
పాదాల కష్టం!
గ్రంథపు చెక్క
మనిషి పాదం అతను నుంచొని భూమి మీద నడవడానికి అనుకూలంగా రూపొందింది. కానీ ఏ రోజు నుండి జోళ్ళు తొడుక్కోవడం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి పాదాలకు ధూళి తగలకుండా జాగ్రత్త పడడం వల్ల పాదాల పాకృతిక అవసరం, ఉద్దేశం రెండూ మట్టిలో కలిసిపోయాయి. ఇంతవరకు మన పాదాలు మన బరువును మోసే శక్తిని కలిగి ఉన్నాయి. కాని ఈరోజు పాదాల బరువును మనం మోస్తున్నాం. చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో నడవవలసి వస్తే పాదాలు మనకు సహాయం చేయడం మాట అటుంచి కష్టం కలిగిస్తున్నాయి.
మన మనసును, బుద్ధిని పాదాల సేవకు ఉపయోగించకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంచెం చలి తగిలితే తుమ్ములు వస్తాయి. నీళ్లు తగిలితే జ్వరం వస్తుంది. ఏమీ చేయలేక జోళ్ళు, స్లిపర్స్, బూట్ల ద్వారా వాటిని పూజించవలసి వస్తోంది. ఈ కృత్రిమ ఉపకరణలనే ఆశ్రయించి వాటినే సౌకర్యంగా భావిస్తూ ప్రాకృతిక శక్తిని అసౌకర్యంగా భావిస్తున్నాం. వస్త్రాలు తొడిగి తొడిగి ఏ స్థితికి తెచ్చామంటే మన మాంసం కంటే, చర్మం కంటే అవి విలువైపోయాయి. మనం మన ప్రాచీన కాలం వైపు చూసినట్లయితే గుడ్డివాని చేతికర్ర వలె వస్త్రాలు. చెప్పులు మనకు తప్పనిసరి అనే నియమం మన ఉష్ణదేశాల్లో లేదని తెలుస్తుంది. మనం అతి తక్కువ వస్త్రాలను ధరించేవాళ్లం.
మన పిల్లలు బాల్యంలో చాలా సంవత్సరాల వరకు బట్టలు, చెప్పులు తొడుక్కునేవారే కారు.కేవలం విదేశాలకు వెళ్లి వచ్చిన సజ్జనులే కాదు, మన నగరాల్లో ఉండే సాధారణ గృహస్థులు కూడా తమ పిల్లలు, బంధువులు, అతిథుల ఎదురుగా నగ్నంగా ఉండడం చూసి సిగ్గు పడుతున్నారు. సంకోచపడుతున్నారు. ఇలా చేయడం వల్ల విద్యావంతుల్లో ఒక కృత్రిమమైన సిగ్గు ఏర్పడుతోంది. పరిస్థితి ఈ విధంగానే ఉంటే కొంత కాలానికి కుర్చీలు, బల్లల కాళ్ళు కూడా నగ్నంగా ఉంటే చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది.
- రవీంద్రనాథ్ టాగూర్ ‘విద్య’ పుస్తకం నుంచి.
(తెలుగు: విజయ నీలగ్రీవం)