
వైవీయూకు తాగునీరు బంద్
వల్లూరు:
యోగి వేమన యూనివర్సిటీతోపాటు వల్లూరు మండలంలోని పలు గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేసే నీటి పథకానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో గత 3 రోజులుగా తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగి వేమన యూనివర్సిటీతోపాటు వల్లూరు , పెండ్లిమర్రి మండలాల్లోని 65 గ్రామాలకు తాగు నీటిని అందించడానికి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రూ.5 కోట్లతో పథకాన్ని మంజూరు చేశారు. ఇందులో భాగంగా వల్లూరు మండలంలోని చెరువుకిందిపల్లె సమీపంలో పెన్నా నదిలో బావులను ఏర్పాటు చేశారు. 40 హెచ్పీ విద్యుత్ పంపు సెట్టును అమర్చి పెద్దలేబాక వద్ద నిర్మించిన ఓహెచ్బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ) కు అనుసంధానం చేశారు. అక్కడి నుంచి గత మూడేళ్లుగా యూనివర్సిటీకి నీటి సరఫరా జరుగుతోంది.
ప్రస్తుతానికి వల్లూరు మండలంలోని కొప్పోలు, లేబాక , దిగువపల్లె, కుమారునిపల్లె తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది.
భారంగా విద్యుత్ బిల్లులు
తమకువచ్చే ఆర్థిక నిధుల వాటా నుండి విద్యుత్ బిల్లులను చెల్లించడం జిల్లా పరిషత్కు పెద్ద భారంగా ఉండేది కాదు. కానీ గ్రామ పంచాయతీలకు వచ్చే కొద్ది పాటి ని«ధుల నుంచి ఇంతటి భారీ విద్యుత్ బిల్లులను చెల్లించడం పెను భారంగా మారింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు తమకు మంజూరైన ఆర్థిక సంఘం నిధులలో కేవలం 20 శాతం నిధులను మాత్రమే విద్యుత్ బిల్లులకు చెల్లించడానికి అవకాశం ఉంది. ఈ 20 శాతం నిధులలోనే గ్రామ పంచాయతీలు తమ పంచాయతీ పరిధిలో ఉన్న సింగిల్ విలేజ్ వాటర్ స్కీముల విద్యుత్ బిల్లులతోపాటు ఈ నీటి పథకం విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి రావడం అవరోధంగా మారుతోంది.
–విద్యుత్ సరఫరా నిలిపివేత
గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వైవీయూ నీటి పథకానికి సంబంధించి రూ.19 లక్షలు విద్యుత్ బకాయిలు పేరుకు పోయాయి. వీటిని యూనివర్సిటీ వారు, నీటిని వాడుకుంటున్న గ్రామ పంచాయతీల వారు కలిసి చెల్లించాల్సి ఉంది. బిల్లుల బకాయిలను చెల్లించక పోవడంతో గత ఆరు నెలల క్రితం విద్యుత్ శాఖ వారు ఈ పథకానికి సరఫరాను నిలిపి వేశారు. తరువాత పలువురు ప్రజా
ప్రతినిధులు జోక్యంతో సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించారు. అయినా బకాయిలు చెల్లించక పోవడంతో తిరిగి ఫిబ్రవరి నెల 26 వ తేదీన సరఫరాను నిలిపి వేశారు. దాదాపు రెండు నెలలతరువాత పునరుద్ధరించారు. తాజాగా ఈ నెల 25 వ తేదీన విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు.
మా వాటా విద్యుత్ బిల్లుల చెల్లించాం:
మాకు ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రజల నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ నిధుల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి చెక్కులు అందచేశాం. మా గ్రామ పంచాయతీ నీటి సరఫరా స్కీము విద్యుత్ బిల్లులు చెల్లించినా విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబదులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.
కే. శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ , కొప్పోలు , వల్లూరు మండలం.
బకాయిలు చెల్లించగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాం:
ఈ స్కీముకు సంబంధించి దాదాపు రూ.19 లక్షలకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకు పోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేశాం. బకాయిలు చెల్లిస్తే వెంటనే పునరుద్ధరిస్తాం.
మురళీధర్ రెడ్డి, ఏడీఈ , విద్యుత్ శాఖ, కడప.
ఫోటోలు
27కేఎల్పీ302,302ఏ– పెద్దలేబాక వద్ద వున్న ఓహెచ్బీర్ ట్యాంక్
27కేఎల్పీ302బీ–కే.శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్, కొప్పోలు.
27కేఎల్పీ302డీ– లేబాక సమీపంలో
వ్యవసాయ మోటారు వద్ద నుండి ∙తాగు నీటిని తీసుకుని వెళుతున్న ప్రజలు