సగం.. సగం..
-
ముంచుకొస్తున్న పుష్కరాలు
-
నత్తకే నడకనేర్పుతున్న పనులు
-
ఘాట్లలో పూర్తికాని నిర్మాణాలు
ఆత్మకూర్: ఈ నెలాఖరులోగా పుష్కరపనులు పూర్తి చేస్తామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. మక్తల్ నియోజకవర్గంలో మాత్రం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మాగనూరు మండలంలో కృష్ణా పుష్కరఘాట్కు రూ.70లక్షలు నిధులు కేటాయించగా, 70శాతం పనులు పూర్తయ్యాయి. కానీ మరుగుదొడ్లు, తాగునీటి అభివృద్ధి పనుల ఊసేలేదు. అలాగే రూ.90లక్షలతో చేపట్టిన తంగిడిఘాట్ పనులు 75శాతం, రూ.1.40కోట్లతో చేపట్టిన గుడెబల్లూర్ ఘాట్ 80శాతం పనులు జరిగాయి. మక్తల్ మండలంలోని పస్పుల ఘాట్కు రూ. 52లక్షలు మంజూరు కాగా 40శాతం పనులు, పంచదేవ్పహాడ్కు రూ.58లక్షలు పనులకు 40శాతం, అనుగొండకు రూ.1.60కోట్ల పనులకు 50శాతం, ముస్లాయిపల్లికి రూ.79లక్షలు పనులకు 40శాతం, గడ్డంపల్లిలో రూ. 80లక్షలు పనులకు 40శాతం, పారేవులకు రూ. 57లక్షలు పనులకు 45శాతం జరిగాయి. ఆత్మకూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల రూ.1.52కోట్లతో చేపట్టిన పనులు 75శాతం పూర్తయ్యాయి. మూలమల్లలో రూ. 64లక్షల పనులకు 40శాతం, జూరాలలో రూ.1.20కోట్లకు 80శాతం, ఆరేపల్లి రూ.64లక్షలు పనులు 50శాతం, కత్తేపల్లి రూ. 64లక్షలు పనులు 40శాతం మాత్రమే జరిగాయి. పనులు పూర్తి చేసేందుకు ఇంకా వారంరోజుల సమయమే ఉన్నా దాదాపు 50శాతం పెండింగ్లో ఉన్నాయి.
ప్రధానఘాట్లోనూ అదే పరిస్థితి..
రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద 55/60మీటర్ల పుష్కరఘాట్ నిర్మిస్తున్నారు. 12ఏళ్ల క్రితం నిర్మించిన ఇక్కడి పుష్కరఘాట్ వీఐపీ ఘాట్ కోసం కేటాయించారు. మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఘాట్ పరిసరాల్లో వేర్వేరు చోట్ల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. అలాగే తాగునీటి సౌకర్యం కోసం బోర్లు వేశారు గానీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పుష్కరఘాట్లను సందర్శిస్తున్నా.. పనులు పురోగతి, నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తలలేని కృష్ణమ్మ
12ఏళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిష్ఠించి, ప్రారంభించారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో కృష్ణవేణమ్మ విగ్రహం తల లేకుండా మొండెంతోనే ఉంది. అక్కడ కట్టిన గుడి కూలిపోయి, విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. గుడిని పునరుద్ధర ణ చేయించాలని భక్తులు కోరుతున్నారు.