
అప్లైడ్ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్ ప్రదానం
శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి సుధాకర్ హైద్రాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్లైడ్ జియోకెమెస్ట్రీ విభాగంలో డాక్టరేట్ను పొందారు. ప్రొఫెసర్ ప్రవీణ్రాజ్సక్సేనా పర్యవేక్షణలో ‘ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలాంగ్ గ్రానైట్–బసాల్ట్ కాంట్యాక్ట్(అగ్నిశిలల్లో భూగర్భ జలాల అన్వేషణ– భూగర్భ జలాల నాణ్యత) అరౌండ్ నారాయణఖేడ్, మెదక్ డిస్ట్రిక్ట్ ’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు సుధాకర్కు డాక్టరేట్(పీహెచ్డీ) పట్టాను అందజేశారు. ఈ మేరకు సుధాకర్ శనివారం ఇక్కడ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సుధాకర్ను గ్రామస్తులు, పలువురు బందువులు అభినందించారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో అక్కెనపల్లి యల్లయ్య–సోమమ్మ దంపతుల ఆరుగురి కుమారుల సంతానంలో చివరి సంతానం సుధాకర్. పాఠశాల విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసించాడు. ఇంటర్మీడియట్ను నకిరేకల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలోని ఎన్జి కళాశాలలో, పీజీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాడు. వివాహితుడైన సుధాకర్ ఒక పక్క పరిశోధన కొనసాగిస్తునే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో జియాలజిస్టుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.