
‘హుండీ’పై డేగకన్ను!
ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండి కొడుతూ... అక్రమ మార్గంలో నగదు మార్పిడి లావాదేవీలు నిర్వహిస్తున్న హుండీ ముఠాలపై నగర పోలీసులు డేగకన్ను వేశారు.
* ఎన్నికల వేళ నగరంలో జోరుగా అక్రమ ద్రవ్యమార్పిడి
* సూత్రధారులంతా ఇతర రాష్ట్రాల్లోనే నిఘా పెంచిన టాస్క్ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండి కొడుతూ... అక్రమ మార్గంలో నగదు మార్పిడి లావాదేవీలు నిర్వహిస్తున్న హుండీ ముఠాలపై నగర పోలీసులు డేగకన్ను వేశారు. ఎన్నికల సీజన్ నేపథ్యంలో వీరు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించవచ్చనే అనుమానంతో నిఘా పెంచారు. ఈ వ్యాపారానికి ఆస్కారం ఉన్న నగరంలోని అనేక ప్రాంతాలను టాస్క్ఫోర్స్ పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. వివిధ దేశాల మధ్య అక్రమ మార్గంలో ద్రవ్య మార్పిడి చేయడాన్ని హవాలా అని, దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జరిగే ఈ మార్పిడిని ‘హుండీ’ అని అంటారు.
ఒకప్పుడు హుండీకి పోటీగా హవాలా వ్యాపారం సైతం నడిచేది. అయితే పీవీ నరసింహరావు ప్రధానిగా పని చేసిన రోజుల్లో అమలులోకి తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈ వ్యాపారం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం అసాంఘిక, ఉగ్రవాద కార్యకలాపాల కోసమే దీన్ని వినియోగిస్తున్నారు. అయితే హుండీ వ్యాపారం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. పన్ను పోటును తప్పించుకోవడానికి అనేక మంది వ్యాపారులు ఈ మార్గాన్ని ఎంచుకోవడం నిర్వాహకులకు కలిసి వస్తోంది. ఎన్నికల ‘ఖర్చుల’ కోసమూ అభ్యర్థులు హుండీని ఆశ్రయించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం నగరంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 50కి పైగా హుండీ ముఠాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ద్వారా రోజుకు రూ.4 కోట్లకు పైనే చేతులు మారుతోందని అధికారులు చెబుతున్నారు. వ్యాపార కేంద్రాలుగా ఉన్న గోషామహల్, అబిడ్స్, బేగంబజార్, అమీర్పేట్, కోఠి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ట్రూప్బజార్, కాచిగూడ తదితర ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని ఈ ముఠాలు తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. అయితే సూత్రధారులంతా గుజరాత్, ముంబయిల్లోనే ఉంటున్నారు.
వీరు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ రూ.లక్షకు రూ.500 నుంచి రూ.300 వరకు కమిషన్ తీసుకుంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న అనుచరుల ద్వారా తమ వ్యవహారాలు సాగిస్తున్నారు. పోలీసులు దాడి చేసిన ప్రతి సందర్భంలోనూ కేవలం పాత్రధారులే పట్టుబడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సమరానికి తెర లేచింది. టిక్కెట్ల పొందటం నుంచి పోలింగ్ వరకు ప్రతి అంకం డబ్బుతోనే ముడిపడి ఉంటుందనేది బహిరంగ రహస్యమే. దీన్ని ఆసరాగా చేసుకునే హుండీ ముఠాలు తమ కార్యకలాపాలను విస్తరించే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నగరంలోని కీలక ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు. హవాలా, హుండీ వ్యాపారాలు జరిగే ప్రాంతాలపై టాస్క్ఫోర్స్ అధికారులు డేగకన్ను వేశారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు లేదా ప్రధాన కంట్రోల్ రూమ్: 100, 94906 16690, వాట్సప్: 94906 16555, సిటీ పోలీసు ఫేస్బుక్ ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.