్రి మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. బిల్లులు చెల్లించలేదని నీటి సరఫరాను నిలిపివేయడం సబబుకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కారు రక్షిత మంచినీటికి ప్రాధాన్యతనిస్తున్నందున.. పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో వికారాబాద్ శాటిటైట్ టౌన్షిప్ పనుల పురోగతిని ప్రజారోగ్య, వాటర్బోర్డు, మున్సిపల్ అధికారులతో మంత్రి మహేందర్రెడ్డి సమీక్షించారు. వికారాబాద్కు వెంటనే మంజీరా జలాల సరఫరాను ప్రారంభిస్తామని, ఏప్రిల్లోపు డిమాండ్కు అనుగుణంగా 5.4 ఎంజీడీల నీటిని పంపిణీ చే స్తామని వాటర్బోర్డు మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ స్పష్టం చేశారు. పైపులైన్ గుంతలు పూడ్చండి డ్రైనేజీ పనులను వేగిరంచేయాలని, పైపులైన్ల కోసం తవ్విన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేయడమేకాకుండా సీసీ రోడ్డు, అంతర్గత పనులను పూర్తిచేయాలని పురపాలక, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని, అసంపూర్తిగా ఉన్న పనులకు తుదిరూపు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కొరత లేదని, నిధుల ఇబ్బంది ఉంటే తన దృష్టికి తేవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు. స్థానిక శాసనసభ్యుడు సంజీవరావు మాట్లాడుతూ శాటిలైట్ టౌన్షిప్ పనులు నత్తనడకన సాగుతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం రెండో దశ నిధుల విడుదలకు కేంద్రం ముం దుకురావడంలేదని పేర్కొన్నారు. నిర్ణీత వ్యవధిలో తొలివిడత పనులు పూర్తి చేసినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదన్నారు.మెట్రో వాటర్బోర్డు ఎండీ జగదీశ్వర్, జనరల్ మేనేజర్ రాజశేఖర్రెడ్డి, పురపాలకశాఖ అడిషనల్ డెరైక్టర్ అనురాధ, ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ ఇంతియాజ్ అలీ, ఎస్ఈ యాదగిరి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జైతారాం, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి పరమేశ్వర్రావు ఉన్నారు. -
మాల్లో పూనమ్పాండే సందడి
-
హైదరాబాద్లో పూనమ్ పాండే సందడి
-
మాల్లో మాలిని
ప్రముఖ మోడల్, నటి పూనమ్పాండే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మంజీర మాల్లో గురు వారం సందడి చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మాలిని అండ్ కో’ చిత్రం ప్రచారంలో భాగంగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చిత్ర బృందం ఆలస్యంగా వచ్చినా అభిమానులు ఓపికతో నిరీక్షించారు. పూనమ్ పాండే రాకతో వారిలో సంతోషం ఉప్పొంగింది. - మలేషియా టౌన్షిప్ -
మంజీరా నీరు మెదక్కే..
సాక్షి, హైదరాబాద్: మంజీరా నీటిని మెదక్ జిల్లా సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని.. హైదరాబాద్కు కృష్ణా నది జలాలను తరలిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రస్తుతం మంజీరా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించడం వల్ల మెదక్ జిల్లా రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మంజీరా నీటిని మొత్తంగా మెదక్ అవసరాల కోసం వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట (ఆనికట్)తో పాటు మంజీరా నదిపై మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఘన పూర్ ఆనకట్ట అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజీరా నది నుంచి దీనికి 4.06 టీఎంసీల నీరు కేటాయించారని, దాని ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందాలని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 25 వేల ఎకరాలకు నీరందాలని, వీలైతే అదనంగా మరో ఐదువేల ఎకరాలకు నీరివ్వాలని చెప్పారు. కాలువల్లో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలకు లైనింగ్ వేయడం వల్ల చివరి భూములకు నీరందుతుందన్నారు. ఘనపూర్ ఆనకట్ట వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే పరిసర పొలాలు మునిగే అవకాశం ఉందని, దీన్ని నివారించడానికి కరకట్టలు నిర్మించాలని సీఎం సూచించారు. పంట పొలాలు మునగకుండా ఈ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్మోహన్రెడ్డి, చింత ప్రభాకర్, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిరునవ్వును పంచండి
‘నిరుపేదల మోముల్లో చిరునవ్వులు పూయిస్తాయనుకునే దేనినైనా దానం చేయొచ్చు. వస్త్రాలు, పుస్తకాలు, నిత్యావసర వస్తువులను మా మాల్లో అందించవచ్చు’ అని అంటున్నారు మంజీరా మాల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గజ్జల వివేకానంద. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ముందుగానే ఆయా వస్తువులను ‘యువత’ సంస్థ సహకారంతో నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంజీరా మజా పేరిట ‘చిరునవ్వును పంచండి’ అంటూ కూకట్పల్లిలోని మంజీరా మాల్లో బుధవారం ‘సంప్రదాయ గోలు’ను తెరిచారు. ఇది అక్టోబర్ 1 నుంచి 18వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. ‘రోమియో’ చిత్రం హీరో సాయిరామ్శంకర్ తన యూనిట్తో ఇందులో పాల్గొన్నారు. -
‘ఛీ’కోడ్!
పాపన్నపేట: చుట్టూరా మంజీర ఉన్నా.. తాగునీరు కరువై పల్లె ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం రూ.4.60 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేసినా, పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి చీకోడ్ తాగునీటి పథకానికి గ్రహణంగా మారింది. పాపన్నపేట మండలం చుట్టూరా మంజీర నది సుమారు 34 కిలో మీటర్ల మేర ప్రవహిస్తోంది. ప్రతి పల్లెకు మంజీర రక్షిత మంచినీటిని అందించాలని మండలంలో ఇప్పటికే కొత్తపల్లి, పొడిచన్పల్లి, కొడుపాక తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన మరో 14 గ్రామాలకు తాగునీరు నీరందించాలన్న ఉద్దేశంతో.. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 2013లో చీకోడ్ తాగు నీటి పథకం మంజూరైంది. ఇందుకు రూ. 4.60 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం కింద చీకోడ్, కొత్తలింగాయపల్లి, అమ్రియా తండా, మల్లంపేట, రామతీర్థం, ముద్దాపూర్, కొత్తపల్లి(మధిర), మొదల్లకుంట తండాలోని సుమారు 6,176 జనాభాకు ర క్షిత మంజీర నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు అవసరమైతే మరో 6 గ్రామాలకు తాగునీరందించాలని నిర్ణయించారు. ఇందుకు కుర్తివాడ వద్ద మంజీర నదిలో ఇన్టేక్వెల్ నిర్మించి, సమీపంలోని మిన్పూర్ గుట్టపై ఓవర్ హెడ్ రిజర్వాయర్ ఏర్పాటు చేసి, పైపులెన్ల ద్వారా తాగు నీటిని పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పనిని యేడాదికాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. కాని ఆరు నెలల గడిచినా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు నదిలో ఇన్టేక్వెల్కు సంబంధించి పనులు ప్రారంభించలేదు. కేవలం మిన్పూర్ గుట్టపై ఓవర్హెడ్ రిజర్వాయర్ కోసం వారం రోజుల క్రితం మొక్కుబడిగా పనులు ప్రారంభించారు. కుర్తివాడ సమీపంలో కొన్ని పైపులు ఉంచారు. పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో తాగునీటికి అనేక అవస్థలు పడుతున్నామని చీకోడ్,లింగాయపల్లి,అమ్రియా తండా, మధిర కొత్తపల్లి, మొదల్లకుంట తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని వాపోయారు. -
తవ్వుకున్నోడికి.. తవ్వుకున్నంత
కొల్చారం : అధికారుల నిర్లక్ష ్యంతో ఇసుక అక్రమార్కులు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్న నానుడి నిజం చేస్తూ మంజీరా నదిని జల్లెడ పడుతున్నారు. అధికారులు అటు వైపు చూడక పోవడంతో ఇ దే అదనుగా భావించి ఇసుక అక్రమ రవాణాను జోరుగా సాగిస్తున్నారు. వా ల్టా చట్టం ఇక్కడ ఏ కోశాన కనిపించదు. దీంతో దోపిడీదారుల రాజ్యంగా మారిం ది. మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, వై మాందాపూర్, పైతర, తుక్కాపూర్ల మీదుగా మంజీరా నది ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం సమయంలో పెద్ద ఎత్తున ఇసుక తెట్టలు నదిలో పేరుకు పోయి ఉంటాయి. ఇదే సమయంలో ప్రధానంగా కోనాపూర్, మాం దాపూర్, తుక్కాపూర్ గ్రామాలకు చెంది న కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఇసుక అక్రమ రవాణాకు గ్రామ సేవకులతో పాటు రెవె న్యూ అధికారులు సైతం అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు ట్రాక్టర్ల యజమాను లు ఏకంగా నదిలోకి రహదారినే ఏర్పా టు చేశారంటే ఎంత దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వై.మాందాపూర్, కోనాపూర్ పరి సరాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో లారీల్లో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు దుంపలకుంట చౌరస్తా మీదుగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులుగాని, గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామసేవకులు కూడా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నదిలో ఇసుక మేటలు అంతరించి భూగర్భ జలాలు తగ్గడంతో పాటు వ్యవసాయ బోర్లపై ఆధారపడ్డ తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
మంజీరా తీరం.. హరితహారం
పాపన్నపేట: మంజీరా తీరం.. హరితహారంగా మారింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వెలవెలబోయిన పుడమితల్లి ఇటీవల కురిసిన వర్షాలతో హరితశోభను సంతరించుకుంది. పాపన్నపేట మండలంలో మంజీరమ్మ తల్లి సుమారు 35 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది. తీరప్రాంత రైతులు బోరు మోటార్లు ఏర్పాటు చేసుకుని తమ పంటలకు ప్రాణం పోస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవలేదు. మంజీరాలో వరదలు కనిపించలేదు. దీంతో రైతులు తుకాలు పోసేందుకు వెనకాడారు. అనంతరం జూలైలో కురిసిన తేలికపాటి వర్షాలు, సింగూర్ నుంచి విడుదలైన నీటితో తుకాలు పోసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కింది. చెరువులు, కుంటల్లో కొంతమేర నీరు చేరింది. దీంతో వరినాట్లు ఓ మోస్తరుగా సాగాయి. సుమారు 12వేల ఎకరాల్లో వరిపంట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్నిచోట్ల వరిపంటలు పొట్టదశకు వచ్చాయి. ముఖ్యంగా మండలంలోని లక్ష్మీనగర్, గాంధారిపల్లి, కొత్తపల్లి, యూసుఫ్పేట, ఆరేపల్లి, మిన్పూర్, పాపన్నపేట, కొడుపాక, నాగ్సాన్పల్లి, గాజులగూడెం తదితర గ్రామాల్లో వరిపంటలు కళకళలాడుతోంది. మరో మూడు విడుతలు సింగూర్ నుంచి ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కె అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.