ప్రాణాలతో వ్యాపారం | Business with survivor | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో వ్యాపారం

Published Thu, Apr 14 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

ప్రాణాలతో వ్యాపారం

ప్రాణాలతో వ్యాపారం

హాలీవుడ్ సినిమా / కోమా
విజయవాడ ఊర్వశి థియేటర్‌లోనో, మేనక థియేటర్‌లోనో గుర్తులేదు. ఓ కొత్త సినిమా పోస్టర్... తీగలకి వేలాడుతున్న శరీరాలు చూడటానికే చాలా భయానకంగా! 1978లో విడుదలైన ఆ సినిమా పేరు ‘కోమా’. సినిమా చూసి, థ్రిల్లవ్వడం తప్పితే, ఆ సినిమా గురించి పెద్ద వివరాలు తెలియలేదు. ఆ తర్వాత ఎప్పుడో హైదరాబాద్ అబిడ్స్‌లో ఫుట్‌పాత్ మీద దొరికిన ఆ నవల కవర్‌పేజీ అదే. రకరకాల తాళ్లతో బందీ అయి, గాలిలో తేలుతున్న ఓ శరీరం... 1977లో రాబిన్ కుక్ రాసిన నవల ‘కోమా’ అది.

ఎక్కడో చదివాను - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నియంత ముస్సోలినిని చంపేసి, మాంసం కొట్లో మేకని వేలాడదీసినట్లు ముస్సోలిని శవాన్ని వేలాడదీశారని. అంత దారుణానికి ఒడిగట్టారంటే - చంపినవాళ్లు దుర్మార్గులైనా అయ్యుండాలి, అలా వేలాడదీయబడ్డవాడు కిరాతకుడు అయినా అయి ఉండాలి. మరి ‘కోమా’ సినిమాలో అలా వేలాడుతున్నవాళ్లెవరు? దుర్మార్గులా? అమాయకులా?
   
రాబిన్ కుక్ ఓ సర్జన్. అమెరికన్ నేవీలో సబ్ మెరైన్‌లో డాక్టర్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో 1972లో ఓ నవల రాశాడు. ఫ్లాప్. ఓ కొత్త రచయితని ప్రపంచం వెంటనే గుర్తించాలంటే ఏం చేయాలి? మిస్టరీ థ్రిల్లర్ నవల రాయాలి. (హాలీవుడ్ రచయితల నుంచి ఇప్పటి కొత్తతరం తెలుగు దర్శకులు ఫాలో అవుతున్న ఫార్ములా ఇదే!) వెంటనే రాబిన్ కుక్ ఓ మెడికల్ థ్రిల్లర్ నవల రాశాడు. అదే ‘కోమా’. అప్పటికే ‘జాస్’ నవల (స్పీల్‌బర్గ్ సినిమా ఈ నవల ఆధారంగానే తీశాడు) ఓ సెన్సేషన్. ఆ ప్రభావం రాబిన్ కుక్ మీద ఉంది.
 
దయ్యాలు, గ్రహాంతరవాసులు, షార్క్ చేపలు... ఇవి మనుషులని భయపెడుతున్న సినిమా ముడిసరుకులు. సినిమాల్లో తప్పితే, ఏ వ్యక్తి ఈ సమస్యలని ప్రత్యక్షంగా ఎదుర్కోడు. కాని కోటీశ్వరుడి నుంచి పేదవాడి వరకూ - అందర్నీ భయపెట్టగలిగేది ఏదన్నా ఉంటే అది హాస్పిటల్. అంతే రాబిన్ కుక్ వైద్య రంగం నేపథ్యంలో తనకంటూ ఓ ఒరవడి సృష్టించుకుని నవలలు రాయడం ప్రారంభించాడు. ‘కోమా’ నవల మొదట్లో ఏ పబ్లిషర్ ప్రచురణకి తీసుకోలేదు. చివరికి ఓ ప్రచురణ సంస్థ (లిటిల్ బ్రౌన్) పదివేల డాలర్లు అడ్వాన్స్‌గా ఇచ్చి, నవల ప్రచురించింది.
 
నవలా ప్రపంచంలో ఓ సంచలనం ప్రారంభమైంది. రాబిన్ కుక్ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రిక 100 బెస్ట్ పాపులర్ నవలల్లో ‘కోమా’ని ఒకటిగా ఎన్నుకుంది. (రాబిన్ కుక్ ‘ఫీవర్’ నవల ఆధారంగానే మన పాపులర్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రార్థన’ నవల రాసినట్లు పేర్కొన్నారు.)

మైఖేల్ క్రీటన్ అనే మరో రచయిత ఉన్నాడు. అతనికి మెడికల్, సైన్స్ ఫిక్షన్ కథలంటే ప్రాణం. ‘జురాసిక్ పార్క్’, ‘లాస్ట్ వరల్డ్’ అంటూ స్పీల్‌బెర్గ్ తీసిన సినిమాలు మైఖేల్ క్రీటన్ నవలల ఆధారంగా తీసినవే. ఇక ‘కోమా’ విషయానికొస్తే - అప్పటికే రెండు సినిమాలు తీసినా మైఖేల్‌కి తగినంత గుర్తింపు రాలేదు. ‘కోమా’ నవల విశేషంగా ఆకట్టుకుంది మైఖేల్ క్రీటన్‌ని. ఆ తరహా సబ్జెక్ట్‌లంటే అతనికి ఇష్టమే. రాబిన్ కుక్, మైఖేల్ క్రీటన్ అభిరుచులు ఒకటే - 1978 నాటికి ఇద్దరి వయసు ఒకటే - పైగా ఇద్దరూ మంచి మిత్రులు. ఈ సినిమాని మంచి థ్రిల్లర్‌గా రూపొందించాలని మైఖేల్ ముందుగానే నిర్ణయించాడు (కౌబోయ్ ధోరణిలో అంటే - ఒక వృత్తిలో ఉండే మంచి, చెడూ చెప్పాలని మైఖేల్ భావించాడు)
 
నవల ఓ స్త్రీ ప్రధాన పాత్రగా నడుస్తుంటుంది కాని సినిమాగా వచ్చేటప్పటికి స్టూడియో అధినేతలు స్త్రీ బదులు పురుష పాత్రగా మారుద్దామనుకున్నారు. మైఖేల్ క్రీటన్ అడ్డంపడిపోయాడు. ఓ స్త్రీ అడ్డంకుల్ని ఎదుర్కొంటూ విజయం సాధిస్తే వచ్చే థ్రిల్ - పురుష పాత్రతో రాదనేది మైఖేల్ వాదన. చివరికి నిర్మాతలు మైఖేల్ ముందు తలదించక తప్పలేదు.
 
ఇక కథ విషయానికొస్తే -
డాక్టర్ సుసాన్ వీలర్ బోస్టన్ మెమోరియల్ హాస్పిటల్‌లో పనిచేస్తుంటుంది. సుసాన్ బెస్ట్ ఫ్రెండ్ అదే హాస్పిటల్‌లో చేరి, ఓ చిన్న ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే ఆపరేషన్ వికటించి, ఫ్రెండ్ కోమాలోకి జారుకోవడం సుసాన్ మనసుని కలిచి వేస్తుంది.
 
అదే ధ్యాసలో ఉన్న సుసాన్‌కి అనుకోకుండా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురవుతాయి. గత కొన్నేళ్లుగా ఆ హాస్పిటల్‌లో చేరిన ఆరోగ్యవంతులు - చిన్న చిన్న కారణాలకే కోమా బారినపడ్డారు. ఆ పేషెంట్స్ అందరూ ఆపరేషన్ థియేటర్ ఎయిట్ (8)లో ఆపరేషన్ చేయించుకున్నవాళ్లే. ఆ తర్వాత వాళ్లందరినీ ఓ మారుమూలన ఉండే జెఫర్‌సన్ ఇన్‌స్టిట్యూట్‌కి తరలించారు.
 
ఈ రెండు విషయాలు సుసాన్‌లో అనుమానాన్ని రేకెత్తించాయి. ఆ పేషెంట్స్ అందరూ ఎందుకు కోమాలోకి వెళ్లిపోతున్నారు? ఏమైపోతున్నారు? సుసాన్ రహస్యంగా తన పరిశోధన కొనసాగిస్తుంది. ఓ దశలో తన బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ మార్క్ బెల్లోస్‌ని కూడా నమ్మలేని పరిస్థితి. నిజానికి ఆ పేషెంట్స్‌కి ఆక్సిజన్ పైప్ లైన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ పంపిస్తారు. దానితో బ్రెయిన్ డెడ్ అవుతున్నారు.
 
వాళ్లందరిని డెత్ బెడ్ మీద నుంచి, వాళ్ల అవయవాలు (గుండె, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు లాంటివి) మార్కెట్లో అమ్ముకుంటుంది బోస్టన్ మెమోరియల్ హాస్పిటల్. ఈ దారుణం వెనక ఉన్నది హాస్పిటల్ చీఫ్ సర్జన్ డాక్టర్ జార్జి హేరిస్.
 సుసాన్‌కి నిజం తెలిసిపోయిందని గ్రహించిన డాక్టర్ జార్జి, సుసాన్ కూడా ఇదే గతి పట్టించడానికి ప్లాన్ చేశాడు. సుసాన్‌కి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయబోతుండగా, ఆమెకి ఆక్సిజన్ పైప్‌లైన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ పంపించే కుట్ర పన్నాడు. చివరి నిమిషంలో ఈ ప్రమాదం తెలుసుకున్న సుసాన్ బాయ్‌ఫ్రెండ్ డాక్టర్ మార్క్ ఆ పైప్‌లైన్ కట్ చేసి, ప్రియురాలిని కాపాడుకుంటాడు. డాక్టర్ జార్జి హేరిస్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
 - తోట ప్రసాద్
 
* 4 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా 50 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
* ఆ మధ్య తమిళంలో వచ్చిన ‘బ్రదర్స్’, ఈ మధ్య తెలుగులో వచ్చిన ‘రాజుగారి గది’ని మెడికల్ థ్రిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement