కుమారుడి మృతితో రోదిస్తున్న తల్లి, బంధువులు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
- ఒకరికి గాయాలు
జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నలుగురిని పొట్టనపెట్టుకోగా మరొకరు గాయాలతో బయటపడ్డాడు. సుంకులమ్మ దర్శనానికి వెళ్లిన దంపతులకు పుత్రశోకం మిగలగా.. రంజాన్ సరుకులు తీసుకొచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డాడు. మరో ప్రమాదంలో దుబాయ్ నుంచి వస్తున్న కుమారుడిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్న ఓ తండ్రిని, డ్రైవర్ ప్రాణాలను రహదారులు బలిగొన్నాయి.
సుంకులమ్మ దర్శనానికి వెళ్లిన తల్లికి కడుపు కోత
బస్సు ఢీకొని ఐదేళ్ల చిన్నారి మృతి..
కె.నాగులాపురం(గూడూరు): మండలంలోని కె.నాగులాపురం సుంకులమ్మ దర్శనార్థం వచ్చిన ఓ తల్లికి కడుపుకోత మిగిలింది. ఐదేళ్ల తన కుమారుడిని కళ్లముందే ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు చేయడంతో గుండెలవిసేలా రోదించింది. గూడూరు పట్టణానికి చెందిన సింగనిగేరి కోస్గి వీరేష్, వరలక్ష్మి దంపతులు వారి బంధువులు సుంకులమ్మ ఉత్సవం చేస్తుండగా ఇద్దరు కుమారులతో వచ్చారు. బంధువులతో కలిసి అమ్మవారి ఆలయం వైపు వెళ్తుండగా ఎమ్మిగనూరు వైపు నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా భక్తుల గుంపు మీదకు దూసుకెళ్లింది. ప్రమాదంలో చిన్నారి విక్రమ్(5)బస్సు టైర్ల కింద పడిపోయాదు. కల్ల ముందే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు వీరేష్, వరలక్ష్మితో పాటు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారు మోగింది. పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి బస్సు డ్రైవర్ను అదుపులో తీసుకుని మృతదేహాన్ని పంచనామా కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రంజాన్ సరుకులు తీసుకొద్దామని వెళ్లి..
పత్తికొండ రూరల్: రంజాన్ పండుగకు సరుకులు తీసుకొద్దామని బయల్దేరిన ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి రిజర్వాయర్ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. దేవనకొండ మండల పరిధిలోని ఎంకె కొట్టాల నుంచి పత్తికొండకు కమాల్సా(35), అతని బావమరిది ఖాజామొద్దీన్ రంజాన్ పండుగకు సరుకులు కొందామని, బైక్పై పత్తికొండకు బయలుదేరారు. కొత్తపల్లి రిజర్వాయర్ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ వారి బైక్ను కల్వర్టు వద్ద ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న కమాల్సా కల్వర్టుపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చున్న ఖాజామోద్దీన్ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖాజామొద్దీన్ పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య ఫాతిమాబి, కుమార్తె హరిఫాబి, ఉమర్ఫారుఖ్ సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుమారుడిని తీసుకొచ్చేందుకు వెళ్తూ..
ఆళ్లగడ్డ: బతుకు దెరువు కోసం పరాయి దేశంలో ఉంటూ ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి వస్తున్న కొడుకును స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు వెళ్తూ ఓ తండ్రి కొడుకును చూడకుండానే అనంత లోకాలకు వెళ్లిన సంఘటన ఆళ్లగడ్డ సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ రామయ్య తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా మండల కేంద్రం సుండుపల్లికి చెందిన నాగయ్య కుమారుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుపై గ్రామానికి వస్తున్నానని హైదరాబాద్ విమానాశ్రయానికి కారు తీసుకురావాలని సూచించడంతో నాగయ్య ఇన్నోవా కారు బాడుగకు తీసుకుని మంగళవారం తెల్లవారు జామున బయలు దేరాడు. ఈ క్రమంలో పట్టణ శివారులోని ఆల్ఫా కళాశాల సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో నాగయ్య అక్కడిక్కడే మృతి చెందగా ఒంటిమిట్ట మండలం మండపంపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ శశికుమార్ (21) తీవ్రంగా గాయపడగా స్థానిక వైద్యశాలకు తరలిస్తుంగా మృతి చెందాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న మరో వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు