
ఎండ, వానల కన్నా చలికాలం చర్మం త్వరగా ముడతలు పడటం, నల్లబడటం చూస్తుంటాం. దీనికి కారణం చర్మం పొడిబారడమే. ఈ సమస్యకు విరుగుడుగా... స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, పాదాలకు మసాజ్ చేయాలి. అలాగే స్నానం చేసేముందు అర టీ స్పూన్ బాదం నూనె బకెట్ నీటిలో కలిపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి మంచి ప్యాక్ అవుతుంది. ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాలతర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది.
చలికాలం నూనె శాతం ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు, చిటికెడు గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటేæపొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.