హిమాలయాలూ కరిగిపోతున్నాయ్..
బంజారాహిల్స్: ‘హిమాలయాలూ కరిగిపోతున్నాయి.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి, వ్యాపార ప్రయోజనాల కొరకు పర్యావరణాన్ని తాకట్టు పెడితే పెనుముప్పు తప్పదు, పర్యావరణం ఒక వ్యాపార అవకాశం ఎప్పటికీ కాకూడదు’ అని మాజీ కేంద్రమంత్రి జైరామ్మ్రేష్ అన్నారు. ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో శనివారం తాజ్కృష్ణాలో ‘ఎన్విరాన్మెంట్ యాస్ ఏ బిజినెస్ అపర్చునిటీ ’పేరుతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాలకు పర్యావరణం ఒక జీవన విధానమైతే మన దేశంలో అది జీవనంలో ఒక భాగమన్నారు.
పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి అడవులు, నదులు, గనులు, నీళ్లు, గాలి సహా అన్ని ప్రకృతి వనరులను యథేచ్ఛగా వినియోగిస్తుండడంతో మానవాళికి పెనుముప్పుగా మారుతుందన్నారు. హిమాలయాలు కరిగిపోతున్నాయని, నదులు ఇంకిపోతున్నాయని, సముద్రమట్టాలు పెరుగుతున్నాయని, ఎండలు మండిపోతున్నాయని.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు జైరామ్ సమాధానాలు ఇచ్చారు. ఎఫ్ఎల్వో చైర్పర్సన్ నిధిస్వరూప్, పింకిరెడ్డి, అజితారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు.