పెదకాకాని(గుంటూరు): గుంటూరు ఛానల్లో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. పెదకాకానిలోని పాతూరుకు చెందిన ఫాతిమాకు(28) నాగూర్వలి(35)తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కొడుకు (అల్తాఫ్) ఉన్నాడు. కాగా.. గత కొన్ని రోజులుగా భార్యా భర్త మధ్య పొరపొచ్చులు రావడంతో ఇరువురు వేరుగా ఉంటున్నారు.
వీరికి కౌన్సిలింగ్ నిర్వహించిన లాభం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఫాతిమా, తన తల్లి అనిఫా(45), కొడుకు అల్తాఫ్తో సహా గుంటూరు ఛానల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. అల్తాఫ్ మృతదేహం నీటితో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరో రెండు మృత దేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.