బీజేపీ, టీడీపీ తీరుపై విద్యార్థుల నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విద్యార్థులు చెవిలో పూలు పెట్టుకుని, మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ అయ్యస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ మేరకు బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. నిరసనలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, దాసరి వంశీ, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.