
మీరెప్పుడైనా కట్టెల మిల్లుకు వెళ్లారా? అక్కడ నేలంతా చిందరవందరగా పడి ఉండే రంపపు పొట్టును చూసే ఉంటారు. దీంట్లో కొంత ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుందేమోగానీ.. చాలావరకూ వృథా అవుతూంటుంది. ఈ వ్యర్థానికీ ఓ పరమార్థం ఉందని నిరూపించారు సింగపూర్కు చెందిన నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ వ్యర్థాన్ని కలపడం ద్వారా కాంక్రీట్ను మరింత దృఢంగా చేయడంతో పాటు నీరు లోపలికి చొరబడకుండా బాగా అడ్డుకుంటుందని వీరు నిరూపించారు. సింగపూర్లోని ఫర్నిచర్ ఫ్యాక్టరీల ద్వారా ఏటా దాదాపు 5 లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతూంటాయని దీన్ని సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న కువా హార్న్ వీ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.
కలప వ్యర్థాన్ని అతి తక్కువ ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే బొగ్గులాంటి పదార్థం మిగిలిపోతుందని.. కాంక్రీట్లోకి దీన్ని కొద్దిమోతాదులో కలిపితే కాంక్రీట్ దృఢంగా మారుతుందని చెప్పారు. ఒక టన్ను కాంక్రీట్లోకి ఇలాంటి బొగ్గు పొడిని దాదాపు 50 కిలోలు కలపవచ్చునని వీ చెప్పారు. ఈ లెక్కన నిర్మించే ప్రతి కొత్త ఇంటి ద్వారా దాదాపు ఆరు టన్నుల కలప వ్యర్థాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని వీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment