
నీలోకి చేసే ప్రయాణం ధ్యానం
ఆత్మీయం
నీలో, నాలో– మనలో ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ. ఈ ప్రపంచాన్ని నడిపించే అనంతమైన శక్తి ఆ పరమాత్మ. ఆ సత్యాన్ని అవగతం చేసుకుని, ఆయనను చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. ఆ ధ్యానం ‘యోగ’ంలో భాగం. ధ్యానం అంటే ఎవరి మనసులోకి వారు చేసే ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకో, ఎలా చేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ, శారీరకంగానూ దృఢంగా ఉండగలరు.
అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే...అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం(తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం.