
విద్యుత్ తీగలు తెగిపడటంతో బందరురోడ్డు పై నిలిచిన ట్రాఫిక్
శాఖల మధ్య సమన్వయలోపం.. ప్రజలను పరుగులు పెట్టించింది.. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టిప్పరు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్తీగలు తెగిపడ్డాయి. జనం భయాందోళనకు గురయ్యారు.
పెనమలూరు: విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారి(బందరు రోడ్డు)పై విద్యుత్ తీగలు ఆదివారం తెగిపడ్డాయి. తాడిగడప సెంటర్ సమీపంలో బందరు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు పనులకు వచ్చిన టిప్పర్ డ్రైవర్ టిప్పర్ వెనుక భాగాన్ని పైకి ఎత్తాడు. అయితే అతడిపైన ఉన్న విద్యుత్ తీగలు చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో టిçప్పర్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో మంటలు వచ్చి విద్యుత్ తీగులు తెగి బందరు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఉండటంతో ప్రాణభయంతో జనాలు ఉరుకులు.. పరుగులు తీశారు. తెగిన విద్యుత్ తీగలు బస్సు పక్కనే పడ్డాయి.
రోడ్డు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం
బందరు రోడ్డు విస్తరణ పనులు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. పనులు నిదానంగా చేయటం, ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని భద్రతా ప్రమాణాలు పాటించక పోవటం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు అధికారులు పట్టించుకోక పోవటంతో రోజు బందరు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పాడుతోంది. బందరు రోడ్డు విస్తరణ పనులు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment