
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
అనంతపురం రూరల్: అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను సోమవారం కందుకూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ కందుకూరు పంచాయతీ పరిధిలో రైతులు దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా కోల్పోవాల్సి వస్తోందన్నారు. 44, 205వ జాతీయ రహదారి కూడలిలో మెగా జంక్షన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న తెలిసిందన్నారు. ఒక్కొక్క జంక్షన్కు దాదాపు 500 ఎకరాల చొప్పున దాదాపు వెయ్యి ఎకరాలు సేకరించాలనే ప్రణాళికను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఇప్పటికే ఎఫ్సీఐ గోదాములకు, రైల్వే జంక్షన్, ఎస్కేయూకు దాదాపు వందల ఎకరాల భూములను రైతులు వదులుకున్నారని గుర్తుచేశారు. అమరావతి రోడ్డుకు ఎకరా భూమి కూడా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. మండల సర్వేయర్ శరత్తోపాటు అధికారులను వారు వెనక్కు పంపి వేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవింద్రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, చంద్రశేఖర్, రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఓబిలేసు, రైతులు వెంకటనారాయణ, లక్ష్మీనారాయణమ్మ, ఉజ్జినమ్మ, తదితరులు పాల్గొన్నారు.