
కాస్కోండి
ఇక చైన్ స్నాచర్ల ఆటకట్టు
ఆపరేషన్స్ ప్రారంభించిన ‘సీసీ టీమ్స్’
వారంలోనే వనస్థలిపురంలో తొలి ఘటన
హాట్స్పాట్స్లో మకాం వేస్తున్న బృందాలు
ప్రాంతాల వారీగా విధులు కేటాయింపు
సిటీబ్యూరో: అదును చూసి వరుసగా పంజా విసురుతూ...సాధారణ ప్రజలతో పాటు పోలీసుల్నీ ముప్పతిప్పలు పెడుతున్న చైన్ స్నాచర్ల ఆటకట్టించడానికి సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీటీస్) తమ ఆపరేషన్స్ ప్రారంభించాయి. వారం రోజులుగా వనస్థలిపురం ప్రాంతంలో మకాం వేసి ఓ బృందం సోమవారం ఇద్దరు స్నాచర్లను పట్టుకోవడానికి ప్రయత్నించింది. తప్పించుకు పారిపోతున్న దొంగలపై కాల్పులు జరిపింది. బహిరంగ ప్రదేశం కావడంతో టార్గెట్ మిస్ అయినప్పటీ సీసీటీమ్స్ ఏర్పాటు స్ఫూర్తి అమలులోకి వచ్చినట్లయింది. చైన్ స్నాచర్లకు చెక్ చెప్పడానికి ఉద్దేశించిన సీసీటీమ్స్కు మూడు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. స్నాచర్లను ఎదుర్కొనే విధానాల్లో భాగంగా హై స్పీడ్ వాహనాలను సురక్షితంగా డ్రైవ్ చేయడం, ఎలాం టి ఆయుధాలు లేకుండా స్నాచర్లతో పోరాడగలగటం, అవసరమైనప్పుడు కాల్పులు జరపటంలో మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చారు.
ఠాణాల వారీగా హాట్స్పాట్స్ గుర్తింపు...
సైబరాబాద్ మొత్తమ్మీద 110 మందితో 55 సీసీటీమ్స్ను రం గంలోకి దింపిన అధికారులు వాటికి విధులనూ వ్యూహా త్మంకగా అప్పగించారు. ఠాణాల వారీగా గడిచిన మూడేళ్ళల్లో చోటు చేసుకున్న స్నాచింగ్స్ను పరిశీలించిన అధికారులు తరచుగా గొలుసు చోరీలు చోటు చేసుకుంటున్న హాట్ స్పాట్స్ను గుర్తించారు. ప్రాంతాలతో పాటు సమయాలు, కచ్చితమైన చోట్లనూ స్థానిక అధికారుల సాయంతో తెలుసుకుని జాబితాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పని చేసే సీసీటీమ్స్ల్లో ఒక్కోదానికీ కొన్ని ప్రాంతాలను అప్పగించారు. వీరు ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి ఉంచడంతో పాటు స్నాచింగ్స్కు అనుకూలమైన సమయాలు, ఏరియాలను గుర్తిస్తూ అవసరమైన చర్యలకు తీసుకోవాల్సి ఉంటుం ది. ఈ విధులు నిర్వర్తిస్తున్న ఒక్కో బృందానికీ సైబ రాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నెలకు రూ.5 వేలు చొప్పున అదనంగా అందిస్తున్నారు. తక్షణం స్పందించే తత్వం ఉండేదుకు సీసీటీమ్స్లో పని చేస్తున్న యువకులు గరిష్టంగా 25 ఏళ్ళ లోపు వాళ్ళే ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఒంటరి మహిళల్ని ఫాలో అవుతూ...
సీసీటీస్లో పని చేసే సిబ్బంది పూర్తి స్థాయిలో మఫ్టీలోనే ఉం టారు. ఆహార్యం, వస్త్రధారణలో సైతం ఎక్కడా పోలీసుల్లా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైన్ స్నాచర్లు ఎక్కువగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్నే టార్గెట్గా చేసుకుంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీటీమ్స్ తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వరిస్తున్నాయి. ఈ బృందంలో ఉండే ఇద్దరు సభ్యులు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు. హాట్స్పాట్కు అతి దగ్గరలో ఒకరు వాహనంపై సిద్ధంగా ఉంటారు. మరొకరు ఆ ప్రాం తంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలకు కాస్త దూరంలో అనుసరిస్తారు. ఒక మహిళ ఆ ప్రాంతం దాటిపోతే మరో మహిళ వెనుక అనుసరిస్తుంటారు. ప్రతి గంట కూ వీరు స్థానాలు మారుతూ విధులు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే వనస్థలిపురం ఘటనలో బాధితురాలికి అతి సమీపంలోనే సీసీటీమ్ సిబ్బంది ఉన్నారు.
‘మూవింగ్ ఆజ్జెట్స్’తోనే ఇబ్బంది...
చైన్స్నాచర్లు తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన క్షేత్రస్థాయి పోలీసులపై దాడులకు దిగడం, కత్తులతో హత్యాయత్నాలకు పాల్పడటం గతంలో చోటు చేసుకున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న స్నాచర్లు తమ వెంట నాటు తుపాకులు సైతం తెచ్చుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇద్దరు సభ్యులతో ఉండే ఒక్కో సీసీటీమ్స్ బృందానికీ ఒక తుపాకీ కేటాయించారు. వీరికి మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఐఐటీఏ)లో 40 రౌండ్లు చొప్పున ఫైరింగ్ ప్రాక్టీస్ సైతం చేయించారు. అయి తే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల మాదిరిగా జనసమర్థ ప్రాంతాల్లో కదులుతున్న వస్తువులు, వ్యక్తులు (మూవింగ్ ఆబ్జెక్ట్స్)ను టార్గెట్ చేయడంలో సీసీటీమ్స్ సభ్యులు నిష్ణాతులు కాదు. ఈ కారణంగానే వనస్థలిపురం ఉదంతంలో చైన్ స్నాచర్లు తప్పించుకోగలిగారు.