కరెన్సీ వర్షం కురుస్తుంది! | con baba buddappagari shiva duped with 'money rain' | Sakshi
Sakshi News home page

కరెన్సీ వర్షం కురుస్తుంది!

Published Thu, Jun 23 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

కరెన్సీ వర్షం కురుస్తుంది!

కరెన్సీ వర్షం కురుస్తుంది!

- బురిడీ బాబా.. ‘బారిష్’ మంత్ర
- దొంగబాబా శివానంద మోసాలు చేసేది ఇలా
- పూజ చేస్తే కరెన్సీ ఎగురుకుంటూ వస్తుందని టోకరా
 
సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని రూ.1.33 కోట్లకు టోకరా వేసిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద స్వామి జనాలను బురిడీ కొట్టించడానికి ‘బారిష్’ మంత్రం వేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. దీని ద్వారానే డబ్బు రెట్టింపు అవుతుందంటూ నమ్మబలుకుతాడంటున్నారు. గత శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన శివ విచారణలో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడని అధికారులు తెలిపారు. శివే కాదు.. పూజల పేరుతో టోకరా వేసే అనేక మంది దొంగ బాబాలు బాధితులపై బారిష్ మంత్రాన్నే ప్రయోగిస్తుంటారట. బారిష్ అంటే వర్షం అని అర్థం.

తాంత్రిక పూజ చేయడం ద్వారా డబ్బు వర్షంలా వస్తుందని, చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, బ్యాంకు లాకర్ల నుంచే ఈ మొత్తం ఎగురుకుంటూ వస్తుందని నమ్మిస్తుంటారట. ఈ పూజ సఫలీకృతం కావాలంటే 21 గోళ్లు ఉన్న తాబేలు(సాధారణంగా తాబేలుకు 18 గోళ్లే ఉంటాయి), 4.5 కేజీల కంటే ఎక్కువ బరువున్న రెండు తలల పాము(దీని తల, తోక ఒకే సైజులో ఉంటాయి), రైస్ పుల్లర్‌గా పిలిచే ఇరీడియం, కాపర్ కాయిన్‌ల్లో ఏదో ఒకటి ఉండాలని ఎర వేస్తారు. వీటికే చుట్టుపక్కల ఉన్న డబ్బును ఆకర్షించి, పూజలో పెట్టిన దాన్ని రెట్టింపు చేసే శక్తి ఉంటుందని నమ్మిస్తారు.

ఈ మూడింటి పేర్లతో జరిగే మోసాలు ఎన్నో ఉంటున్నాయని, అలాంటి ముఠాలు తరుచుగా నగరంలో చిక్కుతున్నాయని అధికారులు చెప్తున్నారు. శివ సైతం బాధితుల ఇళ్లల్లో పూజకు కూర్చునేప్పుడు 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే కాపర్ కాయిన్ తన వద్ద ఉన్నట్లు చెప్పేవాడు. పూజ నేపథ్యంలో రైస్‌పుల్లర్‌ను చూపించమని ఎవరైనా అడిగితే.. పగడ్బందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించి కాయిన్ అందులోనే ఉందని నమ్మించి పూజలో పెట్టేవాడు. మధ్యాహ్నం 1.30-2.00 గంటల ప్రాంతంలో పూజ పూర్తయినా.. డబ్బు పెరగకపోవడంతో బాధితులు శివను ప్రశ్నిస్తే.. అది లంచ్ సమయం కావడంతో బ్యాంకులు పని చేయవని, అందుకే డబ్బు ‘బారిష్’ కాలేదని, బ్యాంకులు తెరుచుకున్న తర్వాత వస్తుందని కాలయాపన చేసేవాడు.

చివరకు అదును చూసుకుని ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’ పెట్టి వారు మత్తులోకి జారుకున్నాక డబ్బుతో ఉడాయించేవాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైల్లో ఉన్న శివను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది. కోర్టు అనుమతిస్తే శివను అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో ప్రశ్నించడానికి, అతడి ద్వారా ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement